Katha – 2021 | మా ముందు సిరిమాను కట్టెల మంట.. మా గొంతులో దిగుతున్న ఇప్పసారాయిలా భగభగ మండుతున్నది. రాత్రిపూట అడవిలో నుంచి వీచే తేమలో అడవిపూల సువాసన కలిసిపోయి, ఉత్సవ సౌరభంలా మమ్మల్ని చుట్టేస్తున్నది. పక్కనే నిప్పులమీద కుతకుత ఉడుకుతున్న నాటుకోడి కూర వాసన.. ఆకలిని కేకవేసి మరీ లేపుతున్నది. ఇంద్రారెడ్డి బ్లూటూత్ స్పీకర్లో నుంచి వినిపించే సూఫీ సంగీతం.. ఆ వాతావరణాన్ని ఇహలోకపు అంచులు దాటించే ప్రయత్నం చేస్తూ ఉన్నది.
నాగరిక ప్రపంచానికి దూరంగా, చుట్టూ ఎత్తయిన గుట్టల మధ్య.. లోతైన లోయలతో ఆవరించి ఉన్న “లొహార” అనే గిరిజనగూడెంలో మా గౌడ్ భూమన్న ఏర్పాటు చేసిన బస ముందు.. నెగడు చుట్టూ కూర్చున్నాం.
“భూమన్నా! నిజంగా ఇది ఆరోగ్యానికి మంచిదేనంటావా?”.. అప్పటిదాకా ఇప్పసారా రుచిచూడని బాపురెడ్డి అడిగాడు.
“ఒట్టు సార్! ఇది తబియత్కు చాలా మంచిదని మా పెద్దలు జెప్తరు. కడుపుల ఏ రోగమున్నా తక్వయిపోతదట! అయితే ఎంత తాగాల్నో గంతే తాగాల! మందును మందుమెరంగ తాగితేనే.. మందు మెరంగ పనిచేస్తది సారూ!”..
ఇప్పసారా మహత్యాన్ని వివరిస్తూ, చిన్న గాజుగ్లాసులో పోసి బాపురెడ్డికి అందించాడు భూమన్న.
ఒక్క గుటక వేశాడో లేదో..
“హమ్మో ఘాటు!” అంటూ అరిచాడు.
మన్న ఇంకొన్ని నీళ్లు కలిపి ఇచ్చాడు. ఆయుర్వేదంలో ఇప్పసారా గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తారు. దానికి తగ్గట్లు ఇక్కడి గ్రామీణ ప్రాంత ఆయుర్వేద వైద్యులు.. కొన్ని మొండి వ్యాధులకు మూలికల రసాన్ని ఇప్పసారాలో కలిపి రోగులతో తాగిస్తారు. ఇప్పసారాతో కలిసిన ఔషధం నేరుగా రక్తంలోకి ప్రవేశించి.. రక్త దోషాలను నివారిస్తుందట!
ఈ లోపు భూమన్న చెరో ప్లేటు అందించి, వేడి వేడి కోడి పులుసూ, చెరో రెండు జొన్న రొట్టెలను వడ్డించాడు. ఈ విందు భోజనం గానీ, ఈ వాతావరణం గానీ ఎన్ని వేలూ, లక్షలు పెట్టినా.. ఏ ఫైవ్స్టార్ హోటళ్లలోనూ దొరకదనీ, స్టార్ హోటళ్ల చరిత్ర తెలిసిన ఇంద్రారెడ్డి వ్యాఖ్యానించాడు. ఇక కాలేజీలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్న రాధాకృష్ణ.. అప్పటికప్పుడు మా మిత్రుల కలయిక గురించీ, అక్కడి వాతావరణం, ప్రకృతి అందాల గురించి ఆశువుగా కవిత్వం వినిపిస్తున్నాడు.
“ఇప్పసారా మనవాడితో మంచి కవిత్వాన్నే పలికిస్తున్నది” అని బాపురెడ్డి పరిహాసమాడితే..
“ఇప్పటిదాకా నువ్వు రాసిన కవితలలో ఇదే తోపు!” అని కమల్ ప్రశంసించాడు.
కమల్, రాధాకృష్ణ టీచింగ్ ప్రొఫెషనల్లో ఉంటే.. బాపురెడ్డి మంచి డాక్టరు. ఫిజీషియన్. ఇక ఇంద్రారెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. ఫొటోగ్రఫీలో, డాక్యుమెంటరీలు రూపొందించడంలో మాస్టర్! ఇక నాకు.. సంగీత సాహిత్యాలంటే ఇష్టం. చేసే ఉద్యోగం వీటికి పూర్తిగా వ్యతిరేకం. ఇట్లా రకరకాల వృత్తులూ, ప్రవృత్తులూ కలిసి ఉన్నప్పటికీ.. మేమంతా బాల్య స్నేహితులం. పొట్ట చేతపట్టుకొని తలోవైపుకి చెదిరిపోయాం. కొంత కుదురుకున్నాక ఇదిగో ఇలా అప్పుడప్పుడూ కలుసుకుని రెండు రోజులు గడుపుతాం. ప్రతిసారీ పట్నాల్లో, లాడ్జీల్లో, హోటళ్లలో కలుసుకునే మేము.. ఈసారి ఇలా కలుద్దామని కమల్ ప్లాన్ చేశాడు. నా వృతిరీత్యా ఈ ప్రాంతమంతా నేను తిరిగిందే కాబట్టి నాకు అదంతా కొత్త కాదు.
“ఏయ్! ఇంద్రారెడ్డి! ఇక ఆ సూఫీని ఆపెయ్! మూడుకు తగిన క్లాసిక్ ఏదన్నా వినిపించు! ‘దర్బారీ కానడా’లో అదేదో మన్నాడేది ఉందికదా ! అది వినిపించు!”..
