‘ఏ’ ఫర్ ఆపిల్ అన్నట్టు ఇంటర్ ఫర్ ఇంజినీరింగ్ అంటున్నారు విద్యార్థులు. మ్యాథ్స్ రావంటే ‘ఏ’ తర్వాత ప్లాన్ ‘బీ’ ఉంది. బీ ఫర్ బైపీసీ! ఇలాంటి రోజుల్లో బీఏ చదవాలని నిర్ణయించుకుంది. అమెరికాలో చదివే అవకాశాలు వెదుక్కోకుండా పుట్టిన దేశానికే వచ్చి బీద జనం బాగు కోసం పని చేయడమే బాధ్యతగా తీసుకుంది. సంతోషం, సంతృప్తి డబ్బుతోనే రావు, చేసే పనిలోనే ఆ రెండూ ఉంటాయంటున్నది యుగాంతర్ సీఈఓ తేజస్విని మాడభూషి!
చిన్నప్పటి నుంచి సమాజం అంటే ఆసక్తి ఉండేది. మ్యాథ్స్ ఎంత చేసినా సంతృప్తి కలిగేది కాదు. సోషల్ సైన్స్ ఎంత చదివితే అంత ఆనందంగా అనిపించేది. అందుకే సాంఘిక శాస్త్రం ఇష్టంగా చదివేదాన్ని. అదే సామాజిక రంగంలోకి రావడానికి దోహదం చేసిందేమో! ఇంటర్ తర్వాత అమ్మానాన్నలు నన్ను ఇంజినీరింగ్ చేయమన్నారు. కానీ, నేను బీఏ తీసుకున్నాను. హైదరాబాద్లో ఆర్ట్స్ కోర్సులు చాలా తక్కువ కాలేజీల్లో ఉండేవి.
సామాజిక శాస్ర్తాలు డిమాండ్ లేని కోర్సులు.. అప్పుడూ.. ఇప్పుడూ! బంధువులు, తెలిసినవాళ్లు ‘నీది రాంగ్ డెసిషన్.. లైఫ్లో ముందుకు పోలేవు’ అన్నారు. ముందుకో, వెనక్కో నాకు నచ్చింది చదవాలనుకున్నాను. వాళ్ల మాటలు పట్టించుకోలేదు. అమ్మానాన్న మాత్రం ‘నీకు నచ్చింది చదువు’ అని అన్నారు. ఇంట్లో అంత స్వేచ్ఛ ఉంది. కానీ, బీఏ చదువుని తక్కువ చేసే జనాలు మాత్రం సలహాలు ఇస్తూనే ఉన్నారు. ఆ సమయంలో అమర్త్యసేన్కి ఆర్థిక రంగంలో నోబుల్ బహుమతి వచ్చింది. ఆ పాయింట్ పట్టుకుని సోషల్సైన్సెస్ చదివే వాళ్లు కూడా పైకి రావొచ్చని చాలా బాగా వాదించాను. కొంతమంది నోళ్లు మూయించాను.
డిగ్రీ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ సోషియాలజీ చేశాను. పీజీలో ఉన్నప్పుడు యూత్ ప్రోగ్రామ్కి ఎంపికయ్యాను. జపాన్లోని హిరోషిమా వెళ్లాను. వారం రోజులు అక్కడ ఉన్నాను. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా ప్రయోగించిన అణుబాంబు బాధితుడి ఇంట్లో ఉన్నాను. ఆయన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆయన పంచుకున్న అనుభవాలు.. ఎన్నో విషయాలు తెలియజేశాయి. ఘర్షణల గురించి అధ్యయనం చేసేందుకు అమెరికాలోని జార్జ్ మాసన్ యూనివర్సిటీ ఎం.ఎస్. (పీస్ స్టడీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్) కోర్స్ నిర్వహిస్తున్నదని తెలిసింది.
