Pocharam Wildlife Sanctuary | దారిపొడవునా దట్టమైన వృక్షాలు. వాటి మధ్యలోంచి చెంగుచెంగున పరుగులు పెట్టే జింకలు. అక్కడక్కడా పురివిప్పి నాట్యమాడే నెమళ్లు. వన్యప్రాణుల సయ్యాటలతో.. పోచారం అభయారణ్యం సందర్శకుల మనసు దోచేస్తున్నది. ఉరుకులు పరుగుల జీవితంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగరవాసులను.. ప్రకృతి ఒడిలో సేదతీరమంటూ ఆహ్వానిస్తున్నది.
అదొక కొత్త ప్రపంచం. కనుచూపు మేరా పచ్చదనమే. ఏ మూలకు వెళ్లినా జలపాతాల గలగలలే. అప్పుడప్పుడూ తారసపడే వన్యమృగాలు పట్నం నుంచి వచ్చిన అతిథులను ప్రేమగా పలక రిస్తాయి. తిరిగివస్తున్న సమయానికి.. గుండెల నిండా స్వచ్ఛమైన ఆక్సిజన్. మనసు నిండా పాజిటివ్ దృక్కోణం. అడవితల్లి మనకిచ్చేరిటర్న్ గిఫ్ట్ అది!
..మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలోని ‘పోచారం అభయారణ్యం’ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నది. వన్యప్రాణులతో, పచ్చదనంతో ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నది. మెదక్ – కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ అభయారణ్యాన్ని వారాంతాల్లో సందర్శించేవారి సంఖ్య కూడా పెరుగుతున్నది. వారి సౌకర్యార్థం అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూల మొక్కలతో పచ్చని గార్డెన్, చిన్నారుల కోసం ఆట వస్తువులు, ఇతర వసతులు కల్పించారు. అటవీ ప్రాంతంలో తిరుగుతూ, వన్యప్రాణులను చూసేందుకు ప్రత్యేకంగా సఫారీ వాహనాన్ని ఏర్పాటు చేశారు. పెద్దలకు రూ.100, చిన్నారులకు రూ.50 చెల్లిస్తే.. అభయారణ్యంలో ఎనిమిది కిలోమీటర్ల మేర తిరిగి, అందులోని అడవి జంతువులను చూడవచ్చు.
మెదక్ జిల్లా కేంద్రం నుంచి 13 కిలోమీటర్ల దూరంలో పోచారం అభయారణ్యం ఉన్నది. మెదక్ బస్టాండ్ నుంచి కామారెడ్డి జిల్లా బాన్సువాడ, ఎల్లారెడ్డి, నిజామాబాద్ జిల్లా బోధన్ వెళ్లే బస్సుల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. మరిన్ని వివరాలకు అభయారణ్యం
ఇన్చార్జి బీట్ ఆఫీసర్ ప్రసాద్ (950200 3439)ను సంప్రదించవచ్చు.
అడవుల పరిరక్షణ, జంతువుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రూ.60 లక్షలతో ‘వన విజ్ఞాన కేంద్రం’ ఏర్పాటు చేసింది. అడవుల వల్ల కలిగే ఉపయోగాలు, వన్యప్రాణులు, వాటి సంరక్షణ, అడవి విస్తీర్ణాన్ని పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, అటవీ శాఖ సిబ్బంది పనితీరు.. తదితర విషయాలను పర్యాటకులకు వివరిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటుచేసిన అలుగు, ఎలుగుబంటి, అడవిపంది, తోడేలు, చుక్కల దుప్పి, ఉడుము, కొండచిలువ, దూదిచిలువ తదితర మృగాల బొమ్మలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే అమెరికా కౌన్సిల్ సభ్యులు పోచారం వన విజ్ఞాన కేంద్రంతోపాటు అభయారణ్యాన్ని సందర్శించారు.
పోచారం అభయారణ్యంలో వివిధ రకాల వన్యప్రాణులు సందడి చేస్తుంటాయి. వాటిని చూసేందుకు హైదరాబాద్ నగరంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు. వీరి కోసం ప్రత్యేక సఫారీ వాహనం ఏర్పాటుచేశాం. ఇందులో 9 మంది కూర్చునే వీలుంది. గైడ్ సాయంతో అభయారణ్య విశేషాలనూ చెప్పిస్తాం.
– మనోజ్కుమార్, ఎఫ్ఆర్వో
…? తాటి మల్లేశం
Khajuraho | కొత్త దంపతులకు హనీమూన్ డెస్టినేషన్.. ఈ శిల్పనగరి
సంక్రాంతికి మొదలై.. ఉగాది వరకు జరిగే ఈ ఐనవోలు జాతర ప్రత్యేకత ఏంటో తెలుసా
హైదరాబాద్లో ఎన్ని బ్యాండ్లు ఉన్నా అరబ్బీ మార్ఫా బ్యాండ్కే ఎందుకంత క్రేజ్?