జరిగిన కథ
శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ పరమభక్తుడైన రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో ఓ తాపసి తారసపడతాడు. ఓ గిరిపుత్రుడి మాటలు కూడా కొత్త ఆలోచనలు రేకెత్తిస్తాయి. అంతలోనే నర్మగర్భంగా మాట్లాడుతున్న ఓ బాలకుడు ప్రభువుల వారికి దిశానిర్దేశం చేస్తాడు. అంతలోనే, ఓ ముసుగు వ్యక్తి త్రిభువన మల్లు మీద దాడికి తెగబడతాడు.ఎవరా అగంతకుడు? అంతలోనే ఇంకో మలుపు..
‘శ్రీమన్ నృసింహ విభవే గరుడ ధ్వజాయ
తాపత్రయోపశ్రమనాయ భవౌషధాయ
తృష్ణాది వృశ్చిక, జలాగ్ని, భుజంగ, రోగ
క్లేశవ్యయామహరయే గురవే నమస్తే’
..సుస్వర వేదనాదంలా వినిపిస్తున్నది రామభట్టు మంత్రోచ్ఛాటన. పరిపూర్ణమైన నమ్మకమూ, భక్తీ.. ఆ తాదాత్మ్యతలో ధ్వనిస్తున్నది. గంభీరమైన ఆ కంఠధ్వని సుగంధ ద్రవ్యాలతో సమర్పితమైన దీప, ధూప పరిమళం లాగా నలువైపులా వ్యాపిస్తున్నది.
పూజా మందిరంలో కొలువై ఉన్న శ్రీలక్ష్మీనారాయణుడిని మనసారా ప్రార్థించి, పూజ ముగించుకొని వస్తున్న మహారాణీ చంద్రలేఖాదేవికి వినబడింది ఈ స్వరం.
‘ఎక్కడిదీ కంఠధ్వని? ఎన్నడూ వినని ఈ మంత్రోచ్ఛాటన ఎవరిది?’
మహారాణి భావం గమనించిన చెలికత్తె నాగమల్లిక.. ఆ సందేహాన్ని నివృత్తి చేసింది.
“అమ్మా! రామభట్టు అనే ఒక వ్యక్తిని మీ ఆదేశం మేరకు, విద్యాపతిగారు కుటీరంలో నిర్బంధించారు. ఆయన కంఠస్వరమే ఇది!”
“అవునా! అయితే నాకెందుకో వారిని చూడాలని ఉన్నది. రమ్మని చెప్పు” రాణీగారి ఆదేశం తక్షణమే రామభట్టుకు తెలియజేయ
బడింది.
రామభట్టును రాణీవారి సమక్షంలో ప్రవేశ
పెట్టాడు దళపతి.
“అమ్మా! అందరికీ అభయమిచ్చే శ్రీలక్ష్మీ
నృసింహ స్వామివారి అనుగ్రహం.. మీకూ, మీ కుటుంబానికీ, ఈ సామ్రాజ్యానికీ పరిపూర్ణంగా లభించుగాక..” మనస్ఫూర్తిగా ఆశీస్సులందించారు రామభట్టు.
అసంకల్పితంగానే ఆయనకు శిరసు వంచి నమస్కరించింది రాణీ చంద్రలేఖ. తరువాత అతనికేసి తేరిపారా చూసింది. నిర్బంధంలో ఉన్నా.. ఏ విధమైన భయ సందేహాలు, అసౌకర్యం ఆయన మొహంలో కనిపించలేదు.
చిరునవ్వుతో చూశాడు.
“అమ్మా..! నన్ను ఎందుకు నిర్బంధించారు? ఎందుకు పిలిపించారు?” అని అడిగాడు.
“మీరు ఇందాక చదివిన శ్లోకానికి అర్థమేమిటి?” తీవ్రంగా చూస్తూ అడిగింది చంద్రలేఖ.
“అన్ని వ్యాధులనుంచి, అన్ని కష్టాలనుంచి శ్రీనారసింహ విభుడు మనల్ని రక్షించాలని మనం ప్రార్థించాలి”.
“కానీ, మన కష్టాలను అర్థం చేసుకొని, అనర్థాలను తొలగించే శక్తి అనేది అసలు ఉన్నదా? అనేది నా సందేహం” తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పింది మహారాణి.
అది విని చిరునవ్వు నవ్వాడు రామభట్టు.“ఇది హాసానికి, పరిహాసానికి సమయం కాదు. మీ నమ్మకానికి ప్రాతిపదిక ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను” కఠినంగా అన్నది రాణి.
