Yezdi Bikes | ‘కొత్త ఒక వింత. పాత ఒక రోత’ అన్న నోళ్లే.. ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్!’ అనీ అన్నాయి. ఆ ఓల్డ్ గోల్డ్ కేటగిరీలో.. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన పాతతరం బైకులూ ఉన్నాయి. నాడు తాతల మతులు పోగొట్టినజావా, యెజ్డీలు.. నేడు మనవళ్ల మనసులూ దోచేస్తున్నాయి. ఆధునిక ట్రెండ్కు తగ్గట్లుగా స్మార్ట్గా, మరింత హాట్గా తయారై భారతీయ రోడ్లపైకి దూసుకొస్తున్నాయి.
ఒకప్పుడు ద్విచక్ర వాహనాలంటే.. జావా, యెజ్డీ బైకులే! 1930 నుంచీ వీటిదే హవా. జావా 42, పిరాక్ మోడళ్లు ఆనాటి కుర్రకారు కలల వాహనాలు. ఓ తరం మొత్తం ఈ బైక్ల జపమే చేసింది. అయితే, కొన్ని కారణాలవల్ల భారత్లో ఈ వాహనాలకు అడ్డుకట్ట పడింది. అయినా, ఏ మాత్రం క్రేజ్ను కోల్పోకుండా.. నేటి తరానికి తగ్గట్లుగా మరింత స్మార్ట్గా తయారై మళ్లీ వచ్చేస్తున్నాయి.
‘జావా’ ద్విచక్ర వాహనాల కంపెనీని చెక్ రిపబ్లిక్ వ్యాపారవేత్త ఫ్రాంటి జాన్స్కీ 1929లో ప్రారంభించారు. ఆయన సారథ్యంలోనే అనేక క్లాసిక్ మోడళ్లు ప్రాణం పోసుకున్నాయి. అవన్నీ భారత్ సహా వివిధ దేశాల్లో ఓ వెలుగు వెలిగాయి. అయితే, స్వదేశీ కంపెనీలను ప్రోత్సహించేందుకు 1950లో విదేశీ వాహనాల దిగుమతిని నిషేధించింది ప్రభుత్వం. మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడయార్.. జావా రేసింగ్ బైక్ను చాలా ఇష్టపడేవారు. ఎలాగైనా ఆ కంపెనీని తీసుకురావాలని అనుకొన్నారు. పార్సీ వ్యాపారవేత్త రుస్తమ్ ఇరానీతో మాట్లాడి, ఎన్నో కష్టాలకోర్చి జావా కంపెనీని భారత్కు రప్పించారు. మైసూరులో 25 ఎకరాల భూమిని కేటాయించారు. ఏడాది తర్వాత, 1961లో మొదటి బైక్ ‘జావా 250- టైప్ 353’ విడుదలైంది. ఆ తర్వాత ‘జావా 50’, ‘జావా 50 టైప్ 555’ అనే మరో రెండు మోడళ్లనూ విడుదల చేసింది. 13 ఏండ్ల తర్వాత ఇండియాలో జావా కంపెనీ కాంట్రాక్టు ముగిసింది. దీంతో సంస్థ పేరును ‘యెజ్డీ’గా మార్చారు. వెనువెంటనే, ‘యెజ్డీ జెట్ 60’ పేరుతో తొలి బైక్ను విడుదల చేశారు. ఈ నాలుగు బైక్లూ.. 30 ఏండ్ల వరకూ భారత్ రోడ్లపై ఏకచ్ఛత్రాధిపత్యాన్ని ప్రదర్శించాయి.
30 ఏండ్ల కింద కనుమరుగైన జావా, యెడ్జీ వాహనాలు.. మహీంద్రా సంస్థ అండతో మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. నేటి తరానికి తగ్గట్టుగా సరికొత్తగా ముస్తాబై, భారతీయ రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. ఆధునిక మోడళ్లతోపాటు పాతతరం ‘జావా, జావా 42, పిరాక్’ బైక్లనూ మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తున్నది జావా కంపెనీ. ఇటీవలే యెజ్డీ నుంచి యెజ్డీ రోడ్స్టర్, స్క్రాంబ్లర్, అడ్వెంచర్ బైక్లు వచ్చాయి. రూ.1.90 లక్షలు మొదలుకొని రూ.2.09 లక్షల దాకా ధర పలుకుతున్నాయి. మళ్లీ కొత్తగా మార్కెట్లోకి వస్తున్న పాత బండ్ల పట్ల పాత తరమే కాదు, కొత్త తరమూ ఆసక్తి చూపుతున్నది. అంతా నోస్టాల్జియా మహిమ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Bullet bandi | నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా పా.. డుగుడుగు బండికి డిమాండ్ పెరిగిందండి!
Yezdi bikes | యెజ్డీ వచ్చేసింది
Electric Vehicles | పెట్రో ధరల ఎఫెక్ట్.. ఈ- వెహికిల్స్కే హైదరాబాదీల ఇంట్రెస్ట్