Bathukamma | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. ఇది మన అస్తిత్వాన్ని తెలిపే వేడుక. ఆశ్వయుజ మాసంలో పెత్రమాసనాడు ఆరంభమై తొమ్మిదిరోజుల పాటు.. అష్టమి వరకు కొనసాగుతుంది. పండుగ జరిగినన్ని రోజులూ బతుకమ్మను ఆరాధించి, ఆపైన నిమజ్జనం చేస్తారు. పాటలే బతుకమ్మ అర్చనలో వేద మంత్రాలు. ప్రతి పాటకూ ఓ నేపథ్యం ఉంటుంది. ఏదో ఓ ఇతివృత్తం చుట్టూ పొందికగా అల్లుకుని సాగుతుంది. అంతర్లీనంగా కథలూ, గాథలూ ఉంటాయి. అవి జానపదాలు కావచ్చు, పౌరాణికాలు కావచ్చు. చారిత్రక ఘట్టాలతో ముడిపడి కూడా ఉండవచ్చు.
దేవీ పురాణంలోని మహిషాసురుని వృత్తాంతం.. జానపదానికి వచ్చేసరికి బతుకమ్మ కథల్లో భాగమైంది. అత్యంత బలశాలి అయిన మహిషాసురుణ్ని సంహరించే శక్తి ఒక్క గౌరీమాతకే ఉంటుంది. ఆ తల్లి ఉగ్ర రూపంతో మహిషుడితో తలపడి, ఆ రాక్షసుణ్ని వధించి మహిషాసుర మర్దినిగా పేరుగాంచింది. ఆ భీకర పోరాటం తర్వాత గౌరీదేవి అలసిసొలసి యోగనిద్రలోకి వెళ్లిపోతుంది. జగన్మాతను ఆ స్థితి నుంచి బయటికి తీసుకురావడానికి స్త్రీలంతా బతుకమ్మ పాటల రూపంలో వేడుకుంటారు.
మగువల తొమ్మిది రోజుల ప్రార్థనలకు స్పందించి, గౌరీదేవి జాగృతమవుతుంది. అందరికీ ఆశీస్సులు అందిస్తుంది. ఆ తొమ్మిది రోజుల గౌరీ పూజలే.. అనంతర కాలంలో బతుకమ్మ పండుగగా ప్రసిద్ధి పొందాయని ఓ కథనం. పురాణాలలో గంగాగౌరీ సంవాదం సుప్రసిద్ధం. శివుడి తలకెక్కిన గంగను చూసి పార్వతీదేవి అసూయ పడుతుంది. అందరూ గంగనే పూజిస్తున్నారని తన తల్లితో చెప్పి ఆవేదన చెందుతుంది. గంగమీద నిన్ను పూలతెప్పలా తేలించి.. పూజించేలా చేస్తానని ఆ తల్లి మాటిస్తుంది. ఆ వాగ్దానమే బతుకమ్మ ఆచారంగా మారిందని, పూలతో బతుకమ్మను పేర్చి, పసుపుతో గౌరమ్మను చేసి.. ఆటపాటలతో కొలిచి, గంగలో వదిలేసే ఆచారం ఏర్పడిందని మరో ప్రచారం.
బృహదీశ్వరమ్మే.. బతుకమ్మ
దక్షిణ కాశీగా సుప్రసిద్ధమైన వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి దేవాలయం ఎనిమిదో శతాబ్దంలో నిర్మితమైంది. ఈ దేవాలయాన్ని లేంబాలవాటిక అని, భాస్కర క్షేత్రమని, హరిహర క్షేత్రమనీ అంటారు. ఈ దేవాలయంలో పార్వతి, రాజరాజేశ్వరీ సమేతుడైన శివుడు మహాలింగ రూపంలో దర్శనమిస్తారు. ఈ దేవాలయం గురించి భవిష్య పురాణంలోనూ ప్రస్తావన ఉంది. అర్జునుడి మనుమడైన నరేంద్రుడు అనుకోకుండా ఓ ముని చావుకు కారణం అవుతాడు.
