Katha – 2021 | “మీకోసం ఎవరో ఒక పెద్దావిడ, ఒకాయన వచ్చారు సార్! మిమ్మల్ని చూసి పోవాలని వచ్చారట” వినయంగా చెప్పాడు సెక్రటరీ జీవన్. “పెద్దావిడా!?..” ఆశ్చర్యంగా చూశాడు మూర్తి.
‘అమ్మేమో!?’ అన్న ఆశ.. మనసులో చిచ్చుబుడ్డిలా గుప్పున వెలిగి మరుక్షణమే ఆరిపోయింది.
అమ్మ ఎందుకొస్తుంది? అసలు ఎలా వస్తుంది?! తన గురించి అమ్మకు తెలిసే అవకాశమే లేదు. ఇందు అమ్మ ఊసే ఎత్తదు. ఉన్న ఒక్కగానొక్క సంతానం హృదయ్కి నానమ్మ గురించి తెలియనే తెలియదు. ఇంక తను లివర్ క్యాన్సర్తో ఆసుపత్రిలో ఉన్నట్టు అమ్మకెలా తెలుస్తుంది?!.. నిరాశగా వెనక్కి వాలాడు మూర్తి.
“ఇప్పుడు నాకు ఎవరితోనూ మాట్లాడే ఓపిక లేదు జీవన్. వాళ్లెవరో ఏమిటో నువ్వే కనుక్కుని, మాట్లాడి పంపించెయ్యి” అన్నాడు.
జీవన్ సరేనన్నట్టు తల ఊపి వెళ్లాడు. మళ్లీ ఐదు నిమిషాల్లో లోపలికి వచ్చి..
“ఆయన మీకిమ్మన్నారు సార్!”.. అంటూ చిన్న కాగితం ముక్క ఇచ్చాడు.
మూర్తి అనాసక్తిగానే చదివాడు..
‘మూర్తీ! నీ గురించి తెలిసి, అమ్మా నేనూ వచ్చాం.. – రాఘవ’..
అది చదువుతూనే ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు మూర్తి.
“వాళ్లను లోపలికి తీసుకురా జీవన్! తర్వాత తలుపులు వేసేసి నువ్వు వెళ్లిపో! బైట డోంట్ డిస్టర్బ్ బోర్డు పెట్టి, నర్స్కి చెప్పు. మూడు కప్పులు స్ట్రాంగ్ కాఫీ.. ఫిల్టర్ కాఫీ తెప్పించి లోపలికి పంపు!”.. గబగబా చెప్పి, నీరసం వచ్చినట్టు వెనక్కి జేరబడ్డాడు.
జీవన్.. మొహంలో ఆశ్చర్యం దాచుకుంటూ తల ఊపి వెళ్లిపోయాడు.
మూర్తి తలతిప్పి తలుపు వైపే దృష్టి కేంద్రీకరించాడు.
‘అమ్మ!.. ఇప్పుడు ఆ తలుపు తీసుకుని లోపలికి వస్తుంది అమ్మ! అమ్మను చూసి ఎన్నాళ్లు.. కాదు.. ఎన్నేళ్లయింది? కచ్చితంగా పదేళ్లు! అమ్మను తనింటి నుంచి గెంటేసి.. ఇరవై ఏళ్లు!! అవును.. ఒక మనిషి తనంతట తాను ఇంట్లోంచి వెళ్లిపోయే పరిస్థితులు కల్పిస్తే.. అది గెంటెయ్యడమే! ఇందు అలాంటి పరిస్థితుల్ని భేషుగ్గా కల్పించింది. తను చూసీ చూడనట్లు ఊరుకున్నాడు. అమ్మ.. నాన్న కూడా లేని అమ్మ! ఏకాకి అయి, అయినా సరే దర్జాగా వెళ్లిపోయింది. అమ్మ వెళ్లిపోయినందుకు తను ఏనాడూ బాధపడలేదు సరికదా.. అమ్మకు పల్లెలోనే బావుంటుందని కూడా అనుకున్నాడు. ఇదిగో.. వారం రోజుల క్రితం డాక్టర్ తనకు లివర్ క్యాన్సర్ అని ఖరారు చేశాక.. మళ్లీ అమ్మ పదే పదే గుర్తుకు రావడం మొదలైంది. పెద్దయాక కూడా తనకేమైనా ఒంట్లో బాగాలేకపోతే అమ్మ ఎలా లాలించేదో గుర్తొచ్చింది. ఈ యాభై ఏళ్ల వయసులో, మృత్యువు పొంచి చూస్తున్న వేళ.. మళ్లీ అలాంటి లాలన కోసం మనసు కొట్టుకుపోయింది! ఇప్పుడు అమ్మే తన పక్కన ఉంటే ఏం చేసేది?! ఏడుస్తూ కూర్చునేది మాత్రం కాదు! తనకు తెలుసు.. అమ్మ చాలా ధీరోదాత్తురాలు! ఆ పదానికి అర్థం ఏమిటో తనకు సరిగ్గా తెలీదు. కానీ అమ్మ మాత్రం అదే! కచ్చితంగా అదే!! అలాంటి అమ్మను తను వెళ్లగొట్టేశాడు! కన్నతల్లిని బాధపెట్టడం వల్లే తనకు ఈ జబ్బు వచ్చిందేమోనన్న పశ్చాత్తాపం.. మొదటి రోజు నుంచీ మూర్తిని బాధించసాగింది. ఉండబట్టలేక ఇందుతో అన్నాడు కూడా.
