NT Stories | తెల్లవారి మాములుగా 4గంటలకు నిద్రలేచే బాలమల్లు.. గత కొద్దిరోజులుగా, నలత నలతగా నిద్రపడుతుంటే 3గంటలకు లేచి కూర్చుంటున్నాడు. మనసు నిండా ఆలోచనలు, ఆందోళన కలుగుతుంటే.. వాటి నుంచి కొంత ఉపశమనం పొందడానికి, ఇంటి ముందు ఉన్న వ్యాయామశాలలోకి తలుపు తీసుకొని వెళ్లాడు. వ్యాయామశాలలో స్విచ్ వేశాడు. వెలుతురు ఎక్కువ ఇవ్వని నాలుగు బల్బులు.. ఆ ప్రాంగణం అంతా గుడ్డివెలుగులు నింపాయి. గోడకు వేలాడుతున్న తన గురువు పహిల్వాన్ వెంకన్న ఫొటోకు దండం పెట్టుకొన్నాడు. పెయ్యి మీద ఉన్న బనియన్ విప్పి, కట్టుకొన్న దోవతిని లంగోటిలా సవరించి కట్టుకున్నాడు. స్వరం సవరించుకొని.. ఒకటి, రెండు.. అంటూ హనుమాన్ దండీలు తీయడం ప్రారంభించాడు. అలా యాభైవరకూ చేశాడు. స్టూల్ మీద ఉన్న టవల్తో చేతులు తుడుచుకొని గోడకు నిలబెట్టి ఉన్న ‘ముక్దార్స్’ను చేతుల్లోకి తీసుకొని, జబ్బ కండరాలు అదురుతుంటే గుండ్రంగా తిప్పాడు. కొంతసేపు సవ్యంగా, మరికొంత సేపు వ్యతిరేక దిశగా తిప్పాడు. అలా అరగంట వరకు చేశాడు. అలాగే యాభై కిలోల వెయిట్ లిఫ్టింగ్ చక్రాలను, నాలుగు, ఐదుసార్లు పైకి లేపుతూ, అంతే నెమ్మదిగా కింద పెట్టసాగాడు. వీలైనన్ని బస్కీలు తీశాడు. అప్పటికీ శరీరం చెమటతో నిండి పోయింది. తన గురువు బతికి ఉన్న రోజుల్లో ఇప్పుడు చేసిన ఫీట్స్ అన్నిటినీ రెట్టింపు సంఖ్యలో చేసేవాడు. అప్పటి వయసు వేరు. ఇప్పటి వయసు పైబడ్డ రోజులు వేరనిపించింది. తాను అరవై ఏళ్లు దాటినా ఈ మాత్రం చేస్తున్నందుకు మీసం మెలేసుకున్నాడు.
ఆరోజుల్లో తాను సాధించి, ర్యాకుల్లో భద్రపరుచుకున్న మెడల్స్ను గర్వంగా చూసుకొన్నాడు.
ఒకటేమిటి జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో జరిగిన కుస్తీ పోటీల్లో పొందిన కప్పులను, ప్రశంసా పత్రాలను వరుసగా అమర్చుకున్నాడు. వాటన్నిటినీ రెండు చేతుల్తో ప్రేమగా పుణికి చూసుకొన్నాడు.
ఆనాడు తనను పెద్ద పహిల్వానుగా ప్రభుత్వం గుర్తించి, రాష్ర్టపతి చేతుల మీదుగా పెద్ద షీల్డ్ అందుకొంటున్నపుడు తీసుకొన్న ఫొటోను ఫ్రేమ్ కట్టించి.. వ్యాయామశాలలో ఎదురుగా పెట్టాడు. తదేకంగా ఆ ఫొటోను చూసిన బాలమల్లు.. చేతి కండల్ని, కనుబొమ్మ బాగాల్ని చిత్రంగా ఎగిరించాడు.
అప్పటికి ఏడుగంటలు అయ్యింది. వ్యాయామశాలకు ఉన్న ద్వారం మూసి, దొడ్లోకి వెళ్లాడు. అక్కడ కట్టేసి ఉన్న ఆవులు.. తన రాకకోసం ఎదురు చూస్తున్నట్టు ఉన్నాయి.
