శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. చుట్టూ కమ్ముకున్న యుద్ధమేఘాలను తొలగించే శక్తి శ్రీమద్ రామానుజాచార్యులకే ఉందని భావిస్తాడు విష్ణువర్ధనుడు.
“గురుదేవా! మరొక సందేహం..” అడగవచ్చునా లేదా అనే
సందిగ్ధతతో అడిగాడు శిష్యుడు.
రాజగురువు తన శిష్యుని పరిస్థితి గ్రహించి, చిరునవ్వుతో అన్నాడు.
“అడుగు నాయనా!”.
“గురుదేవా! ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకు, మీరు చెప్తున్న శ్రీ రామానుజాచార్యుల వారికి సంబంధమేమిటి?”.
“మంచి ప్రశ్న అడిగావు. మన పాలకుడైన విష్ణువర్ధన మహారాజుగారు భువనగిరి రాజ్యాన్ని యుద్ధంలో జయించాలని చూస్తున్నారు. అందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. భువనగిరి సామ్రాట్టు త్రిభువనమల్లుడు శక్తిమంతుడే కాదు, భక్తిపరుడు కూడా. శ్రీ లక్ష్మీ నరసింహుణ్ని మనసా, వాచా ఆరాధించే మహాభక్తుడు. కొండ గుహలో కొలువైన నరసింహ స్వామివారిని దర్శించుకొని, అక్కడొక ఆలయ నిర్మాణం చేయాలనే సత్సంకల్పంతో ఉన్నారని తెలిసింది. కానీ, ఈ పరిస్థితుల్లో త్రిభువనమల్లుడు యుద్ధం కంటే.. స్వామివారి సేవకే ఎక్కువ సమయం ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. శ్రీరామానుజాచార్యుల వారు ప్రస్తుతం కన్నడ రాజ్యంలో ఉన్నారు. వారూ నరసింహస్వామి భక్తులే! మరి ఈ విషయాలు రామానుజులవారి దృష్టికి తీసుకెళ్తే.. వారేదైనా పరిష్కారం సూచించగలరేమో అనిపిస్తున్నది” అన్నారు గురువులు.
అయితే, శిష్యుని సందేహం అలానే ఉండిపోయింది.
“గురుదేవా! ‘రామానుజులవారు ఆధ్యాత్మికపరంగా సూచనలు ఇవ్వగలరు కానీ, వ్యావహారికంగా ఉండే రాజ్యాల సరిహద్దుల విషయంలో ఏమి చేయగలరు?’ అని మహారాణీవారు అన్నారు కదా!”.
అర్థమైంది రాజగురువుకు..
“అదే మేమూ ఆలోచిస్తున్నాం. ‘ఇది మాకు సంబంధంలేని వ్యవహారం’ అని స్వయంగా రామానుజులవారే అన్నట్టయితే, మనమేం చేయలేం. అలా అంటారేమో అని ముందుగానే మనమే ఊహించుకొని అడగకుండా ఉండటం కూడా భావ్యం కాదు. వారినే వెళ్లి అడుగుదాం..” అన్నారు గురువుగారు.
అసలు రామానుజాచార్యులవారు ఎవరు? వారు విష్ణువర్ధనుడు పరిపాలించే కన్నడ రాజ్యం హొయసలలోకి ఎందుకొచ్చారు? ఎలా వచ్చారో.. ఆ విషయాలన్నీ కండ్లకు కట్టినట్టు గురుదేవులు శిష్యులకు చెప్పడం ప్రారంభించారు.
రామానుజులవారిని గురించి తెలుసుకోవాలంటే.. ముందు ఆయనను ప్రభావితం చేసిన ఆళ్వారుల గురించి తెలుసుకోవాలి.
