ఆట అంటే.. వినోదం! బ్లాక్బస్టర్ సినిమా అంత ఉత్కంఠ భరితం. షేక్స్పియర్ డ్రామాలో లేనంత నాటకీయత. వెబ్సిరీస్ను మరిపించే కొత్తదనం. కాబట్టే, క్రికెట్తో ఆరంభమైన లీగ్ మానియా ప్రతి క్రీడకూ విస్తరించింది. దీనివల్ల ఆటకు గుర్తింపు వచ్చింది. క్రీడాకారులకు నాలుగు కాసులు దక్కుతున్నాయి. నిర్వాహకులూ ఆనందంగానే ఉన్నారు.
Leagues | ఓ నిర్దిష్టమైన ప్రాంతం.. ఆ ప్రాంతానికి సంబంధించిన ఓ జట్టు లేదా ఆటగాళ్లు.. అది రాష్ట్రమైనా.. దేశమైనా! ఒకప్పటి ఆటల ఫార్మాట్ ఇదే. కానీ, ఐపీఎల్ ప్రవేశంతో భారత్ క్రీడా స్వరూపమే మారిపోయింది. ఇప్పుడంతా కలగూర గంప. భారత్, ఆసీస్ క్రికెటర్లు చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. మ్యాగ్నస్ కార్ల్సెన్తో కలిసి విశ్వనాథన్ ఆనంద్ చదరంగ వ్యూహాలు పన్నుతున్నాడు. గత దశాబ్దానంతర కాలంలో ఇబ్బడిముబ్బడిగా స్పోర్ట్స్ లీగ్స్ రంగప్రవేశం చేశాయి. వివిధ క్రీడాంశాల్లో పదిహేనుకుపైగా దూసుకొచ్చాయి. ఖరీదైన టెన్నిసే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో కూతపెట్టే ‘ఖో-ఖో’ కూడా కార్పొరేట్ కళ సంతరించుకుంది. అయితే డబ్బుంటే చాలు.. లీగ్ స్టార్ట్ చేద్దామనుకుంటే మాత్రం పొరపాటే! దీర్ఘకాలంపాటు నడిపే సత్తా.. మార్కెటింగ్ వ్యూహాలు.. ఆర్థిక వనరులు, సెలెబ్రిటీల మద్దతు, పాలకుల చేయూత ఉంటేనే ఆట నిలబడుతుంది. లీగ్ మనగలుగుతుంది. లేదంటే అట్టహాసంగా ఆరంభమై.. అర్ధంతరంగా ఆగిపోయి.. అట్టర్ఫ్లాప్ అనిపించుకోవడం ఖాయం.
గల్లీ క్రికెటైనా.. ప్రపంచకప్ అయినా.. వన్డేలైనా.. ట్వంటీ-ట్వంటీలైనా.. ఫార్మాట్ ఏదైనా మన దేశంలో క్రికెట్కు ఉన్న ఆదరణే వేరు. అందుకే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజయం పెద్దగా ఆశ్చర్యపరచలేదు. కానీ 2014లో ప్రొఫెషనల్ కబడ్డీ లీగ్ (పీకేల్) షురూ అయ్యింది. క్రీడా విశ్లేషకుల అంచనాలు తలకిందులయ్యాయి. ‘కబడ్డీ ఆరంభించారు. తదుపరి గిల్లీ-దండ లీగ్ కూడా మొదలెడతారేమో!’ అని వెటకారమాడిన వాళ్లంతా కంగుతిన్నారు. వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా దన్నుగా నిలవడంతో కబడ్డీ కార్పొరేట్ రంగు పులుముకుంది.
‘బస్తీమే సవాల్!’ అంటూ.. అనూహ్య ప్రేక్షకాదరణతో ఐపీఎల్ తర్వాతి స్థానంలో నిలిచింది. ఐపీఎల్ వీక్షకులు 36 కోట్లు అయితే.. కబడ్డీ వాటా 22 కోట్ల పైచిలుకే! అక్టోబర్లో జరిగే ప్రొ కబడ్డీ పదో ఎడిషన్ కోసం ఇప్పటినుంచే యువత ఉత్సుకతతో ఎదురుచూస్తున్నది.