ఆ దోషాన్ని నివృత్తి చేసుకోవడానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. ఈ దేవాలయాన్ని వేములవాడ చాళుక్య రాజు విక్రమాదిత్య యుద్ధమల్లుని మనుమడు మొదటి నరసింహుడు నిర్మించాడు. ఇతనికి రాజాదిత్య అనే బిరుదు ఉండేది. ఆ పేరుతోనే రాజరాజేశ్వర దేవాలయం అనే పేరు వచ్చింది. తమిళనాడును పరిపాలించే రాజరాజచోళుడి తండ్రి రెండవ పరాంతక సుందర చోళుడు రాష్ట్రకూటుల నుంచి తనను కాపాడమని పరమేశ్వరుడిని వేడుకుంటాడు.
ఆ భక్తితోనే తన కుమారుడికి రాజరాజు అని నామకరణం చేస్తాడు. రాజరాజు కూడా రాజరాజేశ్వరుడి భక్తుడే. అంతలోనే, రాజరాజచోళుడి కొడుకు రాజేంద్ర చోళుడు ఈ ప్రాంతంపై దాడి చేసి.. రాజరాజేశ్వర ఆలయంలోని విగ్రహాన్ని పెకలించి తీసుకెళ్లి తన తండ్రికి కానుకగా ఇస్తాడు. ఆ స్వామిని ప్రతిష్ఠించడం కోసమే రాజరాజు తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడని అంటారు. దేవాలయ నిర్మాణానికి చాళుక్యుల నుంచి కప్పంగా వసూలు చేసిన సొమ్మునే వినియోగించాడు.
ఆ తర్వాత చాళుక్యులు రాజరాజేశ్వర ఆలయంలో పునఃప్రతిష్ఠించిన మూర్తికి, బృహదీశ్వరాలయంలోని శివలింగానికి అనేక పోలికలు కనిపిస్తాయి. ఆ సంఘటనతో కల్యాణి చాళుక్యులు, రాజ్య ప్రజలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. శివుడికి (బృహదీశ్వరుడు) దూరమైన ఒంటరి పార్వతిని (బృహదీశ్వరమ్మను) వారు చూడలేకపోయారు. పసుపుతో గౌరమ్మను చేసి, తొమ్మిదిరోజులు పువ్వులతో బతుకమ్మను పేర్చి, శివుడు లేని పార్వతి గురించి పాటలు పాడుతూ, పూజించి శివుడి దగ్గరికి వెళ్లిరమ్మంటూ నీళ్లలో వదులుతారు. అదే అనంతర కాలంలో తెలంగాణ ప్రజల బతుకమ్మ ఆచారంగా మారిందని ఓ విశ్లేషణ.
అనగనగా.. ధర్మాంగదుడు
బతుకమ్మతో ముడిపడిన ఓ జానపద కథ బహుళ ప్రాచుర్యంలో ఉంది. దక్షిణ భారతదేశాన్ని పూర్వం ధర్మాంగదుడు అనే రాజు పాలించేవాడు. ఈయన భార్య సత్యవతీదేవి. వీరికి వందమంది కుమారులు జన్మించినా.. అందరూ చనిపోయారు. దీంతో సంతానం లేకుండా పోతుంది. ఆ ఆలూమగలు ఘోర తపస్సు చేసి, లక్ష్మీదేవిని తమ కూతురిగా పొందుతారు. ఆ బాలికను చూసి దేవతలు, మునులు చల్లగా బతకమని ఆశీర్వదిస్తారు. ఆమే బతుకమ్మగా ప్రాచుర్యం పొందింది.
ఈ బాలికకు చిన్నతనం నుంచే అతీత శక్తులు ఉండేవి. అడిగిన వారందరికీ వరాలు ఇచ్చేది. సాక్షాత్తూ ఆ శ్రీమహా విష్ణువు చక్రాంకుడనే పేరుతో జన్మించి ధర్మాంగదుడి ఇంటికి ఇల్లరికం వస్తాడు. ఆ జంటకు అనేకమంది పుత్రికలు జన్మిస్తారు. ఆ కడుపుచల్లని తల్లిని పూజించి.. తమ పసుపుకుంకాలు కలకాలం ఉండాలని వేడుకుంటారు ముత్తయిదువలు. తమకు మంచి భర్తను ప్రసాదించమంటూ.. పసుపు ముద్దను చేసి, దానిని శ్రీ మహాలక్ష్మిగా, పార్వతీదేవిగా భావించి పువ్వులతో గోపురంగా పేర్చి పూజిస్తారు పడుచుపిల్లలు. వేములవాడ ప్రాంతానికి చెందిన నరసింహభట్టు కవి బతుకమ్మ ప్రాశస్త్యాన్ని చెబుతూ.. ఈ కథను పాటరూపంలో వివరించాడు.
