శ్రుతి బాబు.. సొంతూరు కోయంబత్తూరు. బయో మెడికల్ ఇంజినీరింగ్ చదివింది. నాన్న పేరు కేకే బాబు. మెకానికల్ ఇంజినీర్. హఠాత్తుగా ఆయనకు పక్షవాతం వచ్చింది. కాళ్లూ చేతులూ పడిపోయాయి. పడుకుంటే మంచం మీద.. కూర్చోబెడితే వీల్ చెయిర్ మీద. దాదాపు ఐదేండ్లు..ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగం చేస్తూనే చివరి క్షణాల వరకూ తండ్రికి సేవ చేసింది. ఆ తర్వాత కూడా నాన్న గుర్తొచ్చేవారు. ఆయన పడిన కష్టాలు గుండెల్ని పిండేసేవి. ‘పక్షవాత రోగులు నలుగురిలా నడవలేకపోవచ్చు. కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికైనా వీలు కల్పిస్తే.. ఎంతో కొంత సౌకర్యంగా ఉంటుంది కదా!’ అనిపించేది.
ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధన ప్రారంభించింది. అనుభవం లేని రంగమే అయినా.. మలమూత్రాల్ని దానంతట అదే శుభ్రం చేసుకునే సాంకేతికతను జోడించింది. చేతులు ఉపయోగించాల్సిన అవసరమే ఉండదు. కుర్చీపై నుంచి మంచం మీదికి వాలడమూ సులభమే. ఆమె స్థాపించిన ధన్వంతరి ప్రైవేట్ లిమిటెడ్ ఎంతోమంది ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నది. ‘ఆంత్రప్రెన్యూర్షిప్ అంత సులభం కాదు. మహిళలకు అసలే కాదు. అలా అని వెనక్కి తగ్గాల్సిన పన్లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే’ అంటుంది శ్రుతి.