దేవుడనేవాడు ఏ కొద్దిమందికో పరిమితమైనవాడు కాదు. పరిమితులే లేనివాడు. అందరిపైనా అపరిమితమైన అనుగ్రహం చూపేవాడు. ఇటువంటి ‘చూపు’ను లోకానికి అందించినవారు భగవత్ సేవకులైన పన్నెండుగురు ఆళ్వారులు. బాధల్లో ఉన్నవారు ఎవరైనా, ఏ కులంలో జన్మించినా.. వారు పెద్దవారు కానీ, పేదవారు కానీ.. అందరూ భగవదనుగ్రహానికి అర్హులే అని చాటిచెప్పారు ఈ పన్నెండు మంది మహాత్ములు. భక్తితో కూడిన ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి పంచారు. వీరు వివిధ కులాల్లో జన్మించారు. తమ అమాయకమైన, స్వచ్ఛమైన భక్తి వల్లా, సాధనతో సాధించుకున్న జ్ఞానం వల్లా చిరస్మరణీయులు అయ్యారు. దేవభాష సంస్కృతాన్ని కాదని సామాన్యులకు అర్థమయ్యే ప్రజల భాషలోనే వీరు భగవంతుణ్ని కీర్తించారు. అందరూ ఆచరించదగ్గ గొప్ప ఉపదేశాలు అందించారు. అందుకే, వీరి మాటలు, పాటలు కుల సంప్రదాయ పరిధులన్నిటినీ దాటుకొని, సంకుచిత భావాల సంకెళ్లను పగలగొట్టి.. పదిమందికీ నిత్య పారాయణ మంత్రాలుగా మారిపోయాయి.
గుడిలో ఉన్న భగవంతుడిని గుండెలో నిలుపుకొని, స్వామిని చేరుకోవాలని చెప్తుంది ఆళ్వారుల భక్తి ఉద్యమం. దేవదేవుని అనుగ్రహం.. ముక్కు మూసుకొని తపస్సు చేసుకొనే ఏ ఒక్కరికో కాక, ఆనందంగా భక్తి మార్గాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికీ దొరుకుతుందని.. అందరికీ అర్థమయ్యేలా చెప్పారు ఈ గొప్ప దార్శనికులు.. ఆళ్వారులు. దీనివల్ల అట్టడుగు వర్గాలవారికి కూడా భగవంతుడిని చేరుకొనే మార్గం ఉన్నదనే స్పృహ కలిగి.. నిస్పృహలో నుంచి ఆశాదీపం వైపునకు ప్రయాణించగలుగుతున్నారు.
కంటి వెలుగుతో చీకటిని సైతం చీల్చుకొని.. ఆ భక్తిజ్వాలలో పరమాత్ముని దర్శించగలిగినవారు.. పొయిగై ఆళ్వారు, పూదత్తార్ ఆళ్వారు, పేయీ ఆళ్వారు. బిడ్డలు లేని గొల్లవారు పెంచిన మహాత్ముడు తిరుమళిశై ఆళ్వారు. జీవితంలోని ఒడుదొడుకులకు సంబంధం లేకుండా అన్ని కాలాల్లోనూ అన్ని అవస్థల్లోనూ భగవంతుడికి దగ్గరగా ఉండాలని, ప్రసన్నం చేసుకోవాలని పరవశుడై ‘పెరుమాళ్ తిరుమొళి’ పేరిట భక్తి కావ్యాన్ని రచించిన మహోన్నతుడు కులశేఖర ఆళ్వారు. పూర్వాశ్రమంలో తిరువాన్కూరు పాలకుడు. భక్తుల కాళ్లకు అంటిన మట్టిని, తలపై ధరించే నియమంగల భక్తాగ్రేసరుడు, విప్రనారాయణుడు తొండరడిప్పొడి ఆళ్వారు. వీరు ‘తిరుప్పళ్లి ఎరుచ్చి’ (ఉదయగానము), ‘తిరుమాలై’ (పూలదండ) అనే సుమధుర గ్రంథాలను రచించారు. ఆ రోజుల్లో ఆలయంలోకి ప్రవేశించే అర్హతలేని ఇంట్లో పుట్టినప్పటికీ, అపారమైన భక్తిగానంతో పరమాత్ముణ్నే ప్రసన్నం చేసుకొన్న గొప్పవాడు తిరుప్పాణ్ ఆళ్వారు.
‘పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు’ అనే పాశురాన్ని అలవోకగా పలికిన పెరియాళ్వారు.. భక్తి ఉద్యమానికి కొత్త బాటలు, కొత్త మాటలు సృష్టించారు. భక్తి మార్గంలో పవిత్ర జీవనాన్ని సాధించిన గోదాదేవి (ఆండాళ్) తిరుగులేని
‘తిరుప్పావై’ని గానం చేసి, అద్భుత భక్తి సంపదను లోకానికి అందించారు.
“నాళై వతువై మణమెన్రు..” అంటుంది ఒక పాశురంలో..
“అటూ ఇటూ అరటిపండ్ల గెలల చెట్లు, గుత్తుల పోక చెట్ల అలంకారాలతో ఎంత అందమైన పెళ్లి పందిరి! వస్తున్నాడదిగో సింహం
లాంటివాడు..
