“గాలి పగ వట్టినట్టే అయితంది. సప్పుడుజేక మనూరికి మనం పోదాం పార్రి” ముక్కూమూతికి దస్తి గట్టుకొని.. దొంగోని లెక్క ఇంట్లకచ్చుకుంట అన్నడు రమేశ్.“ఏమైంది? ఇంట్లగుడ గీ ముస్గేంది? మనోడో, మందోడో తెల్వకుంట. అయినా, ఎటువోదాం? పోదాం.. పోదాం అంటున్నవ్?” ఇంట్లకచ్చిన పెనిమిటిని కిందికిమీదికి జూసుకుంట అన్నది పద్మ.
“ఎటువోదమేంది? టీవీల జూస్తలేవా? రోజురోజుకూ సావులు పెరుగుతనే ఉండే. లోకానికంత గాలి గత్తరచ్చినట్టయింది. నిన్నియ్యాల మా దుక్నంల పన్జేసేటోళ్లకు ఇద్దరికచ్చింది. ఆళ్లు దవాఖాన్ల వడితె లచ్చలు లచ్చలు కర్సయితున్నయట. అయినా, బతుకుతరో లేదో శెప్పలేమంటున్నరట. ఇగ మనగ్గిన గా రోగమచ్చెనా..? మనం సచ్చుడే! మన దగ్గర రూపాయ్ లేదు. అయినా, ఇంకా ఈడుండి ఏం జేస్తం. రేపటి సంది నన్నుగుడ పన్లెకు రాకుమన్నడు మా సేటు. దుక్నం బందట రేపటిసంది. ఓటెనుకోటి అన్ని బందువెడ్తున్నరు.” శెంబుతోని గటగట నీళ్లు తాక్కుంటన్నడు రమేశ్.
“అయ్యో! ఈనింట్ల పీనుగెల్ల. ఏం సావుమర్నం కాలమచ్చెనుల్లా..”
“సావుమర్నమా.. సావుమర్నమా! ఇప్పటికే అయిద్రాదుల పదిండ్లకు నాలుగిండ్లు ఖాళైనయట. ఇంక మనముండి ఏం జేస్తం. సామాను సర్దు. పోరగాండ్లు రాంగనే బైలెల్దాం” కింద సాపల ఒరుక్కుంట అన్నడు రమేశ్.
పగటీలి రొండు గంటల వరకు ఇంత దిని బయిలెల్లిండ్రు రమేశ్, పద్మ, కొడుకు నరేశ్, బిడ్డ పావని. అందరు కల్సి రోడ్మీదికి వస్తే, ఆటోలు దొరుకుత లెవ్వు. ఇగ ఏం చేసుడో మన్సున వట్టక సూశిసూశి మెల్లగా సామాను నెత్తిమీద వెట్టుకొని అడుగుల అడుగేసుకుంట బస్టాండ్ దాకా వచ్చిండ్రు. బస్సులుగూడ బందైనయట. బస్టాండ్ ముంగట ఉశికేస్తే రాలనంత జనం. ఇంటిదాకా ఎట్లబోవుడో రమేశ్కు సమజ్గాలే. అంతా గోలగోల ఉన్నది. కొద్దిశేపటికి ఎవరో ఒకాయినె దగ్గుకుంట, తుమ్ముకుంట, ఊపిరి గట్టిగ పీల్సుకుంట కిందవడి కొట్టుకుంటండు. ఊపిరి అందుతలేదేమో! ఆయాస పడ్తండు. “దూప.. దూప.. నీళ్లు.. నీళ్లు..” అనుకుంట కింద అటు ఇటు బొర్రుతండు. వానికున్న రోగం ఎక్కడ అంటుతదోనని ఎవరూ ఆయినె దగ్గరకి పోతలేరు. దూరంగా నిల్సున్న మందిల ఎవరో
“నూటెనిమిదికి ఫోన్ చేసినం. వస్తదాగుండ్రి. వాళ్లే తీసుకపోతరు” అన్నడు.
“ఏ.. నూటెనిమిదోళ్లు గూడ వట్టరట ఈ కేసులను. వాళ్లు సుత భయపడుతున్నరట” అన్నడు ఇంకొగడు.