క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్ లాంటి ప్రొఫెషనల్ క్రీడలే కాదు.. భారత్లో అంతగా తెలియని ఆర్మ్ రెజ్లింగ్ లీగ్ కూడా ఇటీవలే ఆరంభమైంది. అదే ‘ప్రొ పంజా లీగ్’. ఇద్దరు ఆటగాళ్ల భుజబలానికి పరీక్షగా నిలిచే ఈ పోటీల ప్రచారం కోసం నిర్వాహకులు మూడేళ్లుగా శ్రమిస్తున్నారు. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద.. గోవాలోని కాసినో బోట్ల పైనా.. చారిత్రక గ్వాలియర్ కోట ముందు ఆర్మ్ రెజ్లింగ్ ప్రదర్శనలు ఇచ్చి హడావుడి చేశారు. కబడ్డీ మాస్ గేమ్.. క్రికెట్ క్రౌడ్ పుల్లర్ కాబట్టీ లీగ్లు సక్సెస్ అయ్యాయనుకుంటే పొరపాటే! చెస్లోనూ ఈ క్రేజ్ పెరుగుతున్నది. ముఖ్యంగా కరోనా సమయం నుంచే ఆన్లైన్ చెస్ గేమ్లకు ఆదరణ పెరిగింది. ఇదే అదునుగా ఈ ఏడాదే గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్)కు తెరతీశారు. ఫిడే సహకారం, ఆనంద్ మహీంద్రా ప్రోత్సాహం వెరసి.. చదరంగానికి సరికొత్త మెరుపు వచ్చింది. ఆటలో వేగాన్ని పెంచి ఆరు ఫ్రాంచైజీలతో ర్యాపిడ్ చెస్ టోర్నీని ఇటీవలే నిర్వహించారు. ‘మూడేండ్ల క్రితం .. చెస్ ఒలింపియాడ్ ముగింపు సమయంలో ఆనంద్ మహీంద్రా చెస్ లీగ్ పట్ల ఆసక్తి వ్యక్తం చేశారు. ఫ్రాంచైజీస్తో ఓ టీమ్ ఈవెంట్గా తీర్చిదిద్దితే జనం తప్పక ఆదరిస్తారని అనిపించింది. ఆ మాట నిజం అవుతున్నది’ అంటారు చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్. వెలికి తీయాలేగానీ.. వేలాది క్రీడాకారులు వెలుగులోకి తీసుకురాగలిగిన ఆట ‘ఖో-ఖో’. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ‘ఖో’ కూత వినబడని ప్రభుత్వ పాఠశాల ఉండదంటే అతిశయోక్తి కానేకాదు. అందుకే టెన్సింగ్ నియోగి కన్ను ఈ ఆటపై పడింది. నాలుగేండ్లు శ్రమించి ఖో ఖో లీగ్ బ్లూ ప్రింట్ సిద్ధం చేశాడు. ప్రమోటర్గా డాబర్ వైస్ చైర్మన్ అమిత్ బర్మన్ను ఒప్పించాడు. ఇంకేముంది.. గతేడాదే ‘అల్టిమేట్ ఖో-ఖో’ మొదలైంది. “దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 20 లక్షల మంది ‘ఖో-ఖో’ ఆడుతున్నారు. అందులో సింహభాగం అమ్మాయిలే. దక్షిణ భారతదేశంలో ఈ ఆట మరింత ప్రాచుర్యం పొందింది. ముంబైలో అయితే ఏకంగా 700 ఖో-ఖో క్లబ్లు ఉన్నాయి. బర్మన్ కూడా భారీ మొత్తంలో పెట్టుబడికి ముందుకు వచ్చారు” అని అల్టిమేట్ ఖో-ఖో సీఈవో నియోగి ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు.
ఆత్మరక్షణకే మార్షల్ ఆర్ట్స్ అన్నది మనదేశంలో భావన. అయితే ఇందులోనూ ఓ లీగ్ వచ్చేసింది. మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ (ఎంఎఫ్ఎన్) పేరుతో 2019లో లీగ్ ఆరంభించారు. “మార్షల్ ఆర్ట్స్ ఫైటర్స్కు సాధారణంగా ఆదాయం తక్కువ. ఆరంభంలో మేం రూ.80 వేల నుంచి రూ. లక్షా పదహారు వేలు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఆటగాళ్ల ప్రైజ్మనీ రూ.4లక్షల నుంచి రూ.8 లక్షలకు పెరిగింది” అంటున్నారు ఎంఎఫ్ఎన్ లీగ్ ప్రెసిడెంట్ ఆయేషా. మెట్రో నగరాలు.. సంపన్న శ్రేణులకే పరిమితమైన టెన్నిస్.. మధ్యతరగతి కుర్రాళ్లుకూ చేరువవుతున్నది.. ఇందుకు వేదిక టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్). “2018లో తొలి ఎడిషన్ సందర్భంగా ముంబైలో ప్రతిభాన్వేషణ చేశాం. కేవలం 140 మంది పాల్గొన్నారు. నాలుగేళ్లలో పరిస్థితి మారింది. గతేడాది దాదాపు 5000 మంది వివిధ నగరాల నుంచి లీగ్ కోసం క్యూ కట్టారు. మా ఉత్సాహం పదింతలైంది. రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా 600లకు పైగా టోర్నీలు నిర్వహిస్తాం” అంటూ.. రెట్టించిన ఉత్సాహంతో చెబుతున్నారు టీపీఎల్ ప్రమోటర్ కునాల్ ఠాకూర్.
