లాస్ ఏంజెలిస్: కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను త్వరగా పూర్తిచేసేందుకు అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం అక్కడి ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ తీసుకోండి.. 116 మిలియన్ డాలర్ల (రూ.840 కోట్లు) బహుమతులు గెలుచుకోండి అంటూ ప్రచారం చేస్తున్నది. కొవిడ్ కేసులు ఎక్కువగా ఉండటంతో కాలిఫోర్నియాలో ప్రస్తుతం ఆంక్షలు అమల్లో ఉన్నాయి. దాంతో జూన్ 15లోగా అందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేసి ఆంక్షలు ఎత్తివేయాలని కాలిఫోర్నియా సర్కారు భావిస్తున్నది.
అయితే, పరిస్థితిని చూస్తే గడువులోగా వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా లేదు. ఎందుకంటే 12 ఏండ్ల వయసు దాటిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కాలిఫోర్నియా ప్రభుత్వం నెలల తరబడి ప్రచారం చేస్తున్నా ప్రజల నుంచి అంతగా స్పందన కనిపించడంలేదు. రాష్ట్రంలోని మొత్తం 3.4 కోట్ల మందిలో ఇప్పటివరకు కేవలం 63 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్లు తీసుకున్నారు. అందుకే కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ప్రైజ్మనీ ఆఫర్ ప్రకటించారు.
లక్కీ డ్రా పద్ధతిలో ఈ ప్రైజ్మనీని అందజేయనున్నారు. కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్నవారు ఈ లక్కీ డ్రాకు అర్హులు. జూన్ 4 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ లక్కీ డ్రాలో 10 మంది విజేతలకు 1.5 మిలియన్ డాలర్లను (సుమారు రూ.10.86 కోట్లు) ప్రైజ్మనీగా అందజేయనున్నారు. అంటే ఒక్కొక్కరిగా సుమారుగా 1.08 కోట్లు అందుకోనున్నారు.
మరో 30 మందికి 50 వేల డాలర్లను (36.21 లక్షలు) ప్రైజ్మనీగా ఇవ్వనున్నారు. అంటే ఒక్కక్కరి సుమారుగా రూ.1.20 లక్షల బహుమతి లభించనుంది. ఇక మరో 20 లక్షల మందికి ఒక్కొక్కరికి 50 డాలర్ల (రూ.3,600) విలువైన గిఫ్ట్ కూపన్లను అందిస్తారు. ఇప్పటికే ఓహియో, కొలరాడో, ఒరెగాన్ రాష్ట్రాలు కూడా ఇలాంటి ఆఫర్లనే ప్రకటించాయి.