‘చాలా ఫూలిష్గా ఆలోచిస్తున్నారు మీరు. తల్లిదండ్రుల్ని చూడని వాళ్లందరికీ రోగాలొచ్చేస్తున్నాయా..?! మీ ఖర్మకొద్దీ మీకొచ్చింది అంతే!’ అన్నది ఇందు.
‘మీ ఖర్మ’ అన్న మాట వినగానే.. మూర్తికి చివుక్కుమనిపించింది.
‘మన ఖర్మ’ కాదు.. ‘మీ ఖర్మ’!! అవును. అంతేగా.
‘ఇందిరా ఫార్మా’ కంపెనీ అధినేత్రి ఇందిరామూర్తి. భర్త అనారోగ్యం కారణంగా కంపెనీ బాధ్యతలన్నీ భుజాన వేసుకుంది. కంపెనీకి వెళ్లాలంటే చక్కగా ముస్తాబవ్వాలి. నవ్వుతూ పనులు చక్కబెట్టాలి. ఆసుపత్రి గుడ్డలు వేసుకుని, సూదులు ఒంటికి గుచ్చుకుని, కదలా మెదలకుండా పక్కమీద పడి ఉండే ఖర్మ తనదే! తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. తెల్లగా, పొట్టిగా, బక్కపల్చగా ఉన్న ఆకృతి లోపలికి వచ్చింది. నిర్మలంగా ఉన్న ఆ మొహంలో.. కళ్లజోడు వెనుక నుంచీ కూడా ఆ చూపు ఎంత దయార్ద్రంగా ఉందో?! ఎంత నిష్కల్మషంగా, ప్రేమగా ఉందో?!
“అమ్మా!..” అప్రయత్నంగా చెయ్యి చాపాడు మూర్తి.
సావిత్రమ్మ చప్పున ముందుకొచ్చి కొడుకు చెయ్యి అందుకుంది.
“అమ్మా!..” మూర్తి కళ్లు నీళ్లతో నిండిపోయాయి.
“నేనూ నాన్న దగ్గరికి వెళ్లిపోతున్నానమ్మా!”..
“నీ మొహం!”.. సావిత్రమ్మ ప్రేమగా కొడుకు బుగ్గలు పుణికింది.
“నన్ను దాటించకుండా నువ్వెక్కడికి వెళతావురా.. నా పూజలన్నీ ఏమైపోవాలీ?” అంటూ పక్కనే ఉన్న రాఘవ వైపు చూసి నవ్వింది.
“చిన్నప్పటి నుంచీ ఇంతే.. ఉత్త భయస్థుడు”..
రాఘవ కూడా స్నేహితుడి వైపు చూస్తూ చల్లని వెన్నెల లాంటి నవ్వు నవ్వాడు.
అమ్మ మాటకు ఒక్కసారిగా పుంజుకున్నాడు మూర్తి. ధైర్యాన్ని సిరంజిలోకి ఎక్కించి, నరాల్లోకి పంపించినట్టయింది. అవును.. ఇప్పట్లో తనకేమీ కాదు. అమ్మ ఎక్కడున్నా తను బావుండాలని పూజలు చేస్తూనే ఉంటుంది. డాక్టర్లు చెబుతూనే ఉన్నారు కదా..
