ఒక సంస్థ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఎనిమిది గంటల పనిదినాన్ని, స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చింది. ఆమె ఆ సంస్థ ఉత్పత్తులకు నాణ్యతను జోడించింది. అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లింది. మహిళా సిబ్బందే మానవ వనరులుగా.. సిరిసిల్ల అప్పారెల్ పార్కులో.. గోకుల్దాస్ గ్రూప్కు చెందిన గ్రీన్ నీడిల్ యూనిట్ గెలుపు కథ ఇది. వేయిమంది మగువల సమష్టి విజయగాథ ఇది.
టైలరింగ్ విభాగంలో.. కటింగ్ సెక్షన్లో.. ప్యాకింగ్ యూనిట్లో.. డిస్పాచ్ దగ్గర.. ఎటు చూసినా మహిళలే.
అంత శ్రమలోనూ మొహాల మీద చిరునవ్వు. ఎంత ఒత్తిడినైనా భరించగలిగే మనోబలం. ఒకరా ఇద్దరా.. వేయిమంది. కార్ఖానా వాళ్లకు జీతం మాత్రమే ఇస్తున్నది. వాళ్లు మాత్రం శ్రమతత్వంతో కార్ఖానాకు జీవితం ఇచ్చారు. అనతికాలంలోనే.. అమెరికా విపణి వరకూ తీసుకెళ్లారు. నూలుదారాలతో సుతిమెత్తని లోదుస్తులు తయారుచేస్తున్న ఆ జీవితాల వెనుక.. గతంలో కష్టాలు ఉండేవి. రెక్కలు ముక్కలు చేసి బీడీలు చుట్టినా కడుపు నిండని దైన్యం. నిత్యం పొగాకు మధ్యే గడపడం వల్ల రోగాల భారం. పొగచూరిన ఆ బతుకులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ చొరవతో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రూ. 170 కోట్లతో ఏర్పాటు చేసిన అప్పారెల్ పార్కులో.. గార్మెంట్ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టాయి. గోకుల్దాస్ కంపెనీకి చెందిన గ్రీన్ నీడిల్ యూనిట్ సుమారు వెయ్యి మంది మహిళలకు ఉపాధి కల్పించింది. ఎనిమిది గంటల పనిదినంతో వాళ్లంతా నెలనెలా రూ. 7,500 వేతనం పొందుతున్నారు. అలా జిల్లాలోని 13 మండలాల మహిళలకు చేతినిండా పని దొరుకుతున్నది. ఇక్కడి మహిళలు తయారు చేసిన లోదుస్తులను గ్రీన్ నీడిల్ సంస్థ వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నది. తాజాగా, అమెరికాకు పంపారు కూడా! ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ మహిళల నైపుణ్యాన్ని అభినందించారు. ఆరోగ్యవంతమైన పనివాతావరణం, సకల సదుపాయాలు, ఉద్యోగ భద్రత, స్థిరమైన ఆదాయం, నలుగురిలో గౌరవం, రవాణా సౌకర్యం.. ఇంతకుమించి ఎవరైనా ఏం కోరుకుంటారు? టెక్స్ఫోర్ట్ ఇండియా అనే సంస్థ కూడా అప్పారెల్ పార్క్ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. భవన నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి. రానున్న కొద్ది నెలల్లో మరో రెండువేల మంది మహిళలు ఆర్థిక సాధికారత సాధించనున్నారు.