రామరామరామ ఉయ్యాలో
శ్రీరామరామ ఉయ్యాలో
శ్రీలక్ష్మిదేవియు ఉయ్యాలో
సృష్టిబతుకమ్మయ్యె ఉయ్యాలో
భరతుని దేశమున ఉయ్యాలో
ధర్మాంగదుడనురాజు ఉయ్యాలో
ఆరాజు భార్యయూ ఉయ్యాలో,
అతివ సత్యవతి ఉయ్యాలో
నూరు నోముల నోచి ఉయ్యాలో
నూరుమందిని కనియె ఉయ్యాలో
వారు శూరులయ్యా ఉయ్యాలో,
తరగని శోకమున ఉయ్యాలో
ఘన అడవులకు బాసి ఉయ్యాలో
దాయాదులను బాసి ఉయ్యాలో..
అంటూ సాగుతుందా పాట.
మరొక జానపద కథ ప్రకారం.. పార్వతీదేవియే వాసవాంబిక. ఈమె వైశ్యుల కులదేవత. కుసుమ శ్రేష్ఠి, కుసుమాంబికల పుత్రిక. గొప్ప సౌందర్యవతి. ఆమెను చూసి విష్ణువర్ధన మహారాజు మోహిస్తాడు. వివాహం చేసుకోవాలని భావిస్తాడు. దానికి ఆమె తల్లిదండ్రులు నిరాకరిస్తారు. ఆమె కూడా రాజాజ్ఞను ధిక్కరించి.. అగ్నికి ఆహుతి అవుతుంది. ఆ ఆత్మ త్యాగాన్ని కొనియాడుతూ వైశ్యులు ఆమెను దేవతగా కొలుస్తారు. మళ్లీ బతకమని పూజిస్తారు. అదే బతుకమ్మ సంప్రదాయంగా మారి ఉండవచ్చని ఒక అభిప్రాయం.
ముగ్గురమ్మల మూలపుటమ్మ
శ్రీచక్రోపాసన నుంచి ఈ పండుగ వచ్చిందని మరో కథనం. బతుకమ్మ శక్తిస్వరూపిణి, మానవాళికి ఆయురారోగ్యాలను జ్ఞాన, ఇచ్ఛా, క్రియా శక్తులను ప్రసాదించే తల్లి. కనుక ఈ శక్తిని శ్రీచక్ర రూపంలో కొలవడం సంప్రదాయంగా మారిందని అంటారు. లక్ష్మి, పార్వతి, సరస్వతి.. ఈ ముగ్గురమ్మల రూపమే బతుకమ్మ అని తెలంగాణ మహిళల బలమైన భావన. ఈ ముగ్గురినీ ఏకరూపంలో చూడటమే దేవీతత్వం. శక్తిని ఆరాధించడానికి, పూజించడానికి శరత్ రుతువు అనుకూలమైనదని చెబుతారు ఉపాసకులు.
ఈ రుతువులో చంద్రుడు అమితంగా ప్రకాశిస్తాడు. చంద్రుడిని మనః కారకుడనీ అంటారు. మనసులో ఉద్భవించే అనుకూల, ప్రతికూల భావాలకు చంద్రుని కళలే కారణమని విశ్వసిస్తారు. కాబట్టే, ఆ చంద్రకళల రూపంలో విరాజిల్లే శక్తి స్వరూపాన్ని లలితాదేవిగా, పార్వతిగా, పరమేశ్వరిగా, శంభురాణిగా, శైలసుతగా, కాళికగా, శాకంబరిగా, శ్యామలాంబగా, బాలాత్రిపురసుందరిగా, బతుకమ్మగా భావించి.. ఆమెను ప్రకృతి ప్రతిరూపాలైన పుష్పాలతో అలంకరించి పూజించడం సంప్రదాయంగా స్థిరపడి ఉండవచ్చని అమ్మవారి ఉపాసకుల ఉవాచ. నిజమే, బతుకమ్మ సంప్రదాయంలో ప్రతీదీ ప్రతీకాత్మకమే.
కాకతీయ దేవత..