నేను అనడమే ఆలస్యం అందరూ.. ‘అదే అదే కావాలి!’ అన్నారు.
మన్నాడే.. మా అందరిలో తన అద్భుతమైన గమకాలను పొదువుతున్నాడు.
“భూమన్నా! ఓ భూమన్నా!”..
జంగుపటేల్ గాబరాగా అరుస్తూ వచ్చాడు.
వాళ్ల భాషలో భూమన్నతో ఏదో చెప్పాడు. రెడ్డి పాట ఆపేశాడు.
“సార్లూ! ఇక మీరంతా లోపలికి పోండి! చిత్తపులి వచ్చిందట! అగో ఆ గుట్ట మీద గూసొని ఒర్లుతున్నదట! మావోళ్లు ఇప్పుడే మంచెల మీదికెల్లి లొల్లి జేస్తున్నరు. చిత్తపులి.. పిల్లిమెరంగ నంపువెట్టి ఎప్పుడు ఎటస్తదో తెల్వది. లెవ్వుండ్రి! లెవ్వుండ్రి!”..
భూమన్న ప్లేట్లు, గిన్నెలూ సర్దేస్తున్నాడు.
హఠాత్తుగా గూడెంలో ఒకవైపు కుక్కలు భౌభౌమని కోరస్గా మొరగసాగాయి. అవి అంత భయంకరంగా మొరుగుతున్నాయంటే.. వాటికి చిరుతపులి కనిపించిందన్న మాటే! పక్కన ఉన్న గుడిసెల వాళ్లులేచి గట్టిగా తుడుం, డోలు మోగిస్తూ.. అరుస్తున్నారు. ఈ గూడెంలో లొల్లి గమనించిన కూతవేటు దూరంలోని గూడేలవాళ్లంతా మేల్కొని.. మేకల కొట్టాల వద్ద, పశువుల కొట్టాల వద్ద పెద్దపెద్ద మంటలు వేస్తున్నారు.
క్షణాలలో వాతావరణం మారిపోయింది!
మేం పరుగు పరుగున తట్టా బుట్టా సర్దుకొని, కమ్యూనిటీ హాలులాంటి మా బసలోకి దూరి తలుపులు బిడాయించుకున్నాం. ఆ తలుపులకు లోపలి నుంచి గడియ లేదు. తలుపులకు ఆనుకుని కమల్ మంచం వేసుకొని పడుకున్నాడు. ఇంద్రారెడ్డి కిటికీ దగ్గర కెమెరా పట్టుకుని.. ‘షూట్ ఎట్ సైట్’ లాగా కాపు గాసున్నాడు. నేనూ, రాధాకృష్ణ, బాపురెడ్డి.. మంచాల్లో నడుం వాల్చాం.
ఉదయం గూడెంవరకు కార్లలో వచ్చిన మా బృందం దినమంతా ట్రెక్కింగ్ చేస్తూ.. చుట్టు పక్కల ఉన్న చిన్నచిన్న జలపాతాల అందాలను ఆస్వాదించాం. అడవిలో గలగలా పారే వాగులోని స్వచ్ఛమైన నీటిలో చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టాం.
భూమన్న మా మధ్యాహ్న భోజనం దారిలో ఉండే రాజుల గూడెంలో ఏర్పాటుచేశాడు. మసాలా వంకాయ, జొన్నరొట్టె, ముద్దపప్పు, పచ్చిపులుసు చారు, రాగటి వడ్ల బువ్వ, గడ్డ పెరుగు. మసాలా కంటే వంకాయనే రుచిగా ఉంది. రాగటి వడ్ల ఎర్రబువ్వతో గడ్డ పెరుగు కలిపి.. అంచుకు పచ్చిమిరప – నువ్వుల చట్నీ వేసుకొని తింటే ఆ రుచులే వేరనిపించాయి. చాలా రోజుల తర్వాత మా పట్నం మిత్రులు.. ‘దిల్ ఖోల్కే’ తిన్నారు. తమకున్న షుగర్, బీపీలు కూడా మర్చిపోయినట్లున్నారు. ఉదయం నుంచి తిరుగుతూ అలసిపోయి ఉన్నామేమో.. ఆ గూడెంలో వేపచెట్టు చుట్టూ ఉన్న అరుగు మీద తువ్వాల్లు పరుచుకొని ఓ కునుకు కూడా తీసేశాం. లేచి వట్టివేర్ల డికాక్షన్ తాగి సూర్యాస్తమయం చూసేందుకు ‘దార్లొద్ది’కి బయల్దేరాం. ఎత్తు నుంచి చూస్తే బాగా లోతైన లోయ. ఆ లోయ చివరన సూర్యుడు.. మరోచిన్న గుట్ట చాటుకు అస్తమిస్తున్నాడు. మా ఇంద్రారెడ్డి కెమెరా అలుపు లేకుండా పనిచేసింది. ఇప్పుడు వచ్చిన చిరుతపులి మాకు దార్లో ఎదురైవుంటే.. ఒక్కసారి ఒళ్లు జలదరించింది. మమ్మల్ని కాపాడటానికి మాగైడ్ భూమన్న ఉన్నాడన్న ధైర్యమే.. మమ్మల్ని అడవంతా నిర్భయంగా తిరిగేలా చేసింది. కానీ, రేపు అంత స్వేచ్ఛగా తిరగలేమేమో!
చిరుతపులి అలజడి తగ్గినా.. నిద్ర రావడం లేదు. రకరకాల ఆలోచనలు!
