కూరగాయల వ్యర్థాలతో సీడ్ పేపర్స్, ఎండిపోయిన పూలతో సహజ రంగులు, రసం తీసిన నిమ్మకాయ తొక్కలతో బయో ఎంజైమ్స్.. ఒకటేమిటి, ఆమె ఆలోచనల్లోంచి అనేకం పుట్టుకొచ్చాయి. ‘ఇవన్నీ నేను కనిపెట్టినవేం కాదు. పూర్వికులు మనకు పరిచయం చేసినవే’ అంటారు అరుణ్జ్యోతి ఎస్.లోఖండే.
‘మనిషి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని సూత్రాలు గుర్తుంచుకోవాలి. కానీ, చాలామంది అవసరం లేనివి నేర్చుకుంటూ.. పనికిరానివి పాటిస్తూ.. ఉపయోగం లేనివి గుర్తుంచుకుంటున్నారు. మన పూర్వికుల పద్ధతులను కొట్టిపారేస్తున్నారు. పెద్దల అడుగుజాడల్లో నడిస్తే.. కుటుంబ బంధాలు, సమాజం ఎంత గొప్పగా ఉంటాయో కదా’ అంటున్నారు పర్యావరణ ప్రేమికురాలైన అరుణ్జ్యోతి ఎస్.లోఖండే. సమస్త జీవజాతి కోసం ప్రకృతి ఎన్నో సృష్టించింది. ఇంకా సృష్టిస్తున్నది. ప్రకృతి ఇచ్చిన ప్రతీది.. మనకు ఉపయోగపడుతున్నది. కాకపోతే ఆ విషయాన్ని గమనించక.. పనికిరానిదాన్ని వాడుకుంటూ.. పనికొచ్చేదాన్ని పారేస్తున్నాం. అందుకు సాక్ష్యం వంటింటి డస్ట్బిన్. కావాలంటే ఆ చెత్తబుట్టను తెరిచి చూడండి. అందులో మీరు పారేసిన కూర గాయల ముక్కలు, పళ్ల తొక్కలు అనేకం ఉంటాయి. ‘ఓ క్షణం ఆలోచించి చెప్పండి. అవి దేనికీ పనికి రావా?’ అని ప్రశ్నిస్తారామె. ప్రశ్నించడమే కాదు.. ఆ ప్రశ్నలకు తానే ఓపికగా సమాధానం చెబుతారు.
తొలి గురువు.. అమ్మ
అరుణ్జ్యోతిది నల్లగొండ. చిన్నప్పటి నుంచీ దేన్నయినా వినూత్నంగా చేయడం అలవాటు. ఆమె తల్లి ఆలోచనా విధానం కూడా అలానే ఉండేది. అమ్మ ఒడిలో కూర్చునే హస్తకళలు, ఎంబ్రాయిడరీ, పేపర్ మౌల్డింగ్ క్రాఫ్ట్స్ నేర్చుకున్నారు. పెరటి మొక్కలు, చెట్లను తల్లి కాపాడుకునే తీరును శ్రద్ధగా గమనించారు. ‘ప్రకృతి మనకు ఎన్నో ఇచ్చినప్పుడు.. మనం వాడుకోగా మిగిలినవి తిరిగి ప్రకృతికే ఇచ్చేయడం ఎంత గొప్ప ప్రయత్నం’ అనిపించేది ఆమెకు. ఇది కూడా అమ్మ నేర్పిన ఆలోచనా విధానమే. కూరగాయలు తరిగాక వ్యర్థాలను జాగ్రత్తగా దాచి.. ఆ ముక్కల్లో కొన్ని మెంతులు, సీతాఫలం ఆకులు, విత్తనాలు లేదా వేపాకు వేసి రుబ్బుతారు అరుణ్ జ్యోతి. ఇలా చేస్తే ఆ మిశ్రమానికి పురుగు పట్టదు. చివర్లో తులసి, ధనియాలు, తోటకూర, బంతి వంటి విత్తనాలు చేర్చి.. సీడ్ పేపర్స్, కంపోస్ట్ పేపర్స్ సిద్ధం చేస్తారు. ఆ పేపర్లను పూలకుండీల్లో పెడితే మొక్కలకు ఎరువులా మారుతుంది. ఖాళీ కుండీల్లో పడేస్తే అందులో విత్తనాలు మొలకెత్తుతాయి. ఇదే పద్ధతిని చుట్టుపక్కల వారికి పరిచయం చేశారు. వీడియోలు చేసి ఎంతోమందికి నేర్పారు. ఆన్లైన్ క్లాసులూ చెబుతున్నారు.