“నమ్మకానికి ప్రాతిపదిక.. అనుభవ జ్ఞానమే. విత్తనం నాటితే దాన్నుంచి మొక్క మొలకెత్తి చెట్టు అవుతుందని మనకు తెలుసు. కానీ, విత్తనంలో చెట్టు ఎక్కడుంది? ఆ విత్తనాన్ని చీల్చి నాకు చూపించు.. అంటే అది సాధ్యం కాదు. పల్లెటూరి వాణ్ణి. ఇంతకు మించిన పోలికలు చెప్పడం నాకు రాదు. ప్రయత్న లోపం వల్ల, నిర్లక్ష్యం వల్ల మనం తెచ్చిపెట్టుకున్న కష్టాలను చేత్తో కన్నీటిని తుడిచినంత సులభంగా, మనం వెంటనే తొలగించుకోలేము. మనం చేసిన పుణ్యం అనేది దైవ ప్రార్థనకు తోడై.. మన పాప ఫలితాలను తీసివేస్తుంది. కష్టాలను దూరం చేస్తుంది. పసివాడైన ప్రహ్లాదుడిని కాపాడిన దేవుడు.. నా నారసింహుడు. నరజాతిని కాపాడటానికే అవతరించాడని నాకు పూర్తి నమ్మకం”.
“మీరు చెప్పిన నిర్లక్ష్యం, ప్రయత్న లోపం, లేదా కర్మఫలం.. కష్టాలను కలిగించినప్పుడు, వెంటనే వాటిని దైవం తొలగించనప్పుడు మన ప్రార్థనకు, ఆరాధనకు ఫలితమేముంది? అవసరమేముంది?”
మహారాణి మాటలకు రామభట్టుకు కోపం రాలేదు. జాలి కలిగింది.“అమ్మా! మీ భర్త, రాజ్యపాలకుడు మీకు దూరమైనాడన్న వేదన మీతో ఇలా మాట్లాడించింది”.“కాదు రామభట్టు గారు. నాకూ భక్తీ భయమూ ఉన్నాయి. మనకు తెలియని, కనబడని ఒక మహాశక్తి మనలను పరిపాలిస్తున్నదని నాకు తెలుసు. ఒకవైపు అంతుచిక్కని వ్యాధితో నా కుమారుడు తీవ్రంగా బాధ పడుతున్నాడు. మరొకవైపు నా భర్త, రాజ్యాధీశుడు నారసింహుని దర్శనం కోసం మమ్మల్ని వదిలి వెళ్లారు. తన దర్శనం కోరి వచ్చిన భక్తుడిపైన భగవంతుడికి అనుగ్రహం ఉండాలి కదా.. కానీ, ఇదేమిటి? ఈ పరీక్ష? ఎంతవరకు ఈ కష్టాలను భరించాలి? వీటినుంచి బయటపడే మార్గం ఎవరు చూపిస్తారు? ‘ఆ దారి, సరైన దారి’ అని నేను ఎలా నమ్మాలి?” ఆక్రోశం, ఆవేదన కలగలిసిన స్వరంతో ప్రశ్నించింది మహారాణి.
“మనకు వచ్చిన కష్టం మరీ తీవ్రంగా ఉన్నప్పుడు.. మనకు దారి తోచని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మనకు అన్ని విషయాల్లో సందేహాలే వస్తాయి. తాడుకూడా పాములా కనిపిస్తుంది. పాలుకూడా విషమేమో అనిపిస్తుంది. భరించరాని వేదన మనిషిని దారి తప్పిస్తుంది. మనపైన మనకే నియంత్రణ లేకుండా చేస్తుంది. గాలి వానలో రెపరెపలాడే దీపం లాగా మనసు కొట్టుకులాడుతుంది. అప్పుడే కదా మనకొక ఆధారం కావాలి. ఒక వెలుగు కావాలి. ఒక నమ్మకం కావాలి. బాగు పడాలనే ఆశ కావాలి. మనం నమ్మిన ఆశాదీపం.. సరైన దారి చూపి కష్టాలనుంచి బయట పడేస్తుంది. ఏది పోగొట్టుకున్నా తిరిగి పొందగలం. కానీ, నమ్మకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోవద్దు. నమ్మకం, భక్తి, శ్రద్ధ.. ఇవే మనల్ని తల్లడిల్లిపోయే కల్లోల సముద్రంలో సురక్షిత తీరానికి చేర్చే దృఢమైన పడవలు. ఓమ్ నమో నారసింహాయ..” అంటూ ప్రార్థించాడు రామభట్టు.‘ఆ దేవదేవుడే ఈయన ద్వారా పలికించాడా?’ అన్నట్టుగా అనిపించింది ఒక్క క్షణం మహారాణి చంద్రలేఖాదేవికి.
