పంటకు పెట్టుబడి రంది లేకుండా అన్నదాతకు రైతుబంధు ఆసరా అవుతున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడి సాయం రైతుల ఖాతాకు చేరుతున్నది. పదో విడుత రైతు బంధు నగదు పంపిణీ బుధవారం నుంచి షురూ కాగా.. మొదటి రోజు ఎకరంలోపు రైతులకు, రెండోరోజు రెండెకరాల్లోపు రైతుల ఖాతాకు డబ్బు జమైంది. గురువారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 4,92,134 మంది రైతులకు రూ.236.94 కోట్ల పెట్టుబడి సాయం అందింది. సర్కారు తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటూ రైతులు పెట్టుబడి ఖర్చులు వెల్లదీస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు దీవెనలు అందిస్తున్నారు. మిగిలిన రైతులకూ విడుతల వారీగా రైతు బంధు అందనున్నది.
యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : రైతుబంధు పథకం పదో విడుతలో భాగంగా రెండోరోజు నిధులు విడుదలయ్యాయి. గురువారం రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యింది. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,92,134 మంది రైతులకు రూ. 236.94 కోట్ల నగదు అందింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 74,543 మందికి రూ, 20.71కోట్లు, నల్లగొండలో 2,61,491 మందికి రూ.135.82కోట్లు, సూర్యాపేట జిల్లాలో 1,56,100మందికి రూ. 80.41 కోట్లు జమ అయ్యాయి. మిగతావారికి కూడా విడుతల వారీగా సంక్రాంతి వరకు పైసలు ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ యాసంగి సీజన్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10.80 లక్షల మందికి ప్రభుత్వం సాయం అందనుంది. ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ షురూ కాగా, మొదటి రోజు ఎకరంలోపు భూమి ఉన్న రైతులకు డబ్బులు పడిన విషయం తెలిసిందే. పంట పెట్టుబడిలో భాగంగా ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు విడుతలుగా ఏడాదికి రూ. 10వేల చొప్పున ప్రభుత్వం సాయం చేస్తున్నది. ఎరువుల కొనుగోలు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్ల కోసం ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రతి సీజన్లో ఠంఛనుగా సర్కారు సాయం చేస్తుండటంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలుపుకొన్న రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని ప్రశంసిస్తున్నారు.
– యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ)
యాదాద్రి జిల్లా రైతులు 74,543
నగదు 20.71కోట్లు
నల్లగొండ 2,61,491
నగదు 135.82కోట్లు
సూర్యాపేట 1,56,100
నగదు 80.41కోట్లు
వానకాలం పంటలు పూర్తి కావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాసంగి పనులు షురూ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యాసంగి ప్రణాళిక రూపొందించగా రైతులు పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది సమృద్ధిగా కురిసిన వానలతో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. దాంతో ఉత్సాహంగా రైతులు యాసంగి పనులు చేపడుతున్నారు. సర్కారు రైతు బంధు సాయం అందుతుండటంతో పొలాలను సిద్ధం చేసుకున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికే వరినాట్లు పెడుతున్నారు. జనవరి మొదటి వారంలో నాట్లు మరింత ఊపందుకోనున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 12లక్షల ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