“అరవై దాటిన తర్వాత బతికివుండే రోజులన్నీ బోనస్గా వచ్చిన ఆయుష్షే!” అని ఇటీవల ఒక మిత్రుడు వ్యాఖ్యానించాడు.
మరి ఈ బోనస్గా వచ్చిన రోజుల్ని ఎలా గడపాలి? నగర జీవితం మీద ఆసక్తి పోయి విరక్తి కలుగుతున్నది. నిజానికి డబ్బులుంటే నగరంలో అన్ని సౌకర్యాలు నడిచి ఇంటికి వస్తాయి. కడుపులో చల్ల కదలకుండా.. కాలు మీద కాలు వేసుకుని బతకొచ్చు. కానీ, మార్పులేని బతుకు. అదీ ఒక బతుకేనా అనిపిస్తుంది నాలాంటి వారికి. ఇలా బయటికి వచ్చి ఒకటి రెండు రోజులు ప్రకృతిని ఆస్వాదించి వెళ్లిపోయే బదులు.. ఇక్కడే ఉండిపోయి తనివి తీరా ఆనందించవచ్చు కదా! అన్న ఆలోచన బలంగా మొలుస్తున్నది. ఆకర్షణీయమైన, సౌకర్యవంతమైన నగర జీవితాన్ని వదిలి ఈ మారుమూల పల్లెల్లో ఉండి ఏం సాధిద్దామని!? అనే ప్రశ్న కూడా ఎదురవుతున్నది. కానీ, ఆలోచించేకొద్దీ జీవితానికొక ‘సార్థకత’ అయితే సాధిస్తానని అనిపిస్తున్నది!
పుట్టాను! పెరిగాను, చదివాను, ఉద్యోగినయ్యాను, పెళ్లిచేసుకున్నాను, పిల్లలు – వాళ్ల చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు.. వాళ్లపిల్లలూ.. చదువులూ.. మళ్లీ! ఇంతేనా జీవితం! అవెట్లాగూ ఎవరికీ తప్పవుగానీ, ఆ బాధ్యతలన్నీ అయిపోయాక కనీసం ఈ బోనస్నైనా నాకిష్టమొచ్చినట్లు ఖర్చు చేసుకునే వీలు లేదా? ఎందుకు లేదు! ఉంది! నిర్ణయం తీసుకోవడమే కావాల్సింది!
ఈ అకారణ రాగద్వేషాల ప్రపంచం నుంచి, పొరుగువాడి మీద అసూయపడని చోటికి వెళ్లిపోవాలి! తనకు గిట్టనివాడి పతనం మీద తన సంతోషాలను వెదుక్కునే దౌర్భాగ్యం నుంచి బయటపడాలి! భవిష్యత్తు గురించి అందమైన కలగంటూ పడుకున్న నాకు.. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలవదు!
కిటికీలోనుంచి నీరెండతోపాటు, పల్లెవాసుల పశువులను అదిలించే కేకలు, చేదబావి దగ్గర గిలకలు చేసే చప్పుళ్లూ, పక్కనే ఉన్న అడవిలోనుంచి నెమళ్ల పిలుపులు వినిపిస్తుంటే.. నిద్రలేవక తప్పలేదు. రాత్రి చిత్తపులి సృష్టించిన బీభత్సపు ఆనవాళ్లు వెతికినా కనిపించకుండా పోయి.. పల్లె మరో అందమైన సూర్యోదయానికి సాక్షిగా నిలిచింది.
* * *
ప్రపంచమంతా కరోనా భయంతో వణికిపోతున్న సమయం. టీవీల నిండా, పత్రికల నిండా ఎప్పుడు చూసినా.. కరోనా వార్తలే! మిగతా వ్యవహారాలన్నీ స్తంభించిపోవడం వలన కరోనా తప్ప చెప్పుకోవడానికి ఏమీ మిగలలేదు. కొవిడ్-19గా పిలిచే ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా జనజీవితం కనీవినీ ఎరుగని సంక్షోభానికి గురవుతున్నది. ఎప్పుడూ ఉరుకులు పరుగులతో ఉండే భూగోళమంతా నిస్తేజమై పోయింది. వందలకోట్ల మంది హోమ్ క్వారంటైన్ పేరుతో నెలల తరబడి ఇంట్లోనే ఉండిపోవడం ఇటీవలి మానవజాతి చరిత్రలోనే విచిత్రమైన, విషాదకర పరిణామం. ప్రపంచ యుద్ధాలు సంభవించిన సమయాల్లో కూడా ఇన్ని మరణాలు జరగలేదంటున్నారు. కరోనా, కొవిడ్, లాక్డౌన్, హోమ్ క్వారంటైన్ అనే పదాలు గతంలో ఎవరికీ తెలియవు. ఇప్పుడు ఇరవైనాలుగు గంటలూ అవే పదాలు వినిపిస్తున్నాయి. పేపర్లు, టీవీలు రోజూ వ్యాధి సోకినవారి సంఖ్య, వ్యాధితో కోలుకున్నవారి సంఖ్య, మరణించిన వారి సంఖ్యలను చూపిస్తున్నారు. ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ విధించేశాయి. కేవలం అత్యవసరాలకు మాత్రమే సడలింపు ఉంది. బ్రిటన్లో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది వందల మంది కరోనాతో చనిపోయారన్న వార్త.. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నది. కరోనా పేషెంట్లకు వైద్యం చేస్తూ, మనదేశంలో నాలుగు వందల మందికి పైగా డాక్టర్లు మరణించారన్న వార్తలు.. మరింత కలవరాన్ని పుట్టిస్తున్నాయి. అసలు మానవజాతి భవిష్యత్తు ఎలా ఉండబోతున్నది అన్న విషయం ఊహకు కూడా అందడంలేదు. కరోనాకు పేదలు, ధనికులూ అనే భేదం లేనట్లుంది. అన్ని వర్గాల ప్రజలూ మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బతికి బట్ట కడితేనే గొప్ప అనే పరిస్థితి వచ్చేసింది. ఇదే అదనుగా సోషల్ మీడియాలో శాడిస్టు నెటిజన్లు పుకార్లను పుట్టించే పనిలో మునిగిపోయి ఉన్నారు.