తెలుగు వారందరినీ ఏకతాటిపై తెచ్చి.. క్రీ.శ.996 నుంచి 1323 వరకు అప్రతిహతంగా తెలుగు ప్రాంతాన్ని పాలించిన కాకతీయుల కాలంలో బతుకమ్మ బాగా ప్రాచుర్యం పొందింది. చాళుక్యుల సామంతులుగా, స్వతంత్ర రాజులుగా, రెండు దశలలోనూ కాకతీయులు ఈ పండుగను ఘనంగా ఆచరించినట్లు తెలుస్తున్నది. కాకతీయుల ఇంటి ఇలవేల్పు.. కూష్మాండ దేవి (కాకతీదేవి). కూష్మాండం అంటే గుమ్మడి తీగ అని అర్థం. ఈ దేవతకు ప్రతిరూపంగా గుమ్మడిపువ్వును పూజించేవారు. నిజానికి కూష్మాండిని ఆరాధన జైనుల నుంచి వచ్చింది. తొలి కాకతీయులు జైన మతాన్ని ఆదరించారు. జైనంలోని 22వ తీర్థంకరుడు అరిష్టనేమి. ఇతణ్నే నేమినాథుడనీ అంటారు.
ఈయన శాసన దేవత యక్షిణి, అంబిక, కూష్మాండిని. తొలి కాకతీయులు కూష్మాండ దేవిని పూజించారు. కాకతీయుల శిల్పాలలో చేతిలో ఫలాలతో, ఒడిలో పిల్లలతో కూష్మాండ విగ్రహాలు కనిపిస్తాయి. ఈ తల్లిని గునుగు, తంగేడు, తామర, బంతి మొదలైన పూలతో కొప్పురంలా పేర్చి, ఆ శిఖరం మీద గుమ్మడి పువ్వును ఉంచి, పసుపుతో గౌరమ్మను చేసి, పసుపుకుంకుమలతో అలంకరించి, ఆటపాటలతో పూజించి నీళ్లలో వదిలేవారు. ఆ ప్రకారంగా బతుకమ్మ వేడుక కాకతీయుల నుంచీ వచ్చింది. శాసనాల ప్రకారం కాకతీయ వంశ మూలపురుషుడైన గుండ్యన పొలం దున్నుతున్నప్పుడు ఓ దేవి విగ్రహం లభించింది. గుమ్మడిపాదుల మధ్యన దొరికిన ఈ మాతయే కూష్మాండా దేవి.
సంస్కృతంలో గుమ్మడి తీగను కూష్మాండ అని, కాకతి అని అంటారు. గుండ్యన ఈ మాతను భక్తిశ్రద్ధలతో పూజించాడు. కాకతీదేవిని పూజించారు కాబట్టే, కాకతీయ వంశమనే పేరు వచ్చింది. అందుకే కాకతీదేవిని గుమ్మడిపూలతో పూజిస్తారు. కూష్మాండా దేవికి ప్రతిరూపంగా గుమ్మడిపూవును పూజించే ఆచారమే బతుకమ్మగా మారిందని కొందరి అభిప్రాయం. దసరా సందర్భంగా కొలిచే నవదుర్గ రూపాల్లో కూష్మాండ ఒకటి. నవరాత్రులలో ఎనిమిదో రోజున కూష్మాండా దేవిని పూజిస్తారు. అదేరోజు బతుకమ్మలు ఆడుతారు. ఈ దేవి లక్ష్మి, పార్వతి, సరస్వతుల సమాహారం. ఈ కాకతీదేవినే బతుకమ్మగానూ పూజించి ఉండవచ్చు. అందుకే బతుకమ్మను అనేక పువ్వులతో పేర్చినా, శిఖరంపై గుమ్మడి పువ్వును ఉంచడం వల్ల కాకతీదేవియే నేటి బతుకమ్మ అయి ఉండవచ్చని కొందరి అభిప్రాయం.
నల్గొండ జిల్లాలోని వాడపల్లిలోని బతుకేశ్వర స్థానం, త్రికూట దేవాలయంలోని శాసనం ఆధారంగా దాదాపు 800 సంవత్సరాల క్రితమే ఇక్కడ బతుకమ్మ కుంటను నిర్మించినట్టు తెలుస్తున్నది. ఈ శాసనం కృష్ణానది, మూసీనది సంగమ ప్రాంతంలో దొరికింది. దీని ప్రకారం కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని పాలనకాలంలో ఆశ్వయుజ మాసంలో తొమ్మిదిరోజుల పాటు పువ్వులతో బతుకమ్మలు ఆడేవారని తెలుస్తున్నది. రుద్రమదేవిని పాలకురాలిగా అంగీకరించని సామంతులు.. యుద్ధంలో ఆమెను వెన్నుపోటు పొడవబోగా, ఒక స్త్రీ అడ్డుగా నిలిచి రుద్రమ ప్రాణాలు కాపాడి తాను మరణించిందని ఓ ఐతిహ్యం. చివరి మాటగా ‘బతుకమ్మా!’ అని రుద్రమను దీవించిందట. ఆ త్యాగానికి గుర్తుగా బతుకమ్మ పండుగ జరుపుకొంటారని ఓ ప్రచారం.
