Katha – 2021 | నేను ఒక పాటను. చాలా రోజుల కిందటి సంగతి..
“ఓ సజనా! బరఖా బహార్ ఆయి..” అని సుగుణ గొంతులోంచి నేను మళ్లీ మళ్లీ పుడుతూనే ఉండే రోజులవి.
ప్రతిరోజూ తను మధ్యాహ్నం మూడయ్యేసరికి పొయ్యిమీద టీ పెట్టి.. గ్రాంఫోన్లో మేముండే రికార్డ్ పెట్టేది. అందులో మేము నాలుగు పాటలం ఉన్నాం. అయినా తను నా దగ్గరే స్టయిలస్ స్టిక్ పెట్టేది. మిగతావారందరూ నన్ను ఈర్ష్యగా చూస్తుంటే.. నాకు భలేగా ఉండేది. రికార్డ్ లోనుంచి రావడం అందరిముందూ గొప్పగా ఉన్నా, సుగుణ గొంతులో నుంచి రావడం నాకు ఇంకా హాయిగా ఉండేది. సుగుణకు పెళ్లయ్యాక, నాగపూర్ శంకరం దగ్గరికి వచ్చినప్పుడు.. శంకరం ఇచ్చిన మొదటి బహుమతి ఈ రికార్డ్.
నాగపూర్లో రైల్వే క్వార్టర్స్లో ఉండే తెలుగువారందరికీ సుగుణ పాటలు తెగ నచ్చుతాయి. వాళ్లు వచ్చినప్పుడల్లా తనను పాడమని అడుగుతారు. తెలుగు పాటలు చాలా బాగా పాడుతుంది తను. ఎవరైనా హిందీ వాళ్లు వస్తే నాకు చాలా సంబరం. వాళ్ల ముందు ఫస్ట్ నన్నే పాడుతుంది సుగుణ. అందరూ తనను మెచ్చుకుంటే నాకు ఎంత సంబరమో!
తను టీ తాగుతూ మమ్మల్ని వింటుంటే కూడా ఎంత హాయిగా ఉండేదో. ఎందుకంటే సుగుణ పాడటమే కాదు, చాలా బాగా వింటుంది కూడా. పాటే తానైపోతుంది.
సుగుణ దగ్గరికి తెలుగు ట్యూషన్ కోసం పిల్లలొస్తారు. వాళ్లకు సుగుణ చెప్పే కబుర్లూ, కథలూ, చిన్ని చిన్ని పాటలూ చాలా సరదాగా వింటారు. ట్యూషన్లు బానే ఉంటాయి కానీ, ఇవి మొదలయ్యాక తన గొంతు లోనుంచి జారిపడే అవకాశం నాకు కాస్త తగ్గింది. ఒకసారి తెలుగువాళ్ల ఫంక్షన్లో ఎవరో చెప్పారు.. తను ఒక తెలుగు పాట చాలా బాగా పాడుతుందని. అందరూ తనను పాడమని బలవంతం చేశారు.
సుగుణ సున్నితంగా మెల్లిగా మెత్తగా..
“మనసున మల్లెల మాలలూగెనే!” అని మొదలు పెట్టింది.
ఏమా మార్దవం, ఏమా ఆర్ద్రత.. పరాయి భాష పాటైనా, నా మనసు ఆర్తితో చెమ్మగిల్లింది. ఆ రోజు రాత్రి శంకరం సుగుణను దగ్గరికి తీసుకుని..
“ఎందుకంత బతిమాలించుకున్నారు అమ్మాయిగారు!?” అని అడిగాడు.
“అందులో మల్లీశ్వరి మళ్లీ విడిపోతామేమో అన్న బాధతో, భయంతో పాడుతుంది కదా! నాకు ఎప్పటికీ అలాంటి బాధ వద్దు బాబూ! అందుకే అందులో పూర్తిగా లీనమయ్యి పాడలేను” అన్నది శంకరాన్ని హత్తుకుపోతూ.
“మరి పూర్తిగా లీనమయ్యి ఇష్టంగా పాడే పాట ఏమిటో!?” అడిగాడు శంకరం.. సుగుణ సోగ కళ్లలోకి చూస్తూ, ఆమె జడతో ఆడుకుంటూ. నేను ఆత్రంగా చూస్తున్నాను.. ఏమంటుందో అని.