వార్తలు చూస్తూ వట్టివేర్ల డికాక్షన్ తాగుతున్నాను.
“రాం! రాం! సారూ? ఏంజేస్తున్నారు?” అంటూ జంగూ పటేల్ వచ్చాడు.
“రాం! రాం! పటేలా! రా! ఇట్లగూసుండు! మీ జంగు దాదా అచ్చిండు.. చాయ్ దీస్కరా!”.. లోపలికి కేక వేశాను.
“సారూ? గిదేం బీమారి! దునియంతా సుట్టుకపోతున్నదట. ఎక్కడోళ్లక్కడనే సచ్చిపోతున్నరట! మా పోరగాండ్లు సెల్ఫోన్లల్ల సూపిచ్చుకుంట అందర్ని భయపెడ్తున్నరు. అసలు దీని సంగతేంది!? మరి మనం ఎట్లు జేసుడు?!”.. విషయంలోకి వచ్చాడు జంగూ పటేల్.
“నిజమే జంగూ! రోజూ వార్తలల్ల జూపిస్తున్నరు గని.. అవి మనదాకా రాకపోవచ్చు. మాకయితే అస్సలు రాకపోవచ్చు. మీకు రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటది. మందుల తిండి దినరు కదా! మంచిగ దిని మంచిగ పని చేసుకుంటురు. గందుకు మీకు కూడ రాదు!”.
“ఎక్కడ మంచి తిండి సారూ! బియ్యం సస్తా దొరకబట్టి మా ఇప్పటి పిలగాండ్లంతా బువ్వనే దింటున్నరు. మా కాలంల అడివికి బోతే ఏదన్నా ఒక షికారి చేసుకొని అస్తుంటిమి. నాలుగు తీర్ల మాసం దొరుకుతుండె. పది తీర్ల పండ్లు దొరుకుతుండె. ఇప్పుడు షికారి ఖానూన్ ఖిలాఫ్ అయిపోయింది. పండ్ల చెట్లు ఖతమైపోయినయి. మెల్లగ మెల్లగ అడివిగూడ నాశనం గావట్టె. మేంగూడా పట్నమోల్ల తిరంగ సునోసరం అయిపోతున్నం”.
“ఇప్పటి తరంల మన ప్రాంతంలో ‘ఎనీమియా’ అంటే.. రక్తహీనత ఉండి రోగాలు అస్తున్నయి అని సర్కారు రిపోర్టులు జెప్తున్నయి. ఈతరం మాత్రం కమ్జోర్ అవుతున్నది”.
“కమ్జోర్గాక ఏమవుతది సారూ! ముందు మేం నెలకు రెండుముద్దల బెల్లం తింటుంటిమి. బెల్లం చాయ, బెల్లం పానకం, ఇప్పపువ్వు బెల్లం లడ్డూలు, బెల్లం బూరెలు.. గిట్ల బెల్లం బాగా తింటుంటిమి. అందుకు మాకు రక్తహీనత రాలే! ఇప్పుడంతా మారిపోయి బెల్లం దినుడు మోటు అనుకుంటున్నరు!”.
“నిజమే జంగూ! ఇప్పుడు పల్లెలు కూడా పట్నాల తొవ్వ పట్టినయి. గందుకు గిన్ని కమ్జోరీలు అస్తున్నయి!”.
“అయితే ఇప్పుడు మనోళ్లందరు గలిసి మన ఊరును ‘హద్దుబందు’ జేద్దామంటున్నరు. కొత్తోళ్లను ఓళ్లనూ ఊర్లెకు రానీయద్దు. మనం ఊరు విడిచి పోవద్దంటున్నరు. ఒక్కళ్లు అంటువెట్టుకొని అచ్చినా.. ఊరంతా అంటుకుంటదట!”.
‘హద్బంద్’ అంటే.. లాక్డౌన్ అన్నమాట. ఇది మంచి ఆలోచనే అనిపించింది నాకు. పల్లెటూరి వాళ్లు పాలు అమ్మడానికో, కూరగాయలు అమ్మడానితో పట్నాల్లోకి పోయి, ఆ రద్దీలో కరోనా అంటించుకొని వచ్చి.. ఊళ్లల్లో వ్యాపించడానికి కారణం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా గ్రామాలలో బయటివారు రాకుండా రహదారులను దిగ్బంధనం చేసి, కంచెలు వేసి కావలా ఉంటున్నారని ఫొటోలతో కథనాలు వస్తున్నాయి!
“జంగూ! మీరంతా ఏ ఫైసలా జేస్తే.. అదే నా మాట! అందరం ఒక్కమాట మీదుంటెనే ఇప్పుడు బతుకుతం. ఇక పాలూ, కూరగాయలు అమ్మెటోళ్లకు కొంత నుక్సాన్ అయితది మరి. కొన్ని ఊర్లల్ల కూరగాయలు చేన్లనే మురిగిపోతున్నయట! ఇంకొన్ని ఊర్లల్ల అందరికీ ఉత్తగానే పంచి పెడ్తున్నరట!”..
“మనం కూడా గట్లనే జేద్దాం సారూ!”.
“ఇయ్యాల నుండే హద్దుబందు జేసెయ్యుండ్రి! ఓళ్లకన్నా అత్యవసరమైతే నా కారును దీసుకుపొమ్మని చెప్పు!”.
