కోదాడ, జూలై 22 : ఆరు దశాబ్దాల సమస్య ఆరు నెలల్లో పరిష్కారమైంది. 60ఏండ్ల క్రితం కోదాడ శివారులో 33/11 కేవీ విద్యుత్ తీగలను ఏర్పాటు చేశారు. కాలక్రమేణా పట్టణం విస్తరించడంతో ప్రస్తుతం అవి ఇండ్ల మధ్యలో ఉండిపోగా ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు. వాటిని తొలగించాలని కోరు తూ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులకు ప్రజలు అనేక మార్లు విన్నవించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాన్ని ప్రజల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి ఈ విషయమై అధికారులతో నివేదిక తెప్పించుకున్నారు. 33/11 కేవీ వైర్లతో 240కిపైగా కుటుంబాలు అవస్థలు పడుతున్న విషయాన్ని తెలుసుకొని వైర్లను తొలగించేందుకు అవసరమైన నిధులు మంజూ రు చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. దీంతో విద్యుత్ అధికారులు ఆగమేఘాల మీద విద్యుత్ తీగలను తొలగించే పనులకు శ్రీకారం చుట్టారు. తమ సమస్య పరిష్కారానికి కృషి చేసిన మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్కు పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.