జానపదాలు..
చారిత్రక కథలతో పాటు బతుకమ్మ ఆవిర్భావాన్ని చెప్పే జానపద, స్థానిక గాథలూ అనేకం ప్రచారంలో ఉన్నాయి. ఒక గృహస్థుని ఇంట్లో పిల్లలు పుట్టీపుట్టగానే చనిపోతూ ఉండేవారు. దీంతో ఆయన తన ఏడవ సంతానంగా అమ్మాయి పుట్టగా.. ‘బతుకమ్మ’ అని పేరు పెట్టుకున్నాడు. ఆ బిడ్డ బతికింది. అనంతర కాలంలో వారికి ఓ కుమారుడు కూడా పుట్టాడు. ఇద్దరూ పెద్దవారయ్యారు. బతుకమ్మకు వివాహమైంది. అత్తవారింటికి వెళ్లింది. ఒకరోజు ఆమె తన తమ్ముణ్ని చూడటానికి పుట్టింటికి వచ్చింది. మరునాడు తెల్లవారుజామున మరదలితో కలిసి స్నానానికి చెరువుకు వెళ్లింది. పొరపాటున చీరలు తారుమారు అయ్యాయి. దీంతో ఇద్దరికీ గొడవ జరిగింది. కోపంతో మరదలు బతుకమ్మను చంపి చెరువుగట్టున పాతిపెట్టి వెళ్లిపోయింది. పాతిన చోట తంగేడు చెట్టు మొలిచింది.
బతుకమ్మ తన భర్తకు కలలో కనిపించి జరిగిందంతా చెప్పింది. తన సమాధి మీద పెరిగిన తంగేడు చెట్టు పూలతో తనను (బతుకమ్మను) పేర్చి, గౌరమ్మతోపాటు పూజించి నీటిలో విడిచిపెట్టమని కోరింది. తాను ముత్తయిదువగా మరణించినందు వల్ల పసుపు గౌరమ్మను పూజించాలని చెప్పింది. ఆమె చెప్పినట్లుగానే భర్త పూజలు చేశాడు. తదనంతర కాలంలో ఇది బతుకమ్మ ఆచారంగా మారిందనే వాదన ఉంది. మరొక కథనం ప్రకారం, ఓ రాజ్యంలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు. వారికి ఒకే సోదరి. అన్నలందరూ గొప్పవీరులు. చెల్లెలంటే ఎంతో ఇష్టం. అన్నలందరికీ పెళ్లిళ్లు జరిగాయి. వదినలకు మాత్రం, తమ భర్తలు ఆడబిడ్డను అంతగా ప్రేమించడం నచ్చేది గాదు. ఒకసారి అన్నలు యుద్ధానికి వెళ్లినపుడు, వదినలంతా కలిసి ఆమెను చిత్రహింసలకు గురిచేసి విషమిచ్చి చంపారు. ఓ చోట పాతిపెట్టారు. అలా పాతిపెట్టినచోట తంగేడు చెట్టు మొలిచింది. యుద్ధం నుంచి తిరిగి వచ్చిన అన్నలు.. చెల్లె కానరాకపోవడంతో ఎంతో వెతికారు. అలా వెతుకుతూ తంగేడు చెట్టు వద్దకు రాగానే..
“ముట్టకు ముట్టకు ఓ అన్నా!