“గట్లనే సారూ! మళ్లీ భేటయితా! రాం! రాం!” అంటూ జంగు వెళ్లిపోయాడు.
నేను ఈ లొహార గ్రామంలో సెటిలైపోయి సంవత్సరంపైనే కావొస్తున్నది. ఒకానొకరాత్రి.. మా దోస్తులతో ఈ గ్రామంలో గట్టి నిర్ణయం తీసుకొని, మూడునెలల్లో అమలు చేశాను. మట్టి గోడలతో, గూన పెంకులతో, వెదురు బొంగులూ.. తడకలతో ఒక డిజైనర్ హౌస్ లాంటిది నిర్మించుకున్నాను. దీనికి హైదరాబాద్లోని నా మిత్రుడు శ్రీధర్ రూపకల్పన చేశాడు. ఇంటిముందు విశాలమైన స్థలంలో చిన్నపాటి పూలతోట, కూర్చోవడానికి ఇప్ప మొద్దులతో చేసిన బెంచీలు! ఇంటివెనుక కూరగాయల తోట కోసం అనువైన స్థలం. నాలుగు గదులు, ఒక విశాలమైన హాలు! మరోపక్క విడిగా అన్ని సౌకర్యాలతో రెండు గదుల ‘గెస్ట్ హౌస్’ కూడా కట్టుకున్నాను. మొదలు.. ‘ఆ పల్లెటూరుకు నేను చస్తేరాను!’ అని మొండికేసిన నా శ్రీమతి కేవలం ఆ ఇల్లు నచ్చే వచ్చేసింది! ఇప్పుడు.. ‘చచ్చినా పట్నానికి పోను’ అంటున్నది. రెండు గదుల డాబాపైన వృత్తాకారపు షెడ్ ఉన్నది. దానిలో కూర్చుంటే మూడువందల అరవై డిగ్రీల కోణంలో చుట్టూతా.. అడవి అందాలను వీక్షించవచ్చు. జడగడ్డితో కప్పిన ఆ షెడ్ పైకప్పు.. నీరెండలో బంగారు వర్ణంతో మెరిసిపోతుంది. ఇంటి చుట్టూ ఉన్న గోడలమీద గూడెంలో ఉన్న కళాకారులు మట్టితోనే వారి శైలిలో అందమైన దృశ్యాలను, కళాకృతులను రూపొందించారు. గోడల కిందిభాగంలో గిరిజన మహిళలు జాజు రంగు మట్టితో అలికి, సుద్ద మన్నుతో తెల్లని ముగ్గులు వేశారు. మొత్తానికి నా ‘కలల గృహం’ అలా తయారైంది!
నగర జీవితంపై విరక్తి కలిగిన ఫలితమిది. ఉద్యోగం కోసం, పిల్లల చదువుల కోసం నగరంలో ఉండే అవసరం ఉండేది. ఇప్పుడు పిల్లలిద్దరూ విదేశాల్లో స్థిరపడ్డాక, నేను పదవీ విరమణ వేశాక.. ఇంకా నగరంలో ఉండి చేసేదేముంది? ఇప్పుడు నగరానికి నా అవసరం లేదు. నాకు నగరం అవసరం అంతకన్నా లేదు! అందుకే నాకు నచ్చిన రీతిలో ప్రశాంతంగా బతుకుదామని ఇలా వచ్చేశాను. మా వయసుకు అవసరమైన అన్ని సౌకర్యాలనూ అమర్చుకున్నాం. కానీ కొన్నిటి అవసరమే రాదు. ఏసీ పెట్టుకున్నా.. మండు వేసవిలో కూడా దాని అవసరం పడలేదు. ఫ్రిజ్ ఉన్నా అప్పటికప్పుడు తాజాగా అన్నీ లభించే ఆ ఊళ్లో దాని అవసరం చాలా తక్కువ.
నాలుగు లోయలు కలిసే ఒక పల్లపు ప్రాంతంలో, జీవధారలాంటి వాగు ఒడ్డున వెలసిన ఈ లొహారా గ్రామం.. నాకు అన్నివిధాలా నచ్చడానికి కారణం.. ఇరవైఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న టౌనుకు ఏకాలంలోనైనా, ఏ సమయంలోనైనా నిరాటంకంగా పోయివచ్చే సౌలభ్యం ఉండటమే! ఏది కావాలనుకున్నా కొన్నిగంటల్లో తెప్పించుకోవచ్చు. ఇటీవల వారి భాషకూడా నేర్చుకున్నాం కాబట్టి.. ఊరివాళ్లతో మరింత సాన్నిహిత్యం పెరిగింది.
* * *
చాలా రోజుల తర్వాత ఇంద్రారెడ్డి ఫోన్ చేశాడు.
“ఏంటి మిత్రమా! మా అందరినీ వదివేసి ఆ మారుమూల అజ్ఞాత వాసంలోకి వెళ్లి పోయావు! ఎలా ఉన్నావు?”.
“ఏనాటికైనా మీ అందరినీ వదిలేసి పోవాల్సిన వాడినే గదా? అసలు ఈ కరోనా కాలంలో ఎవరెవరు ఉంటారో, ఎవరు ఎప్పుడు పోతారో ఏమీ తెలీడం లేదుకదా!”.
“నీకేం బాబూ! హాయిగా ప్రకృతి ఒడిలో.. కలలో కూడా కరోనా సోకని రాజ్యంలో ఉన్నావు. ఇప్పుడు మాకొచ్చి పడింది చావు! ఎప్పుడు ఏమవుతుందోనని భయం భయంగా బతుకుతున్నాం. ఇవాళ నేనూ, బాపురెడ్డి, రాధాకృష్ణా మాట్లాడుకున్నాం. ఇక్కడ రోజూ చావు భయంతో బతుకేకన్నా.. ఫ్యామిలీ సహా నీవద్దకు వచ్చి కొన్నాళ్లు ఉండి పోదామనుకుంటున్నాం!”.
