హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గట్టి షాక్ ఇచ్చింది. ఉద్యోగాల భర్తీ అప్లికేషన్ ఫీజును తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ) భారీగా పెంచింది. ఇప్పటి వరకు రూ. 200గా ఉన్న ఫీజును ఏకంగా వెయ్యికి పెంచింది. ఒకేసారి 400% ఫీజులను వడ్డించింది. కొత్తగా ఐదు నోటిఫికేషన్లు విడుదల చేయగా, ఐదింటికి రూ. వెయ్యి ఫీజు విధించింది. బీసీ విద్యార్థులకు రాయితీ ఇవ్వలేదు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ. వెయ్యి చెల్లించాల్సి ఉండగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 500 ఫీజుగా తీసుకుంటున్నది. భారీగా ఫీజులు పెంచడంపై నిరుద్యోగ యువత ఆగ్రహం వ్యక్తంచేస్తున్నది. నమ్మి ఓట్లేస్తే తమను నట్టేటముంచారని ఫైర్ అవుతున్నది. ప్రజాపాలన అంటే ఇదేనా? అని నిలదీస్తున్నది. ఉద్యోగాల భర్తీయేమో గానీ.. మా జేబులకు చిల్లులుపెడతారా? అంటూ మండిపడుతున్నది. పెంచిన ఫీజులను రూ. 200కు తగ్గించాలని, లేదా నిరుద్యోగులందరికీ ఉచితంగా దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నది. ఒకే తరహా పోస్టులు, ఒకే అర్హత గల పోస్టులకు కంబైన్డ్ నోటిఫికేషన్లు జారీచేయాలని కోరుతున్నది.
కేసీఆర్ సర్కార్ హయాంలో ఉద్యోగాల దరఖాస్తు ఫీజు రూ. 200 మాత్రమే. నిరుద్యోగుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అప్పట్లో తక్కువగా తీసుకున్నారు. అంతేకాకుండా ఒకే విభాగానికి చెందిన పోస్టులకు ఉమ్మడి నోటిఫికేషన్లు జారీచేశారు. కానిప్పుడు దరఖాస్తు ఫీజును ఏకంగా వెయ్యికి పెంచారు. అశోక్నగర్, దిల్సుఖ్నగర్, చిక్కడపల్లిలో ఏండ్లుగా గదులు అద్దెకు తీసుకుని పూట గడవడమే కష్టంగా మారి, అప్పులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ఈ ఫీజుల పెంపు గుదిబండలా మారింది. ఒకే అభ్యర్థి నాలుగైదు రకాల పోస్టులకు పోటీ పడాలంటే గతంలో రూ.వెయ్యి ఉండగా, ఇప్పుడు రూ. 5వేలు సమర్పించుకోవాల్సి వస్తున్నది. చేతిలో చిల్లిగవ్వలేక.. ఫీజుల కోసం తల్లిదండ్రులను డబ్బులు అడగలేక నిరుద్యోగ యువత సతమతమవుతున్నది. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసే వారి నుంచి నయా పైసా ఫీజులు తీసుకోబోమని కాంగ్రెస్ ఏకంగా అభయహస్తం మ్యానిఫెస్టోలో ప్రకటించింది. కానీ ఈ హామీని అటకెక్కించింది.

టీజీపీఎస్సీ జారీచేసిన నోటిఫికేషన్లకు పరీక్ష ఫీజు కూడా వసూలు చేస్తున్నారు. ఈ ఫీజు కింద రూ. 120 తీసుకునేవారు. ఈ పరీక్ష ఫీజు మినహాయింపులోనూ టీజీపీఎస్సీ వివక్ష ప్రదర్శించింది. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్తోపాటు 18 నుంచి 44 ఏండ్ల లోపున్న రాష్ర్టానికి చెందిన నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పుడేమో కేవలం నిరుద్యోగులకు మాత్రమే పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. దీంతో ఎక్స్ సర్వీస్మెన్, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీకి చెందిన కొందరు పరీక్ష ఫీజు మినహాయింపునకు నోచుకోలేకపోతున్నారు. దీనిపైనా నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు.