దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్లో.. ఏడాదికోసారి జరిగే ఉత్సవానికి సమయం ఆసన్నమైంది. ఆరు నెలల పాటు మంచుతో కప్పి ఉండే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్ మహాధామాలు.. మంచుతెరలు తొలగించుకొని.. భక్త జనులను, పర్యాటక ప్రియులను స్వాగతిస్తున్నాయి. మంచుకొండల్లో సాగే మహా విహారం చార్ధామ్ యాత్ర. హిమాలయ సానువుల్లో దాదాపు 10 రోజులపాటు 1,200 కిలో మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. వందల అడుగుల లోతైన లోయల పక్కగా సాహసోపేతంగా సాగిపోయే యాత్రా విశేషాలే ఇవి..
బదరీనాథ్, ద్వారక, రామేశ్వరం, పూరి ఈ నాలుగు పుణ్యక్షేత్రాల దర్శనానికి చార్ధామ్ యాత్ర అని పేరు. గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్, కేదార్నాథ్ ధామాల దర్శనాన్ని మినీ చార్ధామ్ యాత్రగా పేర్కొంటారు. ప్రస్తుతం దీనిని కూడా చార్ధామ్ యాత్రగా పిలుస్తున్నారు. ఏటా అక్షయ తృతీయ నుంచి దీపావళి తర్వాత వచ్చే యమద్వితీయ వరకు ఆరు నెలలు మాత్రమే ఈ ఆలయాలను భక్తుల కోసం తెరుస్తారు. మిగతా ఆరు నెలల కాలం అక్కడంతా మంచు కప్పేసి ఉంటుంది. ఆలయాలను తెరిచే, మూసివేసే క్రతువులు అత్యంత వైభవంగా సాగుతాయి. తొలిదర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు.
ఈ నాలుగు ధామాల్లో ముందుగా ఎక్కడికి వెళ్లాలనే సందేహం రావడం సహజమే కానీ.. సాధారణంగా యాత్రికులు తూర్పు నుంచి పశ్చిమానికి ప్రయాణిస్తారు. అంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్ ఇలా సాగుతుందన్నమాట. హరిద్వార్ నుంచి వాహనాల్లో డెహ్రాడూన్, ముస్సోరీల మీదుగా యమునోత్రికి బయల్దేరుతారు. ఈ మార్గంలో వాహనాలు జానకీ ఛట్టీ అనే ప్రాంతం వరకు వెళ్తాయి. అక్కడి నుంచి 8 కిలోమీటర్లు కాలినడకన యుమునోత్రికి చేరుకోవచ్చు. గుర్రాలు, నలుగురు మనుషులు మోసే పల్లకి (డోలీ)ల్లో మంచుపర్వతాల్లో ప్రయాణించి యమున జన్మస్థలమైన యమునోత్రికి చేరుకోవాలి. ఈ నడక దారి ఒక్కోచోట 10 అడుగుల వెడల్పే ఉంటుంది. అప్రమత్తంగా లేకపోతే గుర్రాలు తోసుకుంటూ వెళ్లిపోతాయి. యమునోత్రి చేరుకున్న తర్వాత.. సూర్యకుండంలో (వేడినీళ్ల కుండం) స్నానాలు చేసి.. యమునాదేవి ఆలయాన్ని సందర్శించుకుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ముందు ఇక్కడి దివ్యశిలకు ప్రత్యేక పూజలు చేస్తారు.