‘చాలా ఎర్లీ స్టేజి! భయపడవలసిందేమీ లేదూ!’ అని.
అది అమ్మ పూజల వల్లే! అమ్మ ఎంత నిష్ఠగా పూజ చేస్తుందో తనకు తెలుసు. ఇందుకు షో ఎక్కువ. వరలక్ష్మి వ్రతానికి లక్ష రూపాయల దాకా ఖర్చు చేస్తుంది. నిత్యపూజ మాత్రం సున్నా.
“అమ్మా.. నీకెలా తెలిసింది?!”.
“కాకొచ్చి కబురు చెప్పింది గానీ.. నేను నీ దగ్గర ఓ వారం రోజులు ఉందామనుకుంటున్నానురా నాన్నా!”.
“అమ్మా!”.. మూర్తి ఆనందం రెట్టింపు అయింది.
“నన్ను చూసేసి వెళ్లిపోతావేమోనని భయపడుతున్నానమ్మా!”..
“పిచ్చితండ్రి! అలా ఎలా వెళతాను? వీలైతే నిన్ను నాతోబాటు తీసుకువెళ్లాలని ఉంది నాకు!”.
మూర్తి మాట్లాడలేదు.. అయిష్టతతో కాదు!
‘అమ్మతో కలిసి వెళతానా!?’ అన్న అపనమ్మకంతో.
కాఫీలొచ్చాయి. డాక్టర్ వచ్చి వెళ్లాడు! రాఘవ స్నేహితుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. తల్లీకొడుకూ మిగిలారు.
“కాలక్షేపానికి విను..!” సావిత్రమ్మ తన సెల్ కొడుకు తల పక్కన పెట్టింది.
‘న కాంక్షే విజయం కృష్ణ.. నచ రాజ్యం సుఖానిచ’.. ఘంటసాల భగవద్గీత వస్తున్నది.
“అమ్మా!”.. చప్పున మళ్లీ మృత్యుభయం కమ్ముకుంది మూర్తిని.
“నేను చచ్చిపోతానని.. చచ్చిపోయే ముందు భగవద్గీత వినిపిస్తున్నావా..?!”.
సావిత్రమ్మ చల్లగా నవ్వింది.
“ఇంచుమించు నలభై ఏళ్ల నుంచీ భగవద్గీత నిత్యం పారాయణ చేస్తున్నాను నేను. చచ్చిపోతాననే చదువుతున్నానా?!”.
మూర్తి మాట్లాడలేదు!
“ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఈనాడు చెబుతున్నారు చూశావా.. యుగయుగాల కిందటే ఆ ఆర్ట్ను గ్రంధస్థం చేసి మనకు అందించాడు కృష్ణ పరమాత్మ! ‘ఆ స్వామి ఉన్నాడూ!’.. అని నువ్వు ఎంత దృఢంగా నమ్ముతావో, సమస్త రకాల బాధల నుంచీ నువ్వు అంత దూరమవుతావు! శారీరకంగా సుఖపడటానికి సంపాదన ఎంత అవసరమో, మనశ్శాంతికి ఆధ్యాత్మికత అంత అవసరం! పెద్దవాళ్లు మనతో బాటే ఉంటే, మన చెయ్యి పుచ్చుకుని ఆధ్యాత్మికత బాట పట్టిస్తారు! నేనిప్పుడు చేస్తున్నది అదే! ప్రశాంతంగా, ఏమీ ఆలోచించకుండా విను! నీ మనసుకు శాంతి దొరుకుతుందో లేదో చూడు!”.
మంత్రముగ్ధుడిలా తల్లి మాటలు విన్నాడు మూర్తి. ఇహ తర్కించకుండా భగవద్గీత వినడం ప్రారంభించాడు.
‘దేహినోస్మిన్ యధా దేహి.. కౌమారం యవ్వనం జరా..’
అవును. చిన్నప్పుడు పరిగెడుతూ క్రికెట్ ఆడిన శక్తి తనకిప్పుడు లేదు. బాల్యం, యవ్వనం దాటేశాడు. బీపీ, షుగర్ శరీరాన్ని లొంగదీసుకున్నాయి. స్టేజి మీద తన పాత్ర చివరికి వస్తుంటే.. ఇహ తెర వెనక్కి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వేరే ఎవరో చెప్పాలా?! ఎటూ తెరమరుగవడం తప్పనిసరి అయినప్పుడు, ఏ రకంగా అయితేనేమీ?!
