NT Stories | “పప్పా.. హమ్ కాలేజ్ జావ్ చూ!” అంటూ తను కాలేజీకి వెళ్తున్నానని రాజేశానికి చెబుతూ.. సైకిలెక్కి బయల్దేరింది సుభద్ర.
“తే బరా బరా చే!”.. అని గుజరాతీలోనే ‘సరేనమ్మా!’ అంటూ కూతురుకు బదులిచ్చాడు రాజేశం.
అసలుకు రాజేశం సొంతూరు వరంగల్ దగ్గరి శంభునిపేట. కట్టుబట్టలతో ఊరును వదిలి.. సూరత్లో అడుగుపెట్టి ఇప్పటికి ఇరవై రెండు ఏండ్లయితాంది. అప్పుడాయన వయసు ఇరువై ఏండ్లు. వచ్చిన నాల్రోజులకే డైమండ్ నగర్లోని ఓ బట్టల మిల్లులో పని దొరికింది. రోజుకు పన్నెండు గంటల పని. మిల్లు పక్కనే ఉన్న కిరాయి గదిలో కూడా పగలో – రాత్రో పన్నెండు గంటలు మాత్రమే ఉండచ్చు. పనిలో ఉన్నా, పడుకున్నా మగ్గాల టకటక చప్పుడు మాత్రం చెవుల దగ్గరే ఉంటది. ఇప్పుడు ఒడిశా కార్మికులు ఉండే కిస్మత్ కాలనీలో నివాసం. రాజేశం భార్య పేరు దీపాలి బెహరా. ఆమె ఒడిశాలో పుట్టి పెరిగింది. రాజేశం ‘దీప’ అని పిలుస్తాడు. వీళ్లకు ఒక్కతే బిడ్డ. కొడుకుల్లేరు. రాజేశం తల్లి పేరు భద్రమ్మ. ఆ పేరు కలిసేలా బిడ్డకు ఈ పేరు పెట్టాడు. సుభద్ర ఇప్పుడు బీఏ చదువుతున్నది. ఇన్నేండ్లు ఇంటి ముచ్చట తెలువకుంటనే బతుకుతున్నడు. లేక లేక పుట్టిన కొడుకు ఎటు పోయిండో ఆ తల్లికి తెలియదు. తల్లి బతికి ఉందో లేదో ఈ కొడుక్కు తెలియదు. అప్పటికే తల్లి అరవై ఏండ్లామె. ఇప్పటికి బతికి ఉండే అవకాశం లేదని మల్లేశం మనసులోనే తల్లిని తలచుకొంటూ బాధ పడుతూ ఉంటాడు. అక్క సుగుణ తనకన్నా ఐదేండ్లు పెద్దది. పెండ్లయింది. రాజేశం ఊరిడిసేనాటికి సుగుణకు రెండేండ్ల వయసు కొడుకు ఉండె. అక్కంటే రాజేశానికి ఎంతో ఇష్టం. అల్లుణ్ని ఎత్తుకొని ఆడుకున్న రోజులు ఇంకా గుర్తున్నయి. తల్లి మాదిరే అక్క కూడా తన కోసం ఏడ్చి ఏడ్చి ఊర్కున్నదేమో అని దిగులు పడుతుంటాడు. ఈ బాధలన్నీ తనకే కానీ దీపకు, సుభద్రకు ఏమీ తెలియదు. దీప దృష్టిలో ఆయనొక అనాథ. సూరత్లనే పుట్టి.. గుజరాతీ పిల్లలా పెరిగిన సుభద్ర తానొక వలస కార్మిక కుటుంబపు పిల్లను అనుకుంటుంది. దీపాలి తండ్రి సూర్యకాంత్. ఒడిశా నుంచి ఎప్పుడో వచ్చి మిల్లు పనిలో చేరాడు. ఆమె తల్లి చిన్నప్పుడే కాలం చేసింది. సూర్యకాంత్ అనారోగ్యంతో చనిపోతే.. సేట్లు ఎలాంటి పరిహారం ఇచ్చేందుకు ముందు ఒప్పుకోలేదు. మిల్లులో కాక ఇంట్లో చచ్చిపోతే పైసా ఇయ్యమని అన్నారు. సమ్మె నోటీసు ఇచ్చినంక వాళ్లు దిగి రాక తప్పలేదు. అప్పుడు యూనియన్ లీడర్గా ఉన్న రాజేశానికి దీప పరిచయమైంది. ఆమె ముఖంలో సూర్యకాంతే దీనంగా కనిపించాడు. ఒంటరిగా ఎలా బతుకుతుందని ఇంటికి తెచ్చుకొని ఇల్లాల్ని చేసుకున్నాడు.
