గుర్తింపు తెచ్చుకోవాలంటే ఐఐఎమ్లోనే చదవాలా? అవార్డులు అందుకోవాలంటే బహుళజాతి కంపెనీలే స్థాపించాలా? అవసరం లేదు. ప్రతిభ సరిపోతుంది. పట్టుదల తోడైతే విజయం దానంతట అదే వరిస్తుంది. సూర్యాపేటకు చెందిన నెమరుగొమ్ముల శిల్ప ‘’ విజయరహస్యం ఇదే. పట్టు చీరల వ్యాపారం చేసిన అనుభవంతో ఈ రంగంలోకి అడుగు పెట్టిందామె. ‘లీఫ్ టు క్లాత్’ కాన్సెప్ట్తో సక్సెస్ఫుల్ ఆంత్రపెన్యూర్గా ఎదిగింది.
సూర్యాపేటకు చెందిన నెమరుగొమ్ముల శిల్ప సాధారణ గృహిణి. డిగ్రీ వరకు చదివింది. పదిహేనేండ్లు పట్టు చీరల వ్యాపారం చేసింది. ఇది కాదు.. కొత్తగా ఇంకేమైనా చేయాలని సంకల్పించింది. మహిళలు అంతగా ఆసక్తిచూపని సెరికల్చర్ రంగంలో అడుగుపెట్టింది. భర్త రవీందర్ రావు సహకారంతో సూర్యాపేట పక్కనే ఉన్న తిమ్మాపురంలో తొమ్మిది ఎకరాలు కొనుగోలు చేసింది. మల్బరి సాగుకు ఆ నేలలు అనుకూలమో, కాదో తెలుసుకునేందుకు మట్టి పరీక్షలు చేయించింది. సానుకూలమైన ఫలితాలు రాగానే.. సేంద్రియ విధానంలో మల్బరి సాగు ప్రారంభించింది. గతంలో పట్టు పురుగుల గుడ్లను బెంగుళూరు, మైసూర్ తదితర ప్రాంతాల నుంచి రైతాంగం దిగుమతి చేసుకునేది.
ఈ పంట కాలపరిమితి ఇరవై రోజులే కావడంతో.. గుడ్ల సరఫరాలో ఆలస్యం కారణంగా నష్టాలు వచ్చేవి. దీంతో ఇక్కడే పట్టుగూళ్ల పెంపకాన్ని చేపట్టాలని నిర్ణయించుకుంది శిల్ప. మరింత నైపుణ్యం కోసం మల్బరి సాగు, పట్టుపురుగుల పెంపకంపై బెంగుళూరులో శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం, ప్రభుత్వ సహకారంతో ఛాకీ సెంటర్ను ఏర్పాటు చేసుకుని తిమ్మాపురంలోనే పట్టుగూళ్లను ఉత్పత్తి చేస్తున్నది. లాభాల బాటలో నడుస్తున్న వ్యాపారాన్ని చూసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గింపు ధరలో ఆటోమెటిక్ సిల్క్ రీలింగ్ మెషీన్ మంజూరు చేశాయి. అలా రూ.3 కోట్ల పెట్టుబడితో మౌలిక సదుపాయాలు సమకూర్చుకున్నది శిల్ప. గత నాలుగేండ్లుగా, ఇక్కడ ఏర్పాటు చేసిన రీలింగ్ మెషీన్పై పట్టు దారం తయారవుతున్నది. సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాలతోపాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు పట్టు గూళ్లు, దారాలు సరఫరా అవుతున్నాయి.
పెండ్లి వేడుకలైనా, పండగ సంబురాలైనా, శుభకార్యమైనా.. పట్టువస్ర్తాల రెపరెపలే ప్రత్యేకతను చాటుతాయి. అయితే వస్ర్తాల తయారీకి ఉపయోగించే ‘పట్టు’ దారం ఉత్పత్తి ఎంతో సంక్లిష్టమైన ప్రక్రియ. పట్టు గూళ్ల నుంచి దారాన్ని తీయడం.. దాన్ని వస్ర్తాల తయారీకి అనుగుణంగా రెండు మూడు పోగులు కలిపి పురివేయడం.. తదితర పనులన్నీ రీలింగ్ యంత్రంపై చేస్తారు. దీన్ని ‘లీఫ్ టు క్లాత్’ కాన్సెప్ట్తో సమర్థంగా నిర్వహిస్తున్నది శిల్ప. ఆమె నెలకొల్పిన ఎస్ఆర్ సిల్క్ కంపెనీ పట్టు దారాలను తయారుచేసే స్థాయికి ఎదిగింది. పట్టువస్ర్తాల తయారీ దిశగా కంపెనీని తీసుకెళ్లడమే తన లక్ష్యం అంటున్నది శిల్ప.
వీ హబ్ శిక్షణ కార్యక్రమాలు శిల్ప వ్యాపార అభివృద్ధికి దోహదపడ్డాయి. దీనివల్ల అకౌంటింగ్, మార్కెటింగ్, బ్యాంకింగ్ వంటి అంశాలపై అవగాహన పెరిగింది. ఆ నైపుణ్యమే ఆమెకు మహిళా పారిశ్రామిక వేత్తగా గుర్తింపు తెచ్చిపెట్టింది. జాతీయ స్థాయి పురస్కారంతోపాటు తెలంగాణలో ఉత్తమ రైతు, రైతుమిత్ర వంటి అవార్డులను అందుకున్నది శిల్ప. పత్తి లాంటి పంటలను సాగు చేసి నష్టపోయే బదులు, సెరి కల్చర్వైపు అడుగులు వేయాలని రైతులకు సూచిస్తున్నదామె. తెలంగాణలో ఈ పంటకు మంచి గిరాకీ ఉండటం వల్ల రెండు ఎకరాలు ఉన్న రైతు కూడా రూ.10వేల పెట్టుబడితో రూ.70వేల వరకు సంపాదించ వచ్చని సలహా ఇస్తున్నది. నిజానికి, పంట కాల వ్యవధి కూడా తక్కువే. దిగుబడి సొమ్ము వెంటనే చేతికి వచ్చేస్తుంది. రైతుకు అన్ని విధాలా లాభమే. ‘మూస ప్రయాణంతో ఎలాంటి ఫలితాలూ సాధించలేం. రైతులు సృజనాత్మకంగా ఆలోచించాలి’ అని సలహా ఇస్తున్నది శిల్ప.
…? గంజి ప్రదీప్కుమార్