చదువుతో మానసిక ఆరోగ్యం
బాల్యం తొలినాళ్లలోనే మానసిక ఆనందం కోసం చదవడం మొదలుపెట్టిన పిల్లలు, కౌమారంలో మంచి మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉంటారట. 10వేల మందికిపైగా కౌమార బాలబాలికలపై అమెరికాలో జరిగిన అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, వారంలో కనీసం పన్నెండు గంటలైనా పఠనానికి కేటాయించాలని యూకే, చైనా పరిశోధకులు తేల్చారు. దీంతో మెదడు నిర్మాణం మెరుగుపడిందని నిర్ధారించారు. అంతేకాదు చిన్న వయసులో చదవడం అలవాటైన పిల్లలు ఆ తర్వాత దశల్లో టీవీ, స్మార్ట్ఫోన్ల ప్రభావానికి గురికావడం కూడా తక్కువేనట. మిగిలిన వాళ్లతో పోలిస్తే నిద్రలేమి సమస్య కూడా ఉండదట.
డాక్టర్లను సంప్రదించాల్సిందే
పసుపు, దాల్చినచెక్క, చేపల నూనె గుండెకు మేలు చేస్తాయనే విషయం తెలిసిందే. అయితే గుండెపోటు, పక్షవాతం ముప్పులకు కారకమైన చెడు కొలెస్ట్రాల్ మీద ఇవి ఏమంత ప్రభావం చూపవంటూ ఓ పరిశోధన వెలువడింది. దీనిని క్లీవ్లాండ్ క్లినిక్ నిర్వహించింది. గుండెకు మేలు చేస్తాయని ఊదరగొడుతూ మార్కెట్లో విక్రయిస్తున్న ఆహార సప్లిమెంట్లు, ప్రచారం చేసినంత గొప్పగా కొలెస్ట్రాల్ మీద ప్రభావం చూపవని ఈ అధ్యయనంలో ప్రధాన పాత్ర పోషించిన ల్యూక్ లాఫిన్ అంటున్నారు. కాబట్టి, ఫుడ్ సప్లిమెంట్లను కొలెస్ట్రాల్ తగ్గించే ఔషధాలకు సమానమని భావించకుండా డాక్టర్లను సంప్రదించడం మంచిది.
ఐవీఎఫ్ పిల్లలకూ తోబుట్టువులు
సంతాన లేమితో బాధపడుతున్న మహిళలకు మాతృయోగం కల్పించడానికి అందుబాటులో ఉన్న విధానాల్లో ఐవీఎఫ్ ఒకటి. కానీ, ఐవీఎఫ్ ద్వారా తొలి శిశువును కన్నతల్లులకు ఆ తర్వాత సహజంగా పిల్లలు పుట్టే అవకాశం ఉందా? అంటే.. ఉందనే అంటున్నారు పరిశోధకులు.
యునైటెడ్ కింగ్డమ్ నిపుణులు ఈ అంశంపై అధ్యయనం చేశారు.
ఐవీఎఫ్ విధానం ద్వారా తొలి శిశువుకు జన్మనిచ్చిన మహిళల్లో దాదాపు 20 శాతం మంది ఆ తర్వాత సహజంగా గర్భం ధరించే అవకాశం ఉందని ఈ పరిశోధనలో తేలింది. పరిశోధకులు 1980-2021 మధ్యకాలానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 5,000 మంది మహిళల మీద జరిగిన 11 అధ్యయనాల నుంచి సమాచారం సేకరించి ఈ నిర్ధారణకు వచ్చారు. ఐవీఎఫ్కు సంబంధించి ఇప్పటివరకు ఉన్న అభిప్రాయాలకు విరుద్ధమైన ఫలితం ఇది అంటున్నారు ఈ అధ్యయన ప్రధాన రచయిత డాక్టర్ అనెట్ థ్వయిట్స్.