మారిన జీవితాలు
‘ఇంటర్ వరకు చదువుకున్నా. చిన్నప్పటి నుంచీ బీడీలు చుట్టాను. నెలకు రెండువేలు సంపాదించినా గగనమే. మా ఆయన పవన్ బంగారం పనిచేస్తారు. అయిదేండ్ల నుంచీ బీడీల పని అంతంత మాత్రమే ఉంది. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది. ఏడాది క్రితం గ్రీన్ నీడిల్ సంస్థలో చేరాను. నెలనెలా ఠంచనుగా జీతం వస్తుంది’ అంటున్నది కిరణ్మయి. ‘మాది నేత
కుటుంబం. నా భర్త వేణు సాంచాల పని చేస్తుండే. ఏడాది కింద ఆరోగ్యం బాగా లేక చనిపోయిండు. ఇద్దరు కూతుళ్లున్నారు. నాకు బీడీల పని తప్ప ఇంకోటి రాదు. ఆ కంపెనీ కూడా సరిగా నడుత్తలేదు. ఏడాదిన్నర కింద మా గల్లీకొచ్చిన కేటీఆర్ను మహిళలమంతా కలిసి ఏదన్న పని ఇప్పియ్యమన్నం. ఒకరు, ఇద్దరు కాదు. పదివేల మందికి ఉపాధి కల్పిస్తానన్నడు. అన్నట్లే అప్పారెల్ పార్కులో మిషన్ కుట్టే పని కల్పించిండు. వచ్చిన జీతంతో ఇద్దరు బిడ్డలను చదివిస్తున్న’ అంటూ తన జీవితంలో వచ్చిన మార్పును వివరించింది జడల పద్మ. నిజమే, సిరిసిల్ల మహిళలు పిల్లల చదువులకు పెద్దపీట వేస్తున్నారు. సంపాదనలో కొంత భాగం అందుకే కేటాయిస్తున్నారు. ఎందుకంటే, వాళ్లలో చాలామంది చదువులు పేదరికం కారణంగా పదో తరగతి దగ్గరే ఆగిపోయాయి. తమ పిల్లలైనా పెద్ద చదువులు చదవాలని వాళ్ల ఆశ. ఆ కలలను గ్రీన్ నీడిల్ కొలువు నిజం చేస్తున్నది. మునుపటితో పోలిస్తే మహిళల ఆరోగ్యమూ మెరుగుపడింది. సమయానికి తింటున్నారు. సంపాదన పెరిగింది కాబట్టి పోషకాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
అందులోనూ దాదాపుగా అందరివీ పొగచూరిన జీవితాలే. బీడీ పరిశ్రమలో పనిచేయడం అంటే.. ఊపిరితిత్తులను కష్టపెట్టడమే. పొగతాగడంలోని దుష్ప్రభావాలన్నీ ఉంటాయి. ‘మాది మహారాష్ట్ర. నన్ను ఇక్కడికి ఇచ్చిండ్రు. సిరిసిల్లకు వచ్చినంకే బీడీలు సుట్టినా. తంబాకు వాసన పడక పోయేది. తలనొప్పి వచ్చేది. ఏడాది కింద టెక్స్టైల్ పార్కులో కుట్టు ట్రైనింగ్కు పోయిన. కంపెనీలో పని దొరికింది. మా ఆయన సాంచాలపై బతుకమ్మ చీరలు నేస్తుండు. నెలకు రూ. 15 నుంచి రూ. 20 వేల కూలీ వస్తుంది. నాకు రూ. 7500ల జీతం వస్తుంది. మంత్రి కేటీఆర్ దయవల్ల ఇద్దరం కలిసి సంపాదిస్తున్నం. బీడీల పనికి దూరమైనంక నా ఆరోగ్యం మంచిగుంది’ అని సంతోషంగా చెబుతుంది ఆడెపు ఉమారాణి. నేర్పించేవాళ్లు ఉండాలేకానీ.. ముదితల్ నేర్వగరాని విద్యల్లేవు. బీడీలు చుట్టిన చేతులే ఇప్పుడు.. కుట్టు మిషన్ల మీద అద్భుతాలు చేస్తున్నాయి. రెండేండ్ల క్రితం వరకూ బానోతు సుజాత అందరిలాంటి మహిళే. కుట్టు శిక్షణ ఆమెలోని నిపుణురాలిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు, ఆమె కత్తెర పట్టుకుంటే.. కటింగ్ పక్కాగా జరిగిపోవాల్సిందే. తేడా రాదు. లోపం ఉండదు. టెక్స్టైల్ పార్క్లోని ఒక్కో మహిళ జీవితమూ ఓ గెలుపు కథే.
…? రాపెల్లి సంతోష్కుమార్