ఎవరి మూడ్ ఎలా ఉంటుందో, ఏ క్షణంలో మనిషి ఏం ఆలోచిస్తాడో ఊహించడం కష్టం. కానీ టెక్నాలజీ శరవేగంగా పరుగులు పెడుతున్న తరుణంలో ఏదైనా సాధ్యమే. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, చాట్బోట్ను ఉపయోగించుకుంటే అద్భుతాలే. కాబట్టే, కృత్రిమ మేధ సాయంతో శుభాంగి రస్తోగి చేసిన డిజిటల్ ఆవిష్కరణ గురించి ఇప్పుడు చర్చ జరుగుతున్నది.
శుభాంగి రస్తోగీ.. కరోనా బ్రేక్లో ఎన్హాన్సింగ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాలను గుర్తించే పరికరాన్ని తయారు చేసింది. అప్పట్లో ఓ మల్టీ నేషనల్ కంపెనీ హెచ్ఆర్ విభాగంలో పనిచేసేది శుభాంగి. కానీ తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ సమయాన్ని ‘మైండ్ ఎక్లోవ్’ అనే డిజిటల్ టూల్ను డెవలప్ చేసేందుకు కేటాయించింది.
క్షణక్షణానికి మారే ఉద్వేగాలను ఇది గుర్తిస్తుంది. ఈ యాప్ను మొబైల్ ఫోన్తో అనుసంధానం చేసుకోవచ్చు. అవసరమైతే నిపుణులకూ సమాచారం చేరవేస్తుంది. మన మూడ్ను బట్టి తగిన సలహాలను, సమాచారాన్ని ఇస్తుంది. ఆరోగ్యకరమైన అలవాట్లను కొనసాగించేందుకు, వ్యసనాలను దూరం చేసుకునేందుకు అవసరమైన చిట్కాలు అందిస్తుంది. ఇప్పటికే 35 వేల మంది ఈ టూల్ను వాడుతున్నారు.