“నా దగ్గరికా? ఈ పల్లెటూరికా?” ఆశ్చర్యంగా అడిగాను.
“అవును! ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద పల్లెలే సేఫ్ ప్లేసెస్గా కనిపిస్తున్నాయి. అందుకని అక్కడికి వస్తే.. కొన్నాళ్లయినా భయాన్ని మరిచిపోవచ్చని అనుకుంటున్నాం. ఎలాగూ పూర్తి లాక్డౌన్లో ఇక్కడుండి కూడా చేసేదేమిలేదు కదా!”.
“అయ్యో! ఇంద్రారెడ్డీ! ఒకరోజు ముందన్నా ఈ సంగతి చెప్పకపోతివి. ఇవ్వాళే మా ఊరువాళ్లు ‘హద్బంద్’ చేసి.. అంటే లాక్డౌన్ ప్రకటించి, ఊళ్లోకి వచ్చేబాటల వద్ద కంచెలు వేసి కాపలా ఉంటున్నారు” నిరాశగా అన్నాను.
“అవును! పల్లెటూళ్లన్నీ సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించుకొని, కొత్తవాళ్లు ఎవరినీ ఊళ్లలోకి రానీయడం లేదని పేపర్లు, చానల్స్లో చూస్తున్నాం. కానీ, నీ ఇన్ఫ్లూయన్స్ అంతా ఉపయోగించి ఎట్లయినా మేం అక్కడికి వచ్చేట్లు చూడు! ఇక్కడ పిల్లలతో ఇంట్లో మక్కిపోతున్నాం. మేమందరం ఆర్టీపీసీ రిపోర్టులు తీసుకొని మరీ వస్తామని చెప్పు!” ఇంద్రారెడ్డి బతిమాలుతున్నాడు.
“సరే! ఏ సంగతీ తెలుసుకొని ఫోన్ చేస్తాను!” అని పెట్టేశాను.
ఒక్కరోజు ముందుగా అడిగి ఉంటే.. ఎట్లయినా వారిని రప్పిద్దును. ఇవ్వాళే నిర్ణయం తీసుకొని.. రేపే దాన్ని ఉల్లఘించడమంటే కష్టమే! నిజానికి నాకూ వాళ్లందరినీ చూడాలనీ, వారితో గడపాలని కోరికగా ఉంది. నేనిక్కడ కట్టుకున్న నా డిజైనర్ ఇల్లునూ, పూలతోటనూ, పెరటి తోటనూ వారికి చూపించాలని ఉబలాటంగా ఉంది. ఈ అవకాశం మళ్లీ రాదు.
ఈ రోజు గుడి వద్ద రాత్రికి భజన కార్యక్రమం ఉంది. అక్కడయితే గ్రామ పెద్దలందరూ కలుస్తారు. అప్పుడప్పుడూ భజన కార్యక్రమానికి నేనూ హాజరవుతుంటాను. భజనలో విరామ సమయం వచ్చింది. విషయం కదపడానికి ఇదే మంచి సమయం!
“సమ్దిర్కీ రాం రాం! మనం ఇయ్యాలనే హద్దుబందు జేసినంగదా! పట్నంకెల్లి మా దోస్తులు ఇయ్యాలనే ఫోన్ జేసిండ్రు! అక్కడ భయం భయంగా ఉన్నదట! ఇక్కడికి కుటుంబాలతో సహా వచ్చి కొన్నిరోజులు ఉండి పోదామని అనుకుంటున్నరు. మీ అందరినీ అడిగినంకనే.. ఏ సంగతీ చెప్తానని అన్నా! ఏమంటరు?!” మెల్లగా అడిగాను.
“గదెట్లా కుదుర్తది సారూ! బయటికెల్లి ఓళ్లను రానీయమంటిమి కదా! మల్ల ఈల్లయితే పట్నంకెల్లి అస్తమంటున్నరు. మరి ఆ రోగమంటు వెట్టుకొని అస్తే.. మన ఊరు ఊరంతా అంటుకొని ఆగమైపోదా!?”.. భీమ్రావు అన్నాడు.
“మీరన్నమాట సయే! అయితే వాళ్లందరూ ఆ రోగంలేదని టెస్ట్ రిపోర్టులు తీసుకొని అస్తమంటున్నరు. నిజంగా ఆళ్లకు ఆ రోగముంటే.. ఆడనే దవాఖాన్ల షరీక్ అయితరు గదా! ఈడదాక రానే రారు గదా! ఈ పట్నవాసులకు ఒకసారి మన పల్లె బతుకులు ఎలా ఉంటాయో చూపించాలని నా కోరిక!”.. మరోసారి ప్రయత్నించాను.
“ఈ రిపోర్టులు గిపోర్టులు గంత భరోసావి కావు గానీ.. ఒగయాల్ల ఆళ్లకు రావాలని కచ్చితంగా అనిపిస్తే.. ఆళ్లను నారాజ్ చెయ్యకుండా ఒక ఇకమతు ఉన్నది”.. హన్మంతు తనకు తోచిన ఉపాయాన్ని అందరి ముందుంచాడు.
“ఆళ్లు మనకు అంటకుండ, ముట్టకుండ దూరంగ ఉండాల! ఆళ్ల తిండీతిప్పలు ఆళ్లే చూసుకోవాల! కావాలంటే.. ఇంతజాములన్నీ మనంజేద్దం!”.
