యాజ్ఞవల్క్యుడు.. మహాముని. గొప్ప సాధకుడు. అపార జ్ఞాని. యాజ్ఞవల్క్య స్మృతి రూపకర్త. వైశంపాయనులవారి ప్రియ శిష్యుడు, మేనల్లుడు కూడా. వీరి పూర్వీకులది నేటి గుజరాత్ ప్రాంతమని అంటారు. బాల్యం నుంచీ పరమ జిజ్ఞాసి. పరమాత్మను దర్శించుకోవాలనే ప్రగాఢ ఆకాంక్ష. నిత్యకర్మల సమయంలో ఆ పరోక్ష అనుభూతిని పొందేవాడు కూడా. ఓ దశలో గురుశిష్యుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో తాను నేర్చిన విద్యనంతా ఆశ్రమంలోనే వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. తండ్రి దగ్గర మళ్లీ వేద విద్యలు చదువుకున్నా.. ద్రష్ట కావాలనే ఆకాంక్ష మాత్రం అతడిని స్థిమితంగా ఉండనిచ్చేది కాదు. దీంతో కఠోర యోగ సాధనతో మనసును, శరీరాన్ని స్వచ్ఛంగా మార్చుకున్నాడు. గాయత్రిని ఉపాసించాడు. భాస్కరుడి కటాక్షంతో ఈశా వాస్య ఉపనిషత్కు ప్రాణం పోశాడు. మిథిలకు వెళ్లి జనకుడిని శిష్యుడిగా చేసుకొన్నాడు. ఆ తర్వాత కూడా ఎన్నో మలుపులు. వాటన్నిటినీ హెచ్. లక్ష్మీ నరసింహ శాస్త్రి రచన ‘యాజ్ఞవల్క్య’ కళ్లకుకడుతుంది. మూలానికి వేలూరి కృష్ణమూర్తి అనుసృజన కన్నడ కస్తూరి పరిమళానికి తెలుగుతేనె తీయదనం అబ్బినట్టుగా ఉంది. యాజ్ఞవల్క్యుడి జీవనయానంలో భాగమైన ప్రశ్నలు-ఉప ప్రశ్నలు, చర్చలు-ఉపచర్చలు, వాదాలు- విద్వత్ గోష్ఠులు .. అత్యంత గుహ్యమైన విషయాలను వెల్లడిస్తాయి . మహర్షుల సన్యాస స్వీకారంతో నవల పరిసమాప్తం అవుతుంది. భార తీయతలోని మూలాలను తెలుసుకోవాలనుకునేవారికి ఉపయుక్త రచన ఇది.
కన్నడ మూలం: హెచ్. లక్ష్మీ నరసింహ శాస్త్రి
అనుసృజన: వేలూరి కృష్ణమూర్తి
పేజీలు: 130, వెల: రూ. 150
ప్రతులకు: పాలపిట్ట బుక్స్ ఫోన్: 9848787284
‘నల్ల సూరీడు’ రోహిణి వంజారి కథల సమాహారం. ఇందులోని ఇరవై ఒక్క కథలూ జీవితంలోని మూడు వందల అరవై కోణాలకు ప్రాతినిధ్యం వహించాయి. ‘నా కళ్ల ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్లు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి.. ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను’ అంటారు రచయిత్రి. ప్రతి కథలోనూ ఆ అధ్యయనశీలత తొంగి చూస్తుంది. ‘అభిమతం’ మతాలకు అతీతమైన మానవతకు పెద్దపీట వేస్తుంది. ‘సరంగు’ కథలోని భవాని ఆత్మవిశ్వాసానికి, ఆంత్రప్రెన్యూర్షిప్కు ప్రతీక. ‘కంచె’ కథ కోసం సమాజాన్ని కలవరానికి గురిచేస్తున్న ఓ సున్నిత విషయాన్ని ఎంచుకున్నారు. లైంగిక విజ్ఞానాన్ని బోధించారు. ఓ కాముకుడి ఆట కట్టించి.. అంతిమ విజయం మానవతదే అని నిరూపించారు. ఆ మాటకొస్తే ప్రతి కథలోనూ తడి ఉంది. కాబట్టే, పాఠకుడు చదువుతూ చదువుతూ అలజడికి గురవుతాడు.
రచన: రోహిణి వంజారి
పేజీలు: 152; వెల: రూ. 200
ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు.