Mucherla | ఆ ఊళ్లో అందరూ చిరంజీవులే! అనారోగ్యంతోనో, వృద్ధాప్యంతోనో మరణించినా.. వెంటనే బతికేస్తారు. ప్రపంచాన్ని చూస్తారు. ప్రకృతిని ఆస్వాదిస్తారు. ఆ అరుదైన వరం.. ఏ దేవుడో ఇవ్వలేదు. నేత్రదానం ప్రసాదించింది. రియల్ ఎస్టేట్ బూమ్తోనో, రౌడీయిజంతోనో వార్తలకెక్కే గ్రామాలు చాలానే ఉంటాయి. కానీ, మహాదానంతో మనందరి నోళ్లలో నానుతున్నది ముచ్చర్ల.
దేహంలో ఎన్ని అవయవాలు ఉన్నా.. కంటి ప్రాధాన్యం ప్రత్యేకమైంది. అయిదు నిమిషాల చీకటినే తట్టుకోలేం మనం. అలాంటిది, జీవితకాలం చూపు లేకుండా బతకడం నరకమే! హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం ముచ్చర్ల గ్రామం.. మానవతా హృదయంతో సాధ్యమైనన్ని జీవితాలలో చీకటిని పారదోలే ప్రయత్నం చేస్తున్నది. నేత్రదానంలో తెలుగు రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. చూపును అందించడంలో అగ్రస్థానంలో ఉన్నది. ముచ్చర్ల వాసుల మహాదానంతో ఎంతోమందికి చూపు వచ్చింది. ఇప్పటికీ, ఉన్నత విద్యావంతులు కూడా నేత్రదానానికి వెనుకంజ వేస్తారు. ‘మరుజన్మలో అంధులుగా పుడతామేమో?’ అని భయపడతారు. ముచ్చర్ల ప్రజలకు మాత్రం ఇలాంటి అపోహలు లేవు. శాస్త్రీయ దృక్పథంతో ఆలోచిస్తారు.
మండల రవీందర్ కృషి ఫలితమే ఈ నేత్రదాన ఉద్యమం. నీటి పారుదల శాఖలో డిప్యూటీ ఇంజినీర్గా పనిచేస్తున్న రవీందర్.. దాదాపు పదేండ్ల క్రితం తన తల్లి లక్ష్మిని కోల్పోయారు. ఆమె రెండు కండ్లనూ దానం చేయడం ద్వారా.. తల్లి జ్ఞాపకాలను పదిలం చేసుకోవచ్చని అనుకున్నారు. సన్నిహితులు వారించినా వినకుండా తల్లి కండ్లను దానం చేయించారు. ఆ తర్వాత కొద్దికాలానికి అదే గ్రామానికి చెందిన కంచనకుంట్ల రామిరెడ్డి చనిపోయారు. ఆయన నేత్రాలనూ దానం చేయించారు. అక్కడితో ఆగిపోకుండా అవయవదానంపై.. ప్రత్యేకించి నేత్రదానంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. మొదట్లో రవీందర్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎవరూ కలిసి రాలేదు. అయినా ఆయన ఆశావాదాన్ని వీడలేదు. కొంతకాలానికి మార్పు మొదలైంది. కొందరు మహిళలు రవీందర్ లక్ష్యాన్ని నమ్మారు. రవీందర్తో కలిసి నడవడానికి సిద్ధపడ్డారు. గ్రామంలో ఎవరైనా చనిపోతే, ఆ ఇంటికి బృందంగా వెళ్లి మృతుల కుటుంబ సభ్యులకు నచ్చజెపుతారు. నేత్రదానానికి ఒప్పిస్తారు. మొదట్లో చీత్కారాలు, తిట్లు ఎదురయ్యాయి. ‘మావోళ్ల కండ్లను తీస్కపోయి అమ్ముకుంటున్నరు’ అని కొందరు అపవాదు అంటగట్టారు. అయినా, రవీందర్ బృందం పట్టుదలతో ముందుకు సాగింది. గ్రామస్తులలో కొంత మార్పూ కనిపించింది. మరికొందరు ఆ జట్టులో చేరారు. ఇప్పటి
వరకు 60 మంది నేత్రాలను సేకరించి నేత్రనిధికి పంపారు. ఒకే ఊరిలో ఇంతమంది నేత్రదానం చేయడం గొప్ప విషయమని అవయవ, నేత్రదాన సంఘం ప్రశంసించింది కూడా. రవీందర్తోపాటు బొగి సుజాత, రాజమణి, స్వప్న… నేత్రదాన ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆ స్ఫూర్తితో ఇరుగుపొరుగు గ్రామాల వారూ నేత్రదానానికి సిద్ధపడుతున్నారు. ముచ్చర్ల వెలుపల కూడా 20 మంది కళ్లను నేత్రనిధికి చేర్చారు. ముచ్చర్లలో, సమీప గ్రామాల్లో ఎవరు చనిపోయినా వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలోని నేత్రనిధి సభ్యులకు సమాచారం అందిస్తారు.
మనిషి చనిపోయిన ఆరు నుంచి ఎనిమిది గంటల్లోపు కళ్లలోని కార్నియాను సేకరించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి హైదారాబాద్లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలిస్తారు. నేత్రదానం చేసిన వారి దశదిన కర్మ రోజున.. నేత్ర, అవయవదాన రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో సభ నిర్వహించి, ఆ వ్యక్తి త్యాగాన్ని కొనియాడుతారు. అవయవదానం చేసిన పేద కుటుంబాలకు బియ్యం వంటివి ఇస్తున్నారు. ‘దేశవ్యాప్తంగా లక్షలాది మంది కార్నియా దెబ్బతిని చూపు కోల్పోతున్నారు. అలాంటివారికి మళ్లీ చూపు తెప్పించి, లోకాన్ని చూపించడంలో ఎంతో సంతృప్తి ఉంది’ అంటారు రవీందర్.
✍ పిన్నింటి గోపాల్, 📷 గొట్టె వెంకన్న
“అప్పుడు చెత్తతో ఏం పని అన్నరు.. కానీ ఇప్పుడు 14 రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తోంది”