ఆమె పుట్టి పెరిగినదంతా రాజస్థాన్లోనే అయినా… హైదరాబాద్తో ప్రత్యేక అనుబంధం ఉంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ తర్వాత ఎమ్మెస్లో చేరడంతో ఈ మహానగరంతో దోస్తానా మొదలైంది. ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్లో చదువుతూనే.. వ్యాపార రంగం వైపు అడుగులు వేశారు. డ్రోన్ టెక్నాలజీకి కంప్యూటర్ పరిజ్ఞానాన్ని జోడించి మార్కెట్లో శరవేగంగా విస్త్తరిస్తున్నారు ప్రయూషి మాథుర్.
Startup Stories | రాజస్థానీ యువతి ప్రయూషి మాథుర్ అహ్మదాబాద్లోని నిర్మా యూనివర్సిటీ నుంచి బీటెక్ చేశారు. అమ్మ, నాన్న.. ఇద్దరూ ఉన్నత విద్యావంతులే. ఐఐటీ కోచింగ్ ఫ్యాక్టరీ కోటాలో పుట్టి పెరిగారు ప్రయూషి. ‘బాల్యం నుంచీ నాకంటూ కొన్ని కలలు ఉండేవి. ఉద్యోగమనే చట్రంలో ఇరుక్కుపోవద్దని ముందే నిర్ణయించుకున్నాను. కన్నవాళ్లు కూడా నా కలల్ని అర్థం చేసుకున్నారు. ఎంతో ప్రోత్సహించారు’ అంటూ తన నేపథ్యాన్ని వివరిస్తారు ప్రయూషి. ఇంజినీరింగ్ అనంతరం మాస్టర్స్ కోసం ట్రిపుల్ ఐటీ – హైదరాబాద్లో చేరారు. ప్రస్తుతం ఇక్కడే పీహెచ్డీ చేస్తున్నారు. మహా నగరం ఐటీ రంగంలో దూసుకుపోతున్న తీరు ఆమెను అబ్బురానికి గురిచేసింది. కేసీఆర్ సర్కారు ఆంత్రప్రెన్యూర్స్కు అందించిన ప్రోత్సాహం గొప్పగా అనిపించింది.
‘దేశంలో ఓ వంద స్టార్టప్స్ ప్రాణంపోసుకుంటే.. అందులో అరవై వరకూ హైదరాబాద్లో పుట్టుకొచ్చినవే. పెద్దపెద్ద కలలతో చిన్నగా అడుగులు వేయడం ప్రారంభించిన ఎంతోమంది స్వాప్నికులు పరిచయం అయ్యారు. ఘన విజయాలు, వైఫల్యాలు ఎక్కడైనా ఉండేవే. వాటిని దాటుకుని ముందుకు వెళ్లడంలోనే మన ప్రతిభ ఉంటుంది’ అంటారామె. ఆ గాథలన్నీ విన్నాక, కళ్లారా చూశాక ఆంత్రప్రెన్యూర్షిప్ వైపు అడుగులు వేయాలనే నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తును శాసించగలిగే శక్తి డ్రోన్ టెక్నాలజీకి ఉందని ఆమె భావించారు.
అప్పటికే తనకు పట్టున్న కంప్యూటర్ సైన్స్ను డ్రోన్ టెక్నాలజీకి జోడిస్తే కనుక.. కొత్తపుంతలు తొక్కించవచ్చనే అభిప్రాయానికి వచ్చారు. ‘అజ్నాహక్ ’ (ఐజేఎన్హక్) స్థాపనకు అదే కారణమైంది. అందులోనూ, ఇటీవలి కాలంలో డ్రోన్ల వినియోగం పెరిగింది. ప్రతిచోటా పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఓ మార్కెట్ అవకాశంగా మలుచుకోవాలని భావించారు ప్రయూషి. అనుకున్నదే ఆలస్యం, ఆలోచనలకు కార్యరూపం ఇచ్చారు.
సరుకుల డెలివరీ నుంచి వ్యవసాయం, రహదారులు, నీటి పారుదల, రక్షణ, రైల్వే, పవనశక్తి, జాగ్రఫికల్ సర్వేల్లోనూ డ్రోన్ల వినియోగానికి ఊతమిచ్చేలా తన కంపెనీని తీర్చిదిద్దారు. అచ్చంగా తనలానే ఆలోచించే కాజల్ సంక్లేచను తన ఆంత్రప్రెన్యూర్షిప్ ప్రయాణంలో భాగస్వామిగా చేసుకున్నారు. వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టూ.. లెక్కలకే పరిమితమైన ఫార్ములా. రెండు ఆలోచనలు కలిస్తే, ఇద్దరి భావాలు ఏకమైతే.. వ్యాపారంలో అద్భుతాలు సాధించవచ్చు. ‘అజ్నాహక్ ’ విజయ ప్రస్థానం నిరూపిస్తున్న విషయం ఇది.
మహిళలను ఆంత్రప్రెన్యూర్స్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఏర్పాటైన వీహబ్తో ప్రయూషి ప్రయాణం మొదలుపెట్టింది. ఇక్కడ నైపుణ్య శిక్షణ పొందాకే ఆమెకు స్పష్టత వచ్చింది. అజ్నాహక్ స్థాపనకు సరిపడా మనోబలం సమకూరింది. విహంగ వీక్షణం అని ఈ మాటకు అర్థం. ‘పోటీలో నిలబడేందుకు అవసరమైన సాంకేతికత, మార్కెటింగ్ నైపుణ్యాలు, కంపెనీ నిర్వహణపై సమగ్ర అవగాహన వీహబ్ వల్లే సాధ్యమైంది’ అంటారామె.
రాజస్థాన్, తెలంగాణతోపాటు మరిన్ని మెట్రో నగరాలను లక్ష్యంగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నారు. ‘స్టార్టప్గా ఎదగడంలో.. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఆంత్రప్రెన్యూర్స్లో కీలక బాధ్యతలు నిర్వహించే చేతన జైన్ సహకారం మరువలేనిది’ అని చెబుతారు ప్రయూషి. అన్నట్టు తను మంచి గాయని కూడా. సంగీతం మీదా పట్టుంది. ఆ పరిజ్ఞానంతోనే పియానో, తబలా మొదలైన వాద్య పరికరాల్ని యాప్ రూపంలో సృష్టించారు. క్యాంపస్ రోజుల్లో అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘మీ కలలే మీ జీవితం. ఎవరికోసమో మీ లక్ష్యాల్ని చంపుకోకండి. కాలేజీ రోజుల నుంచే ఆ వైపుగా ప్రయత్నాలు ప్రారంభించండి. ఇప్పుడు ఆంత్రప్రెన్యూర్షిప్నకు అనువైన వాతావరణం ఉంది’ అంటూ యువతను ప్రోత్సహిస్తారు ప్రయూషి.
మెరుగైన ఇంజినీరింగ్ నైపుణ్యాలు, అంతకుమించిన మానవ వనరులు, విస్తరించిన సాంకేతికత డ్రోన్ రంగంలో భారత్ కీలక పాత్ర పోషించేందుకు వీలు కల్పిస్తున్నది. ప్రధానంగా ఐటీ, ఫార్మా, డిఫెన్స్ వంటి రంగాలకు చిరునామాగా మారిన హైదరాబాద్ డ్రోన్ప్రెన్యూర్స్కు ఓ వేదికగా నిలుస్తున్నది. రానున్న రోజుల్లో ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు రానున్నాయని గట్టి నమ్మకంతో చెబుతారామె. అయితే పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా పరిశోధన కూడా జరగాలంటారు.