తన భార్య వరలక్ష్మి చనిపోయిన తరువాత, వాటి ఆలనా పాలనతోపాటు పాలు పితకడం బాలమల్లు చూసుకొంటున్నాడు. రెండు ఆవుల పాలు పెద్ద సర్వలో పిండుకొని, ఇంట్లోకి వెళ్లాడు. పండ్లు తోముకొని లీటర్ పాలు తాగి బయటికి వచ్చేసరికి పూర్తిగా తెల్లవారింది. ఇంటి ముందు వరండాలోని బల్లమీద హరివరాసనం వేసుకొని సాధన చేస్తున్న మనిషిలా కూర్చున్నాడు. అలా కూర్చున్నప్పుడల్లా, అతని మనసు నిండా గతం మెదులుతూ ఉంటుంది.
* * *
బాలమల్లుది వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ, తాత, తండ్రుల కాలంనుంచే వహిల్వాన్ వంశంగా ఆ చుట్టు పట్ల గ్రామాల్లో పేరు పొందింది. తండ్రి స్థాపించిన వ్యాయామశాలలోనే వ్యాయామ విద్యల్లోని కర్రసాము, కుస్తీ పట్లు నేర్చుకున్నాడు. దానికి తోడు శరీర దారుఢ్యాన్ని పెంచుకొన్నాడు. తల్లి చనిపోయిన తర్వాత ఊళ్లో ఉన్న బడిలో పదో తరగతి వరకు చదువుకొని వదిలేశాడు.
తనకు ఇరవై ఏళ్లు దాటగానే.. మేనమామ కూతురు వరలక్ష్మితో పెండ్లి జరిపించారు. మూడు ఎకరాల భూమి వారు ముగ్గురి జీవితాలకూ ఆధారమైంది. వరలక్ష్మికి వ్యవసాయ మెలకువలన్నీ తెలుసు కాబట్టి.. అన్నీ ఆమే అయి వ్యవసాయం నడిపించింది. అప్పటివరకు బాలమల్లుకు బతుకు తేలికగానే కనిపించింది.
ఆ తర్వాత వాళ్లకు వరుసగా ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. అప్పటిదాకా కుటుంబ భారం మోయని బాలమల్లు.. తన తండ్రి కాలం చేసిన తర్వాతే సంసార భారాన్ని నెత్తికెత్తుకున్నాడు. అప్పుడే.. ‘నాకు వచ్చిన పహిల్వాన్ విద్యతో కుటుంబాన్ని నెట్టుకు రావడం ఎలా!?’ అనే భయం కూడా ప్రారంభం అయింది.
వరలక్ష్మి ఏనాడూ.. ‘మీరేం పనిచేస్తలేరు. ఇంత సంసారాన్ని ఒక్కదాన్ని ఎలా లాగించాలి!?’ అని తనను నిలదీయకపోవడం కూడా బాలమల్లుకు అవమానంగా అనిపించసాగింది.
ఆమెకు వ్యవసాయంలో ఏదైనా సాయం చేద్దామని పొలంలోకి దిగితే..
“నువ్వు ఏం చేస్తావయ్యా! నువ్వు పెద్ద పహిల్వానువుగదా! అలా వెళ్లి గట్టు మీద కూర్చో!” అనేది చిన్నగా నవ్వుతూ.
వరలక్ష్మి అలా అన్నప్పుడల్లా..
‘నా మీద ప్రేమతోనా! లేక ఎకసెక్కెంగానా?’ ఆనేది బాలమల్లుకు అర్థం కాకపోయేది.
తాను ఏ సాయం చేద్దామనుకున్నప్పటికీ.. తన సాయాన్ని అంగీకరించేది కాదు! బహుశా తన మీద ఉన్న అభిమానమేనని అర్థం చేసుకున్నాడు. సంసారం గడవడానికి తాను కూడా కొంత సంపాదించాలనుకున్నాడు.
