KCR | ఆ పలుకులు ప్రవాహాలు. ఆ విమర్శలు ఫిరంగులు. ఆ చలోక్తులు హాస్య గుళికలు. ఆ హితవులు మార్గదర్శకాలు. కేసీఆర్ ఉపన్యాసం వింటే.. మంచి పుస్తకమేదో చదివిన భావన కలుగుతుంది. భాషలోని మధురిమ తెలుస్తుంది. వ్యక్తీకరణలోని ఒడుపునూ ఆస్వాదిస్తాం. రాజకీయ పోరాటాల నుంచి భాషా ఉద్యమాల వరకు.. విషయం ఏదైనా అదే గాఢత, అంతే తాత్వికత. అందులోంచి కొన్ని మెచ్చు తునకలు..
భాషకు అవధులు, ఎల్లలు ఉండవు. ఒక కవి మరొక కవిని తయారు చేస్తాడు. ఒక పండితుడు మరో పండితుడిని తయారు చేస్తాడు. ఈ గురు పరంపర, ఈ సంప్రదాయాలు, ఈ విలక్షణత తెలంగాణలో కొనసాగాలన్నది నా ఆకాంక్ష.
ఈ అడవి మనది. ఎవరిదో కాదు. చిన్నప్పుడు ఎన్ని రకాల పండ్ల చెట్లు ఉండె. మనం తినే పండ్లు వేరే ఉంటయి. కోతులు గానీ, ఇతర పక్షులు గానీ తినేవి వేరే ఉంటయి. కోతులు ఆడనే తినేవి. ఏర్ల నీళ్లు తాగి మంచిగ ఆడనే ఉండేవి. అవన్నీ మనం కట్ చేసినం. అవి వచ్చి మన పంటల్ని కట్ చేస్తున్నయి.
తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల వద్దకు చేర్చిన ఘనత కళాకారులదే. ఎక్కడ తెలంగాణ సభలు జరిగినా కళాకారులు బస్సులు, బండ్లు, లారీలు అని చూడకుండా వెల్లువలా తరలివచ్చేవారు. కళాకారులు ఆకలి కడుపులతో, తినీ తినక, అటుకులు బుక్కి పాటలు పాడి ప్రజల్లో చైతన్యం తెచ్చారు.
అమ్మ ఒడి తొలి బడి. ఏ బిడ్డ అయినా అమ్మ ఒడిలోనే మొదటి పాఠాలు నేర్చుకుంటుంది. ‘జో అచ్యుతానంద జోజో ముకుందా.. లాలిపరమానంద.. రామగోవిందా’వంటి జోలపాటలతో తల్లి తన బిడ్డ గోవిందుడు, అచ్యుతుడు కావాలని కోరుకుంటుంది. జోలపాటల నుంచే తెలుగు తీయదనాన్ని పసిబిడ్డలు ఆస్వాదిస్తారని చెప్పడానికి ఇవి ఉదాహరణలు. ఆ విధంగా చిన్ననాటి నుంచి అమ్మానాన్నలు, గురువుల చెరగని ముద్రలు నాపై ఉన్నాయి.
సుబ్బిరామిరెడ్డి గారి శ్లోకాలు, వెంకయ్యనాయుడు గారి ప్రాసల తర్వాత మాట్లాడితే.. సీఆర్పీఎఫ్ లాఠీచార్జ్ తర్వాత చీపురుపుల్లతోని కొట్టినట్టు ఉంటది. చాలా సభల్లో కాసేపు స్వ డబ్బా, కాసేపు పరడబ్బా, కాసేపు పరస్పర డబ్బా! మీరు గొప్పవారు, మేం గొప్పవారం, వెరసి మనమందరం గొప్పవారం.. అనడం తప్ప మూడోది ఉండదు.
ఫతే దర్వాజ దగ్గర చప్పట్లు కొడితే బాలా హిస్సార్ దర్వాజ కాడ ప్రతిధ్వనించే ధ్వని శాస్త్ర విజ్ఞానానికి, వాస్తుకళా కౌశలానికి నిదర్శనంగా నిలిచింది గోల్కొండ కోట. తానీషా ప్రభువుకు శ్రీరామలక్ష్మణులు సాక్షాత్కరించింది గోల్కొండ కోటలోనే. భక్త రామదాసు నోట వెలువడిన సుప్రసిద్ధ కీర్తనలెన్నో ప్రతిధ్వనించింది ఈ కోటలోనే. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోహినూర్, దరియా ఏ నూర్ వజ్రాలకు ఆలవాలంగా విలసిల్లింది గోల్కొండ సామ్రాజ్యమే.
ఒక మేరాయన బట్టలు కుట్టేటప్పుడు సూది జారి పోయింది. దానికోసం ఇల్లంతా వెతికాడు. అయినా దొరకలేదు. సూది దొరికితే కిలో చక్కెర దేవుడికిస్తానని మొక్కుకున్నాడు. అదిచూసి అతని పెండ్లాం మొత్తుకున్నది. ‘పావలా విలువ చేయని సూది కోసం కిలో చక్కెర దానమిస్తవా?’ అని నిలదీసింది. ‘పిచ్చిదానా! సూది దొరికితే మొక్కు ఎగ్గొట్టేది ఎంతసేపే’ అని జవాబిచ్చాడు మొగుడు నవ్వుతూ. కొన్ని పార్టీల హామీలూ అంతే.