టీమ్ గేమ్లే లీగ్లో ఎక్కువగా క్లిక్ అవుతున్నాయి. “జట్టు ఆడితేనే ఫ్రాంచైజీ పేరు ప్రాచుర్యంలోకి వస్తుంది. వ్యక్తిగత ఆటలో ఆటగాళ్ల పేర్లే గుర్తుంటాయి” అని ఓ ఫ్రాంచైజీ యజమాని వ్యాఖ్యానించడం గమనార్హం. అయినా, ఇప్పుడంతా ర్యాపిడ్ యుగం. రోజుల తరబడి సాగే ఆటలకు కాలం చెల్లింది. అందుకే ఆటలో వేగం పెరగాలంటే సంప్రదాయ నిబంధనలూ పక్కన పెట్టాల్సిందే! ఉదాహరణకు ఖో-ఖోనే తీసుకుంటే తొమ్మిది మందికి బదులుగా ఏడుగురినే ఆడిస్తున్నారు. టెన్నిస్ లీగ్లోనూ ఫార్మాట్ను మార్చారు. సాధారణంగా టెన్నిస్లో బెస్ట్ ఆఫ్ త్రీ లేదా బెస్ట్ ఆఫ్ ఫైవ్ సెట్స్గా మ్యాచ్లు జరుగుతాయి. ఇదంతా పక్కన పెట్టి.. ప్రతి మ్యాచ్లో 20 పాయింట్ల చొప్పున నాలుగు గేమ్లు ఉండేలా మార్పులు చేశారు. వాలీబాల్ లీగ్లోనూ 25 పాయింట్లకు బదులు 15 పాయింట్లకు కుదించారు. లీగ్ల రాకతో గ్రామీణ ప్రాంత ఆటగాళ్లకూ విస్తృతమైన అవకాశాలు దొరుకుతున్నాయి. ఐపీఎల్ కారణంగా ఆటోడ్రైవర్ కొడుకు అంతర్జాతీయ బౌలర్గా ఎదిగాడు. డెలీవరీ బాయ్ క్రికెట్ హీరో అయ్యాడు. అంతేకాదు విదేశీ ఆటగాళ్ల సాహచర్యంలో మరిన్ని మెలకువలు నేర్చుకుంటున్నారు. స్పోర్ట్స్ లీగ్లు సాధారణ ఆటగాళ్లను వెలుగులోకి తేవడం ఒకెత్తయితే.. అంతకుమించి స్థిరమైన ఆదాయ వనరుగా మారడం మరో ఎత్తు. ప్రొఫెషనల్ కబడ్డీ స్టార్ ప్రదీప్ నర్వాల్ది పూర్తి గ్రామీణ నేపథ్యం. యూపీ యోధాస్ జట్టు గతేడాది రూ. 1.65 కోట్లకు ప్రదీప్ను కొనుగోలు చేసింది. కబడ్డీ ఆటగాడిగా అతను ఇంత డబ్బును ఊహించి ఉండడేమో! హర్యానాలోని కొన్ని గ్రామాల్లో యువకులు వ్యవసాయం వదిలిపెట్టి మరీ కబడ్డీని కెరీర్గా ఎంచుకుంటున్నారు. లీగ్ల వల్ల అవకాశాలు పెరగడమే ఇందుకు కారణం. టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) అంకిత రైనా ఇప్పటికే మూడు ఎండార్స్మెంట్స్ మీద సంతకం చేసింది.
టీవీ వీక్షకులే లీగ్లకు ప్రధాన ఆదాయ వనరు. ఇప్పుడు ఈ జాబితాలో డిజిటల్ మీడియా (ఓటీటీ) జతయింది. ఐపీఎల్ మీడియా హక్కులు పదేళ్ల కాలానికి రూ.8200 కోట్లకు అమ్ముడు పోగా.. తదుపరి ఐదేళ్లకు ఆ ధర రూ.48,390 కోట్లకు చేరింది. ప్రొ కబడ్డీ హక్కులు అయిదేళ్ల కాలానికి ఏకంగా రూ.905 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక్కడా కొన్ని పరిమితుల ఉన్నాయి. లీగ్ నిర్వహణ అంత ఆషామాషీ కాదు. స్పాన్సర్ దొరికాడు కదా.. లీగ్ పెట్టేద్దామంటే కుదరదు. ఓపిక వహిస్తేనే లాభాలు వస్తాయని వివిధ లీగ్ల అనుభవాలు చెబుతున్నాయి. నిజానికి ఐపీఎల్ ఆరంభంలో నష్టాల్లోనే నడిచింది. మొదట భారత్లో లీగ్లకు బీజం వేసింది హాకీ. 2005లో ప్రారంభమైన ప్రీమియర్ హాకీ లీగ్ ముచ్చట మూడేళ్లలోనే ముగిసింది. ఆ తర్వాత హాకీ ఇండియా లీగ్ ఆరంభమైనా.. ఆర్థిక నష్టాలతో ఎంతోకాలం కొనసాగలేదు. ప్రొ రెజ్లింగ్, బాక్సింగ్, స్నూకర్ లీగ్లు బాలారిష్టాలను దాటలేకపోయాయి. మరోమారు కొత్త ఆవిష్కరణకు ప్రయత్నిస్తున్నాయి. మహేశ్ భూపతి సారథ్యంలోని ఇంటర్నేషనల్ టెన్నిస్ లీగ్ కూడా గట్టెక్కలేక పోయింది. అలా అని పూర్తిగా నిరాశపడాల్సిన పన్లేదు. మార్కెట్లో ఆశాజనకమైన మార్పు కనిపిస్తున్నది. బజాజ్ గ్రూప్నకు చెందిన నీరజ బజాజ్.. టేబుల్ టెన్నిస్ లీగ్ కోసం దాదాపు వందకోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యారు. టెన్నిస్ ప్రీమియర్ లీగ్ అయితే ఓ అడుగు ముందుకేసి.. ప్రొఫెషనల్స్ జోలికి వెళ్లకుండా మెరికల్లాంటి బాల క్రీడాకారులను వెతికేపని మొదలుపెట్టింది. ‘క్యాచ్ దెమ్ ఎంగ్’ నినాదాన్ని భుజానికి ఎత్తుకుంది. ‘టాలెంట్ డే’ పేరుతో పాఠశాల స్థాయిలో పోటీలు నిర్వహిస్తున్నది. క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్ వరకూ ఫర్వాలేదు. మార్కెట్ సిద్ధంగా ఉంటుంది. వీక్షకులు పరుగెత్తుకొస్తారు. స్పాన్సర్లు నోట్లను చిల్లరలా ఖర్చు పెడతారు. లీగ్ అనేది.. సినిమా కాదు. మొదటి మూడు రోజుల కలెక్షన్లు చూసి మురిసిపోవడానికి. ఇదంతా ఓటీటీని తలపించే వ్యవహారం. జనానికి అందుబాటులోకి తీసుకురావడం వరకే మన పని. ప్రజలు తీరిగ్గా ఆదరిస్తారు. అప్పటిదాకా ఓపికతో ఎదురుచూడాల్సిందే. అవును, ఓ ఆటను జనంలోకి తీసుకెళ్లడం అంటే.. కొబ్బరి చెట్టు నాటినంత దీర్ఘకాలికమైన వ్యవహారం.
స్పోర్ట్స్ లీగ్ల ప్రమోషన్లో సోషల్ మీడియా దుమ్మురేపుతున్నది. ఆటను మార్కెటింగ్ చేయడంలో ఇప్పుడు సోషల్ మీడియాదే ప్రధానపాత్ర. ప్రపంచవ్యాప్తంగా 360 కోట్ల మంది రెగ్యులర్గా సామాజిక మాధ్యమాల్లో వివిధ లీగ్లను ఫాలో అవుతున్నారు. వచ్చే రెండేండ్లలో ఈ సంఖ్య 450 కోట్లకు చేరుతుందని అంచనా. ప్రత్యక్ష ప్రసారాలకే కాకుండా లైవ్ చాట్కూ అవకాశం ఉండటం సోషల్ మీడియా అదనపు ప్రయోజనం. నేరుగా అథ్లెట్లతో, స్పోర్ట్స్ స్టార్స్తోనూ అభిమానులు తరచూ చిట్చాట్ చేస్తున్నారు. ఆటకు బ్రాండ్ వాల్యూ పెంచడంతోపాటు స్పాన్సర్లను వేగంగా వెతికిపెట్టడంలోనూ సోషల్ సైట్లు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి.
-మట్టపల్లి రమేశ్