పీజీ పూర్తయ్యాక ఆ కోర్సు చదవాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. అనుకున్నట్టే ఆ యూనివర్సిటీలో సీటు వచ్చింది. నేను చదివే చదువులకు ‘మా అమ్మాయికి మంచి జాబ్ వస్తుందా! రాదా?’ అని అమ్మానాన్న కొంచెం భయపడేవాళ్లు. అమెరికాలో ఉద్యోగం సాధించేందుకు చాలామంది చదువును ఒక అవకాశంగా ఎంచుకుంటారు. నేను అమెరికాలో చదివినా.. భారత్లోనే ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నా! మా క్లాస్మేట్స్ కొంతమంది వివిధ దేశాల్లో మంత్రులుగా పని చేస్తున్నారు. చాలామంది అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.
అమెరికాలో ఉన్నప్పుడే భారత్లో ఉద్యోగం కోసం వెదుకులాట మొదలుపెట్టాను. సామాజిక సమస్యల పరిష్కారం కోసం పనిచేసే యుగాంతర్ (హైదరాబాద్) సంస్థ ఒక ఉద్యోగి కోసం ఎదురుచూస్తున్నది. సరిగ్గా అదే సమయంలో నా చదువు పూర్తయింది. స్వదేశానికి వచ్చి యుగాంతర్ సంస్థలో చిన్న ఉద్యోగంలో చేరాను. హైదరాబాద్లో మూడు దశాబ్దాలకుపైగా చరిత్ర ఉన్న యుగాంతర్ అప్పుడు దండకారణ్యంలో ఆదివాసుల సమస్యల గురించి ఒక ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నది. ఇందులో చాలామంది గాంధేయవాదులైన సమతా స్వరాజ్ మిత్రమండలి సభ్యులుగా ఉన్నారు. నాకు వాళ్లంత అనుభవం లేకున్నా వాళ్లను కో ఆర్డినేట్ చేస్తూ ఉండేదాన్ని. నక్సలిజం, యాంటీ నక్సల్స్ ఆపరేషన్ల మధ్య నలిగిపోయే ఆదివాసీలు, వారి ఉపాధి, రక్షణ, సంక్షేమం కోసం మేం పనిచేసే వాళ్లం. పెసా యాక్ట్, కమ్యూనిటీ ఫారెస్ట్ రైట్స్ కోసం పనిచేశాం.
ప్రభుత్వం నుంచి సమాచారం తెలుసుకోవాలనుకునే వాళ్లకు సాయపడుతున్నట్టే.. కనీసం తమకు అవసరమైన సర్టిఫికెట్లు పొందలేక, ఆ సర్టిఫికెట్ల గురించి తెలియక ఇబ్బందులు పడుతున్న పేదల కోసం పాటుపడాలనుకున్నాం. పాతబస్తీలోని బాబానగర్ అనే స్లమ్లో కనీస హక్కులు ఉపయోగించుకునేలా ఓ ప్రాజెక్ట్ ప్రారంభించాం. ఒక చిన్న గదిలో, ఒక కంప్యూటర్తో ఆఫీస్ నిర్వహిస్తున్నాం. ఆ ప్రాంత ప్రజలు అక్కడికి వచ్చి వాళ్ల సమస్యలు చెబుతారు. వాళ్లకు కావాల్సిన సర్టిఫికెట్ల గురించి మమ్మల్ని అడుగుతారు. ఆ సర్టిఫికెట్లు పొందాలంటే ఎవరికి దరఖాస్తు చేయాలో, ఏ విధంగా దరఖాస్తు చేయాలో చెబుతాం.
దరఖాస్తు చేయడానికి సహకరిస్తాం. చాలామంది చదువురాని వాళ్లు, అమాయకులు బ్రోకర్లను ఆశ్రయిస్తారు. వాళ్లు డబ్బు అడుగుతారు. వీళ్లు ఇవ్వలేరు. నేరుగా అధికారుల దగ్గరికి వెళ్తే లంచాలు అడుగుతారు. ఇలాంటి సమస్యలు లేకుండా మేమే నేరుగా వాళ్ల దరఖాస్తుల్ని ప్రభుత్వాధికారులకు అందజేస్తున్నాం. తర్వాత ఆ అర్జీ ఎంతదాకా వచ్చిందో తెలుసుకుంటాం. వాళ్లకు కావాల్సిన సర్టిఫికెట్ వచ్చేదాకా మేం సహాయం చేస్తాం. ఉచితంగా సాయం చేయడం వల్ల విద్య, ఆరోగ్యం, ఉపాధి, సంక్షేమ కార్యక్రమాలను ఎక్కువమంది వినియోగించుకోగలుగుతున్నారు.