“అమ్మా!”..
“ఏమిటి నాన్నా?!”.
“డిశ్చార్జ్ చేశాక.. నువ్వూ, నేనూ కలిసి మన ఊరు వెళదాం! నీ దగ్గర కొన్నాళ్లుంటానమ్మా”.
* * *
చిన్న డాబా ఇల్లు! ముందు వైపు మధు మాలతి, సన్నజాజి, విరజాజి, వెనుక వైపు ఆనప, బీర, కాకర తీగెలతో కప్పుకొని పోయి, లతాగృహంలా కనిపిస్తున్నది. విశాలమైన పెరట్లో.. తూర్పున గోశాల. తాటాకు కప్పిన ఆ పాక మీద కాశీరత్నం పూలతీగ నిండుగా విస్తరించి, పాకలో గోమాతకు పువ్వుల గొడుగు పట్టినట్టుంది! ఇంట్లో కాలు పెడుతూనే పెరట్లో నూతి దగ్గరికి వెళ్లి, అక్కడి గోలెంలో నీళ్లతో కాళ్లూ, చేతులూ, మొహం కడుక్కుని, గోశాల వైపు నడిచింది సావిత్రమ్మ. చిన్నపిల్లాడిలా తల్లి వెనక వెనకే వస్తున్న మూర్తి.. తనూ కాళ్లూ, చేతులూ కడుక్కుని, గోశాలలోకి వెళ్లాడు!
“బావున్నావా తల్లీ!”.. ఆవు గంగడోలు నిమురుతూ ఆప్యాయంగా అడిగింది సావిత్రమ్మ.
ఆవు ఆమె రాకకు ఆనందిస్తున్నట్టు మెడ సాచి సావిత్రమ్మకు మరింత దగ్గరగా మొహం పెట్టింది.
పక్కనే మరో చిన్న గుంజకు కట్టేసి ఉన్న దూడ, తల్లిని రాసుకుంటూ ముందుకొచ్చి.. సావిత్రమ్మను తలతో పొడిచింది.
“అయ్యో! నిన్ను మర్చిపోలేదురా నాన్నా..” సావిత్రమ్మ వంగి దూడను నిమురుతూ ముద్దు చేసింది.
“ఇది సురభి! ఈ బుజ్జి దూడ గౌరి!” అని కొడుక్కి చెబుతూ, జబ్బ పట్టుకుని సురభి దగ్గరగా తీసుకువెళ్లింది.
మూర్తి చెయ్యి పట్టుకుని సురభి గంగడోలు నిమిరించింది. తర్వాత చేతులు జోడించి నమస్కారం చేస్తూ..
“అమ్మా! సురభీ! నీకు తెలియనిదేముంది. వీడు నా ఒక్కగానొక్క పిల్లాడు! వీణ్ని చల్లగా చూడాలి నువ్వు!” అన్నది.
రాత్రి పడుకోబోయే ముందు ఏలకపొడి, కలకండ కలిపిన గోరువెచ్చని ఆవుపాలు పెద్ద వెండిగ్లాసు నిండా తెచ్చి కొడుకు చేత తాగించింది.
