– మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్ పాషా
– మదర్సా విద్యార్థులకు ప్రవేశాల్లో ప్రత్యేక మినహాయింపులు కల్పించాలి
రుద్రంపూర్, జూన్ 06 : ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో మదర్సాలలో ఆధ్యాత్మిక విద్యను అభ్యసించిన అనేక మంది విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్ల లేమి కారణంగా వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందలేక అవకాశాలను కోల్పోతున్నారని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన షేక్ మదీనా అనే విద్యార్థిని 8 సంవత్సరాల పాటు మదర్సాలో ఆలీమ్ కోర్సు అభ్యసించి, అనంతరం సార్వత్రిక విద్యా విధానం ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్లో అత్యుత్తమ మార్కులు సాధించిందని తెలిపారు. ఉపాధ్యాయ శిక్షణ (టీచర్ ట్రైనింగ్) పొందాలనే లక్ష్యంతో టీజీ డీఈఈసెట్ ప్రవేశ పరీక్ష రాసి రాష్ట్ర స్థాయిలో 339వ ర్యాంక్ సాధించినప్పటికీ, శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన కౌన్సిలింగ్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు లేకపోవడంతో సీటు కోల్పోయిందన్నారు.
సార్వత్రిక విధానం ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు స్టడీ సర్టిఫికెట్లు ఎవరు జారీ చేస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మదర్సా విద్యార్థులకు ప్రతిభ ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో ఉన్నత విద్యావకాశాలను కోల్పోవడం బాధాకరమని అన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, మదర్సా విద్యార్థులకు కౌన్సిలింగ్లు, ప్రవేశాల సమయంలో ప్రత్యేక వెసులుబాట్లు కల్పించే విధంగా అవసరమైన మార్గదర్శకాలు జారీ చేసి వారి విద్యా భవిష్యత్కు భరోసా కల్పించాలని యాకూబ్ పాషా ప్రభుత్వాన్ని కోరారు.