నాకు ఎకరం ఏడు గుంటల భూమి ఉన్నది. సీఎం కేసీఆర్ సారు రైతుబంధు డబ్బులేస్తడని విన్న. నా ఫోన్కు గురువారం పొద్దుగాల మెసేజ్ వచ్చింది. సీఎం కేసీఆర్ పేరిట మెసేజ్ ఉన్నది. వెంటనే కెనరా బ్యాంకుకు పోయి బ్యాంకోళ్లను రైతుబంధు డబ్బులొచ్చినయా అని అడిగిన. 5,875 రూపాయలు వచ్చినయని జెప్పిండ్రు. శానా సంతోషమనిపించింది. యాసంగి సాగుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇగ ఎరువులు కొంట. రైతు బంధు డబ్బులతో రేపు నాటు వేస్తం. గతంలో నీళ్లు, ఎరువులు, కరెంటు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. పంట పెట్టుబడుల కోసం వడ్డీ
వ్యాపారులను ఆశ్రయించి నష్టపోయేవాళ్లం. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రైతుల కష్టాలు తీరినయ్. సీఎం కేసీఆర్ పంట పెట్టుబడికి సాయం చేస్తుండడంతో అప్పులు చేయడం లేదు. రైతుల గురించి ఆలోచించే కేసీఆర్ సీఎంగా ఉండడం మా అదృష్టం. – బోయ సతీశ్, కిష్టాపురం (మునుగోడు)
రైతుబంధుతో నా కుటుంబానికి సీఎం కేసీఆర్ సారు ఆసరాగా నిలిచిండు. నేను నిరుపేద గిరిజన కుటుంబానికి చెందిన వికలాంగ రైతును. నాకు తండాలో ఎకరం పొలం ఉన్నది. గతంలో నీరు లేక, చేతిలో డబ్బు లేక వ్యవసాయం చేసేందుకు ఇబ్బంది పడ్డా. అప్పులు తెచ్చి తీర్చలేకపోయిన. సీఎం కేసీఆర్ వచ్చినంక కాలం మంచిగైతున్నది. చెరువుల పుష్కలంగా నీళ్లు ఉండబట్టి పంటలు మంచిగా పండుతున్నయి. రైతుబంధు కింద సర్కారు ఇచ్చిన డబ్బులు పంట పెట్టుబడికి సరిపోతున్నయి. యాసంగి పంటకు నాకు 5వేల రూపాయలు వచ్చినయి. కేసీఆర్ సారు డబ్బులు ఇస్తాడని ముందుగానే ధైర్యంగా అప్పు చేసి పొలం దున్నిచ్చిన. రైతు బంధు డబ్బులతోనే ఎకరన్నర పొలాన్ని నాలుగేండ్లుగా సాగుచేసుకుంటున్నా. నాకు వికలాంగుల పింఛన్ కింద నెలకు 3016 రూపాయలు వస్తున్నయి. నా పొలంలో నేనే పనిచేసుకుంటూ బతుకుతున్న. నా భార్య అంగన్వాడీలో ఆయాగా పనిచేస్తున్నది. ఆమెకు కూడా జీతాలు పెంచడంతో మా కుటుంబం చింతలేకుండా బతుకుతున్నాం. కేసీఆర్ సారుకు ధన్యవాదాలు.
– లావూరి నారాయణ, వాచ్యాతండా, దామరచర్ల మండలం(మిర్యాలగూడ)
నేను నిరుపేద రైతును. మా గ్రామంలో నాకు ఎకరం 20 గుంటల పొలం ఉన్నది. వ్యవసాయంతోపాటు కల్లు తీసి విక్రయించి కుటుంబాన్ని పోషిస్తున్నా. గతంలో పంట సాగు కోసం అప్పులు తెచ్చి అవి తీర్చలేక నానా ఇబ్బందులు పడేవాళ్లం. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగడంతో కొంత కాలం వ్యవసాయం చేయలేదు. సాగు ఖర్చులు పెరిగి వ్యవసాయం భారంగా మారుతున్న తరుణంలో సీఎం కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో అప్పుల బాధ తప్పింది. నాకున్న ఎకరం 20గుంటల పొలానికి 7,500 రూపాయలు నా ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. నేను ఈ రోజు పెట్టుబడుల కోసం అప్పు చేయకుండా వ్యవసాయం చేస్తున్నానంటే అది సీఎం కేసీఆర్ పుణ్యమే. ముఖ్యమంత్రి కేసీఆర్ మా లాంటి చిన్న, సన్నకారు రైతుకు చేస్తున్న సాయం ఎప్పటికీ మరువలేనిది.
– కమ్మంపాటి వెంకటయ్య, రైతు, కల్మెర (కట్టంగూర్)
యాసంగిలో పొలం నాటుకు సిద్ధం చేసుకున్నా. పెట్టుబడి డబ్బుల కోసం ఎదురు చూస్తుండగానే ఫోన్లో టింగ్ టింగ్మని మెసేజ్ వచ్చింది. మేసేజ్ చూసేసరికి రైతుబంధు డబ్బులు ఖాతాలో జమయ్యాయి. నాకు 1.14 ఎకరాలు భూమికి 6,250 రూపాయలు పడ్డయి. వాటితో కొన్ని ఎరువులు కొంటా. మిగతావి కూలీల ఖర్చులకు పెడతా. ఇప్పటికీ 10 సారి రైతుబంధు సాయం అందింది. సావుకారి వద్ద అప్పు చేయకుండా వ్యవసాయం కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ చలువే ఇది.