“ఆళ్లను మన సారింట్ల ఉంచుకునుడు కూడా కుదరది! సారిల్లు నడి ఊళ్లెనే ఉన్నది గదా! అదీగాక.. ఆళ్లు ఎందరస్తరో తెలుసుకుంటే.. యాడ ఉంచాల్నో ఇచారం జేయచ్చు!”.. అంటూ జంగు పటేల్ నా వైపు చూశాడు.
“మూడు కుటుంబాలు!.. అంటే నలుగురు చొప్పున పన్నెండు మంది! ఆరుగురు పెద్దోళ్లు, ఆరుగురు పిలగాళ్లు! పిల్లగాళ్లంటే పెద్దపిలగాండ్లే!”.. చెప్పాను.
“ఇగో! ఆళ్లకు రానిద్దాం జంగు దాదా! గిసుంటోళ్లు మళ్ల మన ఊరుకు ఎప్పుడచ్చి ఉంటరు. ఇప్పుడు ఈ బీమారి చెయ్యవట్టి అస్తున్నరు! అయితే ఆళ్లను గొన్ని రోజులు మన జంగుదాదా పెద్దకొట్టంల ఉండుమందం! జాగ పెద్దగున్నది. ఊరుకు ఒక పక్కకున్నది. అండ్లనే ఆళ్లకు అన్ని ఇంతజాములు జేద్దాం!”.. జంగు తమ్ముడు మోతీరాం మంచి ఐడియా ఇచ్చాడు.
తర్జన భర్జనల మీద మరికొన్ని షరతులు విధించి, అన్నిటికీ ఒప్పుకొంటేనే రమ్మనమని నిర్ణయం చేశారు. మర్నాడే ఇంద్రారెడ్డికి షరతులన్నీ వివరించాను. అన్నిటికీ ఒప్పుకొంటామనీ.. ఈ ఇంటి జైలుకన్నా ఆ అడవే నయమనీ, రెండు రోజుల్లో వచ్చేస్తామని చెప్పాడు.
పట్నాల్లో ఇళ్లన్నీ ఖాళీ అవుతున్నాయనీ, ప్రజలంతా తమ సొంత ఊళ్లకు చేరుకుంటున్నారని, పల్లెలకు మళ్లీ మునుపటి వైభవం వచ్చేసి.. జనాలతో కళకళలాడుతున్నాయనీ, బంధుమిత్రుల బంధాలన్నీ మరొకసారి జ్ఞాపకం వచ్చి.. కలిసిమెలిసి హాయిగా గడుపుతున్నారన్న కథనాలు విరివిగా వస్తున్నాయి. వీళ్లంతా వస్తే.. మా లొహార గ్రామానికి కొత్త శోభ వస్తుందని నాకెంతో సంతోషంగా ఉంది!
* * *
“ఉన్నారా సార్! రాం! రాం!”.. జంగు పటేల్ మరో ఇద్దరిని వెంటబెట్టుకొని వచ్చాడు.
“రా! రా! పటేలా! కూసోండ్రి!”.
“సారూ! ఒకమాట మీ చెవుల ఏద్దమని అచ్చినం. ఏమనుకోకుండి! మీ దోస్తుల పిలగాండ్లు కొంచెం ఆగమున్నరు సార్!” నిష్టూరంగా అన్నాడు జంగు.
“అవునా? ఏమయింది? ఏం జేసిండ్రు!”.. ఆందోళనగా అడిగాను.
“తెల్లందాకా గవ్వేమో పెద్దపెద్ద లోడు స్పీకర్లు పెట్టుకొని, పెద్ద సోండుతోని పాటలు ఇనుకుంట డ్యాన్సులు చేస్తున్నరు! ఆ సోండుకు అటు పక్క పదిండ్లమందికి తెల్లారేదాకా నిద్రలుంటలేవట! పొద్దుందాకా పనిచేసి అచ్చినోళ్లకు తెల్లందాకా నిద్రలేకపోతే మళ్లీ తెల్లారి పనిజేసుడు కష్టమయితది గదా!”.
విషయం అర్థమయింది. పిల్లలు పగలు పడుకొని, రాత్రి ఇలా హంగామా చేసున్నారన్న మాట! వాళ్ల తల్లిదండ్రులన్నా మందలించి ఉండాల్సింది. అయినా రోమ్లో ఉన్నప్పుడు రోమన్లలాగే ఉండాలన్న ప్రాథమిక సూత్రం.. వీళ్లకు తెలిసినట్లు లేదు! అలా ఉండకపోతే, ఇక్కడ ఉండటం కుదరదని చెప్పేయాలి! వీళ్ల మూలన నాకు మాట వచ్చేట్లు ఉంది!
“జంగు పటేలా! నాకర్థమైంది! ఇగ నేజూసుకుంట. మీరు బేఫికర్ ఉండుండ్రి! ఉంటరా.. మంచిగుండాల! లేకుంటే వాససు ఎల్లిపోవాల! గింతే జెప్త ఆళ్లకు!”
వాళ్లను పంపించి.. మిత్రులు బస చేసిన కొట్టంవైపు నడిచాను.
* * *
మర్నాడు నుంచి గ్రామంలో దృశ్యాలన్నీ మారిపోయాయి! వాళ్లు వచ్చి వారం రోజులపైనే అయినందున క్వారంటైన్ పీరియడ్ ముగిసి.. వాళ్లను మా ఇంట్లోకి మారిపోవడానికి గ్రామస్తులు అనుమతించారు. వీళ్లంతా మాస్కులు పెట్టుకొని ఊళ్లో తిరగడానికి కూడా అనుమతి లభించింది!