పక్కన ఉన్న రికార్డ్ లోనుంచి ‘రసిక్ బలమా’, ‘ఆజారే పరదేశి’, ‘యే షాం కీ తన్ హాయియా’.. ఇవన్నీ కూడా ఆత్రంగా చూస్తున్నాయి. దానికి తోడు సుగుణ పెళ్లికి ముందు పాడుకున్న తెలుగు పాటలు కొన్ని చాలా ఎదురు చూస్తున్నాయి.
కానీ, సుగుణ.. శంకరాన్ని లాలనగా హత్తుకుంటూ, ఒళ్లో పడుకోబెట్టుకుంటూ..
‘సడి సేయకో గాలి, సడి సేయబోకే..’ అంటూ ఒక తెలుగు పాటను మెత్తగా, బంగారు తల్లిలా జోకొడుతూ పాడింది.
శంకరం ఆమె ప్రేమలో కరిగిపోతూ నిద్రపోయాడు.
నాకు సంతోషంతో కూడిన ఈర్ష్య వచ్చింది. నాకు లోపల ఏదో నమ్మకం, నిద్ర జోకొట్టడానికి పాడింది కానీ, నేనంటేనే తనకు ఇష్టం. కొంచెం మబ్బు పట్టగానే, రికార్డ్ పెట్టి, పనులు చేసుకుంటూ నన్నేగా పాడుకుంటూ ఉండేది.
సుగుణ ఏ పని చేసినా కూని రాగాలు తీస్తూనే ఉండేది. పక్కింటావిడ కబుర్లు చెప్పడానికి వస్తే పాల మీగడ లాంటి గలేబాల మీద బుల్లి బుల్లి అందమైన పూలు కుడుతూ అందమైన జడను ఒక చేత్తో వెనక్కి తోసుకుంటూ.. సొగసుగా మాట్లాడేది. చేసేది ఏ పనైనా ఎంత అందంగా చేసేదో!
శంకరం మంచివాడు, సుగుణ అంటే ప్రాణం. ఒకసారి ఏదో ఒక నైట్డ్రెస్ తెచ్చాడు వేసుకోమని..
“ఛీ.. ఛీ..! నేను వేసుకోను:” అన్నది సుగుణ.
“ఇంట్లో రాత్రిపూట వేసుకోవడానికి కూడా నీకు అభ్యంతరం ఏమిటి?” అన్నాడు శంకరం.
వాళ్లిద్దరూ పోట్లాడుకోవడం అదే మొదటిసారి.
మళ్లీ ఉదయానికల్లా.. రాత్రి పోట్లాడుకుంది మరచిపోయి మళ్లీ కలిసిపోయారు.
సుగుణ రోజూలాగే ఉదయం పూజ చేసుకొని సుప్రభాతం చదువుతూ శంకరాన్ని లేపుతుంటే.. మేము ‘హమ్మయ్యా!’ అనుకున్నాం.
రోజులు మూడు తెలుగు పాటలూ, ఆరు హిందీ పాటల్లా మధురంగా గడిచిపోయాయి. గ్రాంఫోన్ ప్లేయర్కు, మా రికార్డ్లకూ మంచి స్నేహం ఉండేది. మేము గ్రాంఫోన్ ప్లేయర్ను.. ‘మావయ్యా!’ అని పిలిచేవాళ్లం. మావయ్య మీద గిరగిరా తిరుగుతూ పాటలు బయటికి వస్తుంటే మాకు చాలా బావుండేది. ప్రతి సంవత్సరం కొత్త రికార్డులు ఏవో ఒకటి వచ్చినా.. ఇంకా మా రాజ్యమే నడుస్తూ ఉండేది.
చూస్తుండగానే సుగుణకూ, శంకరానికీ ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. శంకరానికి ఆంధ్రప్రదేశ్కు ట్రాన్స్ఫర్ అయ్యింది.
బొబ్బిలి వచ్చాక హిందీ పాటల సందడి బాగా తగ్గిపోయింది.