ఆయినె ఒర్రుడు, బొర్రుడు చూసి ఎవరో ఒకాయినె దూరం నుండే తన శేతిలున్న నీళ్ల సీసా ఇసిరేసిండు. జప్పన అందుకొని తాగి, జరంత నిమ్మలమైండు ఆ మనిషి. అయినా, ఆయాస పడ్తనే ఉన్నడు.
రమేశ్కు ఒక్కసారి కింది నుంచి మీద్దాక జల్లుమన్నది. ‘రేపు మన గతిగూడ గింతే గదా!’ అనుకున్నడు. ఎట్లయినా ఈన్నుంచి జల్ది బయటవడాల్నని ఏదో జీబు వస్తే ముల్లెలన్నీ దాని టాప్మీదికి ఎక్కిచ్చిండు. అప్పటికే జీబంత నిండిపోయింది. కూసుండ జాగలేదు.
‘నల్గురం ఎట్లపోవుడు. ఎక్కిచ్చిన సామాను దించుకుందాం’ అనుకున్నడు. కానీ, డ్రైవరు ఎన్కకచ్చి “అరె! పోదాం కూసోర్రి. జర జరుగుర్రమ్మా” అంటూ పద్మను, పావనిని లోపల కూసుండవెట్టిండు.
“ప్రెజ్ఞాపూర్ల ఇద్దరు దిగుతరు. మీరాడిదాక పట్టి మీద నిల్సోండ్రి. ప్రెజ్ఞాపూర్ల లోపల కూసుందురు” అనుకుంట బండి చాల్ జేసిండు. ‘వేరే సౌలతి లేదు. ఏంజేద్దాం మరి’
అనుకుంట రమేశ్, నరేశ్ జీబు పట్టి మీద నిల్సొని, గట్టిగ వట్టుకున్నరు. జీబు మెల్లగ బైలెల్లింది. లోపలెవలో తుమ్మిర్రు. పట్నం దాటేటాల్లకు గంటన్నర వట్టింది. అటెన్క శానా రువ్వడిమీద పోయింది. గంటకే ప్రెజ్ఞాపూర్ అచ్చింది. కాని, జీబు ఆగలే. ఎవ్వలూ దిగలే.
‘ఇగ శనిగరం దాకా నిల్సునుడే’ అనుకున్నరు రమేశ్, నరేశ్. మల్లో గంటన్నరకు.. అంటే రాత్రి ఎనిమిదింటి వరకు శనిగరం స్టేజీమీద దించిండు. బస్సు కిరాయికి రెండంతలు ఇయ్యిమన్నడు డ్రైవరు. రమేశ్కు సుర్రుమని కోపమచ్చింది.
“ఎక్కేటప్పుడే శెప్పద్దా? మేం ఎక్కనే ఎక్కపోదుం.. నీ జీబు” అని లొల్లిలొల్లి జేసిండు.
“మీకు తెల్వదా? బస్సులే బందాయే! ఇంకా నయం. నిన్న మొన్న మూడంతలు వసూలు జేసినం” అని రెండంతల కిరాయి ఇచ్చేదాకా ఇడ్సిపెట్టలేదు ఆ డ్రైవరు.
నల్గురికి డబుల్ కిరాయి కట్టేటాల్లకు రమేశ్కు కండ్లల్ల నీళ్లు తిరిగినయ్.
నల్గురు నాలుగు మూటలు నెత్తిమీద వెట్టుకొని, ఊళ్లెకు బయల్దేరిర్రు. నరేశ్ లగాయించి నడ్సుకుంట ముందట పోతండు. ఏడెనిమిదేండ్ల కిందట అచ్చినపుడు ఎట్లుందో.. గిప్పుడు సుతం గట్లే ఉంది ఊరు. ఊరు కొసకే ఉన్న నాయినమ్మ ఇల్లు జెప్పన్నే గుర్తువట్టిండు.
“నానీ.. నానీ.. ” అనుకుంట లోపటికి వొయ్యి, మూట కింద వెట్టిండు.
నుల్క మంచం మీద కూసొని, రొట్టె దింటున్న మల్లయ్య.. “ఉన్నావే రంగమ్మా! నీ మనువడొచ్చిండు” అన్నడు తలె కిందపెట్టి శెయ్యి గడుక్కుంట.
ఇంటెన్క రేకులకింద రొట్టె జేస్తున్న రంగమ్మ “మనువడెవలయ్యా! మనువడు” అనుకుంట చేతులకంటిన పిండిని శీరె కొంగుకు తుడ్సుకుంట నడింట్లకచ్చింది. నరేశ్ను బిత్తరపోయి చూస్తూ “ఒరే! నరేశూ.. నువ్వారా? ఎంత పెద్దగైనవురా.. ఎట్లచ్చినవు బిడ్డా! ఊళ్లెకు ఎవ్వల్ను రానిస్తలేరు. సడుగు మీద కంప పెట్టలే?” అన్నది. నరేశ్ పెయ్యంత పునుక్కుంట..
“మా పెట్టిండ్లే.. నేనే కాల్తోని పక్కకని అచ్చిన. అక్కడెవలు కావల్లేరు” అన్నడు నరేశ్.
“అయిత వాయేగనీ, ఒక్కనివే అచ్చినవా? మీ బాపు, అమ్మ, అక్క సుతం అస్తున్నరా?”
“ఏ.. నేనొక్కన్నే అచ్చిన్నే. ఆళ్లు రామన్నరు” అన్నడు.. నవ్వుకుంట నుల్క మంచం మీద తాత పక్కపొన్న కూసుండుకుంట.
ఇంతల్నే రమేశ్, పద్మ, పావని నెత్తిమీద బరువుతోని.. మొసపోసుకుంట లోపలికచ్చి శెప్పులిడ్సిర్రు.
“అగో.. అందరు అచ్చిర్రు గదా! నీ తీట మాటలు.. ఇంకా మర్సిపోలేదురా?” అనుకుంట మనువరాలు పావని దగ్గరకు పోయి నెత్తిమీది మూట దించి, దగ్గరికి దీసుకున్నది.
నరేశ్ లోపలికి పోయి సర్వల మంచి నీళ్లుదెచ్చి, అందరికీ తలో గిలాసల పోశిచ్చిండు.
“ఎప్పుడు బైలెల్లిర్రురా! నాత్రయింది” అన్నది రంగమ్మ కొడుకును సూసుకుంట.
“బస్సులే నడుస్తలేవు గాదె. గింత దిని బైలెల్లినం. కిందమీద వడుకుంట అచ్చేటాళ్లకు గీ రాత్రయింది. బాపు ఎట్లున్నవే?” అనుకుంట నుల్క మంచంల కూసున్నడు రమేశ్.
“మంచిగనే ఉన్నరా. గీ మోకాళ్ల నొప్పే వోతలేదు. మొన్న జీడిగింజ సుతం కాల్శి పెట్టిన” అన్నడు మల్లయ్య.
“మీ అయ్య ముచ్చట్లు ఒడ్వయిగని. అందరు కాల్రెక్కలు కడుక్కోర్రి. గీ లోపట బువ్వ అండుత” అనుకుంట రంగమ్మ ఇంటెన్క పొయ్యికాడికి బోయింది.
“యాపాటి సంపాయించినవురా రమేశు? ఈడ ఎవుసం జెయ్యిమంటే అలిగి పట్నం పోతివి?” అన్నడు మల్లయ్య, నాగలి బయటికి తీసి.. కొడలి, పగ్గాలు శేతిల వట్టుకొని, ఎడ్ల కొట్టంలకు పోవుకుంట.
“సంపాయించుడెక్కడిదే! నా కట్టమంతా.. బట్ట పొట్టకే సాలకపాయె. మీదికెళ్లి అప్పుల పాలైతి.” అన్నడు రమేశ్ నొచ్చుకుంట.
“అదేందిరో? సంపాయించందే పొలగాండ్లను పట్నంల సదివిస్తున్నవా? నీ రెక్కల కట్టం నేనేం అడుగతియ్యిరా”
“నిజమేనే. అయ్యగారి సంపాదన, అమ్మగారి పసుపు కుంకుమకు అన్నట్టే అయితంది సంసారం. పోరగాండ్లు ఉశారున్నరని ఒక డాక్టర్ మేడం సదివిపిత్తంది ఆళ్లిద్దర్ని”
“తాతా.. ఏడికి పోతున్నవే? పొలం కాడికా? నేనుగుడ అత్త” అన్నడు నరేశ్
శెప్పులేసుకుంట.
“నువ్వెందుకోయ్. సదువుకున్నోనివి నువ్వాడికచ్చి ఏం జేత్తవ్?” అన్నడు మల్లేశం.
“వాని సదువే బురద పిసుకుడు తాతా. తీస్కపో.. నీకింత ఆసరైతడు” అన్నది పావని నవ్వుకుంట. ఎన్కనుంచి అచ్చి, శెరో మాస్కు ఆళ్ల శేతుల వెట్టింది.
“మేమేమన్నా ఎడ్లమా? మూతులకు గీ సిక్కాలెందుకే పిల్ల. మన తాత ముత్తాతలు గిట్లే మూతులకు ముంతలు, గుడ్డలు కట్టుకొనే బతికిర్రా? ఊళ్లె ఎవలన్నా పెట్టుకోంగ కనవడ్డదా? ఎండల కట్టపడేటోల్లం.. మాకేమైతది?”
“తాత గట్లనే అంటడు గని, నువ్వన్న మాస్కు పెట్టుకోరా! నరేశ్” అని అర్సుకుంట లోపలికి పోయింది పావని.
“గదేం సదువురా? ఏమో బురుద పిస్కుడు అంటంది మీ అక్క” అనుకుంట నాగలి భుజం మీద వెట్టుకొని, ఎడ్ల తలుగులిప్పిండు మల్లయ్య. పగ్గాలు వట్టుకొని బయిలెల్లిండు. తాతెంబడే నడిశిండు నరేశ్.
v v v
పొలం దగ్గరికి పోంగనే దున్నుడు మొదలువెట్టిండు మల్లయ్య. నరేశ్ గూడ ప్యాంటు మీదికి మల్శి, బురుద పొలంల దిగిండు. తాత పక్కనే నుడ్సుకుంట.. “ఏం పంటేస్తవే తాతా. బాగనే దున్నుతున్నవుగని?” అన్నడు.
“ఏమేసుడేందిరా. ఈ పొలంల మా నాయిన జమాన కాన్నుంచి వరే ఏత్తున్నం. ఈ సారిగుడ వరే ఏద్దామనుకుంటున్న”
అట్ల అన్నేండ్ల సంది ఒకటే పంటేయద్దే.. పంట మార్పిడి శెయ్యాలె. గప్పుడే భూమిల సారం పెరిగి, పంట మంచిగత్తది”
“అగో.. నీకేం తెల్సురో.. నాకే శెప్పవడ్తివి.” ఎడ్లను మలుపుకుంట అన్నడు మల్లయ్య.
“పట్నంల నేను సదివే సదువు గిదేనే. బీయస్సీ అగ్రికల్చర్. అంటే.. ఏ భూమిల ఏ పంటేయాలె? ఏ పంటకు ఎన్ని నీళ్లు, ఎంత ఎరువు ఎయ్యాలె? ఏం రోగమత్తె ఏం మందులు వాడాలె? అన్నీ నేర్పుతరు. మేం గుడ మా యూనివర్సిటీల ఒక మూలకు పంటలేత్తం. వాటిని మేమే దగ్గరుండి పరిశీలిస్తం.”
“ఓరియక్క.. గిదీనికి సదువుడెందుకురా. నాతోనుంటే రొండేండ్లల్ల అన్ని నేర్పుదును.”
“కరెక్టేనే! నీకు తెల్వనియి వాళ్లేం శెప్పరు. కానీ, అన్నీ సైంటిఫిక్గా నేర్పిస్తరు”
“గట్లయితే గిప్పుడేమంటవురా? వరేద్దామంటవా? అద్దా?”
“అద్దు తాత. నా మాటిను. ఈసారి పంట మారుద్దం. సుట్టున్నోళ్లందరి పొలాలల్ల వరే ఏస్తున్నరు గదా! మల్ల మనమెందుకు? మనం పూలతోట వెడుదాం.”
“నీకు పిచ్చిలేశిందారా? పువ్వులెవరు కొంటర్రా. అవి ఏపాటి పూస్తయ్. పూసినా వాటికి ఏపాటి ధర అత్తది?”
“ఓ పూట అన్నం లేకున్నా నడుస్తది గని, ఇప్పుడు పూలు లేకుంటే నడుస్తలేదే. పుట్టినా, సచ్చినా, పెండ్లికైనా, పూజకైనా.. అన్నిటికీ పూలే కావాలె. మనం పూలతోట వెడితే రెండు, మూడేండ్లల్ల పైసలే పైసలు.”
మల్లయ్య నవ్వి.. “ఊకోరా.. పిల్ల కాకికేం తెల్సు ఉండేలు దెబ్బ. నీ సదువులు, గిదువులు ఈడ పనిజెయ్యయ్. పొయ్యి సదువుకొని, పరిచ్చలు రాయిపో..”
“అట్లగాదే! మనకు ఎంత భూమున్నది?”
“ఆరెక్రాలు”
“సరే! సరదాగా శెరి మూడెక్రాలు తీస్కుందం. నువ్వు నీ మూడెక్రాలల్ల వరి పంటెయ్యి. నేను నా మూడెక్రాలల్ల పూలతోట పెడ్త. యాడాది తిరిగేసరికి ఎవలెంత సంపాయిస్తరో సూద్దం. మనిద్దరం శెర్తు కట్టుకుందామే!”
“సరే రా! నీ సదువు గెలుస్తదో, నా అనుభవం గెలుస్తదో సూద్దాం.”
మూన్నెల్లల్ల ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చి, ఒక్కెకురంల బంతి, ఒక్కెకురంల గులాబి, ఇంకో ఎకురంల శేమంతి మొక్కలు వెట్టిండు నరేశ్. పురుగు, పుట్ర వట్టకుండ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాల్నో పుస్తకాల్లో చూసి, యూట్యూబ్లో అనుభవజ్ఞుల వీడియోలు చూసి, మధ్యమధ్యన తన యూనివర్సిటీ ప్రొఫెసర్లకు ఫోన్లు చేసుకుంట తోటలకు మందులు కొడుతున్నడు.
కాలం మంచిగ కావడంతో మల్లయ్య సుత తన అనుభవాన్ని రంగరించి మంచి విత్తనాలు, నాట్లు, ఎరువులు, కలుపులు అన్నీ జాగ్రత్తగా జేస్తున్నడు. అప్పుడప్పుడు నరేశ్ కూడా తనకు తోచిన సలహాలిస్తున్నడు. కొట్టిన మందులేడ పోయినయో కాని, చీడపురుగుల దాడి ఎక్కువవడంతో అనుకున్నంత పంట శేతికి రాలేదు. పసలంతా కట్టవడ్డా.. అరువై వేలు రాలే.
నరేశ్ మాత్రం తోటను కంటికి రెప్పలా కాపాడుకుంట వస్తున్నడు. పెండ్లిల్ల సీజను, వరుసగా పండుగలు రావడంతో పూలకు గిరాకీ బాగా అచ్చింది. పూల బత్తాలను ట్రాక్టర్లతోనే కరీంనగర్ మార్కెట్కు తరలిస్తున్నడు. కొన్నిసార్లు సావుకార్లే తోట దగ్గరికచ్చి, నరేశ్ శెప్పిన ధరకు పూలు పట్టుకెళ్తున్నరు. ఆ సుట్టు పక్కల ఇదొక్కటే పూలతోట కావడంతో, నరేశ్ పూలకు బగ్గ డిమాండ్ అచ్చింది. ఆరు నెలలు తిరిగే సరికి ఎంత లేదన్నా.. ఆరు లచ్చలు సంపాయించిండు. మళ్లేడాది మొత్తం ఆరెక్రాలూ పూలతోటే వెట్టిండు. పది లచ్చల మీదనే సంపాయించిండు.