అడవుల్లోనే కాదు బస్తీల్లోనూ మా సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. బస్తీల్లో పని చేస్తున్నప్పుడు వాళ్లలో ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం గుర్తించాం. ముఖ్యంగా మగవాళ్లయితే అవసరం లేకపోయినా వస్తువులు కొనడం గమనించాం. స్మార్ట్ఫోన్లు కొనేస్తున్నారు. కొందరేమో తాహతుకు మించి బైక్లు కొంటున్నారు. ఆడవాళ్లు ఫంక్షన్ల కోసం డబ్బులు మంచినీళ్లలా ఖర్చు చేయడం కనిపించింది. ఖర్చు చేయడం తప్పు కాదు! కానీ, భవిష్యత్ అవసరాల గురించి ఆలోచించాలి కదా! ఈ విషయాలపై వారికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం.
పొదుపు మంత్రాన్ని ఉపదేశిస్తున్నాం. డబ్బులు ఎక్కడ వృథా అవుతున్నాయో వివరిస్తున్నాం. వాళ్లకు పొదుపు గురించి చెప్పేటప్పుడు నా సంగతి ఏంటన్న సందేహం వచ్చింది. నేనూ కాస్త దుబారా మనిషినే! వాళ్లకు పాఠాలు చెబుతూ నేనూ మారిపోయా. పొదుపు చేయడమూ మొదలుపెట్టాను. ఇప్పుడు ఏది కొనాలన్నా ఆలోచిస్త్తున్నా. గతంలో ‘ఆర్ట్స్ కోర్సులు చదువుతున్నావా?’ అన్న నా ఫ్రెండ్స్ ఇంజినీరింగ్, ఎంబీఏలు చేసి కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. సోమవారం వచ్చిందంటే మా ఫ్రెండ్స్ ఆఫీస్ని తలుచుకుని ఏడుస్తారు. కానీ నేను సంతోషంగా మా ఆఫీస్కి బయల్దేరతాను. నేను నా పనిని ఎంజాయ్ చేస్తున్నాను. అదన్నమాట ఇష్టమైన పనిలో ఉండే కంఫర్ట్!
కొన్నేండ్ల తర్వాత యుగాంతర్ బాధ్యతలు నా చేతికి వచ్చాయి. ప్రాజెక్ట్ మేనేజర్గా చేరిన నేను సీఈఓగా బాధ్యతలు చేపట్టాను. మహిళలు, పేదల హక్కుల కోసం మా సంస్థ అనేక ప్రాజెక్టులు చేపట్టింది. వీటికి తోడుగా కొత్తగా ట్రాన్స్జెండర్స్కు అండగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం. చాలామంది అవగాహనా లేమితో సమాచార హక్కు చట్టాన్ని సరిగ్గా వినియోగించుకోలేక పోతున్నారని గుర్తించాం.
అర్టీఐకి దరఖాస్తు చేసిన వారి భద్రతకు కొన్నిసార్లు ముప్పు వాటిల్లుతున్నదని మా దృష్టికి వచ్చింది. ఈ సమస్యలకు భయపడి చాలామంది ఆర్టీఐ ఉపయోగించుకోవడానికి జంకుతున్నారు. కొంతమందికి సమాచారం కోసం ఎవరికి దరఖాస్తు చేయాలి? ఎలా దరఖాస్తు చేయాలో కూడా తెలియదు. ఇలాంటి వాళ్లు వాళ్ల సమస్యలు, అవసరాలు మాకు చెబితే ఆర్టీఐ అర్జీలు ఆన్లైన్లో పంపిస్తాం. మా సంస్థ పేరునే ఆర్టీఐ వేస్తున్నాం కాబట్టి సమాచారం కోరుకుంటున్న వాళ్ల వివరాలు గోప్యంగా ఉంటాయి. అవసరం ఉన్నవాళ్లు yourti.in ద్వారా సంప్రదించవచ్చు.
– నాగవర్ధన్ రాయల
– భాస్కర్