వర్క్షాప్లు కూడా..
అరుణ్జ్యోతి రెండు దశాబ్దాల నుంచీ పర్యావరణం, రీసైక్లింగ్ మీద పని చేస్తున్నారు. మట్టి వినాయకుడి విగ్రహాలు, సహజసిద్ధ హోలీ రంగులు, పేపర్ బ్యాగులు తయారు చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఆర్ట్ గ్యాలరీలలో వర్క్షాపులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే, కాలనీ సంఘాల ద్వారా అపార్ట్మెంట్ వాసులకు పరిచయం చేశారు కూడా. అంతేకాదు.. మట్టి గణేష్ విగ్రహాల వాడకం పెరగాలని, కుమ్మరి వీధుల్లో తిరిగి మరీ విగ్రహాల తయారీ బోధించారు. ప్రకృతి నుంచి వచ్చిందేదీ చెత్త కాదు.. మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. ‘కూరగాయలు తరగక ముందు ఉన్నది చెత్త కానప్పుడు, తర్వాత మాత్రం చెత్త ఎలా అవుతుంది?’ అంటారు అరుణ్జ్యోతి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో, డీఆర్డీఏలో ఫుడ్ ప్రాసెసింగ్ క్లాసులు కూడా తీసుకుంటారు తను. ‘చాలా కలుపు మొక్కల్లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. బతుకమ్మ పేర్చడంలో ప్రధానంగా వాడే గునుగాకు, ఎర్రబద్దాకు, అవిసాకు, గురివిందాకు, గుడ్లమల్లి, లొట్టపీసు ఆకు, ఇరికి ఆకులు, ఇరికి పండ్లు.. ఇలా చెబుతూపోతే ప్రతి వాటిలో ఏదో ఒక పోషకం, ఆరోగ్య ప్రయోజనం ఉంది. కాకపోతే, తరాలు మారుతున్నకొద్దీ ఆ ప్రయోజనాలు తెలుసుకోలేక పోతున్నాం’ అంటూ ఆవేదన చెందుతారు. ఆమె చేస్తున్న పనికి ఎన్నో అవార్డులు వచ్చాయి, ఎంతో గుర్తింపు లభించింది. కానీ, వాటి గురించి బయటికి చెప్పరు. ‘రావాల్సింది అవార్డులు కాదు.. మార్పు’ అంటారు నవ్వుతూ. ఉల్లి, నిమ్మ, ఉసిరి, బంతి, మందార వంటివి వాడిన తర్వాత పారేయకుండా ఒక వాటర్ బాటిల్లలో వేసి ఒక చెంచా చక్కెర కలిపి.. 90 రోజుల పాటు నిల్వ చేసి వాడితే బయో ఎంజైమ్లా పనిచేస్తాయంటూ ముక్తాయింపుగా ఓ చిట్కా చెవిన పడేస్తారు. ఆ ద్రావకం స్ప్రే చేస్తే దోమలు, బొద్దింకలు, ఇతర కీటకాలు పరిసరాల్లోకి రానేరావు. ఇలా, తనను కదిలిస్తే ఎన్నో ఉపాయాలు.
ఇంకా చేస్తా..
అమ్మ నుంచి నేర్చుకున్న విషయాలపై మరింత అధ్యయనం చేశాను. పరిశోధనలో ఇంకొన్ని పద్ధతుల గురించి తెలుసుకున్నా. వాటిని జనాలకు చేర్చాలన్నదే నా ఆలోచన. మా అమ్మ, అత్తమ్మ.. ఇద్దరి ఆలోచనలు, పద్ధతులు ఒక్కటే. నా ప్రయత్నానికి మా ఆయన సతీష్ లోఖండే మద్దతు లభిస్తున్నది. భవిష్యత్తులో వెడ్డింగ్ కార్డ్స్, పేపర్ ప్లేట్స్ లాంటివి కూడా తయారుచేస్తాను.
…? సుంకరి ప్రవీణ్ కుమార్
– గడసంతల శ్రీనివాస్