* * *
రాజేశానికి తాను ఊర్లో విన్న ఆనాటి చివరి తెలుగు మాటలు ఇంకా గుర్తున్నాయి.
“పోరండ్ల రాజేశం ఇల్లెక్కడ?” ఒక గొంతు మెల్లగా అడుగుతున్నది.
అప్పుడు రాత్రి ఒంటిగంట దాటింది. ఆ మాటకు అరుగు మీదనే పడుకున్న రాజేశానికి తెలివైంది. బేల్ కట్ పట్టీల పొక్కల్లోంచి బయటికి చూసిండు. బయట మంచంల పడుకున్న లచ్చన్నను లేపి అడుగుతున్నారు.
“కాలేజీల చదువుకుంటడు”.. అని ఇంకో మనిషి ప్రశ్న.
వెంటనే రాజేశం లేచి డ్రెస్ సంకలపెట్టుకొని ఇంటెనుక తలుపు తీసుకొని బయటకొచ్చిండు. పక్కింటి పరారీ గోడ దుంకి చింతకింది మూలకు చీకట్ల ఉన్న పాయిఖానాల దాక్కున్నాడు. పెరట్ల లైట్ వెలిగింది. తెరిచిన చిన్న తలుపులోంచి ఇద్దరు సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుళ్లు బయటికి వచ్చినారు. అటు ఇటు వెతికి.. కోపంగా బూతులు తిడుతూ వెళ్లిపోయారు. కొద్దిసేపు ఆగి చీకట్లనే ఊరు దాటిండు. తల్లిని కలవాలని ఉన్నా ఏ ప్రమాదం పొంచి ఉందోనని భయపడ్డాడు.
బీఏ చదువుతున్న రాజేశం ఇట్లా ప్రాణభయంతో ఊరు దాటడానికి కారణమేమిటంటే.. ఆ రోజు ఓ కాలేజీ స్టూడెంట్ హత్య జరిగింది. కాలేజీలో రెండు యూనియన్లు ఉండేవి. రెండిటి మధ్య ఎప్పుడూ కొట్లాటలే. పొద్దున్నే రూములో వ్యాయామం చేస్తున్న విద్యార్థిని కొట్టడానికి వెళ్తే.. అది ఆయన చావు దాక వెళ్లింది. రాజేశం.. దాడి చేసిన వారి పక్షం. తాను రూములోకి వెళ్లలేదు కానీ బయట సైకిల్ మీద ఉన్నాడు. కొట్టి బయటికి రాంగానే, ఒకణ్ని సైకిలుపై ఎక్కుంచుకొని పోయిండు. అంటే దాడి చేసిన వారిలో ఒకడు అన్నట్లే!
అదేరోజు ఒంటి గంటకు కాలేజీ గేట్ దగ్గరికి పోలీసులు వచ్చారు. బయటికెళ్తున్న స్టూడెంట్లలో ఇద్దరిని పట్టుకొని, అందరి ముందే బట్టలూడదీసి కట్ డ్రాయర్ మీదుంచి కొట్టుకుంటూ, తన్నుకుంటూ పట్టుకుపోయారు. వారి వెనుకే రాజేశం ఉన్నాడు. పోలీసులు తనను చూసి కూడా వదిలేసేసరికి ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఊహించని రీతిలో పోలీసులు అర్ధరాత్రి ఇంటికి రావడంతో కథ మారిపోయింది.