-ఎర్రగోకుల జశ్వంత్, రైతు(రాజాపేట)
కేసీఆర్ సారు రైతులకోసం ఎన్నో చేస్తున్నడు. రైతుబంధు, రైతుబీమా పథకాలు పెట్టి ఆదుకుంటున్నడు. తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్ కొరత లేదు. నీళ్లు పుష్కలంగా ఉన్నయి. పంటల సాగుకు గుంట భూమి ఉన్నా పెట్టుబడి సాయాన్ని ఇస్తున్నడు. రైతులకు కష్టాలు తీరాయి. సంతోషంగా వ్యవసాయం చేస్తున్నరు. కేసీఆర్ మేలును రైతులు మరిచిపోరు.
-దొంతిసారం కిష్టయ్య, చొల్లేరు (యాదగిరిగుట్ట రూరల్)
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడి సాయం ఎన్నటికీ మరువలేనిది. రైతు కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. పంటల సాగుకు రైతులు ఇబ్బంది పడకుం డా రైతుబంధు పథకం కింద డబ్బులు ఇస్తున్నారు. నాకు ఎకరం 10గుంటల భూమి ఉండగా 6,065 రూపాయలు నా ఖాతాలో జమయ్యాయి. ఈ సాయంతో పంట పెట్టుబడులకు రంది తీరింది.
-లింగాల బాలేశ్, రైతు, ఎన్జీబండల్ (తుర్కపల్లి)
రైతుబంధు పథకం రైతులందరికీ వరంలాంటిది. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత రైతులకు చాలా మంచి జరుగుతున్నది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్నడు. సన్న, చిన్నకారు రైతులకు రైతు బంధు డబ్బులు ఎంతో ఆసరా అవుతున్నాయి. పెట్టుబడి ఖర్చులు తప్పడంతో వ్యవసాయం కష్టాలు లేకుండా సాగుతున్నది. ప్రభుత్వం మేలు మరువం.
-కొండా వెంకయ్య, రైతు (చిలుకూరు)
రాష్ట్రం ఏర్పడక ముందు రైతుకు భూమి సాగు ఒక సవాలుగా ఉండే. సాగు నీరు ఒక ఎత్తయితే, పంట పెట్టుబడి కోసం సావుకార్లను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉండే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం రైతు బంధు ఇస్తున్నడు. ఏటా రెండు పంటలకు సాయం చేస్తున్నడు. ఇప్పుడు పెట్టుబడి కోసం అప్పు చేస్తలేను. సర్కారు సాయంతోనే నాకున్న రెండెకరాల భూమిలో పంటలు పండిస్తున్నా.
– నల్లమేకల వెంకులు , రైతు, బాదలాపురం(మిర్యాలగూడ రూరల్)
కేసీఆర్ సారు రైతుబంధు పెట్టినప్పుటి నుంచి నాట్లేసే టైమ్కు ఖాతాల్లో పైసలు పడుతున్నాయి. నాకు ఎకరం 18 గుంటల భూమి ఉన్నది. గురువారం ఉదయాన్నే 11 గంటలకు సెల్కు మెసేజ్ వచ్చింది. మీకు రైతుబంధు డబ్బులొచ్చినయ్.. వ్యవసాయ పనులకు డబ్బులు వాడుకోండని. రైతుబంధు డబ్బులొచ్చినయా అని బాంకు వాళ్లని అడిగితే 7,250 రూపాయలు పడ్డయని చెప్పిండ్రు. రేపు నాట్లేసేందుకు కూలీలకు, ఎరువులకు ఇక కొదవలేదని అనిపించింది. గతంలో వ్యవసాయమంటే పురుగుల మందు తాగే పరిస్థితి. నేడు వ్యవసాయాన్ని పండుగలా మార్చిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో నీళ్లు లేక కరెంట్ రాక మోటర్లు కాలిపోయేవి. అలాంటిది ఉచితంగా 24 గంటల కరెంటు, పెట్టుబడికి రైతుబంధు సాయం అందిస్తున్నారు. కేసీఆర్ను జీవితంలో మరువం.
-మేడి ప్రభు, వెంకటేశ్వర్లబాయి(నార్కట్పల్లి)