ఆ మర్నాటి నుంచీ మూర్తి దినచర్య సరికొత్తగా మొదలైంది. తెల్లవారుజామునే అమ్మతోబాటు లేవడం, స్నానం చేసి, దేవుడి ముందు దీపం వెలిగించి.. ఒక పావుగంట సేపు నిశ్చలంగా ధ్యానం చేయడం. తర్వాత వేడిగా కాఫీ తాగి, గోశాలకు వెళ్లి, సురభి, గౌరి ఇద్దరి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి.. సురభి గంగడోలు నిమురుతూ మృత్యుంజయ మహా మంత్రాన్ని ముమ్మారు చెప్పడం. అదయ్యాక.. అలా పొలాల వైపు వాకింగ్! సావిత్రమ్మ కబురంపగా వచ్చిన ఆయుర్వేద వైద్యుడు ఏదో లేహ్యం, గుళికలూ ఇచ్చాడు. వేళకల్లా అవి వేసుకోవడం. అమ్మ పెట్టే సాత్వికాహారాన్ని తీసుకోవడం! రెండు పూటలా గోరువెచ్చని ఆవుపాలు తాగడం! సావిత్రమ్మ ఒక్కక్షణం కూడా ఖాళీగా ఉండదు. వంటపని అయిపోతే భాగవతమో, రామాయణమో చదువుకుంటుంది. ఇంటికి ఎవరో ఒకరు ఏదో ఒక సలహా కోసం వస్తూనే ఉంటారు. అదీగాక.. మధ్యాహ్నం మూడు దాటాక బోలెడు మంది ఆడవాళ్లు, మగవాళ్లు వస్తారు. వాళ్లందరినీ కూర్చోబెట్టి రామాయణం, భాగవతం చెబుతుంది. సాయంత్రం మళ్లీ స్నానం, ధ్యానం. రాత్రికి గ్లాసెడు గోరువెచ్చని పాలు మాత్రమే ఆహారం!! తల్లి బుక్షెల్ఫ్లో కొన్ని ఇంగ్లీషు పుస్తకాలు కూడా కనిపించాయి మూర్తికి. ‘ఇవి ఎవరు చదువుతారా!?’ అనుకున్నాడు. ఇంతలో ఒకరోజు కొడుక్కు ఒక పుస్తకం తీసుకొచ్చి ఇచ్చింది సావిత్రమ్మ. అదేమిటా అని మూర్తి కుతూహలంగా చూశాడు.
‘Holi Cancer’.. అమిత్ వైద్య అనే వ్యక్తి రాసిన పుస్తకం అది.
‘Holi Cancer’.. How a Cow saved my life.. అని ఉంది.
“చదువు! చాలా బావుంది” తల్లి చిరునవ్వుతో చెప్పింది.
చాలా బావుందా!?.. నువ్వు చదివావా?!” ఆశ్చర్యంగా అడిగాడు మూర్తి.
“అమ్మా.. నువ్వు ఇంగ్లిష్ నేర్చుకున్నావా!? ఎప్పుడూ.. ఎవరు నేర్పారు?!” మూర్తి ఆశ్చర్యానికి అంతు లేదు.
“చెబుతాను విను! ఆరోజు ఆసుపత్రిలో.. ‘నా గురించి నీకు ఎలా తెలిసిందీ!?’ అని అడిగావు కదా!?”..
“అవును”..
“నాకు ఇంగ్లిష్ నేర్పిందీ.. నేను వాడుతున్న స్మార్ట్ఫోన్ నాకు కొనిచ్చి.. దాని వాడకం నేర్పిందీ, నీ గురించి నాకు చెప్పిందీ ఒకరే!”..
“ఎవరమ్మా!?”.. మూర్తి కుతూహలం రెట్టింపు అయింది.
“చెబుతున్నా! నేను నీ దగ్గర నుంచి వచ్చేశాక, నాకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకున్నాను. పూజా పునస్కారాలు, గోసేవ నాకు మొదటి నుంచీ ఇష్టమైన విషయాలు. భాగవతం, రామాయణం చదువుకుంటూ, తెలియనివి నేర్చుకుంటూ, తెలిసినవి నలుగురికీ చెబుతూ కాలక్షేపం చేస్తున్నాను. అలా ఉండగా ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది. ‘నానమ్మా! నేను నీ మనవణ్ని’ అన్నాడు అవతలి నుంచి. నేను నిలువునా చలించిపోయాను. నేను వచ్చేసే సమయానికి వాడు ఏడాది వాడు. ఇప్పుడు ఇరవై ఏళ్లు నిండిన యువకుడు! ‘నానమ్మా.. నేను నీ దగ్గరికి రావచ్చా!?’ అని అడిగాడు. కళ్లనీళ్లొచ్చాయి నాకు. రమ్మన్నాను. వచ్చాడు. ‘మా ఇంట్లో ఎవ్వరూ ఉండరు! ఆ సైలెన్స్.. ఐ హేట్ నానమ్మా!’ అని వాడు అంటూంటే నాకు మీ నాన్నగారే గుర్తొచ్చారు. ఇల్లనేది సందడిగా ఉండాలనేవారాయన. అప్పుడే అంతా బావుంటుంది అనేవారు. హృదయ్.. ‘మనింట్లో ఎవరూ ఎందుకు లేరు!?’ అని మిమ్మల్ని అడిగి, నీ సెల్లో నా ఫోన్ నంబర్ పట్టుకుని.. మీకు చెప్పకుండా ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్ పేరుతో ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు కనీసం రెండు నెలలకోసారైనా వస్తాడు. సురభి, గౌరి వాడు పెట్టిన పేర్లే! ఈ ఇల్లు ప్రస్తుతం నడుస్తున్నది వాడి ఊపిరితోనే!!”..
