సాంకేతికత ముద్దుబిడ్డలు రోబోలు. రెస్టారెంట్, సినిమా థియేటర్, ఆఫీస్, ఫ్యాక్టరీ ప్రతిచోటా రోబోలదే రాజ్యం. సరిహద్దులలోనూ వాటిదే పహరా. సాంకేతిక రంగంలో వస్తున్న ఈ పెనుమార్పులను పదేండ్ల క్రితమే గుర్తించారు హైదరాబాద్కు చెందిన దేవులపల్లి ప్రసూన. ‘టిక్స్ రోబోటిక్స్’ అనే సంస్థను స్థాపించి బాల్యానికి సాంకేతిక శిక్షణ అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులనూ రోబో విద్యలో రాటుదేలుస్తున్నారు. ఆ అనుభవాలు ఆమె మాటల్లోనే..
మాది హనుమకొండ. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి మైక్రో బయాలజీలో పీజీ చేశాను. పెండ్లి తర్వాత మా ఆయన రవికుమార్ అమెరికా వెళ్లారు. ఆయనతోపాటు నేనూ బయల్దేరాను. నాలుగేండ్లపాటు అక్కడే ఉన్నాం. మా పిల్లలు.. సుహాస్, ఆర్ణవ్ చదువుకుంటున్న స్కూల్లోనే వలంటీర్గా చేశాను. అక్కడి విద్యార్థులు రోబోటిక్స్లో చాలా ముందుంటారు. ఆ స్థాయి పరిజ్ఞానాన్ని మన పిల్లలకూ అందించాలనిపించింది. స్వదేశంపై మమకారంతో 2011లో భారత్ తిరిగొచ్చేశాం. హైదరాబాద్లోని మియాపూర్లో ఉంటున్నాం. అమెరికా నుంచి వస్తూ ఓ రోబో తీసుకొచ్చాను. రోబోటిక్స్ నిపుణుల సహకారంతో ఏడాదిపాటు రోబోల పనితీరు అధ్యయనం చేశాను. నా పిల్లలకు రోబోటిక్స్పై అవగాహన కలిగించేందుకు మంచి సంస్థల కోసం చాలా ప్రయత్నించారు. ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆ బాధ్యత నేనే తీసుకున్నాను. వాళ్లకు గురువుగా మారాను. కొద్దిరోజులకే ఆ శాస్త్రం మీద వాళ్లు పూర్తి పట్టు సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఓ ఎగ్జిబిషన్లో ఐటీ మంత్రి కేటీఆర్ కూడా నన్ను ప్రశంసించారు. రోబోటిక్స్ను పదిమందికీ చేరువ చేయమని ప్రోత్సహించారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో 2016లో ‘టిక్స్ రోబోటిక్స్’ పేరుతో శిక్షణ సంస్థను ప్రారంభించాను.
ప్రతి చిన్నారిలో నిగూఢంగా ఉన్న ప్రతిభను వెలికితీసి.. రోబోటిక్స్పై లోతైన పరిజ్ఞానాన్ని పెంపొందించడమే మా సంస్థ లక్ష్యం. ఇందులో భాగంగా వినూత్నమైన రోబోలకు ప్రాణం పోశాం. ఇక్కడ రూపుదిద్దుకున్న ప్రతి రోబో ప్రత్యేకమైందే. ఆరేండ్లు పైబడిన ఎవరైనా మా దగ్గర శిక్షణ తీసుకోవచ్చు. సొంతంగా రోబోలను ఆవిష్కరించవచ్చు. ఈ ఏడేండ్లలో 20వేల మందికిపైగా శిక్షణ ఇచ్చాం. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లోనూ రోబోటిక్స్పై అవగాహన పెంచుతున్నాం. వివిధ పోటీల కోసం పిల్లలతో ఇప్పటివరకూ రెండొందలకు పైగా రోబోలను తయారు చేయించాం. ‘టిక్స్ రోబోటిక్స్’లో శిక్షణ పొందిన ఎంతోమంది పిల్లలు అంతర్జాతీయ వేదికలపై ప్రతిభ చూపుతున్నారు. అమెరికా, యూకే తదితర దేశాలలో శిక్షణ తీసుకున్న వారితో పోటీపడి మరీ, మనవాళ్లు గెలవడం సంతోషంగా అనిపిస్తున్నది. కార్పొరేట్ స్కూళ్ల పిల్లలను వెనక్కి నెట్టి మియాపూర్, మదీనాగూడ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నారు. ఇది ఎంతో మంచి పరిణామం. ఈ మార్పు గ్రామాల వరకూ విస్తరించాలి. పల్లెలు సైతం రోబోలను ఆవిష్కరించే రోజు రావాలి.
మా ప్రయత్నానికి వీహబ్ పూర్తి మద్దతు పలికింది. నెట్వర్కింగ్, మెంటర్షిప్ నా వ్యాపార విస్తరణకు దోహదపడ్డాయి. అనేక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలలో సెమినార్లు నిర్వహించే అవకాశాలనూ కల్పించింది. ఇక్కడితో ఆగకుండా.. విదేశాలకు విస్తరించాలన్నది నా సంకల్పం. మహిళ కెరీర్ను, కుటుంబ బాధ్యతలను వేరువేరుగా చూడాలి. రెండిటికీ సమన్యాయం చేయాలి. ఇదే నా సలహా.
…? గంజి ప్రదీప్ కుమార్