మా గ్రాంఫోన్ మావయ్యకు కొత్త రికార్డులు ఎన్నో పరిచయం అయ్యాయి. ముత్యాల ముగ్గు డైలాగులూ, ఘంటసాల గారి ప్రైవేటు పాటలూ.. మమ్మల్ని బానే వెనక్కి నెట్టేసాయి. అయినా సుగుణ పిల్లలకు జడలు వేస్తూ, సాయంకాలం దీపాలు వెలిగిస్తూ, జాజిపూల మాలలు కడుతూ పాడే మధుర గీతాల్లో.. నాకెప్పుడూ చోటు ఉంటూనే ఉండేది. కాకపోతే ఒక కొత్త చిక్కు వచ్చింది. సుగుణ పెద్ద కూతురు సంధ్యకు కాస్త సంగీతం రావడం మొదలుపెట్టింది. దాంతో ఒక వృద్ధ వీణ మాస్టారుతో వీణ నేర్పించడం మొదలుపెట్టారు. ఆయన ఠంచనుగా సాయంత్రం 4 గంటలకల్లా వచ్చేవారు. సుగుణకు ఇంక తీరిగ్గా టీ తాగుతూ మమ్మల్ని పలకరించే టైం లేకపోయింది.
ట్యూషన్కు చాప వేయడం, వీణ తీసి రెడీ పెట్టడం, సంధ్యను కూర్చోపెట్టడం.. దీనితోనే సరిపోయేది. నిజానికి నేర్పేది సంధ్యకే అయినా నేర్చుకునేది సుగుణే! పక్కనే కూర్చుని, వీణను చూస్తూ చూస్తూ నేర్చేసుకుంది సుగుణ.
మాస్టారు వెళ్లగానే పిల్లలు ముగ్గురూ పొలోమంటూ బయటికి పరిగెత్తేవారు.. ఆటలని.
అప్పుడింక సరస్వతీ దేవి వాయిల్ చీర కట్టుకుని వయ్యారంగా కూర్చుని వీణ వాయిస్తున్నట్లు.. సుగుణ చకచకా అవాల్టి పాఠాన్ని పాడుకుంటూ వీణ వాయించేది. కొన్నిసార్లు మా పంట కూడా పండేది. మమ్మల్ని వీణ మీద పలికించాలని సుగుణ ప్రయత్నాలు చేస్తూ ఉండేది. స్వరాల్ని కూడబలుక్కుంటూ, రాగాల్ని ఊహిస్తూ మొత్తానికి మాకు వీణ స్పర్శా సౌఖ్యాన్ని కలిగించేది. తనకు సరిగ్గా వచ్చేవరకూ చేసే సాధనకు పిల్లలు నవ్వులూ, కేరింతలూ, పక్క వాద్యాలు. అవి బంగారం రోజులు.
* * *
ఉద్యోగంలో శంకరానికి పని ఒత్తిడి చాలా ఉండేది. దాంతో ఒకప్పటిలా గోముగా పాటలు పాడమని అడిగే దృశ్య కావ్యాలూ, మోహన రాగాలూ తగ్గినా.. వారి అనుబంధం మాత్రం చెక్కుచెదరకుండా మౌనరాగాలు పలికిస్తూ సాగిపోయింది. కొత్త సినిమాలూ, కొత్త పాటలూ, ఇంట్లో వీణా గానాలూ, వీటితో మా హిందీ పాటలం బానే వెనక్కి పడ్డాం. మా గ్రాంఫోన్ మామయ్య మాత్రం చాలా బిజీగా ఉండేవాడు.
ఒక్కసారి మమ్మల్ని ఎవరైనా వింటే బాగుండు.. తనను పలకరించగలుగుతాం అనిపించేది. ఇంతలో ఒక దారుణం జరిగింది. ఒక చిన్న డబ్బా మమ్మల్ని శాశ్వతంగా వెనక్కి నెట్టేసింది. ఈ చిన్న డబ్బా.. టేప్రికార్డర్ అంట. దాన్ని ఎప్పుడంటే అప్పుడూ.. ఎక్కడంటే అక్కడ చాలా సులువుగా పెట్టేసుకోవచ్చంట. దాంతో హఠాత్తుగా మమ్మల్ని ఎవరూ పట్టించుకోకుండా అయిపోయింది.
మేమంటే పాటలం కాబట్టి రికార్డు మీదా ఉండగలం, క్యాసెట్టు మీదా ఉండగలం! కానీ, పాపం గ్రాంఫోన్ మావయ్య అలా కాదు కదా! ఎక్కడికి వెళ్లిపోయాడో తెలీదు. మళ్లీ ఎప్పుడూ చూడలేదు.