ముట్టిన చోట ముత్యాలు
పట్టినచోట పగడాలు
పాపకారి మా వదినె
పాలల్ల విషమిచ్చి చంపింది”
అంటూ ఆత్మరూపంలో ఉన్న చెల్లెలు జరిగిందంతా చెప్పింది. తంగేడు పువ్వులలో తనను చూసుకోవాలని, ప్రతి ఏటా పండుగ చేయమని వేడుకుంది. ఆ పండుగే బతుకమ్మ. మరొక స్థానిక కథనం ప్రకారం.. ఓ గ్రామంలో భూస్వామి ఆగడాలు భరించలేక ఒక బాలిక చెరువులో దూకింది. గ్రామస్తులు ఆమెను రక్షించారు. కొనూపిరితో కొట్టుకుంటున్న బాలికను ‘కల కాలం బతుకమ్మా!’ అని దీవించారట. అప్పటినుంచి ఆ గ్రామంలో మహిళలు, బాలికలు నూరేళ్లూ బతకాలనీ, వారికి ఏ ఆపదలూ రావద్దనీ గౌరమ్మను పూజిస్తూ బతుకమ్మ పండుగను చేసుకుంటున్నారు.
పాటల రూపంలో..
ఓ బతుకమ్మ పాట ఆసక్తికరమైన కథను చెబుతున్నది. చిన్నమ్మ ఒక దేశపు రాజు చిన్నకోడలు. ఆ రాజు పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండేవారు. ప్రతి గామంలో చెరువు ఉండేది. ఒక సంవత్సరం భారీ వర్షాలు పడి చెరువు నిండిపోయింది. గండిపడే పరిస్థితి ఏర్పడింది. ఊరివాళ్లంతా మరమ్మతు చేయడానికి ప్రయత్నించారు. కానీ, సాధ్యం కాలేదు. మైసమ్మను ప్రార్థిస్తే కట్ట నిలుస్తుందని, గండి పడదని గ్రామ పెద్దలు చెప్పారు. అయితే మైసమ్మ కోర్కెలు తీర్చాలని షరతు పెట్టారు. కట్టను నిలపడానికి గొర్రెల సంపదనంతా ఇస్తానని రాజు మొక్కుకున్నాడు. కానీ మైసమ్మ తన దగ్గర కూడా గొర్రెల మంద ఉందని జవాబిచ్చింది. ఏది ఇస్తానన్నా.. అవన్నీ తన దగ్గర ఉన్నాయని దాటవేస్తుంది. చివరికి రాజు తన తల్లిదండ్రులను, అత్తమామలను, అన్నావదినలను, అక్కాబావలను, పెద్దకొడుకు, కోడలును ఇస్తానని మొక్కుకొన్నాడు. అయినా మైసమ్మ తృప్తి చెందలేదు. చివరికి చిన్న కోడలును ఇస్తాననగానే మైసమ్మ సరేనంది. ‘చిన్న కోడల్నిస్తే ఉయ్యాలో కట్ట నిలిపే మైసు ఉయ్యాలో’ అనగానే చెరువు స్పందిస్తుంది.
ముసిముసి నవ్వుతూ ఉయ్యాలో
మూడడుగులాపె ఉయ్యాలో,
ఎగిసిపడి నవ్వుతూ ఉయ్యాలో,
ఏడడుగులాపె ఉయ్యాలో,
పకపకా నవ్వుతూ ఉయ్యాలో
పదడుగులాపె ఉయ్యాలో
..అట్లా కట్టమైసమ్మ కట్టను తెగకుండా ఆపుతుంది.
ఇంటికి వెళ్లగానే.. చిన్న కోడలికి ఏ విషయం చెప్పకుండా చెరువుకు వెళ్లి నీళ్లు తెమ్మని పురమాయిస్తాడు. ఆమె బిందె తీసుకొని వెళ్తుంది. ఆమె వెంట రాజు కూడా వెళ్తాడు. చెరువులో ఎంతలోతుకు వెళ్లినా బిందె మునుగదు. దాంతో మామ ‘ముందుకు పోయి ముంచు’ అనడంతో చెరువు మధ్యలోకి వెళ్తుంది. అక్కడ బిందెతో పాటు ఆమె కూడా మునిగి పోతుంది.
బొడ్డెమ్మనయి ఉయ్యాలో
నీబిడ్డనైత ఉయ్యాలో
తంగేడు పూలల్ల ఉయ్యాలో
తల్లినయి వస్త ఉయ్యాల
కలువపూలల్ల ఉయ్యాలో
కలగలసివస్త ఉయ్యాల
అన్నిపూలతోటి ఉయ్యాలో
ఆడుకొనిపోత ఉయ్యాల
అని పాడుతూ పూర్తిగా కనిపించకుండా పోతుంది. ఆమె మునిగిన చోట నీళ్లలో తేలుతూ పూలు కనిపిస్తాయి. ఊరికోసం ప్రాణత్యాగం చేసిన చిన్నమ్మను ఊరు ఊరంతా కలకాలం పూలల్లో పూవులా.. బతుకమ్మ అని కొనియాడినట్టు తెలుస్తుంది.
