Amla Pickle | ఉసిరిలో అపారమైన పోషకాలు ఉన్నాయి. రోగ నిరోధక శక్తిని ప్రసాదించే గుణమూ ఉంది. కరోనా తర్వాత ఉసిరి ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. దీన్నో వ్యాపార అవకాశంగా భావించారు గిరిజన మహిళలు. పచ్చళ్ల నుంచి మిఠాయిల వరకు.. రకరకాల రుచులు అందిస్తూ లాభాలు గడిస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఉసిరి బాగా పండుతుంది. వాటితో అనేక ఆహార పదార్థాలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు గిరిజన మహిళలు. ఏడాది క్రితం సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ స్వచ్ఛంద సంస్థ ఉట్నూర్ ప్రాంతంలోని ఐదుగురు మహిళలకు ఉసిరి రుచుల తయారీలో శిక్షణ ఇప్పించింది. దాంతోపాటు అవసరమైన సరుకుల కొనుగోలుకు రూ.60 వేల సాయం అందించింది. ఆ సహకారంతోనే వారు ఉసిరికాయ పచ్చడి, క్యాండీ, లడ్డూ, ఉసిరి పొడి, సుపారీ, మురబ్బా తయారు చేస్తున్నారు. ఈ పదార్థాలను ‘ఆదివాసీ సంపద’ బ్రాండ్తో విక్రయిస్తున్నారు.
ఉట్నూర్ ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. పోషక విలువలతో కూడిన రుచులు కాబట్టి, ప్రజలూ ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతున్నది. ఉసిరి ఉత్పత్తుల తయారీ ద్వారా మరింతమంది మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సెంటర్ ఫర్ పీపుల్స్ ఫారెస్ట్రీ ప్రతినిధులు నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్)కు ఓ నివేదిక పంపారు. దీనికి సానుకూలంగా స్పందించిన అధికారులు మహిళా స్వయం సహాయక సంఘాల్లోని 90 మంది సభ్యులకు 12 రోజుల పాటు ఉసిరి ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్లో శిక్షణకు నిధులు మంజూరు చేశారు. వారు తయారు చేసిన ఉత్పత్తులు విక్రయించడానికి ఉట్నూర్ ఎక్స్రోడ్లో ఓ దుకాణాన్నీ ప్రారంభించబోతున్నారు.
జిల్లాలో ఉసిరి ఉత్పత్తుల తయారీకి ముడిసరుకు కొరతే లేదు. 2012లో నాబార్డ్ సహాయంతో ఉట్నూర్ ప్రాంతంలో 200 ఎకరాల్లో ఉసిరి చెట్ల పెంపకం చేపట్టారు. ప్రస్తుతం దిగుబడులు బాగా వస్తున్నాయి. ఎకరానికి 50 కిలోల చొప్పున ఏడాదికి రెండు కాతలు వస్తాయి. దీంతో గిరిజన మహిళల వ్యాపారానికి ఉసిరికాయ కొరత సమస్య లేకుండా పోయింది. మార్కెట్తో పోలిస్తే ధర కూడా తక్కువే. ఇంకేముంది, సిరుల పంటే.
…? భాకే రఘునాథ్ రావు