పాత పాటల పల్లకీ.. జ్ఞాపకాల్ని మోసుకుంటూ అలమరాలెక్కింది. కొత్త పాటలు జోరుగా హుషారుగా కారులో షికారు కొడుతున్నాయి. ప్రతి సంవత్సరం ఎన్నో వందల పాటలు పుడుతుంటే, ఆపాత మధురాల్ని తట్టి పలకరించడానికి ఏ గొంతుకు మాత్రం కుదురుతుంది?
సుగుణ మాత్రం మబ్బు పట్టగానే ఒక్కసారి నన్ను పాడుతుంది. ఆ గొంతును ఆర్ద్రంగా తడుముకుంటాను.. మళ్లీ ఎప్పటికి పిలుస్తుందో కదా అని.
* * *
కాలం తెచ్చే కొత్త మార్పుల్ని చూస్తూ చూస్తూ అలమారాలో ఓ మూలగా జీవితాన్ని గడిపేశాం. నేను అప్పుడప్పుడూ రేడియోలో వినిపిస్తాను గానీ, అది పూర్తిగా నేను కాదు. సుగుణకు వినపడి ఆమె గొంతులో నుంచి, తన కంఠాంతరంలో నుంచి బయటపడే నేనే నేను..
సుగుణలాంటి బంగారాలు అమ్మలయ్యి, అమ్మమ్మలయ్యి.. బాధ్యతల్ని తలమీదకెత్తుకొని, పాటల్ని గుండెల్లో పెట్టిమూసేశారు. వేసవి వెన్నెలలో పెరట్లో మడత మంచాల మీద మల్లెపూల సువాసనల మధ్య మెత్తటి చీర కట్టుకొని ఒత్తయిన జుట్టును జడగా అల్లుకుంటూ, పిల్లలకు కథలు చెప్తూ, మమ్మల్ని కూడా ప్రేమగా పిలిచి తన గొంతుతో హత్తుకున్న ఆ అందాల రాశి.. మమ్మల్ని మళ్లీ అలా పిలవడం ఇంక కలే!
సుగుణ చూస్తుండగానే సుగుణమ్మ అయ్యింది. అమ్మమ్మ కూడా అయ్యిందిగా మరి. పిల్లలు ఎప్పుడైనా పాడమంటే..
“అబ్బే! గొంతులో జీర వచ్చిందర్రా!” అని పాడటం ఎప్పుడో ఆపేసింది. ఆ జీర మమ్మల్ని కోస్తుందనీ, మాకు నొప్పెడుతుందనీ తనకు భయం పాపం.
ఆ జీరను మేము లెక్క చేయమనీ, ఆమె గొంతులో నుంచి రావడం మాకెంతో ఇష్టమనీ తనకు తెలీదుగా పాపం.
ఎవరైనా తనను బలవంతపెట్టి మమ్మల్ని పిలిపిస్తారనీ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటాను. టీవీలు వచ్చాక, పాటల కార్యక్రమాలు పెరిగాక ఎంతోమంది పాత పాటలు పాడుతున్నారు. కానీ, నన్ను పెద్దగా ఎవరూ పాడలేదు. ఎవరైనా నన్ను పాడినా కూడా నాకు ఆనందం ఏమీ లేదు. కానీ, అది విని నన్ను గుర్తు చేసుకుని, సుగుణేమన్నా నన్ను గొంతు చేసుకుంటుందేమో అని ఆశ. ఎన్నోసార్లు వర్షపు రాత్రులు ఎదురుచూశాను.. తనకు నేను గుర్తొస్తానేమోనని. అసలు తనకు ఆ ధ్యాసే లేదు. నాకు శంకరం మీద పిచ్చి కోపం వస్తుంది. అప్పట్లో అంత గోముగా..
‘అది పాడు! ఇది పాడు!’ అని అడిగేవాడు.. అంతలా ఎలా మర్చిపోయాడు.
డాబా మీద చాపలు పర్చుకొని, వెన్నెల్లో నక్షత్రాల కింద పడుకుని పాడుకునే పాటల కంటే బాగున్నాయా ఈ టీవీల్లో ఎవరో పాడే పాటలు. ఏసీలు, ఫ్యాన్లూ.. ఉక్కిరిబిక్కిరిగా లేదా వీళ్లకు??