గంగ అని ముద్దుగా, గంగమ్మ అని భక్తితో.. గంగమ్మతల్లీ అని పరవశంతో పిలుచుకునే గంగానది జన్మస్థలమే గంగోత్రి. ఇక్కడికి నడిచి వెళ్లాల్సిన పనిలేదు. వాహనాల్లో నేరుగా గంగోత్రి వరకూ వెళ్లొచ్చు. యమునోత్రి నుంచి జానకీ ఛట్టీ వరకు వచ్చాక, అక్కడి నుంచి వాహనాల్లో గంగోత్రికి చేరుకోవచ్చు. ముందుగా బార్కోట్ చేరుకోవాలి. అక్కడ బస చేసి మర్నాడు ఉదయం గంగోత్రికి బయలుదేరుతారు చాలామంది. బార్కోట్ నుంచి ఘాట్ రోడ్డు మీదుగా 100 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఉత్తర కాశి వస్తుంది. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్లు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తే గంగోత్రి చేరుకోవచ్చు. అక్కడ ధవళవర్ణంలో మెరిసిపోతున్న గంగాదేవి ఆలయం దర్శనమిస్తుంది. నిజానికి గంగ జన్మస్థలం ఇది కాదు. ఇక్కడి నుంచి మరో 17 కిలోమీటర్ల దూరం కాలినడకన మంచుపర్వతాలను ఎక్కితే గోముఖ్ వస్తుంది. అక్కడ గోవు ముఖం రూపంలోని ఓ పర్వత పాదాల నుంచి గంగ ఉబికి వస్తూ కనిపిస్తుంది. అక్కడికి వెళ్లాలంటే ముందుగా సైన్యం అనుమతి తీసుకోవాలి.
గంగోత్రి దర్శనం అనంతరం యాత్రికులు కేదార్నాథ్ యాత్రకు పయనమవుతారు. గంగోత్రి నుంచి ఉత్తరకాశి మీదుగా వాహనాల్లో రుద్ర ప్రయాగ చేరుకుంటారు. అక్కడి నుంచి కేదార్నాథ్కు బయలుదేరుతారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ 11వది. ఈ దారిలో వచ్చే గుప్తకాశి పురాణాల పరంగా విశిష్ఠమైన క్షేత్రం. అక్కడి నుంచి గౌరీకుండ్ చేరుకుంటారు. గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్కు 14 కిలోమీటర్లు. కాలి నడకన, డోలీల్లో, గుర్రాలపై వెళ్తుంటారు. కేదార్ వెళ్లే దారి పొడుగునా లోయల్లో మందాకిని నది ఉరుకుల పరుగులతో సాగిపోతూ ఉంటుంది. కేదార్నాథ్ ఆలయం మూడు పర్వతాల మధ్య ఉంటుంది. ఎద్దు పృష్టభాగం రూపంలో ఉండే ఇక్కడి శివలింగం అత్యంత పవిత్రమైనది. ఆదిశంకరాచార్యుల వారు ఇక్కడే తన దేహాన్ని త్యజించి శివైక్యమయ్యారని చెబుతారు. ఈ ఆలయం వెనుక ఆయన సమాధి మందిరం ఉంటుంది.
బదరీనాథ్కు వాహనాల్లో నేరుగా వెళ్లొచ్చు. కేదార్నాథ్ నుంచి తొలుత జోషీమఠ్కు వెళ్లాలి. ఘాట్ రోడ్డు మీదుగా సాగే ఈ ప్రయాణం భలేగా ఉంటుంది. పక్కన లోయలో అలకనందా నదీ ప్రవాహం అలరిస్తుంది. జోషీమఠ్ నుంచి బదరీనాథ్ సుమారు 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. నరనారాయణ పర్వతాల నడుమ నెలకొని ఉన్న బదరీనాథ్ ఆలయ గోపురం రంగురంగులతో భక్తులను ఆకట్టుకుంటుంది. పలు ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు భోజన, వసతి సదుపాయాలు లభిస్తాయి. బస్సులు, వాహనాలు నేరుగా బదరీధామానికి చేరుకుంటాయి. నారాయణుడిని దర్శించుకోవడంతో చార్ధామ్ యాత్ర ముగుస్తుంది. యాత్రికులు హరిద్వార్ లేదా రుషికేశ్ చేరుకొని తిరుగు ప్రయాణం అవుతారు.