అయితే రాజేశానికి తెలియని అసలు సంగతి మరోటుంది. ఆ రోజు ముందటి రాత్రి హసన్పర్తిలో నక్సలైట్లు ఓ భూస్వామిని చంపేశారు. వచ్చిన దళంలో ఒకరు ‘రాజేశం.. కానియ్’ అన్నారని, ఆ వెంటనే తుపాకీ పేల్చిన చప్పుడచ్చిందని విన్నవారు పోలీసులకు చెప్పారు. ఆ మాట.. ఈ రాజేశం మెడకు చుట్టుకుంది. దానికి కూడా ఒక బలమైన నేపథ్యముంది.
అదేమిటంటే.. రాజేశానికి పాటలంటే మహా ఇష్టం. మంచిగా పాడుతాడు కూడా. ఆ పాటలు విన్న తెలుగు లెక్చరర్ ఓ రోజు ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ మరో పది మంది స్టుడెంట్స్ ఉన్నారు.
లెక్చరర్ మాట్లాడుతూ..
“ఈ వేసవి సెలవుల్లో మీరంతా ‘గ్రామాలకు తరలండి ప్రోగ్రాం’లో పాల్గొనాలి. ఊర్లలో వెట్టి చాకిరీ, తక్కువ కూలీరేట్లు కొనసాగుతున్నాయి. వీటికి వ్యతిరేకంగా పోరాడేందుకు గ్రామాల్లో సంఘాలు ఏర్పడాలి. గ్రామస్తులకు ఈ విషయాలన్నీ వివరించేందుకు ఊర్లలో అక్కడక్కడా మీరు మీటింగులు పెట్టాలి. మీరు హసన్పర్తి వెళ్లాలి. అదే ఊర్లో దళితవాడల్లో తింటూ పడుకోవాలి. మన రాజేశం మంచి పాటగాడు. ఊర్లలో పాడే పాటల పుస్తం ఆయనకు ఇస్తా. ప్రాక్టీస్ చేస్తాడు. స్పీచ్లు ఇచ్చేవాళ్లకు నేను ట్రైనింగ్ ఇస్తాను. సరేనా!?” అన్నాడు
అసలు టైముకు సగం మంది జారుకున్నారు. మిగిలిన అయిదుగురు చిన్న సంచుల్లో బట్టలు సర్దుకొని హసన్పర్తికి వెళ్లారు. వారిలో రాజేశం ఒకడు. పోయిన రోజే హోటల్ దగ్గర చాయ్ తాగుతూ అక్కడున్నవారితో తాము వచ్చిన పని గురించి చెప్పారు. కొందరు ఆసక్తిగా విన్నారు. కొందరు సరే బాగుందన్నారు. వచ్చిన పని తొందరగానే లైన్లో పడిందని వారిలో హుషారు పెరిగింది. రాజేశం ఆగలేక ఒక పాటెత్తుకున్నాడు. మరింత మంది గుమికూడారు.