“నిరాశలో ఉన్నవారికి ఆశ గురించి చెప్పడం, సందేహాలతో సతమతమయ్యేవారికి నమ్మకం గురించి చెప్పడం.. ఉపశమనానికే గాని ఉన్న కష్టాలను తీసివేయడానికి కాదు. నమ్మకం అనేది ఒకరు చెప్తే వచ్చేది కాదు. ఒకరు చెప్తే పోయేది కాదు. అది అనుభవం ద్వారా రావాలేమో! బహుశా అసహాయత అనుభవానికి, ఆ అనుభవం నమ్మకానికి పునాది అవుతుందేమో” నిరాశగా అన్నది మహారాణి.
“కాదు మహారాణీ.. అసహాయత అనేది శాశ్వతమైన స్థితికాదు. తాత్కాలికమైన మనోస్థితి. అది దాటితే కానీ, విశ్వాసం అనేది కలుగదు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడిపై నమ్మకం అనేది నిర్బంధంగా కాకుండా స్వచ్ఛందంగా ఉండాలి. కష్టాలు వచ్చినప్పుడే నమ్మకం కాదు.. నమ్మితే ఏ కష్టాలూ ఉండవు అనే భావన ఉండాలి. ఇది నేను నేర్చుకున్నది కాదు.. తెలుసుకున్నది”.
“రామభట్టు గారూ, ఇప్పుడు నా మనసు దేన్నీ నమ్మే పరిస్థితిలో లేదు. ఊహలు.. ఉన్న కష్టాలను తీర్చలేవు. ‘ఏది జరగాలో అది జరుగుతుంది’ అనుకొని నిర్వేదంగా ఉండలేను. ‘ఏది జరగకూడదో అదే జరుగుతున్నది’ కనుక రాబోయే కాలం మీద నాకు ఆశలేదు. దారిచూపే దేవుడు రాయిలా ఉన్నాడు. దారి చూపాల్సిన నా భర్త దూరంగా ఉన్నాడు. ప్రాణానికి ప్రాణం అనుకున్న నా బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఏది పాపం? ఏది దీపం? అనే విచక్షణలో లేదు నా హృదయం. నా వాళ్లున్నంత వరకే ఉండాలని నా తపన. అపరిచితులైనా ఎందుకో మీరు నాకు ఆత్మీయులుగా కనిపించారు. మీకు చెప్పిందంతా నాకు నేను చెప్పుకున్నదే అనుకోండి” అంటూ తన కంటనీరు మరొకరి కంట పడరాదని.. చూపు మరల్చి మళ్లీ చెప్పింది.
“రామభట్టు గారూ.. మీరిక వెళ్లవచ్చు. స్వంత అనుబంధాలే కూలిపోతున్న ఈ సమయంలో, మరొక నిర్బంధం అవసరం లేదు” ఆ మాటల వెనుక ఉన్న వేదనను చూసి చలించిపోయాడు రామభట్టు. ముందుకొచ్చి ఇలా అన్నాడు..“అమ్మా.. మీరన్నట్టు కష్టాలు తీర్చగల శక్తి నాకు లేదు. కానీ, ఆ శక్తి ఎవరికి ఉందో నాకు తెలుసు. సకల శక్తివంతుడు శ్రీలక్ష్మీనారసింహుడు.. మీ కష్టాలను తీరుస్తాడనే నమ్మకం నాకుంది”.మౌనంగా చేతులు జోడించింది మహారాణి.“ఇక నాకు సెలవిప్పించండి” వినయంగా చెప్పి.. అక్కణ్ణించి ఒక అడుగు ముందుకు వేశాడో లేదో.. అకస్మాత్తుగా ఏదో స్ఫురించింది ఆయనకు.ఉద్వేగంగా తన జోలెలో గబగబా వెతికాడు. లోపల్నించి ఆకులతో తయారు చేసిన దొప్పను బయటకు తీశాడు. అందులో తమలపాకు చుట్టి ఉంది. తమలపాకు పైన కుంకుమ ఉంది. నేతి చుక్క కలిపిన కుంకుమ అది. కాస్త చిక్కగా ఆంజనేయస్వామి వారి సింధూరంలా అనిపిస్తున్నది.
