RDF | మంచి ఉద్యోగం, పెద్ద ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలనుకునేవారు ఎంతోమంది. కానీ, ‘మాతో పాటు తోటివాళ్లూ బాగుపడాలి. మా కోసం కష్టపడే వారి పిల్లలు కూడా మాలాగే పెద్ద చదువులు చదవాలి’ అనే సదాలోచనతో.. సొంత డబ్బుతో బడి కట్టించి, విలువలతో కూడిన విద్యను బోధిస్తున్నారు రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ (ఆర్డీఎఫ్) వ్యవస్థాపకులు. ఆ సంస్థ ప్రతినిధిగా ఎర్రబెల్లి వందితా రావు యుధ్వీర్ స్మారక పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా గ్రామీణ అక్షరాస్యత దిశగా తమ సంస్థ ప్రయాణాన్ని వివరించారామె.
ఎర్రబెల్లి వందితా రావు, రామ్మోహన్ రావు, ఉదయ్కుమార్, సునీల్ కుమార్.. తదితరులంతా ఓ కుటుంబ సభ్యులు. వరంగల్ జిల్లాలోని కల్లెడ స్వగ్రామం. ఆ పరివారానికి వ్యవసాయ క్షేత్రాలు ఉండేవి. అక్కడ ఎంతోమంది పనిచేసేవారు. ఆ శ్రమజీవుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలి అనే సంకల్పంతో.. 1995లో ఎర్రబెల్లి కుటుంబ సభ్యులంతా కలిసి ఏర్పాటు చేసిన సంస్థ.. ఆర్డీఎఫ్ (రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్).
సరైన వసతులు, నిపుణులైన ఉపాధ్యాయులు లేకపోవడంతో.. చదువులకు దూరం అవుతున్న గ్రామీణ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాలని తీర్మానించారు వాళ్లంతా. ‘మాకు భూములున్నాయి. ఆస్తులున్నాయి. పెద్ద చదువులు చదివాం. మాకోసం జీవితాలను ధారపోస్తున్న శ్రామికుల పిల్లలు మాత్రం ఎందుకు ఉన్నత విద్య అభ్యసించకూడదు? వాళ్లకు మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత మాదే.. అనే సమష్టి ఆలోచనలోంచి పుట్టిందే ఆర్డీఎఫ్’ అని వివరిస్తారు ఫౌండేషన్ సీయీవో ఎర్రబెల్లి వందితా రావు. ఆ ప్రయత్నంలో నిపుణుల సలహాలు తీసుకున్నారు. ప్రత్యేకించి ఆంధ్ర మహిళా సభకు చెందిన లక్ష్మీచారి సహాయం మరువలేనిది అంటారామె. అప్పటికి కల్లెడ సర్కారు బడికి సరైన వసతులు లేవు. ఉపాధ్యాయుల కొరత వేధిస్తున్నది. ఈ పరిస్థితుల్లో సొంత భవనం నిర్మించి.. ఏడుగురు సిబ్బందితో పాఠశాలను ప్రారంభించింది ఆర్డీఎఫ్. తొలి ఏడాదే 80 మంది చేరారు. ఆ తర్వాత సిద్దిపేట జిల్లాలోని మాటెండ్లలో ఓ పాఠశాల ఏర్పాటు చేశారు. వరంగల్ జిల్లాలోనే రెడ్లవాడ, రోళ్లకల్ గ్రామాల్లోనూ స్కూల్స్ స్థాపించారు. అప్పటికే పదో తరగతి వరకు ఉన్న కల్లెడ పాఠశాలకు అనుబంధంగా జూనియర్ కాలేజీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆర్డీఎఫ్ బడులలో 2,300 మంది విద్యార్థులు చదువుతున్నారు. 193 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.
ప్రస్తుతం ఆర్డీఎఫ్ స్కూళ్లలో అన్ని వసతులూ ఉన్నాయి. పిల్లలకు మధ్యాహ్న భోజనం తప్ప. ప్రభుత్వం కానీ, దాతలు కానీ ముందుకొచ్చి శాశ్వత మధ్యాహ్న భోజనం అందిస్తే విద్యార్థులకు మంచి ప్రొటీన్ ఫుడ్ ఇచ్చినవాళ్లం అవుతాం.
– ఎర్రబెల్లి వందితా రావు సీయీవో, రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్
గల్లీకో ప్రైవేటు స్కూల్, కాలనీకో కార్పొరేట్ బడి కనిపిస్తాయి. అయినా, గ్రామీణ ప్రాంతాల్లో ఓ ఎన్జీవో ఏర్పాటు చేసిన పాఠశాలలో చేరేందుకు విద్యార్థులు ఎందుకంత ఆసక్తి చూపుతున్నారు? అసలు అక్కడేం బోధిస్తున్నారు? ఈ ప్రశ్నలకు ఆర్డీఎఫ్ సమాధానం ఒక్కటే.. నమ్మకం. ఆ ఆవరణల్లో పిల్లలు పుస్తకాలతో కుస్తీ పట్టరు. బట్టీయం ఉండదు. విద్యార్థుల ఆసక్తిని, నైపుణ్యాన్ని గుర్తించి ఆ దిశగా బోధిస్తారు. టీచర్లను కూడా కేవలం పట్టాల ఆధారంగా నియమించుకోరు. జీవన నైపుణ్యాలను నేర్పగలవారినే ఎంచుకుంటున్నారు. చదువులు, మార్కులు, ర్యాంకులకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. లైఫ్స్కిల్స్ బోధిస్తున్నారు. విలువల ప్రాధాన్యం వివరిస్తున్నారు. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడి ఉపాధ్యాయులు కూడా పిల్లలతో పాటుగా యూనిఫాంలోనే వస్తారు.
ఈ పాతికేండ్లలో ఆర్డీఎఫ్ బడులు ఎన్నో జీవితాలను మార్చాయి. కల్లెడలో చదివిన తొలిబ్యాచ్ విద్యార్థులు ఇప్పుడు అదే స్కూల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఇంటికో పట్టభద్రుడిని తయారు చేయాలన్నది ఆర్డీఎఫ్ లక్ష్యం. ఇప్పుడు ఆ కల నెరవేరుతున్నది. ఆర్డీఎఫ్ బోధన విధానం మంచి ఫలితాలనిచ్చింది. మట్టిలోంచి అనేక మాణిక్యాలు బయటికొచ్చాయి. ఆ ఆవరణలో చదివిన ప్రణీత విలువిద్యలో బీజింగ్ ఒలింపిక్స్ వరకూ వెళ్లింది.
దీప్తి జాతీయ స్థాయి అథ్లెటిక్స్లో పలు బంగారు పతకాలు సాధించింది. కిరణ్ అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. ఇస్లావత్ రాజు ఇండియన్ ఆర్మీలో హవల్దార్ హోదాలో దేశానికి సేవలందిస్తున్నాడు. ‘డాక్టర్లుగా, టీచర్లుగా, ఇంజినీర్లుగా విదేశాల్లో స్థిరపడినవారు ఎంతోమంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారూ అనేకం. యుధ్వీర్ సమష్టి కృషి ఫలితం. గ్రామీణ అక్షరాస్యతకు కృషిచేస్తున్న ప్రతి ఒక్కరిదీ’ అని చెబుతున్నప్పుడు వందితా రావు కళ్లలో వంద నక్షత్రాల వెలుగు!
-సుంకరి ప్రవీణ్కుమార్
– జి. భాస్కర్