నా గోవిందుడు, మాధవుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి.. వస్తున్నాడదిగో! ఆ.. కల కన్నానే చెలీ!”.
ఈ పాశురాన్ని పఠిస్తే పెళ్లికాని అమ్మాయిలకు పండంటి మెగుడితో పెళ్లి జరుగుతుందని మనవారి నమ్మకం!
పుట్టుకతోనే సిద్ధపురుషుడై, చింతచెట్టు కింద దీర్ఘకాలం సమాధి స్థితిలో గడిపిన మహానుభావుడు ‘నమ్మాళ్వార్’.. పన్నెండుగురు ఆళ్వారుల్లో ప్రముఖులని చెప్పుకోవాలి. ప్రతి వైష్ణవాలయంలో మనకు నమ్మాళ్వారు విగ్రహం
కనిపిస్తుంది.
దివ్యజ్యోతి దారి చూపగా, నమ్మాళ్వారును కనుగొని, శిష్యులైన మరొక గొప్పవ్యక్తి మధుర కవి. ‘కణ్నినుం – సిరుత్తాంబు’ అనే గ్రంథంలో మధుర కవి తమ గురువులైన నమ్మాళ్వారును ఎంతో గొప్పగా ప్రశంసించారు.
ఈ పన్నెండు మంది ఆళ్వారుల జీవితాలను, భక్తి రచనలను అధ్యయనం చేసి, ప్రభావితుడైన ఆధ్యాత్మిక సంస్కరణవాది రామానుజాచార్యులవారు. ఆళ్వారు అంటే.. ‘గాఢమైన, గంభీరమైన, లోతులోకి చొచ్చుకొని పోయి పరమాత్మునితో నిరంతర.. నిత్య సాన్నిహిత్యాన్ని తీవ్రంగా కాంక్షించినవాడు’ అని అర్థం.
భగవద్రామానుజుల జీవనయానం అద్భుతం.. ఆదర్శనీయం!
ఆధ్యాత్మిక ఆలోచనధారలో, ఆలయ నిర్వహణ పద్ధతుల్లో.. అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రామానుజులవారు, తన జీవితకాలంలో ఎన్నెన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు. ప్రాణాలకు సైతం తెగించి, తను నమ్మిన ప్రజలకు అవసరమైన సిద్ధాంతాల కోసం, లక్ష్యాల కోసం జీవితాన్ని ధారపోశారు.
తిరుమంత్రం ఒకరిద్దరికే పరిమితం కాకూడదనీ, అది అందరికీ అందాలనీ, అందరినీ భగవంతుడి అనుగ్రహం పొందేలా చేయాలని గోపురమెక్కి తిరుమంత్రాన్ని బహిరంగంగా పఠించారు.
“పవిత్రంగా ఉంచవలసిన పరమ మంత్రాన్ని నీకు మాత్రమే ఉపదేశించాను. పది మందికీ చెప్తే.. నువ్వు నరకానికి పోతావు” అన్నారు అప్పటి పెద్దలు.
రామానుజులవారు ఆ మాటల్ని విని.. ఆ మాటలు చెప్పిన వారికి వినయంగా నమస్కరించి ఇలా అన్నారు.
“మీకు అనేకానేక నమస్సులు. మోక్షమార్గాన్ని చూపే ఈ మహామంత్రాన్ని అందరికీ చెప్తే.. నేను నరకానికి పోతానని మీరంటున్నారు. ఇంతమంది స్వర్గానికి వెళ్లే అవకాశం కల్పించడానికి నేనొక్కణ్ని నరకానికి పోతే.. నష్టమేమిటి?” అని ప్రశ్నించారు.
ప్రశ్నించడం అనేది ఆయన తన జీవితకాలమంతా కొనసాగించారు.
సరిగా చదువు చెప్పని గురువునీ ప్రశ్నించారు. ప్రజల నమ్మకాలను, సంక్షేమాన్ని పట్టించుకోని పాలకులనూ ప్రశ్నించారు. అపసవ్య సిద్ధాంతాలను ప్రచారం చేసుకొంటూ.. పొట్ట పోసుకుంటున్న ప్రతి వారినీ ప్రశ్నించారు.
చదివే చదువు, నేర్చుకున్న సంస్కారం, పెద్దల నుంచి వచ్చిన సంప్రదాయం, ఏర్పరుచుకున్న కట్టుబాట్లు.. లక్ష్యాలు, ఇవన్నీ సమాజంలో వివక్ష లేకుండా అందరికీ ఉపయోగపడాలనీ, ఆ దిశగా గురు పరంపర మార్గ నిర్దేశనాన్ని చేయాలని ఆయన ఆకాంక్షించారు.