ఆరుబయట కూర్చుని.. ‘నీలి మేఘాలలో గాలి కెరటాలలో!’ అని ఎంత బాగా పాడుకునేది సుగుణ. మరి ఆ గదుల్లోనే పనుల మధ్యలో ఉంచేస్తే గొంతు పూడుకుపోయిందేమో పాపం, పాడటమే ఆపేసింది. పాడే గొంతును పూడ్చేస్తే ఊరుకుంటుందా.. సుగుణ మెత్తని గుండెను ఒత్తిడి చేసింది. వీణలు మీటాల్సిన చెయ్యి.. ఏవేవో పనులు చేయాలంటే ఎందుకు వింటుంది? ఇంక లేవనంది. పాటను మర్చిపోయేటట్టు చేసిన జీవన శైలి.. బ్రెయిన్స్ట్రోక్ రూపంలో వచ్చి అన్నీ మర్చిపోయేట్టుగా చేసింది. మంచాన పడేసింది.
తనే లోకంగా బతికిన సుగుణ, మౌనంగా తన లోకంలో తాను ఉంటుంటే.. ఎలా తట్టుకోవాలో తెలీలేదు శంకరానికి. ముగ్గురు కూతుర్లూ వచ్చారు. సుగుణను చంటిపిల్లలా చూసుకున్నారు.
ఏ భావమూ లేని స్వచ్ఛమైన కళ్లతో వాళ్లను చూస్తుండేది సుగుణ. అందరూ ఇంట్లోనే ఉండటం, పిల్లలు ఇంట్లోనే ఉండటంతో.. ఎవరో మొత్తానికి పెట్టెలో ఉన్న రికార్డులను తీసి అలమరాలో పెట్టారు. నేను ఉన్న రికార్డు పైకి కనిపిస్తూ ఉండేది. సుగుణ నిశ్చలమైన చూపులు అన్నిటినీ ఒకేలా చూస్తున్నాయి. నన్ను గుర్తుపట్టలేదా!? ఈ రికార్డు చూసి నేనేమైనా తన మనసులో మెదిలితే.. ఆనక గతం ఏమన్నా గుర్తుకు వస్తుందేమో అని ఆశ నాకు. కానీ, ఏమి లాభం?? తన గొంతులో నన్ను ఇంక ఎప్పటికీ నింపుకోలేదు కదా అని పుట్టెడు దుంఖం వస్తున్నది నాకు తనను చూస్తుంటే.
తమకెన్నో తీపి గుర్తులిచ్చిన తల్లికి తామే గుర్తులేకపోవడం చాలా కష్టంగా ఉంది కూతుర్లకు. కూతుర్లూ, మనవలూ, మనవరాళ్లూ కళ్ల ముందే తిరుగుతున్నా.. ఏ భావమూ లేకుండా స్వచ్ఛంగా చూపులు ప్రసరిస్తూ నిర్వికారంగా ఉంది సుగుణ.
ఒకరోజు పెద్ద మనవరాలు అలమరాలో నేను ఉన్న రికార్డును తీసి..
“ఇది ఏంటి తాతయ్యా!?” అని అడిగింది.
నా దృష్టి అంతా సుగుణ మీదే ఉంది. వాళ్లంతా మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఆ రోజుల్లో ఆ రికార్డులు ఎలా ఉండేవో!? గ్రాంఫోన్ మీద ఎలా పెట్టేవారో పిల్లలకు చెబుతున్నాడు శంకరం. సుగుణ కళ్లల్లో వచ్చిన చిన్న మార్పును గమనించలేదు ఎవరూ.
హఠాత్తుగా ఆఖరి మనవరాలు..
“అమ్మమ్మ తల తిప్పి మనవైపు చూస్తున్నది” అన్నది.
శంకరం ఒక్కసారిగా..
“సుగుణా! సుగుణా!” అంటూ దగ్గరికి వెళ్లాడు.
అందరూ ఆ రికార్డును ఎలా ప్లే చేయాలి అనే హడావుడిలో ఉన్నారు.
