ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ లేని ఇల్లు ఊహించడం కష్టం. తెలుగు రాష్ర్టాల్లో కొన్నేళ్లుగా ఆన్లైన్ క్లాసులు, డిజిటల్ లెర్నింగ్ పేరుతో హైస్కూల్ విద్యార్థుల చేతుల్లోకి మొబైల్ ఫోన్లు విరివిగా వచ్చాయి. ఇది చదువుకు ఎంతవరకు సహాయపడుతుందో పక్కన పెడితే విద్యార్థులు సోషల్ మీడియా వైపు ఆకర్షితులు కావడానికి దారి తీసింది. ఇది వారి అకడమిక్ విషయాలతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది.
నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ నివేదిక ప్రకారం చాలామంది పిల్లలు కనీస వయసు (13 ఏళ్లు) నిండకుండానే సోషల్ మీడియా ఖాతాలను క్రియేట్ చేస్తున్నారు. రోజుకు 3 గంటల కంటే ఎక్కువ సమయం స్క్రీన్ వైపు చూడటం విద్యార్థుల మెదడు వికాసంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కౌమార దశలో మెదడు వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ సమయంలో డిజిటల్ మీడియా వాడకం వల్ల మెదడులోని ముఖ్యమైన భాగాలపై ప్రభావం పడుతుంది.
మెదడులో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చే డోపమైన్ రసాయనం ఉంటుంది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ‘లైక్’, ‘కామెంట్’ లేదా షార్ట్ వీడియో మెదడులోని రివార్డ్ సెంటర్ను ఉత్తేజపరిచి వెంటనే డోపమైన్ను విడుదల చేస్తుంది.
ప్రభావం: దీనివల్ల విద్యార్థులకు పదేపదే ఫోన్ చూడాలనే కోరిక కలుగుతుంది. క్రమంగా నిజ జీవితంలోని చిన్న చిన్న సంతోషాలు, చదువు వంటి విషయాలు వారికి బోర్ కొట్టడం మొదలవుతుంది.
మెదడులోని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఏకాగ్రత, ప్లానింగ్, నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. నిరంతరం 15-30 సెకన్ల రీల్స్ లేదా షార్ట్స్ చూడటం వల్ల మెదడు తక్కువ సమయంలోనే ఎక్కువ సమాచారాన్ని ఆశిస్తుంది.
ప్రభావం: దీనివల్ల విద్యార్థులలో దీర్ఘకాలిక ఏకాగ్రత క్షీణిస్తుంది. ఒక పుస్తకం చదువుతున్నప్పుడు లేదా క్లాస్ వింటున్నప్పుడు నిమిషాల వ్యవధిలోనే మెదడు పరధ్యానానికి గురవుతుంది.
మెదడులో భావోద్వేగాలను నియంత్రించే భాగం అమిగ్డాలా. సోషల్ మీడియాలో ఇతరుల నుంచి వచ్చే సామాజిక ఆమోదం లేదా తిరస్కరణకు ఈ భాగం చాలా సున్నితంగా స్పందిస్తుంది.
ప్రభావం: రీసెర్చ్ ప్రకారం, సోషల్ మీడియా ఎక్కువగా వాడే పిల్లల్లో అమిగ్డాలా అతిగా స్పందిస్తుంది. దీనివల్ల పీర్ ప్రెజర్, ఆన్లైన్ రిజెక్షన్ ఎదురైనప్పుడు తీవ్రమైన మూడ్ స్వింగ్స్, కోపం, ఆందోళన కలుగుతాయి.
మెదడులోని హిప్పోక్యాంపస్ అనే భాగం కొత్త విషయాలను నేర్చుకోవడానికి, జ్ఞాపకశక్తిని భద్రపరచడానికి కీలకమైనది. ఒకే సమయంలో చదువుకుంటూ, ఫోన్ నోటిఫికేషన్స్ చూసే అలవాటును ‘మీడియా మల్టీటాస్కింగ్’ అంటారు.
ప్రభావం: ఇలా చేయడం వల్ల సమాచారం షార్ట్-టర్మ్ మెమరీ నుంచి లాంగ్-టర్మ్ మెమరీకి బదిలీ అవ్వదు. ఫలితంగా చదివిన విషయాలు త్వరగా మర్చిపోతుంటారు.
స్మార్ట్ఫోన్ల నుంచి వచ్చే బ్లూ లైట్ మెదడులో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే హార్మోన్ విడుదలను అడ్డుకుంటుంది.
ప్రభావం: రాత్రిపూట నిద్ర సరిగ్గా లేకపోతే మెదడులోని టాక్సిన్స్ క్లియర్ అవ్వవు, ఇది మరుసటి రోజు వారి ఆలోచనా శక్తిని దెబ్బతీస్తుంది. మెదడుకు ‘న్యూరోప్లాసిటిసిటీ’ అనే ప్రత్యేక గుణం ఉంటుంది. అనుభవాలను బట్టి మెదడు తనను తాను మార్చుకోగలదు. సోషల్ మీడియా అధిక వాడకం దీనిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
విద్యార్థుల్లో సోషల్ మీడియా అడిక్షన్ తగ్గించడానికి సైకాలజీలో చాలా పద్ధతులు ఉన్నప్పుటికీ డాక్టర్ గబర్ మేట్ రూపకల్పన చేసిన కంపాషనేట్ ఇంక్వైరీ అనేది అద్భుతమైన సైకోథెరప్యూటిక్ విధానం. సాధారణంగా వ్యసనాన్ని ఒక చెడు అలవాటుగానో లేదా ప్రవర్తనా లోపంగానో చూస్తారు. కంపాషనేట్ ఎంక్వైరీ ‘వ్యసనం ఎందుకు?’ అని కాకుండా ‘ఆ బాధ ఎందుకు?’ అని ప్రశ్నిస్తుంది. విద్యార్థులలో సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ అడిక్షన్స్ వెనుక ఉన్న అసలు మానసిక గాయాన్ని, భావోద్వేగ లోటును కనుగొనడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది.
ఈ పద్ధతిలో సోషల్ మీడియా అడిక్షన్ను ఒక జబ్బులా కాకుండా, విద్యార్థి తన జీవితంలోని ఏదో ఒక బాధ లేదా ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి వెతుక్కున్న ఒక తాత్కాలిక ‘పరిష్కారం’ లేదా ‘రక్షణ కవచం’ గా చూస్తాము.
విద్యార్థి కౌన్సెలింగ్లో మాట్లాడుతున్నప్పుడు వారి మాటల కంటే వారి శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో (నరాలు బిగుసుకుపోవడం, గొంతు మారడం, శ్వాస వేగం కావడం) గమనించడం. మనసు దాచే నిజాలను శరీరం చూపిస్తుంది.
విద్యార్థిని నిందించకుండా, తప్పుపట్టకుండా, ఒక డిటెక్టివ్లా కాకుండా ప్రేమతో కూడిన జిజ్ఞాసతో వారి అంతరంగంలోకి వెళ్లడం. ఆ కౌన్సెలింగ్ జరిగే విధానం, కలిగే ప్రయోజనాలు వచ్చేవారం తెలుసుకుందాం.
బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261