రామానుజులవారి జీవన ప్రస్థానంలో ఎన్నెన్నో అద్భుత ఘటనలు చోటుచేసుకొన్నాయి.
ఒకసారి రామానుజులవారు తన మేనమామ గారైన తిరుమల నంబి సాహచర్యంలో రామాయణ సారాన్ని శోధించడానికి, అధ్యయనం చేయడానికి తిరుపతి కొండలకు వెళ్లాలని సంకల్పించారు. ముఖ్య శిష్యులను వెంటబెట్టుకొని.. యాత్రకు బయల్దేరి, దారిలో ‘అష్టసహస్రం’ అనే ఊరికి చేరుకొన్నారు.
వారికి.. ఆ ఊళ్లోని ఇద్దరు వ్యక్తుల గురించి తెలిసింది. ఒకాయన బాగా డబ్బున్న వ్యక్తి. పేరు యజ్ఞేశ్వరుడు. ఆచార్యులవారిని ఇంటికి పిలిపించి, సత్కరించుకోవాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాడు.
ఇంకొకాయన వరదరాయుడు. చాలా బీదవాడు. ఆచార్యులవారి పాదాలపైబడి.. వారి అనుగ్రహం పొందాలనే కోరిక తీవ్రంగా ఉన్నది. కానీ, అందుకు అవకాశం లేదని, మనసులోనే స్వామి
వారిని ప్రార్థిస్తూ కాలం గడుపుతున్నాడు.
‘రామానుజాచార్యులవారు ఈ ఇద్దరిలో ఎవరింటికి వెళ్తారా? ఈ ఇద్దరిలో ఎవరికి తమ దర్శనభాగ్యాన్ని ప్రసాదిస్తారా?’ అని శిష్యుల్లో ఒక విధమైన చర్చ మొదలైంది.
ధనవంతుడైన యజ్ఞేశ్వరుని ఇంటికా?
బీదవాడైన వరదరాయుని ఇంటికా?
శిష్యుల మనోభావాలను పసిగట్టినట్టుగా.. రామానుజులవారు వారివంక చూసి,
“పదండి.. మనం భిక్ష స్వీకరించే వేళ కావొస్తున్నది” అంటూ ముందుకు నడిచారు.
ఆలోచనలను తల్లకిందులు చేస్తూ.. రామానుజులవారు వడివడిగా నడుస్తూ, వరదరాయుని ఇంటి ముందు ఆగారు.
నిజానికి అదొక పూరి గుడిసె.
రామానుజులవారు ఆ గుడిసె ముందుకు వచ్చి..
“నాయనా.. వరదయ్యా!” అని ప్రేమగా పిలిచారు.
లోపల పూజ చేసుకొంటున్న వరదయ్య భార్యకు వినబడింది.
తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది. ఆచార్యులవారు గ్రామానికి వస్తున్నారనీ, వారు ఎక్కడ ఉంటే, అక్కడికి వెళ్లి అవకాశం ఉంటే.. కనీసం దూరం నుంచైనా వారి పాదపద్మాలకు నమస్సులు అర్పించాలని తన భర్త వరదయ్య పొద్దునే చెప్పి, పనిమీద ఇంటి నుంచి బయటికి వెళ్లాడు.
‘స్వామిని దూరం నుంచైనా చూసే అదృష్టం కలుగుతుందా?’ అని సందేహం కలిగింది.
అటువంటిది..
ఆచార్యులవారే స్వయంగా తమ ఇంటి ముంగిటకు వచ్చి నిలబడటమేమిటి?
సమయానికి ఆయన కూడా లేరే! అనుకొంటూ లేవబోయింది.
అప్పుడు గమనించింది.. తన ఒంటిమీద ఉన్న చీరను.
చాలా పాత చీర. చిరుగులతో ఉంది. ఈ చిరుగుల చీరతో ఆచార్యులవారి సమక్షానికి పోలేదు.
బాధ కలిగింది.
దుఃఖం వచ్చింది.
కన్నీటిని అదిమి పెట్టుకొంటూ.. నెమ్మదిగా లేచింది.
“ఆచార్యదేవోభవ” అన్నది బిగ్గరగా..
దేవుడివంటి ఆచార్యుడికి ఆమె స్థితీ, పరిస్థితీ అర్థమైంది.