కరోనా వల్ల ఆ ఊళ్లోని పిల్లలంతా చదువుకు దూరంగా ఉన్నారిన్నాళ్లు! మా రాధాకృష్ణ వాళ్ల అమ్మాయి అశ్విని టీచర్ అవతారమెత్తింది. రోజూ పిల్లల్ని జమచేసి చదువు చెప్పడమే కాకుండా.. కొత్త కొత్త ఆటలాడిస్తున్నందున పిల్లలు అశ్వినిని వదలడంలేదు! అశ్విని తమ్ముడు వేణు.. తనవెంట తెచ్చుకున్న వాటర్ కలర్ బాక్సులతో పిల్లలతో బొమ్మలు వేయిస్తున్నాడు. ఇక మా డాక్టర్ బాపురెడ్డి మా గెస్ట్హౌస్లో పొద్దున రెండు గంటలూ, సాయంత్రం రెండు గంటలు ఓపీ క్లినిక్ నడుపుతున్నాడు. తన సొంత ఖర్చు మీదనే మందులు తెప్పించి.. అందరికీ ఉచితంగా ఇస్తున్నాడు. పక్కనున్న గూడేలకూ విజిట్కు వెళ్లివస్తున్నాడు. రాధాకృష్ణ ఊళ్లో ఉన్న యువతకు ఇంగ్లిష్ స్పీకింగ్ కోర్సు నేర్పిస్తున్నాడు. ఇంద్రారెడ్డయితే.. తన కెమెరాతో ఎప్పుడు ఎక్కడికి పోతున్నాడో తెలవడం లేదు. ఫొటోగ్రఫీ మీద ఆసక్తి ఉన్న నలుగురి టీమ్ను తయారుచేసి.. వారికి ప్రయోగాత్మకంగా శిక్షణ ఇస్తున్నాడు. అంతేగాదు.. ఊళ్లో ఉన్న వృద్ధులను, పెద్దవాళ్లను అందంగా ఫొటోలు తీసి, ప్రింట్ వేయించి.. ఫ్రేములుకట్టి వాళ్లకు బహూకరిస్తున్నాడు.
వాళ్లల్లో జీవితంలో మొదటిసారి తన ఫొటోను తాను చూసుకున్నవాళ్లు ఎందరోమంది ఉన్నారు. వీళ్ల శ్రీమతులు నా శ్రీమతితో కలిసి.. చేనూ, చెట్లూ కలియదిరుగుతూ.. రోజుకొక కొత్తరకం వంటల రుచులు మాకు చూపిస్తున్నారు.
తాజా గాలి పీల్చడంతో, తాజా ఆహారం తినడంతో, పదిహేను రోజుల్లో పట్నవాసుల మొహాల్లో.. పల్లెవాసుల్లో మాత్రమే కనిపించే ఒక అపురూపమైన సహజ సౌందర్యం తొంగి చూస్తున్నది!
వాళ్లు అప్పుడప్పుడూ మాట్లాడుకుంటున్న మాటల్ని బట్టి, నా ఊహ నిజమైతే.. వచ్చే సంవత్సరంలోపు నా డిజైనర్ ఇంటి పక్కనే మరో మూడు డిజైనర్ ఇండ్లు కచ్చితంగా అవతరిస్తాయని అనిపిస్తున్నది!
కరోనా చాలామందిని తమ మూలాల్లోని చెవి మెలేసి మరీ లాక్కుపోయింది! రానున్న కాలం మానవజాతికి ఇంకా ఏమేం పాఠాలు నేర్పనున్నదో!? అడ్డూఅదుపూ లేకుండా, అడ్డందిడ్డంగా ముందుకు పరిగెడుతున్న మనిషిని.. తిరిగి ఏమేరకు తన మూలాల్లోకి నడిపించనున్నదో? అలా వెనకకు నడుస్తున్న మనిషిని మళ్లీ ఏ దురాశ ముందుకు లాక్కెళ్తుందో.. కాలమే నిర్ణయిస్తుంది!
* * *
బోరి మురళీధర్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం సొనాలా గ్రామం. ప్రస్తుతం ఆదిలాబాద్ పట్టణంలో నివాసం ఉంటున్నారు. ప్రభుత్వ వ్యవసాయశాఖలో 35 ఏళ్లు సేవలు అందించి.. 2013లో పదవీ విరమణ పొందారు. విద్యార్థిగా ఉన్నప్పుడే 1975లో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో కళాశాల ప్రతినిధిగా పాల్గొన్నప్పటి నుంచీ.. తెలుగు సాహిత్యంపై అభిమానం పెంచుకున్నారు. 1987లో ‘అడవిపువ్వు’ కథతో కథారచన మొదలుపెట్టారు. ఇప్పటివరకు 25 మాత్రమే రాయగా.. అందులో 18 కథలు వివిధ ప్రతిష్ఠాత్మక పోటీలలో బహుమతులు దక్కించుకున్నాయి. ‘నెమలినార’ కథ.. ‘తానా’ (అమెరికా) వారి పోటీలలో ప్రోత్సాహక బహుమతి పొందడమే కాకుండా.. 2006లో ‘వట్టికోట ఆళ్వారుస్వామి కథాపురస్కారం’ దక్కించుకున్నది. మరాఠీ, హిందీ, కన్నడ భాషలలోకీ అనువాదమైంది. ‘నెమలినార’ పేరుతోనే ప్రచురించిన 18 కథల సంకలనానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి ప్రతిష్ఠాత్మక ‘కథాసాహితీ పురస్కారం’ దక్కింది. జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో అనేక బహుమతులు, సన్మానాలు అందుకున్నారు. వీరి ఒకే ఒక నవల ‘నిరుడు కురిసిన కల’.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.