ఈ నృసింహుడు.. ఇప్పటివాడు కాదు. నరసింహావతార పరిసమాప్తి సమయంలో కొలువుదీరినవాడు. ఇక్కడి ఆలయాలు ఇప్పటివి కాదు. రుద్రమ చేతుల మీదుగా పూజలు అందుకున్నాయి. కృష్ణరాయల నివేదనలు స్వీకరించాయి. కుతుబ్షాహీలు, అసఫ్ జాహీలు.. కొలిచి తరించారు. ఇక్కడి కోటలు విష్ణుకుండినుల నాటివని అంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఉండ్రుగొండ చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక యాత్రాస్థలి.
పచ్చని చెట్లు. ఎత్తయిన ప్రాకారాలు. చుట్టూ ఇరవై దేవాలయాలు. ప్రకృతి రమణీయత నడుమ ఉండ్రుగొండ గిరిదుర్గంలో స్వయంభువుగా కొలువై ఉన్నాడు లక్ష్మీనృసింహస్వామి. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్లు, హైదరాబాద్ – విజయవాడ మార్గంలో.. చివ్వెంల మండల పరిధిలోని 65వ నంబరు జాతీయ రహదారి నుంచి దక్షిణ దిశగా 3 కిలోమీటర్ల దూరంలో ఉందీ క్షేత్రం. మామూలుగా సూర్యాపేట సమీపంలో ఎక్కడా గుట్టలు, లోయలు కనిపించవు. అదే, ఉండ్రుగొండకు వెళ్తే ఒక్కసారిగా దట్టమైన అడవుల్లో కాలుపెట్టిన అనుభూతి కలుగుతుంది. దాదాపు 1,372 ఎకరాల్లో విస్తరించిన ఎనిమిది కొండలను కలుపుతూ ప్రాకారాలు నిర్మించిన ఈ దుర్గంలో 23 దర్శనీయ స్థలాలు ఉన్నాయి. ఫొటో షూట్లకు, ప్రీ వెడ్డింగ్ షూట్లకు, షార్ట్ ఫిల్మ్ల చిత్రీకరణకూ ఈ ప్రాంతం అనుకూలం.
ఉండ్రుగొండ గిరిదుర్గంపై స్వయంభూ మూర్తిగా కొలువైన లక్ష్మీనృసింహస్వామి 1,200 సంవత్సరాల పూర్వమే పూజలు అందుకున్నట్టు ఆనవాళ్లు చెబుతున్నాయి. క్రీస్తుశకం 8, 9 శతాబ్దాల నడుమ విష్ణుకుండినుల కాలంలో ఈ దుర్గం నిర్మితమైంది. అప్పటికే స్వామి భక్తజన రక్షకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కాకతీయ రాణి రుద్రమదేవి, ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు, గోల్కొండ సుల్తానులు సేవించి తరించారని చరిత్రకారుల అభిప్రాయం. గుట్టలపై గోపాలస్వామి, శివుడు, లింగమంతులస్వామి, మల్లేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. రుషుల గుహలు, శంఖుచక్రాలు, రాజ భవనాలు, నర్తకీమణుల నివాసాలు, కొండ శిఖరాన బోగందాని గద్దెగా వ్యవహరించే మంటపం.. దర్శనీయ స్థలాలు. ఎనిమిది గుట్టలను కలుపుతూ దాదాపు 14 కిలోమీటర్ల పొడవైన ప్రాకారాలు, రాతి దర్వాజాలు ఉన్నాయి. వీటిలో చాలావరకు జీర్ణావస్థకు చేరుకున్నాయి. కొన్నిమాత్రం చెక్కు చెదరలేదు. గుట్టపై చాకలిబావి, మంత్రిబావి చూడవచ్చు. వాటిలో ఇప్పటికీ నీళ్లున్నాయి. మంత్రిబావిలో గుప్తనిధులు ఉన్నాయని ఓ నమ్మకం. శత్రుసైన్యం దండెత్తి వస్తే ఎదురు దాడి చేసేందుకు వీలుగా, అవసరమైతే ఆత్మరక్షణ కోసం తలదాచుకునేందుకు అనువుగా నిర్మాణాలూ ఉన్నాయి. కోట పైభాగంలో వంపు వద్ద నిర్మితమైన రాతి మంటపం శిల్పి ప్రతిభకు తార్కాణం. ఏడు గుట్టల చుట్టూ సొరంగ మార్గాలు నిర్మించిన ఆనవాళ్లూ ఉన్నాయి.
ఆలయం ముందున్న కోనేరులో గజేంద్ర మోక్ష దృశ్యాన్ని తలపించే కరి-మకరుల ఆకృతులు అబ్బురపరుస్తాయి. ఆలయం వెనుక భాగాన ఆదిశేషుడు, కోనేరు ఒడ్డున కూర్మావతార ఘట్టాలు ఆకట్టుకుంటాయి. ఎస్సారెస్పీ కాలువ (జాతీయ రహదారి 65) దగ్గరినుంచీ చూస్తే హిరణ్యకశిపుడి సంహారం తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న భంగిమలో శయన నరసింహస్వామి సహజ శిల్పాకృతులు దర్శనమిస్తాయి. గుట్టమీద వేలాడుతున్నట్టుగా కనిపించే గుండ్లు (హ్యాంగింగ్ స్టోన్స్) ఓ భౌగోళిక అద్భుతం. మంత్రి బావి, చాకలిదాని పడిగ, సింగరేణికుంట కోనేర్లు ఇప్పటికీ నీటితో కళకళలాడుతున్నాయి. బోగందాని గద్దె, పందెంబావి, కేపిరాయిని కుంట, నాయినివారిబావి, ఏనుగుల దర్వాజ, పీనుగుల దర్వాజ, నాగుల పహాడ్ దర్వాజ, మల్లయ్యస్వామి గుడి, రుషుల మఠం, పహారా, గోపాలస్వామి గుడి, గుట్ట చుట్టూ 18 ఆంజనేయ స్వామి విగ్రహాలు, రామాలయ స్థలం, మూల దర్వాజ, జాలు దర్వాజ.. అడుగడుగునా ఓ విశేషమే. ఒకానొక సమయంలో.. నిధి నిక్షేపాల తవ్వకాలతో ఈ చారిత్రక సంపద కనుమరుగు అయ్యేదే. పట్టణానికి చెందిన డాక్టర్ రామయ్య, మరికొందరు ఉండ్రుగొండ గుట్టలలో పర్యటించి సర్వే చేయడంతో అక్కడి గుట్టలపై నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి.
–గుండా శ్రీనివాస గుప్త