అయ్యో.. శంకరం! ఇంకా గుర్తు రాలేదా!. పోనీ నన్ను ఏదైనా టేప్రికార్డరో అయినా పెట్టి వినిపించొచ్చు కదా. సెల్ఫోన్లో కూడా వినిపిస్తారు కదా. నేను ఎవరికీ తట్టలేదా ఏంటి?
ఎవరో చెప్పారు పాత గ్రాంఫోన్ రికార్డులు దొరికే షాపు ఒకటి ఉందని. అర్జెంట్గా మనిషిని పంపి తెప్పించారు. నాకు ఎక్కడో ఆశ! గ్రాంఫోన్ మావయ్య ఏమన్నా వస్తాడేమోనని. కానీ కాదు.. ఇంకేదో పాత గ్రాంఫోన్ ప్లేయర్ వచ్చింది.
నేను ఉన్న రికార్డుని పెట్టి ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సుగుణ చూపులన్నీ ఆ రికార్డు కవర్ మీదే ఉన్నాయి. వీళ్లెవరికీ తెలీదు. శంకరానికేమో గుర్తురావడం లేదు. సుగుణ నన్ను కోరుతున్నది. నన్ను వినాలని అడుగుతున్నది. అందులో నేను ఉన్నానని వీళ్లకు తెలీదు. అయ్యో ఎలా?? ఆ పాత రికార్డు ప్లేయరు బరబరా గీరుతున్నది. కానీ, మేము బయటికి రాలేక పోతున్నాం. ఇక నేనే ఎలాగోలా బయటికి రావాలని ప్రయత్నం చేశాను.
‘ఓ సజనా.. బరా బహార్ ఆయి!’..
“ఓహ్!” అని అందరూ చప్పట్లు కొడుతూ రికార్డర్ పని చేసిందని సంతోష పడుతున్నారు.
‘బర్సే పుకార్ ఆయి..’ అని ఇంకా నేను వస్తున్నాను.
నేను సుగుణ వంకే చూస్తున్నాను. ఆమె కళ్లు ఒక్కసారి ఆనందంగా వెలిగాయి. తన పెదాల మీదికి చిన్న చిరునవ్వు వచ్చి గాలిలో కలిసిపోయింది. నన్ను పలకరించింది.. నన్నే పలకరించింది.
“అమ్మమ్మ నవ్వింది!” అన్నారు పిల్లలు.
ఇంతలో పాట ఆగిపోయింది. ఎవరో మళ్లీ ప్రయత్నం చేస్తున్నారు పాట రావాలని.. కానీ నేనింక రాను. సుగుణ వెళ్లిపోయింది. అది నాకే తెలుసు. వీళ్లింకా గమనించలేదు. ఇంక నేను వినిపించను.
బయట చిన్నగా వాన పడుతున్నది. ఇలాంటి వానంటే సుగుణకు ఎంత ఇష్టమో! నేను వెళ్లాలి.. నీలి మేఘాలలో తను మళ్లీ కలుస్తుందేమో! సెలవా మరి!
* * *
ఎం.రామలక్ష్మి స్వస్థలం పాలకొల్లు. శ్రీకాకుళం జిల్లాలో విద్యాభ్యాసం కొనసాగించారు. తిరుపతి మహిళా యూనివర్సిటీ నుంచి ఎంఏ (సొషల్ వర్క్) పట్టా అందుకున్నారు. యూఎస్ఏలో ఎంఎస్ (కంప్యూటర్ సైన్స్) చేశారు. ఏడేళ్ల అమెరికావాసం తరువాత.. 2001 నుంచి 2018 వరకూ తెలుగు టెలివిజన్ రంగంలో వివిధ స్థాయుల్లో బాధ్యతలు నిర్వహించారు. మా టీవీ పునాది కార్యక్రమల రూపకల్పన, భక్తి టీవీ, ఎస్వీబీసీలలో ప్రోగ్రామింగ్ అధికారిగా, భారత్ టుడే చానల్కు కార్యనిర్వహణాధికారిగా విధులు నిర్వహించారు. భారత్ టుడే చానల్లో ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమ్మనికి ప్రయోక్తగా అనేకమంది ప్రముఖులను ఇంటర్వ్యూలు చేశారు. ‘అమ్మ’ జ్ఞాపకంతో రాసిన ‘నీవు పాడే పాట’.. రచయిత్రికి మొదటి కథ.