నెల్లుట్ల రమాదేవి రచించిన ‘తల్లివేరు’ సంకలనంలోని కథలు చదవడం మొదలుపెడితే విసుగు, విరామం లేకుండా హాయిగా ముందుకువెళ్తూనే ఉంటాయి. రెండేండ్లుగా కరోనా వైరస్ కారణంగా సమాజానికి ఆరోగ్యపరంగా, ఆర్థికంగా భారీ నష్టమే జరిగింది. ఎంతోమంది ఉద్యోగాలు, ఉపాధులు హుష్ కాకి అయిపోయాయి. అలా కరోనా వల్ల పని లేక కొడుకు ఉసూరుమంటున్న స్థితిలో, తల్లి ఎంతో ఆత్మవిశ్వాసంతో పని వెతుక్కున్న కథ ‘తల్లివేరు’. అంతేకాదు కొడుకుకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది ఇందులో. అత్త పెన్షన్ డబ్బులతో కుటుంబం వెళ్లదీయడానికి ఒక కోడలు అత్తను అపురూపంగా చూసుకునే వైనాన్ని ‘అవసరం’ కథ కండ్లకు కడుతుంది.
కరోనాతో ఉద్యోగం పోగొట్టుకున్న ఓ యువకుడు సంధి దశలో ట్రాక్టర్ నడపడానికి అంగీకరించిన ‘ఎటువైపు’ కథ శ్రమ గొప్పతనాన్ని చాటుతుంది. ఆర్థిక స్వేచ్ఛ స్త్రీలకు గౌరవాన్ని ఇస్తుందనుకుంటే, అలాంటి పరిస్థితి ఇంకా రాలేదేమో అన్న సందేహాన్ని లేవనెత్తుతూ సాగే కథ ‘కాలం మారినా’. వివాహం సమయంలో కేవలం అమ్మాయిలకే పేరు మార్చే పరిస్థితి ఎందుకు? అబ్బాయిలు కూడా మార్చుకోవచ్చు కదా! ఎవరి పేరు వారికి ఇష్టమైనప్పుడు, మధ్యలో మార్పులెందుకు? అనే ప్రశ్నతో హాస్యంగా, గంభీరంగా సాగిన కథ ‘పేరు’. రియల్ ఎస్టేట్ కాసుల గలగలల నేపథ్యంలో భూమిని అనుబంధంతో కాకుండా ఆర్థిక బంధంతో చూస్తున్న వారికి బుద్ధిచెప్తూ సాగే కథ ‘పొద్దు గుంకక ముందే’.
తన తప్పేమీ లేకుండానే సమాజం నిందితురాలిగా నిలిపిన స్త్రీకి బాసటగా నిలిచిన ఉదాత్తుడైన పురుషుడు, అతని కుటుంబం గురించి వివరించే కథ ‘చెడిపోయిన మనిషి’. ఈ కథలో వందేండ్ల కిందటి తెలంగాణ వ్యవహార భాషను ప్రయోగించడం రచయిత్రి సాధించిన ఘనత. ఎంతో కాలం వేచి చూసి తిరుమలకు వెళ్లిన ఓ పల్లెటూరి స్త్రీ, సాటి మనిషికి సేవచేయడంలోనే వేంకటేశ్వరుణ్ని సందర్శించుకున్న ఇతివృత్తంతో సాగిన కథ ‘దర్శనం’ లాంటి వైవిధ్య భరితమైన 18 ఇతివృత్తాలతో కూడిన ‘తల్లివేరు’ సంకలనం ప్రముఖ రచయిత్రి ఓల్గా ముందుమాటలో పేర్కొన్నట్లు మంచి కథల సమాహారం.
తల్లివేరు
రచన: నెల్లుట్ల రమాదేవి
పేజీలు: 200; వెల: రూ. 200/-
ప్రచురణ: అపురూప పబ్లిషర్స్
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
ఫోన్: 94406 22781
పళ్లెరం (సంగీత, సాహిత్య వ్యాసాలు)
రచన: ఎలనాగ
పేజీలు: 200
వెల: రూ. 195
ప్రచురణ: రాగకృతి
ప్రచురణలు
ప్రతులకు: ప్రముఖ
పుస్తక కేంద్రాలు
మనిద్దరం (స్త్రీ కేంద్రక కవిత్వం)
రచన: అరణ్య కృష్ణ
పేజీలు: 87
వెల: రూ. 100
ప్రచురణ: నవ్యాంధ్ర
రాష్ట్ర రచయిత్రుల సంఘం
ప్రతులకు: ప్రముఖ
పుస్తక కేంద్రాలు
ఫోన్: 96661 88195
భావతరంగాలు (కవిత్వం)
రచన: సురేంద్ర రొడ్డ
పేజీలు: 160
వెల: రూ. 160
ప్రచురణ: జ్ఞాపిక శీర్షిక
సాహితీ ప్రచురణలు
ప్రతులకు: 94915 23570
-హర్షవర్ధన్ చింతలపల్లి