“అమ్మా.. ఇది నేను నరసింహ స్వామి వారి దీక్షలో అర్చించిన కుంకుమ! పరమ పవిత్రమైంది. దీనిని మీరు పూర్తి నమ్మకంతో నుదిటిపైన పెట్టుకోండి. అదే విధంగా రాకుమరుడికీ పెట్టండి. ‘ఓమ్ నమో నారసింహయ’ అని ఒక పదకొండుసార్లు మనసులో అనుకోండి. అనుకున్నది సాధిస్తాననే నమ్మకాన్ని నిలుపుకోండి” అంటూ ఆ తమలపాకును మహారాణికి అందించాడు.
ఎటువంటి భావమూ లేకుండా ఆయన చేతుల్లోంచి కుంకుమ ఉన్న తమలపాకును అందుకుంటూ.. “ధన్యవాదాలు” అని వినయంగా పలికింది మహారాణి.
తల ఊపి.. నిశ్శబ్దంగా అక్కణ్ణించి వెళ్లిపోయాడు రామభట్టు.
స్పృహలేని త్రిభువనమల్లుడిని కొండల్లోకి విసిరేసిన తరువాత నరవర్మ తను అనుచరులతో.. సంతోషంగా తిరిగి వస్తున్నాడు.శరవేగంగా పరుగులు తీస్తున్న.. నరవర్మ గుర్రం ఒక్కసారిగా బెదిరిపోయి సకిలిస్తూ గాల్లోకి ఎగిరి తలకిందులుగా కిందపడింది. నరవర్మ పొదల మీదుగా జారిపోయి ఒక కొమ్మను పట్టుకొని ఆగాడు.‘ఏం జరిగిందా’ అని చూశాడు. రెండు చెట్లకు కట్టివున్న సన్నటి తీగ కనిపించింది. తన అనుచరులు ఆరుగురుని చుట్టు ముట్టాయి సాయుధ సైనిక దళాలు. అప్పుడర్థమైంది. కొండకింద కాపలా ఉన్న సైనికదళాలు తమను పసిగట్టి చుట్టు ముట్టాయని.
‘అనుచరుల కోసం వెనక్కి వెళ్తే.. అసలుకే మోసం వస్తుంది’ అనుకున్నాడు.తన గుర్రం కూడా దూరంగా పడి, లేచింది.గుర్రంపైకి ఎగిరి దూకాడు. బలంగా డొక్కలో తన్నాడు.
అది భయంకరంగా సకిలిస్తూ.. దుమ్మురేపుతూ క్షణంలో కనుమరుగైంది. భువనగిరి కాపలాదళాలు తేరుకొనే లోపే.. మాయమయ్యాడు నరవర్మ.మిగిలి వారిని బందీలుగా పట్టుకున్నారు. కాళ్లు చేతులూ.. తాళ్లతో కట్టేసి, ఆ తాళ్ల కొనలను గుర్రాల జీనులకు బలంగా ముడి వేశారు. వాళ్లను ఈడ్చుకుంటూ సైనిక దళాలు కోటలోకి ప్రవేశించాయి. వాళ్లను చూస్తూనే విద్యాపతి తదితరులు దిగ్భ్రాంతికి గురయ్యారు.“ఏం జరిగింది?.. చక్రవర్తుల వారికి ఏ ప్రమాదం జరుగలేదు కదా?”
“సేనాపతీ! ఈ ద్రోహులను చిత్రహింసలు పెట్టి అయినా.. నిజమేమిటో కక్కించండి”
మరుక్షణం నరవర్మ అనుచరుల హాహాకారాలతో కోట దద్దరిల్లింది.
అదే సమయంలో రామభట్టు నిశ్చలంగా తన కుటీరంలో ఉన్నాడు. మహారాణి వారి వేదన ఆయన హృదయాన్ని తొలచి వేస్తున్నది. కనులు మూసుకొని ‘యోగ నారసింహుని’ తలుచుకున్నాడు. ఏడుతలల ఆదిశేషుడు పడగలు విప్పి ఆడుతుండగా, ధ్యాన నిమగ్నుడైన యోగ నారసింహుడు అర్ధనిమీలిత నేత్రాలతో అందరికీ అభయమిస్తున్న అద్భుత దృశ్యం తన కనుల ముందు నిలిచింది.“స్వామీ యోగ నారసింహా! ఈ సామ్రాజ్యానికి నీవే రక్ష.. కాపాడు స్వామి”..
వొణుకుతున్న పెదాలతో ప్రార్థించాడు. ఆ ప్రార్థన స్వామి ఆలకించాడో లేదో గానీ.. అడవిలో ఒక అద్భుతం జరిగింది.
-అల్లాణి శ్రీధర్
(మిగతా వచ్చేవారం)