న్యూఢిల్లీ : ఐటీ రంగంలో లేఆఫ్స్కు (Layoffs) తెరపడకపోవడం టెకీల్లో కలకలం రేపుతోంది. గూగుల్, అమెజాన్, స్నాప్ సహా పలు కంపెనీలు కొలువుల కోత ప్రకటిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రోడక్ట్ మేనేజ్మెంట్, కన్జూమర్ సర్వీసులు, ఇంజనీరింగ్, మార్కెటింగ్ సహా విభిన్న విభాగాల్లో ఉద్యోగులను టెక్ కంపెనీలు తొలగిస్తున్నాయి. 2023 ఆరంభం నుంచి కొలువుల కోత వెంటాడుతూనే ఉంది. ఈ ఏడాది గత ఏడాది కంటే లేఆఫ్స్ 50 శాతం అధికం కాగా ఇప్పటివరకూ 2023లో ఏకంగా 2,44,342 మంది టెకీలు ఉద్యోగాలను కోల్పోయారు.
గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్లో మేజర్ లేఆఫ్స్ వణికించగా స్టార్టప్స్, యాప్స్లోనూ కొలువుల కోత కొనసాగింది. కొద్దినెలలుగా లేఆఫ్స్ కొంత తగ్గినట్టు కనిపించినా పండగ సీజన్లో మళ్లీ కొలువుల కోత తెరపైకి రావడంతో ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని టెకీల్లో గుబులు రేగుతోంది. గూగుల్, అమెజాన్, స్నాప్ సహా పలు కంపెనీలు లేటెస్ట్ లేఆఫ్స్ ప్రకటిస్తుండగా పండగ సీజన్లో కొలువుల కోత టెకీలను వెంటాడుతోంది. ఇక అల్ఫాబెట్ ఇంక్ సారధ్యంలోని గూగుల్ ఇటీవల తన యూజర్స్ అండ్ ప్రోడక్ట్స్ టీంలో పలువురు ఉద్యోగులపై వేటు వేసింది.
అనుబంధ కంపెనీలు వెరిలీ, వేమో, గూగుల్ న్యూస్లోనూ ఉద్యోగులను కుదిస్తామని గూగుల్ బాంబు పేల్చింది. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వంటి కీలక రంగాలపై సెర్చింజన్ దిగ్గజం దృష్టి కేంద్రీకరించింది. ఇక ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇటీవల మరో డివిజన్లో లేఆఫ్స్ ప్రకటించింది. మరోవైపు సోషల్ మీడియా ప్లాట్ఫాం స్నాప్ ఇటీవల తన ప్రోడక్ట్ టీంలో పలువురు ఉద్యోగులను తొలగించింది. ఖర్చులకు కళ్లెం వేసే చర్యలతో కొలువుల కోతకు దిగిన స్నాప్ ఏకంగా ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సహా పలు హై ప్రొఫైల్ ఉద్యోగులను కూడా సాగనంపింది.
Read More :