కోరుకున్న జీవితం. ఆశించినంత జీతం. ముద్దులొలికే పిల్లలు. ముచ్చటైన కుటుంబం. ఇన్ని ఆనందాల మధ్య లోకం గురించి ఆలోచించే తీరిక ఎవరికి ఉంటుంది? మనసులో ఏ మూలనో ఉన్నా.. ఏదో ఓ సంస్థకు ఎంతోకొంత ఆర్థికసాయం చేసి సంతృప్తి చెందుతారు. హైదరాబాద్కు చెందిన దుర్గా కళ్యాణి మాత్రం తన సాయం పది మందికీ చేరాలనుకున్నారు. అది పది కాలాలూ నిలవాలని భావించా రు. ఓ అనాథ చిన్నారి కన్నీళ్లు తుడిచే క్రమంలో ఆమె నెలకొల్పిన ‘జగతి’ ఫౌండేషన్ పేదల ప్రగతికి బాటలు వేస్తున్నది.
సామాజిక సేవ.. దుర్గా కళ్యాణికి కొత్తకాదు. కాకపోతే, నలుగురితో కలిసి అడుగేయడమే కానీ, పదిమందీ తన వెంట నడిచిన సందర్భాలు లేవు. సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ మేనేజర్ స్థాయిలో 14 ఏండ్ల అనుభవం గడించారు దుర్గ. సంస్థ తరఫున కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కార్య కలాపాల్లో పాల్గొనేవారు. ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన ఆమె జీవితాన్ని మార్చేసింది. పూర్తిగా సమాజ సేవవైపు నడిపించింది. “మూడేండ్ల కిందట మా మామయ్యగారి జ్ఞాపకార్థం ఓ అనాథా శ్రమంలో అన్నదానం చేశాం. అక్కడున్న పిల్లలకు భోజనం వడ్డిస్తుండగా ఎవరిదో ఏడుపు వినిపించింది. మా పాపే అనుకొని కారు దగ్గరికి పరుగెత్తాను. కానీ, తను హాయిగా నిద్రపోతున్నది. అనాథాశ్రమంలోనే.. ఓ తొమ్మిది నెలల చిన్నారి గుక్కపట్టి ఏడుస్తున్నది. తనదీ మా పాప వయసే! సరైన పోషణ లేకపోవడంతో చాలా బలహీనంగా ఉంది. తనను చూడగానే గుండె తరుక్కుపోయింది. ఇంటికొచ్చాక కూడా.. నా బిడ్డకు అన్నం తినిపిస్తున్న ప్రతిసారీ ఆ చిన్నారే గుర్తుకొచ్చేది. ఆ క్షణంలోనే పసిపాపలకు, అనాథలకు అండగా నిలవాలనుకున్నా. జగతి ఫౌండేషన్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నా” అంటారు దుర్గా కళ్యాణి.
50వేల మంది విద్యార్థులకు..
కొవిడ్ సమయంలో సంస్థ తరఫున దుర్గా కళ్యాణి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. పోషకాహారం, ఔషధాలు అందించారు. కడుపు నిండా భోజనం పెట్టారు. అయినా ఏదో అసంతృప్తి. సమాజ సేవ కోసం ఉద్యోగం మానేయాలనుకున్నారు. ఆ నిర్ణయానికి భర్త వెంకటరత్న ఆనంద్ మద్దతుగా నిలిచారు. వెన్నంటి ఉన్నారు. ధైర్యంగా ముందుకు నడిపించారు. ఆ ఉత్సాహంతో జగతి ఫౌండేషన్ తరఫున మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం మొదలుపెట్టారు. హైదరాబాద్లో అనేక అనాథాశ్రమాలకు సాయం అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు రాష్ర్టాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. మూడేండ్లలో సుమారు 50వేల మందికి స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, స్టేషనరీ కిట్స్ పంపిణీ చేశారు. ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు స్కూల్ ఫీజులు కట్టడంతోపాటు సైకిళ్లు, ల్యాప్టాప్లు అందజేశారు. బడి మానేసిన పిల్లలు మళ్లీ పాఠశాలకు వెళ్లేలా ప్రోత్సహించారు. అక్షరాల విలువను చాటి చెప్పారు.
ఉపాధి కల్పన
మహిళా సాధికారత లక్ష్యంగా అనేక గ్రామాల్లో కార్యక్రమాలు చేపట్టారు దుర్గా కళ్యాణి. ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్న టైలరింగ్, బ్యూటీషియన్ విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఐటీ రంగంలో తనకున్న పరిచయాలతో విద్యావంతులైన యువతులకు ఉద్యోగాలు చూపించారు. నిరుపేద గర్భిణులకు తమ సంస్థ తరఫున సీమంతం చేయడమేకాకుండా, పోషకాహార కిట్స్ అందించారు. శిశువు ఎదుగుదలకు కావాల్సిన పోషకాహారం పంచు తున్నారు. ‘ఇక్కడితో నా బాధ్యత తీరిపోయిందని భావించడం లేదు. చేయాల్సింది చాలా ఉంది. నిరక్షరాస్యత సకల సమస్యలకూ మూలం. కాబట్టే, జగతి ఫౌండేషన్ ద్వారా బాలికా విద్యకు పెద్దపీట వేస్తున్నాం’ అంటారు దుర్గా కళ్యాణి.
భర్త ప్రోత్సాహంతో..
మా పెండ్లయ్యాక కొన్నాళ్లు నా చదువు ఆగిపోయింది. అయితే, మా ఆయన ప్రోత్సాహంతో మళ్లీ చదివాను. ‘ఉద్యోగం చేస్తాను’ అనగానే ‘సరే’ అన్నారు. సమాజానికి నావంతుగా ఏదైనా సాయం చేస్తానని చెప్పినప్పుడూ అంతే నిండు మనసుతో అండగా నిలిచారు. ఆయన సహకారంతోనే ‘జగతి’ ఫౌండేషన్కు పూర్తి సమయం కేటాయించగలుగుతున్నా. నిర్విఘ్నంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ఆర్థిక కారణాలతో నిరుపేద విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోయినా, పేద గర్భిణులకు పోషకాహారం అవసరమైనా.. 99637 41518 నంబర్కు వాట్సప్ చేస్తే మా బృంద సభ్యులు సంప్రదిస్తారు. దయచేసి, అనవసరమైన సందేశాలు పంపి మంచి కార్యక్రమానికి ఇబ్బందులు కలిగించొద్దు!
– దుర్గా కళ్యాణి