మూర్తి నోట మాట రాలేదు! కానీ రక్తం ఉరకలేస్తున్నది. గుండె గంగావతరణంలా.. ‘తొందర తొందర నడకల వెను వెన్కనె వేల్పుటేరు’లా పొంగుతున్నది!!
* * *
పదేళ్ల తర్వాత.. ‘ఇందిరా ఫార్మా’ కంపెనీ అధినేత హృదయ్ తండ్రి రామమూర్తి షష్టిపూర్తి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి! ఎనభై ఏళ్ల ముదివగ్గు మూర్తి తల్లి సావిత్రమ్మ సోఫాలో కూర్చుని ఉంది. మూర్తి లేచి..
“నేను ఎక్కువగా మాట్లాడటానికి ఏమీ లేదు గానీ, రెండే రెండు మాటలు చెబుతాను. మొదటిది.. మీ ఇళ్లలో పెద్దవాళ్లు ఉంటే వాళ్లను పెన్నిధిలా కాపాడుకోండి. మనం ఎలా బతకాలో.. ఎలా బతికితే జీవిస్తామో చెప్పగలిగేది వాళ్లే! రెండోది కోరిక తీరడం కోసం భగవత్ప్రార్థన చెయ్యకండి. ఫలితం ఉండదు. మిమ్మల్ని మీరు సంపూర్ణంగా తీర్చిదిద్దుకోవడం కోసం ఆ పరమేశ్వరుణ్ని ఆశ్రయించండి. ఫలితం చక్రవడ్డీలా పెరుగుతుంది!! ఇక అందరూ లేచి తృప్తిగా భోజనం చెయ్యండి!” అన్నాడు.
సావిత్రమ్మ, హృదయ్ ఇద్దరూ చిరునవ్వుతో ఒకరినొకరు చూసుకున్నారు!
‘అనన్యాశ్చింతయంతో మాం..’ మైక్లోంచి ఘంటసాల స్వరంతో శ్రీకృష్ణ పరమాత్మ పలుకుతున్నాడు!
* * *
లక్ష్మీ గాయత్రి స్వస్థలం విశాఖపట్నం. 1980లో ఇంగ్లిష్ లిటరేచర్లో డిగ్రీ పట్టా అందుకున్నారు. విశాఖపట్నంలోని ఒక లోకల్ పేపర్లో పన్నెండేళ్లపాటు పాత్రికేయురాలిగా పనిచేశారు. రాసినవి తక్కువ కథలే అయినా.. పాఠకుల మన్ననలు పొందాయి. లక్ష్మీ గాయత్రి.. చందమామ రచయిత్రి. 1983 నుంచి దాదాపు 30 సంవత్సరాలపాటు చందమామ పిల్లల మాసపత్రికలో అనేక కథలూ, సీరియల్స్ రాశారు. అన్నిటికంటే పెద్ద సీరియల్.. ‘స్వర్ణ సింహాసనం’ 2000 సంవత్సరంలో ప్రచురితమైంది. ఆంధ్ర పత్రికతోపాటు స్వాతిలో కొన్ని కథలు ప్రచురితమయ్యాయి. కొన్ని స్థానిక కథల పోటీలతోపాటు ఈనాడు ఆదివారం అనుబంధం కథల పోటీ, అమెరికాకు చెందిన ఆన్లైన్ మ్యాగజైన్ నిర్వహించిన పోటీలోనూ బహుమతులు గెలుచుకున్నారు. భగవంతుని పట్ల తనకున్న ప్రగాఢ విశ్వాసం, హిందూ సంస్కృతి, సంప్రదాయాలపట్ల ఉన్న గౌరవం, అనురక్తి.. ‘యోగక్షేమం వహామ్యహమ్’ కథకు మూలస్తంభాలు అంటారు రచయిత్రి.