పొద్దు గుంకినంక తమ వాడల మీటింగ్ పెట్టుండ్రని కొందరు ముందుకొచ్చారు. ఇదంతా జరిగిన గంటకే వీరికోసమే అన్నట్లు పోలీసు జీపు వచ్చి ఎదురుగా, అడ్డంగా ఆగింది. దాన్ని చూడగానే భయపడిపోయి తలో దారి పరుగు తీశారు. పోలీసులు వెంటపడి ముగ్గురిని పట్టుకున్నారు. చిక్కినవారిలో రాజేశం ఒకడు. వీరి సంచుల్లో ఉన్న పుస్తకాలను చూసి స్టేషన్కు తీసుకెళ్లారు. రెండు రోజులు పగలు – రాత్రి లాకప్లో పోలీస్ మర్యాదలు. అయినా లెక్చరర్ పంపాడని చెప్పలేదు. మరునాడు ఓ అడ్వకేట్ వచ్చి వారిని విడిపించుకు వెళ్లాడు. పోలీసులు ఈ ముగ్గురి వివరాలు, ఫొటోలు, వేలుముద్రలు తీసుకున్నారు. ఇది జరిగిన మూణ్నెల్లకు హసన్పర్తిలో భూస్వామి హత్య జరిగింది. రాజేశానికి దీనితో సంబంధం ఉన్నదని నమ్మిన పోలీసులు ఆ రాత్రి ఇంటికి వచ్చారు. ఇలా పారిపోవడంతో రాజేశంపై హత్య కేసు నమోదు చేసి, నక్సలైటుగా ముద్ర వేసి.. పరారీలో ఉన్నట్లు రికార్డు చేసుకున్నారు.
* * *
ఇక్కడ మాత్రం అది తన గతమే కానట్లు వలసకూలీగా రాజేశం బతుకు బండి సాగుతున్నది. పెరుగుతున్న కూతురును చూస్తుంటే రాజేశానికి ఎప్పటినుంచో.. ‘నీకో బావ ఉన్నడే..’ అని చెప్పాలని అనిపిస్తుంది. బిడ్డను తన అల్లుడికిచ్చి పెళ్లి చేయాలని ప్రాణం కొట్టుకుంటున్నది. కూతురు పుట్టకపోతే ఈ బంధాలే గుర్తుకు వచ్చేవి కాదేమో!?
‘అక్క ఎలా ఉందో? అల్లుడు ఎంతవాడయ్యాడో.. ఏం చేస్తున్నాడో!?’.. అని మనసు ఇప్పుడు ఎత్తయిన కొండ దాటి ఆ వైపు చూడాలని ఆశపడుతున్నది. ఏదో కావాలని మనసు బలంగా కోరుకున్నప్పుడు.. అది ఒకవైపే ఆలోచిస్తుందనడానికి రాజేశం వేసిన అడుగే రుజువు. ఇన్నాళ్లకు తన అక్కకు ఉత్తరం రాయాలనుకున్నాడు రాజేశం.
ఓరోజు రాత్రి షిఫ్టు నుంచి వస్తూ పోస్టాఫీసుకు పోయి అక్క పేరిట ఉత్తరం రాసి డబ్బాలో వేసి వచ్చాడు. ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. తాను మాత్రం ఫలితాల కోసం చూసే విద్యార్థిలా.. జవాబు కోసం ఎదురుచూస్తున్నాడు. వారం గడిచింది.
రాత్రి ఎనిమిదింటికి డ్యూటీ చేసి వచ్చిన రాజేశం స్నానం చేసి అన్నం గిన్నె కోసం ఎదురుచూస్తూ, వాకిట్లో మంచం మీద కూర్చున్నాడు. మెల్లగా నడుచుకుంటూ వచ్చిన నలుగురు ఆయన ముందుకొచ్చి నిలబడ్డారు.
“నీ పేరేంది?” అని ఒకాయన అడిగాడు.
ఏమీ ఆలోచించకుండానే..
“రాజేశం” అన్నాడు.
వెంటనే నలుగురు రాజేశంను అదిమి పట్టుకొని బయటికి తీసికెళ్లారు.
“మీరెవలు? నన్నెటు తీస్కపోతుండ్రు?” అన్నా.. జవాబు ఇయ్యకుండా బయట సిద్ధంగా ఉన్న కార్లో వేసుకొన్నారు.
చప్పుడు విన్న దీప.. పళ్లెం చేత్తో పట్టుకొని పరుగున రాగానే కదిలిపోతున్న కారు ఆమెకు కనిపించింది.
వెంటనే లోపలి గదిలో చదువుకుంటున్న బిడ్డకు విషయం చెప్పింది. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కు పరుగుతీశారు.
