ప్రభుత్వ బడిలో చదివింది. గురుకుల పాఠశాలలో సీటు సంపాదించింది. ప్రభుత్వ నిధులతో శిక్షణ తీసుకుంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎవరెస్టును అధిరోహించింది. కాబట్టే, ఆ విజయాన్ని ప్రభుత్వం తన విజయంగా భావించింది. పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణను తన ముద్దుల బిడ్డగా ప్రకటించింది. భారీ నగదు ప్రోత్సాహకంతో గౌరవించింది. ఐదెకరాల భూమిని కానుకగా అందించింది. ఇప్పుడు, సువిశాలమైన ఇంటిని నిర్మించి ఇచ్చి తన దొడ్డ మనసు చాటుకుంటున్నది కేసీఆర్ సర్కారు.
మట్టిలో మాణిక్యాలను గుర్తించడంలో, ఆదరించి ప్రోత్సహించడంలో తెలంగాణ సర్కారు ఎప్పుడూ ముందుంటుంది. నైపుణ్యం ఉన్నా.. ఆర్థిక పరిస్థితి అనుకూలించని క్రీడాకారులను భుజం తట్టి బంగారు భవిష్యత్తును అందించిన సందర్భాలు అనేకం. మాలావత్ పూర్ణ సంగతే తీసుకోండి. ఎక్కడో మారుమూల గ్రామానికి చెందిన గిరిజన బాలిక. ఆమె ప్రతిభ గురించి తెలుసుకున్న సీఎం కేసీఆర్ అడుగడుగునా ప్రోత్సహించారు. ఆ ఉత్సాహంతోనే.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని పిన్న వయసులోనే అధిరోహించింది పూర్ణ. అంతేనా, ప్రపంచ రికార్డునూ నెలకొల్పింది. అంతటి ఖ్యాతిని సాధించినా.. తనకంటూ ఓ పక్కా ఇల్లు లేని కొరత పూర్ణను వేధించేది. ఆమె విజ్ఞప్తి మేరకు తెలంగాణ సర్కారు కామారెడ్డి జిల్లా కేంద్రంలో.. ఉచితంగా స్థలాన్ని కేటాయించింది. అందులో సువిశాలమైన గృహాన్ని నిర్మించి ఇస్తున్నది. త్వరలోనే, ఇంటికి సంబంధించిన హక్కు పత్రాలను అధికారికంగా అందించనున్నారు.
ఎవరెస్టును అధిరోహించి.. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మాలావత్ పూర్ణ స్వస్థలం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామం. పల్లెలో ఆమె కుటుంబానికి ఓ పూరిల్లు ఉంది. అది ఏమంత నివాస యోగ్యం కాదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి పట్టణమైతే రాజధాని హైదరాబాద్కు కాసింత దగ్గరగా ఉంటుందనే ఉద్దేశంతో పూర్ణ ఆ ప్రాంతంలో తనకు నివాసాన్ని కేటాయించమని ప్రభుత్వాన్ని కోరింది. ఆ విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. 44వ నంబరు జాతీయ రహదారి సమీపంలో.. ఎల్లమ్మ ఆలయం ఎదురు గల్లీలో 300 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. ఇక్కడే రూ.47 లక్షలతో గృహాన్ని నిర్మించాలని నిర్ణయించారు. తక్షణం నిధులు మంజూరు అయ్యాయి. నిపుణులు రంగంలో దిగారు. ముచ్చటైన మూడు పడక గదుల ఇంటిని కట్టారు. రోడ్లు, భవనాల శాఖ పర్యవేక్షణలో నిర్మాణం తుది దశకు చేరుకుంది.
మాలావత్ పూర్ణ ఘనతకు మెచ్చిన ప్రభుత్వం తొలుత రూ.25 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. అనంతరం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో 5 ఎకరాల ప్రభుత్వ భూమిపై హక్కును అందించింది. మంత్రి కేటీఆర్ చొరవతో ఆ భూమిని సాగుకు అనుకూలంగా తీర్చిదిద్దారు. పూర్ణ కన్నవారు.. మాలావత్ దేవీదాస్, లక్ష్మి దంపతులు పాకాల గ్రామంలోనే నివసిస్తున్నారు. వీరి మొదటి సంతానం నరేశ్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. కూతురు పూర్ణ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్లో పీజీ పూర్తి చేసింది. సాహస క్రీడలకు సన్నద్ధమయ్యే వారికి శిక్షణ, సలహాలు అందిస్తూ రేపటి పర్వతారోహకులను తయారు చేస్తున్నది. తమకు అందిన సహకారం పట్ల పూర్ణ కుటుంబం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. ఏ కష్టమొచ్చినా తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందని గుర్తు చేసుకుంటున్నది.
ఎవరెస్టును అధిరోహించేందుకే కాదు, ఆ తర్వాత కూడా ప్రభుత్వం అండగా నిలిచింది. నగదు బహుమతి, సాగుభూమి, సొంతిల్లు.. సమకూర్చింది. ఈ విషయంలో నేను కేసీఆర్ సార్కు ఎంతో రుణపడి ఉంటాను.
– మాలావత్ పూర్ణ
పిన్న వయసులోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శిఖరం.. ఎవరెస్టును అధిరోహించి ప్రపంచ రికార్డును సృష్టించింది మాలావత్ పూర్ణ. తెలంగాణ ప్రభుత్వ గురుకుల విద్యాలయంలో విద్యను అభ్యసిస్తూ, ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎవరెస్టును అధిరోహించింది. తద్వారా ప్రపంచానికి తెలంగాణ ఘనతను, దేశ గౌరవాన్ని చాటిచెప్పింది. ఎవరెస్టును అధిరోహించిన స్ఫూర్తితోనే.. అనేక శిఖరాగ్రాలకు చేరుకొని రికార్డులను తిరగరాసింది. 2014 నుంచి 2022 వరకు వివిధ ఖండాల్లో పేరొందిన శిఖరాలను అధిరోహించింది. మొదటగా ఆసియా ఖండంలోని ఎవరెస్ట్ను, ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారోను, యూరప్లోని మౌంట్ ఎల్బ్రస్ను, దక్షిణ అమెరికాలోని మౌంట్ అకోన్కగువాను, ఓషియానియాలోని మౌంట్ కార్స్టెన్స్ను, అంటార్కిటికాలోని మౌంట్ విన్సన్ను అధిరోహించింది. 2022, జూన్ 5న ఉత్తర అమెరికాలోని మౌంట్ డెనాలిని అధిరోహించి అతి తక్కువ సమయంలో, అదీ అతి పిన్న వయసులో ఏడు ఖండాల్లోని ఎత్తయిన శిఖరాలను పాదాక్రాంతం చేసుకుని కొత్త చరిత్రను లిఖించింది పూర్ణ. తన సాహస గాథ ఇతివృత్తంగా తీసిన ‘పూర్ణ.. కరేజ్ హ్యాజ్ నో లిమిట్’ చిత్రం ఎంతోమందికి స్ఫూర్తి నిచ్చింది.
…? జూపల్లి రమేశ్ రావు
– కాకర్ల శేఖర్