Chandrababu | జనసేనాని పవన్ కల్యాణ్పై టీడీపీ అధినేత చంద్రబాబు నోరుజారాడు. పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ విమర్శలు చేశారు. జగన్ను ఉద్దేశించి ఆరోపణలు చేయబోయిన చంద్రబాబు పొరపాటున పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావించారు. విజయనగరం జిల్లాలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు నాలుక కరుచుకున్నారు.
ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచార వేడి మొదలయ్యింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష కూటమి రెండూ పోటాపోటీగా సభలు పెడుతూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విజయనగరం జిల్లాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ కలిసి బుధవారం నాడు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ సీఎం జగన్పై విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే నోరుజారిన చంద్రబాబు.. పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ విమర్శించారు. చంద్రబాబు మాటలు వినగానే జనసైనికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. బాబుకు ఏమైంది.. మా జనసేనానిని ఇలా అంటున్నారని షాకయ్యారు. ఇంతలోనే తప్పు గ్రహించిన చంద్రబాబు.. జగన్పై విమర్శలు చేశారు. ప్రజలు అధికారం ఇస్తే జనగ్ దోపిడీ లైసెన్స్ అనుకున్నారని చంద్రబాబు అన్నారు. సైకో పోవాలి.. రాష్ట్రం బాగుపడాలి అన్నదే తమ ధ్యేయమని పేర్కొన్నారు. కానీ అప్పటికే జరగాల్సిన తప్పిదం జరిగిపోయింది. పవన్ కల్యాణ్పై చంద్రబాబు వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి.