‘మిగిలిపోయిన, పాడైపోయిన ఆహార పదార్థాలను చాలామంది చెత్తపాలు చేస్తారు. లేదంటే వీధుల్లో పడేస్తారు. దీంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటుంది. ఈగలు, దోమలు పోగవుతాయి. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి హాని కలుగుతుంది. ప్రతినిత్యం ఆ వ్యర్థాలను డంపింగ్ యార్డుకు తరలించడమూ తలనొప్పే. ఈ సమస్యకు తిరుగులేని పరిష్కారం కనిపెట్టారు శ్రుతి అహూజా , దిశ అహూజా.
మహిళలు ఏ దశలోనూ నిరాశకు గురికాకూడదు. అవరోధాలకు భయపడకూడదు. ఆశావాదంతో అడుగు ముందుకేయాలి. తెలంగాణ సర్కారు ‘వీ హబ్’లాంటి వేదికల ద్వారా మహిళా ఆంత్రప్రెన్యూర్స్ను ప్రోత్సహిస్తున్నది. స్టార్టప్స్కు ఇదో వరం. ఆకాశమే మీ హద్దు. కలల దగ్గరే ఆగిపోవద్దు.
– అహూజా సిస్టర్స్
హైదరాబాద్కు చెందిన శ్రుతి అహూజా అమెరికాలో మాస్టర్స్ చేసింది. ఆహార వ్యర్థాలకు సంబంధించి వివిధ ప్రాజెక్టులలో పనిచేసింది. లక్షల జీతాల విదేశీ ఆఫర్లను వదులుకుని ఇండియాకు తిరిగొచ్చింది. ఓ అనుకోని సంఘటన ఆమె మనసును కదిలించింది. ఓసారి ఎక్కడికో వెళ్తున్నప్పుడు.. ప్రధాన రహదారి పక్కన గుట్టలుగా పడున్న ఆహార వ్యర్థాలను చూసింది. ఆమె మనసు చలించింది. వ్యర్థాల వల్ల కలిగే హాని గురించి కానీ, వాటి పునర్వినియోగం గురించి కానీ చాలామందికి అవగాహన లేదని శ్రుతికి అర్థమైపోయింది. ఎలాగైనా ఈ దుస్థితిని మార్చాలనుకుంది. తన ఐటీ పరిజ్ఞానంతో బయోగ్యాస్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. వ్యర్థాలకు కొత్త అర్థాన్ని కనిపెట్టింది.
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అహూజా ఇంజినీరింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఈఎస్పీఎల్)కు ఆహార వ్యర్థాలే పెట్టుబడి. బయో గ్యాస్ ఉత్పత్తికి అవసరమైన వ్యర్థాలను కూరగాయల మార్కెట్లు, విద్యాసంస్థలు, హోటల్స్ నుంచి సేకరిస్తారు శ్రుతి. ఆ ప్రయత్నంలో, సాంకేతిక సాయం కోసం కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (సీఎస్ఐఆర్-ఐఐసీటీ) వారిని సంప్రదించింది. వాళ్లు డిజైన్ చేసిన అన్ ఏరోబిక్ గ్యాస్ లిఫ్ట్ రియాక్టర్ (ఏజీఆర్) టెక్నాలజీ.. బయోగ్యాస్ ప్లాంట్ రూపకల్పనకు దోహదపడింది. తొలుత నాచారంలో 300 కిలోల ఆహార వ్యర్థాల సామర్థ్యంతో ఓ మినీ ప్లాంట్ ఏర్పాటు చేసిందామె. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో కమర్షియల్ ప్లాంట్స్ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. శ్రుతి సోదరి దిశకు బయోలాజికల్ ఇంజనీరింగ్లో నైపుణ్యం ఉంది. దీంతో తనూ డైరెక్టర్ హోదాలో వ్యాపార విస్తరణకు తోడ్పాటు అందిస్తున్నది.
‘ఇన్నేళ్లూ వ్యర్థాలను ఎలా వదిలించుకోవాలా అనే ఆలోచించేవారు. అందుకేనేమో, ఇదో పెద్ద సమస్యలా కనిపించింది. కొంత ఊహాశక్తిని జోడించి.. వ్యర్థాలను ఎలా ఉపయోగించుకోవచ్చు అనే కోణంలో ఆలోచిస్తే.. బోలెడు పరిష్కారాలు దొరుకుతాయి. నేను చేస్తున్నది అదే. ప్రాసెసింగ్ తర్వాత
వెలువడే వ్యర్థాలను పంటలకు ఎరువులుగా కూడా వినియోగించుకోవచ్చు’ అని చెబుతున్నది శ్రుతి. ఆమె తండ్రి దేవేందర్ బిట్స్ పిలానీ పట్టభద్రుడు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఆయనకున్న అనుభవం ఈ స్టార్టప్కు తోడైంది.
దేశ వ్యాప్తంగా శ్రుతి వ్యాపార కార్యకలాపాలు దేశమంతా విస్తరించాయి. అహూజా సంస్థకు చెందిన బయో ప్లాంట్స్ సాయంతోనే ‘అక్షయపాత్ర’ ఫౌండేషన్ మధ్యాహ్న భోజన వ్యర్థాలను ఇంధన శక్తిగా మార్చుకుంటున్నది. ఉస్మానియా యూనివర్సిటీ, సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజ్,
ఐఐసీటీ-తార్నాక తదితర ఆవరణలలోని బయోప్లాంట్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. హైదరాబాద్ బోయిన్పల్లి మార్కెట్ యార్డులోని ప్లాంట్ అయితే, 10 వేల టన్నుల కూరగాయల వ్యర్థాలతో 600 యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఎర్రగడ్డ, కూకట్పల్లి, బాట సింగారం, గుడి మల్కాపూర్ కూరగాయల మార్కెట్లలో ఏర్పాటు చేసిన బయో ప్లాంట్స్ నిర్విఘ్నంగా పనిచేస్తున్నాయి. ‘ప్రస్తుతానికి బయోగ్యాస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతున్నది. రాబోయే రోజుల్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్స్ నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని వాహనాలకు ఇంధనంగా కూడా వాడుకోవచ్చు. కాలనీ సంఘాలవాళ్లు ముందుకొస్తే.. బయో ఎనర్జీ ప్లాంట్స్ ఏర్పాటుకు సహకారం అందిస్తాం. పెట్టుబడి డబ్బు మూడేండ్లలోనే తిరిగి రావడం ఖాయం. ఇరవై ఏండ్లపాటు ప్లాంట్ను నిర్వహించుకునే అవకాశమూ ఉంటుంది. భవిష్యత్తులో వీ హబ్ భాగస్వామ్యంతో వ్యాపారాన్ని మరింత విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని వివరించారు అహూజా సిస్టర్స్.
…? గంజి ప్రదీప్కుమార్