నీరు ప్రాణికోటికి జీవనాధారం. దేశంలో అన్నిచోట్లా ఎండలు మండిపోతున్నాయి. కర్నాటకలో అయితే చాలా ప్రదేశాల్లో నీటికి కటకట నెలకొన్న పరిస్థితులు రోజూ వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాయి. నల్లాలు, ట్యాంకర్ల దగ్గర పెద్దపెద్ద క్యూలు నిత్యకృత్యం అయ్యాయి. ఇలాంటి ప్రతికూల సందర్భాలకు ఎదురొడ్డి నిలిచి మనిషి విజయం సాధించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కానీ, అన్ని జీవులకూ ఇలాంటి అదృష్టం దొరకదు. ఎండాకాలం నీటి కొరతతో విలవిల్లాడే నిశ్శబ్ద బాధితుల్లో పక్షులు, జంతువులు ముందువరసలో ఉంటాయి. ఒక్కోసారి ఈ మూగప్రాణులకు చుక్కనీరూ దొరకడమూ కష్టమైపోతుంది.
ఇలాంటప్పుడే కొంతమంది దయార్ద్ర హృదయులు సాటిప్రాణుల పట్ల కనికరం చూపడానికి ముందుకు వస్తారు. వాటి దాహార్తిని తీర్చి తమ విశాల హృదయాన్ని చాటుకుంటారు. అలాంటివాడే 62 ఏండ్ల గోవింద్ గుండప్ప గుండ్కల్. ఈయన ధార్వాడ జిల్లా కాల్ఘట్గి తాలూకా మసలికట్టి గ్రామానికి చెందిన సామాన్య రైతు. తమ గ్రామంలో దాహార్తితో అల్లాడుతున్న పశువులు, పక్షుల కోసం ఎండిపోయిన వాగులోకి తమ బోరుబావి నుంచి నీళ్లను వదులుతున్నాడు. మూడేండ్ల నుంచి ఇలా చేస్తున్నాడు. “మా పొలం పక్కనే ఉండే వాగుకు మా పశువులను నీళ్లు తాగడానికి తీసుకువెళ్లే వాడిని. అయితే, మూడేండ్ల కింద వాగు ఎండిపోయింది. దాంతో పశువులకు మా బోరుబావి దగ్గరే నీళ్లు పట్టేవాణ్ని.
కానీ, వాగు దగ్గరికి కూడా కొన్ని జంతువులు దప్పికతో వచ్చి, నిరాశగా వెళ్లడం గమనించాను… ఇదే నేను వాగులోకి నీళ్లు పెట్టడానికి కారణం” అంటాడు గోవింద్. వర్షాకాలంలో నిండుగా పారే వాగు ఫిబ్రవరి కల్లా ఎండిపోతుంది. అప్పటినుంచి దాదాపు నాలుగు నెలలపాటు గోవింద్ తన బోరుబావి నుంచే వాగులోకి నీళ్లు మళ్లిస్తాడు. దీనికోసం పొలం నుంచి వాగుకు పది గొట్టాలు కూడా పరచాడు. దాదాపు నాలుగు గంటలపాటు నీళ్లు పడతాడు. పైగా తమకు ఉన్నది కొంచెం పొలమే కాబట్టి, బోరుబావి నీళ్లు కూడా తమ పంటలకు సరిపోతాయంటాడు. మూగజీవుల పట్ల గోవింద్ చూపుతున్న కారుణ్యం ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నది. ఇక ఈ నీటితో ఆ గ్రామ పశువులు మాత్రమే కాకుండా పరిసరాల్లో బతికే జింకల లాంటి వన్యప్రాణులు సైతం దాహార్తి తీర్చుకుంటున్నాయి. ఇలా వందలాది పశువుల దాహం తీరుస్తున్న గోవింద్ కృషిని గుర్తించి చెరకు రైతుల సంఘం వారు సన్మానం కూడా చేశారు. ‘ప్రకృతి అంటే ఒక్క మనుషులకు మాత్రమే కాదు… ప్రాణికోటి అన్నిటిదీ’ అనే గోవింద్ తన జీవ కారుణ్యాన్ని ఇలానే కొనసాగిస్తానని నిశ్చయంగా చెబుతున్నాడు.