ఇన్స్పెక్టర్తో సుభద్ర మాట్లాడుతూ..
“మారా పితనే కోయి లెయి గయు!” అన్నది.
“తెలంగాణ పోలీస్ తేనే లెయ్ గయి!” అని చెప్పాడాయన.
“సా మాటే!? (ఎందుకు?)” అని అడిగింది.
“ఆమ్నె ఖబర న థీ!” అంటూ తనకు తెలియదని చెప్పాడు ఇన్స్పెక్టర్.
అసలు ఈ తెలంగాణ ఏమిటి? అక్కడి పోలీసులు ఈయన్ని తీసుకుపోవడమేమిటి.. తల్లీ కూతుళ్లకు ఏమీ అర్థం కాలేదు.
అదే రాత్రి యూనియన్ లీడర్ దగ్గరికి వెళ్లారు. తాను ఎమ్మెల్యేను వెంటబెట్టుకొని, లేబర్ మినిస్టర్ని కలిసి.. రాజేశం ఎక్కడున్నా ఇంటికి రప్పిస్తానని భరోసా మాట చెప్పాడు యూనియన్ లీడర్. అంతకుమించి ఏమిచేయలేని తల్లీకూతుళ్లు.. భారంగా ఇంటికి తిరిగి వచ్చారు.
* * *
రాజేశం తన అక్కకు రాసిన ఉత్తరం శంభునిపేట పోస్టాఫీసు నుంచి సుగుణ చేతికి రాకుండా సరాసరి పోలీస్ స్టేషన్కు చేరింది. నక్సలైట్ల కట్టడి, ఆచూకీ కోసం పోలీసు నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న యుద్ధతంత్రంలో భాగంగా ఆ ఉత్తరం గమ్యం మారింది.
హసన్పర్తి భూస్వామి హత్యతోపాటు పలు తీవ్రవాద సంఘటనలతో సంబంధమున్న దళసభ్యుడు రాజేశం.. ఇన్నాళ్లకు పోలీసులకు చిక్కాడని ఫొటోతో సహా పత్రికల్లో వార్త వచ్చింది. పొద్దున్నే పత్రికలో రాజేశం ఫొటో, వార్త చూడగానే ప్రకాశ్ షాక్ అయ్యాడు.
‘అయ్యో.. ఇట్లయిందేంది!?’ అనుకున్నాడు.
ప్రకాశ్.. జనవాణి పత్రికలో సీనియర్ జర్నలిస్టు. చదువుకునే రోజుల్లో విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న అనుభవంతోపాటు విలేకరిగా నక్సల్స్ వార్తలు, కథనాలు రాసిన అనుభవం ఆయనది. తనకు తెలిసిన వాస్తవాన్ని చెప్పేందుకు వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లాడు.
సర్కిల్ ఇన్స్పెక్టర్ను కలిసి..
“సార్.. ఇది నక్సలైట్ రాజేశం ఫొటో కాదు. ఈయనెవరో అమాయకుడు” అన్నాడు.
“లేదయ్యా బాబు.. ఈయన మా రికార్డుల్లో తప్పించుకు తిరుగుతున్న నక్సలైట్గా ఎప్పుడో రాసుంది. నేను కొత్తగా ఎక్కించింది కాదు” అని చెప్పాడు ఇన్స్పెక్టర్.
కానీ, ఆయన మాటలు ప్రకాశ్ నమ్మలేదు.
“అసలు రాజేశం కాలేజీలో నా క్లాస్మేట్. నాకు బాగా తెలుసు. ఆయన ఊరు కేశవపట్నం. ఇప్పటికీ ఆయన అన్నదమ్ములు ఆ ఊర్లోనే ఉన్నారు” అని చెప్పాడు.
“సరే.. చూద్దాం” అంటూ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏదో పని ఉందంటూ వెళ్లిపోయాడు.
