Queen of Millet | ఒడిశా కోరాపుట్ జిల్లాకు చెందిన రాయిమతి ఘియురియాను ‘చిరుధాన్యాల మహారాణి’గా పిలుస్తారు. ఈ గిరిజన రైతు 72 దేశవాళి ధాన్యం రకాలను, 30 చిరుధాన్యాల రకాలను సంరక్షిస్తున్నారు. వీటిలో అరుదైన కుంద్రాబతి మండియా, జస్రా, జువానా, జంకోలీ రకాలు కూడా ఉన్నాయి. 16 ఏండ్లకే పెండ్లయినా, రాయిమతి చిరుధాన్యాల పట్ల తన ప్రేమను ఏమాత్రం వదులుకోలేదు. ఇంటిపనులు చేసుకుంటూనే పొలంలో వివిధ పంటలపై ప్రయోగాలు చేస్తూ వస్తున్నారు. ఏడాదికేడాది మెరుగైన పద్ధతులను అవలంబిస్తూ నాణ్యమైన చిరుధాన్యాలను పండిస్తున్నారు. దేశవాళీ విత్తనాల పరిరక్షణలో రాయిమతికి 70 ఏండ్ల కమలా పూజారి స్ఫూర్తిగా నిలిచారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత కూడా అయిన కమల దగ్గర దేశవాళీ విత్తనాల సంరక్షణ పద్ధతులను ఆకళింపు చేసుకున్నారు.
ఆమె సూచన మేరకే చెన్నై కేంద్రంగా పనిచేసే ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్లో చేరారు. అక్కడ విత్తనాల సంరక్షణలో ఆధునిక పద్ధతులు, గ్రామీణ మహిళల ఉపాధి లాంటి అంశాలపట్ల అవగాహన తెచ్చుకున్నారు. అందుకే “నేను బడిలో ఏం చదువుకున్నానో గుర్తులేదు. నాకు తెలిసిందల్లా విత్తనాలను భద్రపరచడం, వాటిని పండించడం మాత్రమే. సాగుభూమే నా బడి” అని నవ్వుతూ చెబుతారు రాయిమతి. తనకు తెలిసిన విద్య తనతోనే అంతరించిపోకుండా మరింత మందికి చేరువ చేస్తున్నారు. చిరుధాన్యాల సాగుపై ఇప్పటివరకు 2,500 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు. రాయిమతి జీవితం అంటే చిరుధాన్యాలే అన్నంతగా ఆమెకు పేరు వచ్చింది. ఇప్పుడామె మహిళా రైతుల సహకార సంఘాన్ని నడుపుతున్నారు.
చిరుధాన్యాల పిండివంటలు తయారుచేసి స్థానిక మార్కెట్లలో విక్రయిస్తున్నారు. అంతేకాదు, తనకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమిలో కొంతభాగాన్ని వ్యవసాయ పాఠశాల నిర్మాణం కోసం దానమిచ్చారు. గత ఏడాది ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సులో సంప్రదాయ వడ్లు, చిరుధాన్యాల రకాలను ప్రదర్శించే అరుదైన అవకాశమూ రాయిమతికి దక్కింది. ఆమె చొరవకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు అందాయి. “జాతీయ స్థాయి గుర్తింపు నన్ను మావాళ్ల మధ్య గొప్పగా నిలబెట్టింది. అంతర్జాతీయ నాయకుల ప్రశంసలకూ అర్హురాలిని చేసింది. ఈ గుర్తింపు మరిన్ని రకాలను సంరక్షించేలా, మన దేశ గౌరవాన్ని మరింత ఇనుమడించేలా నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది” అంటారు రాయిమతి.