మనుమడు నరేశ్ తెలివికి మల్లయ్య అప్సోసైపోయి.. లోలోపల ముర్శిపోతండు. రెండేండ్లు తిరిగే సరికి, ఊళ్లోని రైతులందరికీ వ్యవసాయ శాస్త్రవేత్తలాగ కనిపించసాగిండు నరేశ్. దానికి తగ్గట్టుగనే నరేశ్ గూడ, రైతులందరినీ జమ చేసి ‘వ్యవసాయదారుల సంఘం’ బెట్టిండు. ఆళ్లందరికీ ఆర్గానిక్ పంటలు ఎట్ల పండించాల్నో.. ఇనార్గానిక్ పంటలు ఎట్ల పండించాల్నో.. మెళకువలు నేర్పించుకుంట, అండగ నిలబడుతున్నడు. నరేశ్ తమ పొలం పక్కనున్న జాగనుకూడా కొని, తోటను మరింత విస్తరించిండు. ఊళ్లె కొన్ని ఆధిపత్య కులాలు ‘వీడేందిరో! నిన్నియాల లాగు కట్టి బాగా ఉషారు సూపిత్తండు’ అని లోలోపల మస్లిపోతుర్రు. మల్లయ్య, రమేశ్ ఇద్దరూ ఎవుసాన్ని నరేశ్కే అప్పజెప్పి, మెల్లగా ఒక ఎరువుల దుక్నం పెట్టిండ్రు. తమ్ముడు అండగా నిలవడడంతో ఎం.డి. కార్డియాలజిస్టు చదివెతందుకు ఉస్మానియా మెడికల్ కాలేజీలో శేరింది పావని.
v v v
“రొండేండ్ల కింద మీరు అయిద్రావాద్ ఇడ్సిపెట్టి మనూరు అచ్చిందే నయమైంది. లేకపోతే మన ఇల్లు, ఊరు ఇంతగనం మారకపోవు” అన్నడు మల్లయ్య.. కార్ల కూసుండుకుంట.
“అదేందే తాత అట్లంటవ్. పక్షి ఆకాశంల ఎంత ఎగిరినా.. మళ్లీ గూట్లెకు రావాల్సిందే గదా! ఇది సుత గంతే. అయినా, ఇప్పటికీ నూటికి డెబ్బయి మంది పల్లెలనే ఉన్నరు. పల్లెటూరు లేనిదే పట్నం ఎట్ల షోకుల వడ్తది. పట్నంకు అవసరమైనవన్నీ పల్లె నుంచే పోవాలె గదా!” అన్నడు నరేశ్.. కారు స్టార్ట్ చేసి. మళ్లా తనే “కాలం కల్సి రావాలె, చెయ్య రావాలె గని.. ఎవుసమంత మంచి వృత్తి మరోటి లేదే తాత. లచ్చలు సంపాయించొచ్చు. ఏ రియలెస్టేట్ బిజినెస్కు ఇది తీసిపోదు. ఇన్నొద్దులు మనకు నీళ్లు లేక, కరెంటు లేక, కరువుకు నా అసోంటి పోరగాండ్లంతా ఎడారి దేశాలకు వలస పొయ్యెటోళ్లు. చేసేటోడు లేక పల్లెల్ల భూములన్నీ బీడువారి పోయినై. ఇప్పుడు జరజర కాలమైతంది గదా! పైగా.. వాన నీళ్లు ఒక్క సుక్కగుడ సముద్రంల కల్వకుంట, మన నీళ్లు మనమే వాడుకుంటున్నం గదా! ఇగ మనకు రాయితోటి కొట్టినా సావులేదు.” అన్నడు నవ్వుకుంట.
మీ తాత, మనువల ముచ్చట మా సాలుగనీ.. నరేశూ! ఎంత సేపైతదిరా మనం ఒరంగల్ శేరుకునేటాల్లకు” అన్నది రంగమ్మ.నరేశ్ దిక్కు, మల్లయ్య దిక్కు సూసుకుంట.“ఎందుకే నానీ. నడుమ మల్లోసారి ఆగి నాస్త జేద్దాం. నీళ్ల సీస ఉన్నది గదా! తాక్కుంట కండ్లు మూసుకో, నువ్వు కండ్లు తెర్సే సరికి ఒరంగల్ల ఉంటం” అన్నడు నరేశ్.. నవ్వుకుంట.
“సరేగనీ! మనకంటె పెద్ద కులపోల్లట గదరా! ఒప్పుకుంటరంటవా?”