ప్రకాశ్ సరాసరి మోటార్ సైకిల్పై కేశవపట్నం వెళ్లాడు. రాజేశం తమ్ముడు సుధాకర్కు విషయం చెప్పి, ఒప్పించి.. ఆయన ఆధార్, ఓటర్ కార్డులు తీసుకొని తనవెంట పోలీస్ స్టేషనుకు తీసుకొచ్చాడు.
“సార్.. ఈయన కేశవపట్నం రాజేశం సొంత తమ్ముడు సుధాకర్. మీరు సూరత్ నుంచి తెచ్చిన రాజేశంను ఈయనకు చూపిస్తే.. అతడు తన అన్న అవునా కాదా చెప్పేస్తాడు” అన్నాడు కొంత ప్రాధేయపూర్వకంగా.
ఇన్స్పెక్టర్ కూడా కొంత మెత్తబడి.. సుధాకర్ వెంట తెచ్చిన రుజువులను పరిశీలించాడు.
తండ్రి పేరు, ఊరు వివరాలు, రాజేశం చదువుకున్న స్కూళ్లు, దగ్గరి దోస్తులు, బంధువుల వివరాలు నోటు చేసుకున్నాడు.
ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే.. నేరగాడు జారిపోవడమే కాకుండా తనకు పెద్ద రిమార్కు వస్తుందని ఆయన మనసులో ఉన్నది.
“కొద్దిసేపు మీరు బయట ఉండండి. నేను డీఎస్పీ సార్తో మాట్లాడి చూస్తాను” అన్నాడు నిదానంగా.
అరగంట తర్వాత ఓ కానిస్టేబుల్ వచ్చి..
“సార్ రమ్మంటున్నారు” అంటూ ప్రకాశ్ను లోపలికి తీసుకెళ్లాడు.
“రాజేశంను కలిసేందుకు సార్ పర్మిషన్ ఇచ్చారు. ‘ఇదేదో తెల్లగోలు అవడం అందరికి మంచిదే!’ అన్నారు. మీరు నాలుగు గంటలకు రండి.. వెళ్దాం” అన్నాడు సీఐ.
బయటికి వచ్చిన ప్రకాశ్.. సుధాకర్ను ఎటూ పోనీయకుండా తన ఇంటికే తీసుకెళ్లాడు.
భోజనం చేసి ముచ్చట్లతో గడిపి.. ఇద్దరూ మూడింటికే స్టేషన్కు బయల్దేరారు.
ముగ్గురూ కలిసి పోలీస్కారులో జైలులో ఉన్న రాజేశం దగ్గరికి వెళ్లారు..
“రాజేశం.. మీ తమ్ముడు నిన్ను కలవడానికి వచ్చాడు. చూడు.. ఏమైనా మాట్లాడేది ఉంటే మాట్లాడు” అన్నాడు సీఐ నిదానంగా.
ఆ మాట విన్న రాజేశం కన్నీళ్లతో చేతులెత్తి మొక్కుతూ..
“సార్.. నేను ఒక్కణ్నే! నాకు అన్నదమ్ములు లేరు. ఈయనెవలో నేనెన్నడూ చూడలేదు. సూరత్ నుంచి నన్నెందుకు తెచ్చిండ్రో నాకర్థమైతలేదు. మాది శంభునిపేట. ఊర్లె మా అక్క ఉంటది. సూరత్ల భార్య – బిడ్డ ఉంటారు. వాళ్లెంత పరేషాన్ అయితున్నరో.. నేనిక్కడున్నట్లు వాళ్లకు చెప్పనైనా చెప్పండి” అని బతిమాలాడు.
“ఏదైనా ఫోన్ నెంబరుంటే నాకివ్వు” అన్నాడు ప్రకాశ్.
రాజేశం.. సీఐ వైపు చూశాడు.
రాజేశం ఫోన్ తన దగ్గరే ఉన్నదని చెప్పి.. అడిగిన నెంబర్లు ప్రకాశ్కు ఇచ్చాడు సీఐ.
“మరి నువ్వు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నవయ్యా!?” అన్నాడు సీఐ.. రాజేశంతో.
చదువుకొనే రోజుల్లో విద్యార్థి హత్య, గ్రామాలకు తరలండి.. తాను పారిపోయిన కారణాలు అన్నీ వివరంగా చెప్పాడు రాజేశం.
పోలీసులు రాజేశంను శంభునిపేటకు తీసుకెళ్లి.. సుగుణకు చూపించారు. ముందు ఆశ్చర్యపోయిన సుగుణ, విషయం తెలుసుకొని..
“మా తమ్ముడు అసుంటోడు కాదు!” అంటూ పోలీసుల కాళ్లపై పడింది.
దాంతో పోలీసులకు మరింత స్పష్టత వచ్చింది. రికార్డుల్లో ఎక్కడో తప్పు జరిగిందని వారికీ అనిపించింది. పైనుంచి అనుమతి వచ్చేదాకా రోజూ పోలీస్ స్టేషన్కు వచ్చే కండిషన్తో రాజేశంను ప్రకాశ్కు అప్పగించారు. సుగుణ తమ్ముడి వెంటే ఉంది. మరుసటిరోజు సూరత్ నుంచి ప్రకాశ్ వద్దకు వచ్చిన దీప, సుభద్ర.. రాజేశంను పట్టుకొని ఏడ్చి, విషయమంతా తెలుసుకున్నారు. ప్రకాశ్ చేసిన మేలుకు చేతులెత్తి దండం పెట్టారు. సుగుణ.. మరదలు, కోడల్ని దగ్గరికి తీసుకున్నది.
“బావ, అల్లుడు ఇంకా రాలేదేంది.. ఎక్కడున్నరట?” అడిగాడు రాజేశం.
“ఇద్దరూ షోలాపూర్ల చద్దర్ల మిల్లుల పనిజేస్తున్నరు. బండి ఎక్కిండ్రు.. రాత్రికి దిగుతరు” అన్నది సుగుణ.
‘ఏమిటి!?’ అన్నట్టు తండ్రి ముఖం చూసింది సుభద్ర.
“ససరా, బనేవి ఆవ్తా!” అన్నాడు రాజేశం.
ఆశ్చర్యంతోపాటు కొంత సిగ్గుపడిందామె.
“మొగడు.. మొగడు..” అన్నది సుగుణ నవ్వుతూ.
* * *
రచయితగా, కాలమిస్ట్గా బద్రి నర్సన్ చిరపరిచితులు. వీరి స్వస్థలం జగిత్యాల. ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. డిగ్రీ వరకూ జగిత్యాలలోనే విద్యాభ్యాసం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ, ఎంఎడ్ చేశారు. పాఠశాల స్థాయినుంచే సాహిత్యాభిలాషను పెంచుకున్నారు. ఇప్పటివరకూ 30 వరకూ కథలు రాశారు. బాల్య స్నేహితులతో కలిసి ‘సాహితీ మిత్ర దీప్తి’ అనే సంస్థ ద్వారా కవితల పోటీలు నిర్వహించారు. ఎంపికైన రచనలను పుస్తకాల రూపంలోకి తెచ్చారు. ఓయూలో చదువుతున్న రోజుల్లోనే ‘రంగుల కల’, ‘విముక్తి కోసం’ సినిమాలకు రచన, దర్శకత్వ శాఖల్లో పనిచేశారు. ఉన్నత విద్యాభ్యాసం తర్వాత తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగంలో చేరారు. 2015లో విరమణ పొందారు. పదేండ్లుగా సమకాలీన అంశాలపై వివిధ పత్రికలకు విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తున్నారు. దివంగత కవి, చిత్రకారుడు అలిశెట్టి ప్రభాకర్ కవిత్వాన్ని పుస్తకంగా తెచ్చారు. తన జీవితంలో అత్యంత సంతృప్తిని ఇచ్చిన అంశం ఇదేనని నర్సన్ చెబుతారు.