ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్రావు
మిర్యాలగూడ, ఫిబ్రవరి 23 : బంజారా జాతి భగవత్ స్వరూపుడిగా, గిరిజనుల ఆరాధ్య దైవంగా సంత్సేవాలాల్ పూజలు అందుకుంటున్నారని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. బుధవారం సంత్సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి వేడుకలను మిర్యాలగూడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బంజారాలు ఎంపీడీఓ కార్యాలయం నుంచి నూతనంగా నిర్మించిన సేవాలాల్ భవన్ వరకు ర్యాలీగా తరలివచ్చి మహాభోగ్ బండార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ బంజారాల సంక్షేమానికి పాటుపడుతున్నారని, సేవాలాల్ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించడం బంజారాల పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుందన్నారు. సంత్సేవాలాల్ గిరిజనులకు మాత్రమే ఆరాధ్య దైవం కాదని, సమస్త లోకానికి మార్గదర్శకుడని పేర్కొన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన గిరిజనుల విద్యార్థులకు జ్ఞాపికలను అందించి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, ఆర్డీఓ రోహిత్ సింగ్, మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, స్కైలాబ్నాయక్, చిట్టిబాబునాయక్, రామ్చంద్రునాయక్, శంకర్నాయక్, ఎంపీపీలు నందిని రవితేజ, సరళాహన్మంతరెడ్డి పాల్గొన్నారు.