ఒకటా రెండా.. అనేక కథలు, అనేకానేక గాథలు. అన్నీ ఆ పండుగ విస్తృతిని తెలిపేవే! ఇదొక చారిత్రక, సామాజిక, ఆధ్యాత్మిక ఉత్సవమనే విషయాన్ని చాటి చెప్పేవే! కొందరికి అక్క, కొందరికి అమ్మ, కొందరికి శక్తి స్వరూపిణి, కొందరికి చెల్లె.. మొత్తంగా బతుకమ్మ అనుబంధాల అధిదేవత.
గిరిజన కథలు
గిరిజనులు తమ జీవితాలు బాగుండాలని, ఆరోగ్యవంతమైన సంతానం కలగాలని అమ్మతల్లిని మొక్కుకునే ఆనవాయితీ ద్రావిడ దేశంలో పురాతన కాలం నుంచీ ఉంది. అలా వేడుకునే వన దేవతలలో బతుకమ్మ ఒకరు. ఆమె వరంతో పిల్లలు బతికితే ‘బతుకమ్మ’, ‘బతుకయ్య’ అని పేర్లు పెట్టుకుంటారు. తమ పిల్లలను చల్లగా చూసినందుకు ఆ తల్లిని పూవులతో శిఖరంగా పేర్చి బతుకమ్మగా భావించి తొమ్మిది రోజులు పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి, పూజానంతరం నీళ్లలో నిమజ్జనం చేస్తారు.
సుల్తానుల నుంచి నిజాముల వరకు..
గోల్కొండ కుతుబ్షాహీల కాలంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తున్నది. హోలీ, దీపావళి, వసంత పంచమి మొదలైన పండుగలతోపాటు బతుకమ్మ పండుగకు కూడా ప్రభుత్వం సెలవులు ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇబ్రహీం కుతుబ్షా తన రచనలో గ్రామ గ్రామాన హిందువులు బతుకమ్మను ఆడినట్లు తెలిపాడు. ఆయన మంత్రిగా, ఆస్థాన కవిగా, మిత్రునిగా ఉన్న నేబతి కృష్ణమంత్రి రచించిన ‘రాజనీతి రత్నాకరం’లోనూ బతుకమ్మ ప్రస్తావన ఉంది. ఆసఫ్జాహీలు కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించారు. తూము రామచంద్రారెడ్డి, వేముల రామభట్టు కవులు నాటి ప్రజల యథార్థ జీవన గాథలను, సాంఘిక పరిస్థితులను ప్రజల జీవన చరిత్రను గేయాలుగా రచించారు. అందులో కూడా బతుకమ్మ పాటలు, పండుగ విశేషాలు కనిపిస్తాయి.
హరీతి కథ
హరీతి.. ఓ రాక్షసి. పిల్లల్ని ఎత్తుకొనిపోయే మహమ్మారి. తథాగతుని బోధనల ప్రభావంతో ఆమె పిల్లలను రక్షించే దేవతగా మారిందని బౌద్ధ సాహిత్యం చెబుతుంది. పిల్లాపాపల ఆయురారోగ్యాల కోసం ప్రజలు హరీతిని కొలిచేవారు. ఇక్ష్వాకుల కాలంలోనూ హరీతి ప్రస్తావన కనిపిస్తుంది. వారి నిర్మాణాలలో హరీతి శిల్పాలు కనిపిస్తాయి. చేతిలో ఫలాలు, ఒడిలో సంతానంతో చూడ ముచ్చటైన రూపం ఆ దేవతది. చాళుక్యుల కాలంలో కూడా ఈ దేవత పూజలందుకుంది. ఓ అడుగు ముందుకేసి.. తాము హరీతి పుత్రులమని చాటుకున్నారు చాళుక్యులు. ఈ హరీతిదేవే అనంతర కాలంలో బతుకమ్మగా మారి ఉండవచ్చనేది చరిత్రకారుల అభిప్రాయం.
…? డాక్టర్ బొల్లేపల్లి సుదక్షణ
సౌజన్యం: అక్షరయాన్