“పైసలు లేకుంటెనే కులం ముచ్చట ముందటవడ్తదే! పైసలుంటె కులాన్ని వట్టించుకోరు. ఆళ్లకంటె మనకే భూమి ఎక్కువున్నది. ఆళ్లకంటె మనకే పెద్ద కారున్నది. ఆళ్లకంటె మన దగ్గర్నే పైసలెక్కువున్నయ్. పిలగానితోని సమానంగా అక్కగుడ ఎం.డి. శెయ్యనేవట్టే! ఇప్పుడు ఆళ్లు ఒప్పుకునుడు కాదు.. మనమే ఒప్పుకోవాలె. పిలగాడు ఇల్లరికం అస్తనంటేనే ఈ సంబంధం ఖాయం జేసుకుందాం. లేదంటే లేదు. ఎందుకంటె.. ఇద్దరి సదువులు అయిపోయినంక మనూళ్లెనే హాస్పిటల్ పెట్టియ్యాలె. ఇప్పటికే మన ఊరికి కావాల్సిన పంటలను మనమే పండించుకుంటున్నం. ఇగ ఏదన్న రోగమొస్తే తక్కువ జెయ్యనీకి హాస్పిటల్ గుడ ఉంటే.. పక్కూరుతోని పనేలేదు. వాళ్లే మన దగ్గరికి రావాలె”
“ఇగ పట్నం మొకాన పోవార మరి? మాతోనే ఉంటవా?”
“ఎందుకే గట్లడుగుతున్నవ్? పట్నంలేముందే? ఉండుటానికి జాగ కరువు, పీల్చుటానికి గాలి కరువు. ఇప్పుడు బాగా పైసలు సంపాయించినోళ్లు గుడ పట్నాలిడ్సిపెట్టి ఏదో ఒక పల్లెటూరు జేరుతుండ్రు. నాలుగెకురాల జాగ కొనుక్కొని, నడుమ ఇల్లు కట్టుకొని మంచిగ.. ప్రశాంతంగ బతుకాలనుకుంటుండ్రు. ఏ రోగాలన్నా రానీ.. పోనీ. మళ్లా అంతా పాతకాలపు జీవన విధానాన్నే అలవాటు చేసుకుంటున్నరు..”
రంగమ్మ సప్పుడుజెయ్యక పోయేసరికి నరేశ్ ఓ సారి ఎన్కకు తిరిగి సూసిండు. రంగమ్మ కండ్లు మూసుకుంది. కారు జోరుగా, మెత్తగా సాగిపోతూనే ఉంది..
నిద్ర రాకుంట కారులో సన్నగా పాటలు వెట్టిండు.
“వినకపోతివిగదరా.. వినకపోతివిగదరా.. ఎరుకగలిగిన పదము కొరివి కొనితెచ్చుకొని
వణికితేమి ఫలము..”
డా. వెల్దండి శ్రీధర్
కథకులుగా సాహిత్యరంగంలో అడుగుపెట్టిన వెల్దండి శ్రీధర్ విమర్శ, కవిత్వంలోనూ తన ప్రత్యేకతను చాటుతున్నారు. వీరి స్వస్థలం సిద్దిపేట (పూర్వ కరీంనగర్) జిల్లా కోహెడ. తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, ఓదయ్య. ప్రస్తుతం హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. 2005లో ‘అమృత వర్షిణి’తో కథలు రాయడం మొదలు పెట్టారు. ఇప్పటి వరకూ 20కిపైగా కథలు రాశారు. ‘పొక్కిలి’ కథకు 2009లో మంజీరా రచయితల సంఘం అందించే ‘వట్టికోట ఆళ్వారు స్వామి ఉత్తమ కథా పురస్కారం’ లభించింది. 2017లో ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ‘ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కవిత్వం’ గ్రంథాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించింది. ‘ఊపిరి దీపాలు’ (నానీలు), ‘కథారూప లక్షణాలు’ వీరి ఇతర పుస్తకాలు. ‘ఆసు’ కవితాసంపుటి త్వరలో విడుదల కానున్నది. 2019లో ‘పుంజీతం’ పేర పన్నెండు కథలతో కథాసంపుటిని వెలువరించారు. వీరి సంపాదకత్వంలో ‘తెలుగుకథ ప్రాంతీయ అస్తిత్వం’ అనే గ్రంథం వెలువడింది. ‘పడుగు పేకలు’ చేనేత కథల సంకలనానికి, తొలి తెలుగు దళిత కథా రచయిత్రి తాడి నాగమ్మ పుస్తకాలకు సంపాదకత్వం వహించారు.
-డా. వెల్దండి శ్రీధర్, 98669 77741