శిష్యులు ఒకరిముఖం ఒకరు చూసుకున్నారు.
ఇవతలికి రాకుండా, ప్రణామం చేయకుండా, లోపల్నించే నమస్కారాలు చేయడమేమిటి? ఏమిటీ అవిధేయత?
స్వామి చిరునవ్వుతో తల పంకించారు.
తలకు కట్టుకున్న పవిత్ర వస్ర్తాన్ని విప్పి.. లోపలికి విసిరేశారు.
మరుక్షణం..
ఆ వస్ర్తాన్ని చిరుగులు కనబడకుండా, చీరపైన నిండుగా కప్పుకొని బయటికి వచ్చింది.
స్వామి పాదాలకు ప్రణామం చేసి.. లోపలకు ఆహ్వానించింది.
వెదురు కర్రలతో చేసిన చిన్న ఆసనాన్ని చూపి, ఆచార్యులవారిని కూర్చుండమని వినమ్రంగా కోరింది.
“ప్రసాదం.. ఏర్పాటుచేస్తాను స్వామి” అన్నదే కానీ, ఇంట్లో బియ్యంగింజ లేదు.
ఏం చేయాలో అర్థం కాలేదు.
“స్వామివారూ! బావిలో నీటిని తీసుకొచ్చి వంట చేస్తాను..” అంటూ కడవ తీసుకొని బయల్దేరింది.
ఎవరిస్తారు వంట సరుకులు?
ఊరి చివర ఉన్న ఒక పెద్ద మనిషి ఇంటికి వెళ్లింది.
“ఏమిటి సంగతి?” అన్నాడా ధనికుడు.
“కొన్ని సరుకులు ఇస్తే..” అడగలేక అడిగింది.
“చిరుగుల చీర, పూరి గుడిసె, చిల్లి గవ్వలేని మొగుడు.. నీకు సరుకులిస్తే, మళ్లీ ఎప్పుడిస్తావ్? కుదరదు!” కఠినంగా అన్నాడతను.
“అయ్యా! ఎంతో కావలసినవారు, చాలా దూరం నుంచి మా ఇంటికొచ్చారు. ఎలాగైనా సహాయం చేయండి” కన్నీటితో అర్థించింది.
“సరే.. నీకు కావాల్సింది నువ్వడిగావు. నాకు కావాల్సింది నేను అడుగుతా”.
“అడగండి.. ఏం కావాలి” తల వంచుకొనే
అడిగింది.
“నువ్వే కావాలి. సరేనంటే.. సరుకులిస్తా!” అన్నాడు.
మరొక మార్గం లేదు.
తల వంచుకొనే చెప్పిందా ఇల్లాలు..
“సరే, సరుకులు ఇవ్వండి. వంట చేసి, వారికి వడ్డించి, వారు వెళ్లాక సాయంత్రం వస్తాను..” అన్నది.
ఆమెను అదోలా చూస్తూ.. సరుకులు ఇచ్చాడు.
గభాల్న తల తిప్పుకొని, ఆ సరుకులను తీసుకొని వెళ్లిందామె.
భగవద్రామానుజుల జీవనయానం అద్భుతం.. ఆదర్శనీయం!ఆధ్యాత్మిక ఆలోచనధారలో, ఆలయ నిర్వహణ పద్ధతుల్లో.. అనేక సంస్కరణలు
తీసుకొచ్చిన రామానుజులవారు, తన జీవితకాలంలో ఎన్నెన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు. ప్రాణాలకు సైతం తెగించి, తను నమ్మిన ప్రజలకు
అవసరమైన సిద్ధాంతాల కోసం, లక్ష్యాల కోసం జీవితాన్ని ధారపోశారు. తిరుమంత్రం ఒకరిద్దరికే పరిమితం కాకూడదనీ, అది అందరికీ అందాలనీ, అందరినీ భగవంతుడి అనుగ్రహం పొందేలా చేయాలని గోపురమెక్కి తిరుమంత్రాన్ని బహిరంగంగా పఠించారు.
‘రామానుజాచార్యులవారు ఈ ఇద్దరిలో ఎవరింటికి వెళ్తారా? ఈ ఇద్దరిలో ఎవరికి తమ దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తారా?’ అని శిష్యుల్లో ఒక విధమైన చర్చ
మొదలైంది. ధనవంతుడైన యజ్ఞేశ్వరుని ఇంటికా?బీదవాడైన వరదరాయుని ఇంటికా?