విప్లవోద్యమం సామాన్యులను అసమాన్యులుగా చేస్తుందనడంలో ఈ ‘వీరుడు’ ఓ సాక్ష్యం. నాడు గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు, దొరలు దోపిడితో ప్రజలను పీల్చిపిప్పి చేసేవారు. అదలా ఉండగా కాలరీ ప్రాంతంలో మేనెజ్మెంట్ల దోపిడి, బొగ్గుబాయిపై దొరల ఆధిపత్యం మరోరూపంలో కొనసాగుతుండేది. వారికితోడు జాతీయ కార్మిక సంఘాల నాయకులమని చెప్పుకొనే వారంతా మేనేజ్మెంట్కు వంతపాడుతున్న సమయంలో.. మన కథానాయకుడు మాదిరెడ్డి సమ్మిరెడ్డి పేద రైతు కుటుంబం నుంచి వస్తాడు. ఊళ్లో బతుకుదెరువు లేకపోవడంతో బొగ్గుబాయి బాటపడతాడు. మురికి కుపాల్లాంటి బస్తీల్లో కార్మికుల నివాసాలు, కనీసం అవసరాలకు నోచుకోలేని వాళ్ల జీవితాలను చూసి చలించిపోతాడు. అలాంటి వివక్షనుంచే పోరాటాలు పుట్టకొచ్చాయి.
ఈ పరిణామ క్రమమే సమ్మిరెడ్డిని కార్మిక నాయకుడిని చేస్తుంది. నమ్మిన సిద్ధాంతం కోసం పోలీసు బలగాలనుంచి తప్పించుకోవడానికి భార్యాపిల్లలను వదిలి అజ్ఞాతంలోకి వెళ్లి అశోక్ అలియాస్ రమాకాంత్గా మనందరికీ పరిచయమవుతాడు. ఎంతోమంది బొగ్గుగని కార్మికుల జీవితాలను మార్చిన పోరాటయోధుడు నాటి చంద్రబాబు సర్కార్ చేసిన బూటకపు ఎన్కౌంటర్లో అమరుడవుతాడు. ఇది కేవలం నవల మాత్రమే కాదు. మనకండ్ల ముందు జరిగిన వాస్తవ చరిత్రకు సాక్ష్యం. రచయిత చంద్ రచనల్లో ఎక్కువ భాగం ప్రజా పోరాటాలను చిత్రించినవే. ఆయన నవలల్లో ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఉద్యమకారుల జీవితాలను ఆధారంగా రాసిన నవలలే అనేకం. ఇది కూడా అలాంటి పుస్తకమే!
రచయిత: పి.చంద్
పేజీలు:154, ధర: రూ.120
ప్రతులకు: అనేక బుక్స్టాల్, ఏలూర్ రోడ్డు, విజయవాడ
ఫోన్ నెం: 9247253884
-రాజు పిల్లనగోయిన