ఒకరోజు బాగా ఆలోచించి, విశేష ప్రజాదరణతో వరంగల్లో ఆడుతున్న జెమినీ సర్కస్లో చేరాలని వెళ్లాడు. సర్కస్ మేనేజర్ బహద్దూర్ సింగ్ను కలుసుకొని, తాను గెలుచుకున్న పతకాలు, రాష్ట్రపతి రివార్డు చూపించి.. దానికి తోడు తన శరీరంలోని కండలన్నిటినీ వివిధ భంగిమల్లో ప్రదర్శించాడు.
బాలమల్లును పరీక్షగా చూసిన బహద్దూర్ సింగ్.. మంచి యువకుడు, దానికి తోడు శరీర సౌష్ఠవం గలవాడు తన సర్కస్లో పహిల్వాన్గా ఉంటే మంచి ఆకర్షణగా ఉంటుందని భావించి వెంటనే ఒప్పుకొన్నాడు. బాలమల్లు అడిగినంత జీతం కూడా ఇస్తానన్నాడు. జెమినీ సర్కస్లో బాలమల్లు చేస్తున్న పట్లు అన్నీ, పిల్లల్ని పెద్దల్ని బాగా ఆకర్షిస్తుంటే.. ‘సర్కస్ పహిల్వాన్’గా పేరు సంపాదించుకొన్నాడు.
సర్కస్ వాళ్లతో రెండు మూడు రాష్ట్రాలు కూడా తిరిగాడు. నెలనెలా వచ్చే జీతం ఇంటికి పంపేవాడు. వీలైనప్పుడల్లా ఇంటికి వచ్చి పిల్లల్ని చూసుకొనేవాడు.
* * *
కొంతకాలం బాగానే గడిచిపోయింది. ‘వన్యప్రాణుల సంరక్షణ’ అంటూ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం వల్ల సర్కస్లోని వన్యప్రాణులన్నిటినీ ప్రభుత్వానికి అప్పగించారు.
దాంతో సర్కస్ మూతపడి పోయింది. తనలాంటి ఎందలో కళాకారుల బతుకులు బజారు పాలయ్యాయి. కొంతమంది కళాకారులు తమకు వచ్చిన విద్యలను నగర కూడళ్లలో ప్రదర్శిస్తూ జీవితాన్ని గడపసాగారు.
అది కూడా ఎంతోకాలం సాగలేదు. కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే.. అదో విషాదగాథ అనిపిస్తుంది.
సర్కస్ విద్యలు నిరాదరణకు గురికావడం వల్ల అన్నీ మూతపడిపోయాయి. సర్కస్ గురించిన విశేషాలను, ఈనాటి తరానికి కథలు కథలుగా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాలమల్లు బాధపడేవాడు.
తన ‘సర్కస్ పహిల్వాన్’ ఉద్యోగం మూన్నాళ్ల ముచ్చటగా ముగిసిపోవడంతో తిరిగి ఇల్లు చేరాడు.
తనకు తన కుటుంబానికి ఇంత తిండి పెట్టలేని తన విద్య మీద ఏవగింపు కలిగింది బాలమల్లుకు.
కానీ, కోడి రామకృష్ణ, దారాసింగ్ లాంటి యోధుల్ని ఆదర్శంగా తీసుకొని సాగాలనుకొన్న తన దృఢ నిశ్చయాన్ని సడలనివ్వలేదు.
కొంతమంది యువకుల్ని తన వ్యాయామశాలలో చేర్చుకొని, వాళ్లకు శిక్షణ ఇస్తూ.. కొత్త ఉపాధి పొందాడు.
బాలమల్లు నేర్పించే విద్యల్ని శిష్యులు కూడా శ్రద్ధగా నేర్చుకొని, ఇంటర్వ్యూలకు వెళ్లి.. పోలీస్ ఆఫీసర్లుగా, వ్యాయామ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించుకొన్నారు. ఆ తర్వాత బాలమల్లుకు పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చుకొని ఘనంగా సన్మానించుకొనేవారు.
ఇప్పటికీ తన శిష్యులు ఎంతో అభిమానం చూపిస్తూనే ఉన్నారు.
తనకు కష్టకాలం వచ్చిందని కాలం ఆగలేదు. రెండు ఎకరాలు అమ్ముకొని ముగ్గురు ఆడపిల్లల పెండ్లిళ్లు చేశాడు.
కొన్నాళ్లు సంతోషంగా ఉన్నారు. అయితే, ఆ సంతోషం ఎంతో కాలం నిలువలేదు.
ఇంతలోనే వరలక్ష్మి తీవ్ర జబ్బుపడింది. ఆమెకు వచ్చిన రోగం ఏమిటో తెలియక ముందే ఉన్న ఎకరం భూమి కూడా అమ్మక తప్పలేదు.
అన్నిటినీ గమనిస్తున్న వరలక్ష్మి ఒకరోజున..
“ఏమయ్యా! నన్ను పట్టుకొని ఎన్ని ఆసుపత్రులు తిరిగినా.. నా వ్యాధి ఇదీ అని డాక్టర్లు చెప్పలేక పోతున్నారు. పిల్లల పెండ్లిళ్లు చేశాం. నాకా తృప్తి చాలయ్యా! నా కోసం నువ్వు మరింత పైసలు ఖర్చుపెడుతూ అప్పుల పాలుకాకు. నేను బతికి బట్టకట్టేలా లేను. దండం పెడతాను.. నువ్వు మాత్రం అప్పులు చేయకు!” అంటు ప్రాధేయపడింది.
“లక్ష్మీ! భర్తగా నా కర్తవ్యం నన్ను చేయనీయి. లేకుంటే నా బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లు అవుతుంది?” అంటూ ఆమెను ఒప్పించాలని అన్నాడు.
ఆమె సుతారంగా ఆయన నోరు మూస్తూ..
“నువ్వు నా కోసం చాలా చేశావయ్యా! నిన్ను చేసుకొని నేను సుఖపడ్డాను కానీ, నువ్వే నన్ను చేసుకొని ఏం సుఖపడలేదయ్యా! నా మాట నమ్ము”.. అంటూ, బాలమల్లును నిలువరిస్తూనే కళ్లుమూసింది.
వరలక్ష్మి అర్ధాంతరంగా వెళ్లిపోయినందుకు, బాలమల్లు కంటినుంచి చుక్క కన్నీరు కూడా రాలేదు.
కానీ, గుండె మాత్రం గాయపడ్డది.
* * *
ఆలోచిస్తున్న కొద్దీ గతమంతా చిక్కులుపడ్డ దారపు ఉండలా ఉంది. దానిలోంచి ఏ పోగు లాగినా.. నిరాశాజనకంగానే ఉంది. ఏ ఒక్కటీ ఆశాజనకంగా ముందుకు సాగడం లేదు.
‘అలా ఉంటేనే బతుకు అవుతుందేమో!’ అనుకొన్నాడు బాలమల్లు నిర్లిప్తంగా.
అప్పుడే బుల్లెట్ బండిమీద వచ్చిన బాలమల్లు ప్రియ శిష్యుడు ముకుందం.. అంతదూరం నుండే దండంపెడుతూ వచ్చాడు. ముకుందాన్ని కళ్లతోనే పలకరించి చేతితో ఆహ్వానిస్తూ.. కూర్చోమంటూ కుర్చీ చూపించాడు.
“ఆ! చెప్పు ముకుందం! నువ్వు వెళ్లిన పని ఏమైంది?” అంటూ అడిగాడు బాలమల్లు.
“దొరా! స్కూల్ హెడ్ మాస్టర్గారిని కలిశాను. ‘మీ స్కూల్ పిల్లల కోసం మా గురువు పహిల్వాన్ బాలమల్లు గారి ప్రోగ్రాం ఏర్పాటుచేయండి. మీ పిల్లల వద్ద నుంచి తలా యాభై రూపాయలు వసూలు చేసి ఇచ్చినా.. మా గురువుగారిని ఆదుకున్నవారు అవుతారు’ అని చెప్పాను. కానీ, ఆయన.. ‘ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా బాలమల్లుగారి ప్రోగా్రం ఏర్పాటు చేసేవాణ్ని. కానీ, స్కూల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. అందుకే ఈసారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేకపోతున్నా. దయచేసి గురువుగారిని ఏమీ అనుకోవద్దని చెప్పండి!’ అంటూ ప్రాధేయపడ్డాడు దొరా” వినయంగా చెప్పాడు ముకుందం.
“ఫర్వాలేదు ముకుందం! బాధపడకు” అంటూ, ధర్మంగా ఒక నిట్టూర్పు విడిచి..
“స్థిరమైన ఉపాధిని ఇవ్వలేని ఏ వృత్తిలో కూడా, మనిషి చివరివరకు కొనసాగలేడని ఇప్పుడు అనిపిస్తుంది ముకుందం!” అన్నాడు బాలమల్లు.
“దొరా! అంతమాట అనకండి. మీకు లభించిన అవార్డులు, రివార్డులన్నిటినీ చూస్తూంటే.. మీ శిష్యులమైన మేము ఎంతో గర్విస్తుంటాం దొరా!” గొప్పగా అన్నాడు ముకుందం.
“వద్దు ముకుందం! ఈ కష్టకాలంలో నువ్వు నాకోసం వెన్నంటి ఉంటున్నావు. అది చాలు. ముకుందం.. నేను చాలామంది దగ్గర అప్పు చేశాను. పాపం వారికి వడ్డీ కూడా కట్టలేకపోతున్నాను. వారంతా నా మీద గౌరవంతో అడగలేకపోతున్నారని అనిపిస్తుంది. వారు డబ్బు అడగకుండా నన్ను మౌనంగా హింసిస్తున్నారని అనిపిస్తుంది..!” గద్గద స్వరంతో అన్నాడు బాలమల్లు.
“అయ్యో! గురువుగారు.. వారంతా నన్ను కలుస్తూనే ఉన్నారు. వడ్డీ గురించిన ప్రస్తావన ఏమీ తేవడం లేదు. వారంతా ఒక నిర్ణయానికి వచ్చారట”.. నసుగుతూ చెప్పాడు ముకుందం.
“ఏమిటీ!? నిన్ను కలుస్తున్నారా!” ఆశ్చర్యంగా ముకుందం వైపు చూశాడు.
“అవును దొరా! మీనుంచి వడ్డీ పైసలు ఆశించడం లేదు. అసలు ఇస్తే చాలంటున్నారు దొరా!”.
“అయితే నా మీద సానుభూతి చూపిస్తున్నారా ముకుందం.. అది నాకు నచ్చదు. ఇప్పటికీ నేను వారి దృష్టిలో ఒక మెట్టు దిగజారినట్లు అనిపిస్తున్నది. ఇది నేను భరించలేను. నేను ఏమైనా ఫర్వాలేదు.. ఏ మాట చెప్పి వారి డబ్బు తీసుకొన్నానో.. తిరిగి ఇచ్చేటప్పుడు కూడా ఆ మాట ప్రకారమే ఇస్తాను. రేపు ఒకసారి వారిని తీసుకోనిరా! మాట్లాడాలి” అంటూ మెల్లిగా లోపలకు వెళ్లిపోయాడు బాలమల్లు.
* * *
ముకుందం మర్నాడు ఉదయమే, బాలమల్లుకు అప్పు ఇచ్చిన నలుగురు వ్యక్తులన్నీ తీసుకొని వచ్చాడు. వారందరినీ సాదరంగా లోపలికి ఆహ్వానించిన బాలమల్లు.. తన ముందు కూర్చోపెట్టుకున్నాడు. కానీ, ఎవరూ ఏమీ మాట్లాడలేక పోతున్నారు.
బాలమల్లు ఆ గంభీర క్షణాల్ని ఛేదిస్తూ గొంతు విప్పాడు.
“మీరు నాకు అప్పు ఇచ్చి ఆపత్కాలంలో నన్ను ఆదుకున్నారు. మీ అప్పును వడ్డీతోసహా త్వరలోనే తీర్చుకుంటాను. నన్ను నమ్మండి !”.. గొంతు తడబడుతూ మెల్లగా అన్నాడు.
“దొరా! మీకు దండం పెడతాం. మాకు వడ్డీ వద్దు. అసలు ఇవ్వండి చాలు!” అంటూ ముకుందం ఎదుట కూర్చున్న వ్యక్తి అన్నాడు.
“అయ్యా! అమ్మగారు బతికి ఉన్నపుడు మేము మీకు డబ్బులు ఇచ్చాము. అమ్మగారు చనిపోయి కూడా మూడేండ్లు దాటిపోయింది. మాకు కూడా అవసరాలు ఉంటాయి. ఇప్పుడు ఇస్తేనే బాగుంటుంది!”.. అదే అదునుగా భావించి, మరో పక్కన కూర్చోన్న వ్యక్తి గట్టిగానే అడిగాడు.
“ఇస్తారు.. మా గురువుగారు మీ అందరి డబ్బులూ ఇస్తారు!” బతిమాలుతూ అన్నాడు ముకుందం.
“మన ఊరి పెద్ద పహిల్వాను కదా! వారినుంచి మాకు ఎలాంటి వడ్డీ అవసరం లేదు. దయచేసి మా అసలు మాకు ఇప్పించండి చాలు!” వచ్చిన వారిలో మరో ఇద్దరు ముందుకు వచ్చి అన్నారు.
“ఆగండి! నాకు వడ్డీ మాఫీ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఒక రెండు నెలలు గడువు ఇవ్వండి. వడ్డీ, అసలు ఇస్తాను”.. అర్థింపుగా ఆడిగాడు బాలమల్లు.
“ఇప్పటికే చాలా టైం ఇచ్చాం. ఈ రోజు డబ్బులు ఇస్తే వెళ్లిపోతాం దొరా!” అన్నారు వాళ్లు.
ముకుందం కంగారుపడిపోతూ..
“గురువుగారు ఇస్తానంటున్నారుగా.. రెండు నెలలు ఓపిక పట్టండి ప్లీజ్!” అంటూ వాళ్లను బతిమిలాడసాగారు.
“లేదు! మాకు డబ్బులు కావాలి! మీ గురువుగారికి చెప్పి ఇప్పించు ముకుందం!”.. అంటున్నారు వాళ్లు.
వాళ్లను చూస్తున్న బాలమల్లులో మొదటిసారి అవమానభారంతో, పళ్లు పటపటలాడుతూ, పిడికిళ్లు బిగించుకున్నాయి. ఎంతో కష్టంగా తమాయించుకొన్నాడు. అంతలోనే ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా లోపలికి వెళ్లాడు.
చేతుల నిండా తనకు వచ్చిన బంగారు పతకాలు, రజత పతకాలు, మరికొన్ని పెద్దపెద్ద కప్పులన్నిటినీ పట్టుకువచ్చి.. వాళ్ల ముందు పెట్టాడు.
“ఇవన్నీ.. నేను గెలిచిన బంగారు, వెండి పతకాలు. కప్పులు. వీటి విలువ లక్షల్లో ఉంటుంది. మీలో ఎవరికి కావాల్సింది వారు తీసుకువెళ్లండి” అన్నాడు.
“అయ్యా! అవన్నీ మీరు సాధించుకొన్న ఎంతో విలువైన పతకాలు కావచ్చు. కానీ, అవి మేము సంపాదించుకొన్న మా డబ్బుకు సరిరావయ్యా! అవి మాకు అక్కర లేదు. మాకు కావాల్సింది డబ్బు!”.. ముక్తకంఠంతో అన్నాంతా.
ఊహించని ఆ మాటలకు బాలమల్లు ఎంతో భావోద్వేగానికి లోనవుతూ.. నిశ్చేష్టుడై నిలబడిపోయాడు.
ముకుందం పేరు పేరునా వేడుకొంటూ..
“మా గురువుగారికి అడిగిన సమయం ఇవ్వండి! నన్ను నమ్మండి. పెద్దాయనను ఇబ్బంది పెట్టకండి!” అంటు వేడుకొన్నాడు.
“మీ దగ్గర డబ్బు అప్పుగా తీసుకొన్నది నేను. నేను చెప్పిన గడువులో మీ డబ్బులు మీకు అప్పజెబుతాను” అంటూ చేతులు జోడించబోయిన బాలమల్లు రెండు చేతుల్ని.. ఆ వచ్చినవారే ఆపారు.
ఆకస్మికంగా చేతులు జోడించి దండం పెట్టబోయిన బాలమల్లు పనికి.. అప్పులవారు దిగ్భ్రాంతి చెందుతూ బాలమల్లు ముఖంలోకి సూటిగా చూడలేకపోతూ..
“సరే దొరా! మీరన్న గడువులో మాత్రం తప్పకుండా డబ్బులు ఇవ్వండి” అంటూ ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు.
“గురువుగారూ! మీరు ఇంత అధైర్యపడిపోతూ వాళ్లకు దండం పెట్టబోతుంటే.. నేను చూస్తూ తట్టుకోలేక పోయాను!” అంటూ ముకుందం బాలమల్లు దగ్గరగా వెళ్లాడు.
ముకుందాన్ని బాలమల్లు గట్టిగా కౌగలించుకొంటూ..
“ముకుందం! నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వాళ్ల డబ్బు చెల్లించేవరకు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో లారీల్లోని ధాన్యపు బస్తాలను, లోడ్, అన్లోడ్ చేస్తాను!” స్థిరంగా అన్నాడు బాలమల్లు.
“గురువుగారూ! మీరు బస్తాలు మోస్తారా!”.. కండ్లల్లో నీళ్లు తిరుగుతుంటే గద్గదికంగా అన్నాడు ముకుందం.
“బాధపడకు ముకుందం! ఇన్నాళ్లూ నేను పెంచుకొన్న కండల్లో సత్తువ ఇంకా ఉంది. నేను నమ్ముకున్న శరీర దారుఢ్యం ఉంది. వంద కేజీల బస్తాలు మోయడం నాకు ఒక లెక్క కాదు ముకుందం!”.. మొహం మీద ముసిరిన సన్నటి చెమట చుక్కల్ని తుడుచుకుంటూ అన్నాడు బాలమల్లు.
“ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు గురువుగారు! మీ అప్పు మీ శిష్యులమైన మేమంతా కలిసి తీర్చేస్తాం. దయచేసి మీరు నిశ్చింతగా ఉండండి” అన్నాడు ముకుందం.
“వద్దు ముకుందం! నేనే తీర్చుకొంటాను. కానీ, నాకున్న అనుమానం ఒక్కటే.. నేను వీళ్లందరికీ అప్పు తీర్చడానికి పెట్టిన గడువు ముందు వస్తుందా..? భగవంతుడు నాకు ఇచ్చిన ఆయుష్షు గడువు ముందు వస్తుందా..? అనేది నాకు అర్థం కావడం లేదు!”.. కంపిత స్వరంతో తాను అనుకొన్న మాటలు.. యాదృచ్ఛికంగా పైకి అనేశాడు బాలమల్లు భయం భయంగా!
* * *
రావుల పుల్లాచారి స్వస్థలం కరీనగర్ జిల్లా హుజూరాబాద్. తల్లిదండ్రులు ఈశ్వరమ్మ – రావుల దశరథం. బి.కాం. తర్వాత నీటి పారుదలశాఖలో ఉద్యోగంలో చేరారు. వివిధ హోదాల్లో పనిచేసి 2008లో సూపరింటెండెంట్గా పదవీ విరమణ పొందారు. అంతకుముందు నుంచే సాహిత్యంవైపు అడుగులేశారు. కవితలు, కథలు, నాటక రచనలు చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు ఇరవై నాటికలతోపాటు ‘బెత్తెడు జాగ’ కథా సంపుటి, ‘నాలోకి..’ వ్యాస సంపుటి, ‘వాళ్లిద్దరు’ కవితా సంపుటిని వెలువరించారు. రచ్చబండ, మనసు చెక్కిన శిల్పం, ఆట కథలను నాటికలుగా తీసుకురాగా, ‘అప్పా జ్యోస్సుల – విష్ణుభొట్ల – కందాళై ఫౌండేషన్’ వారు కథా నాటికలు పుస్తకంగా ప్రచురించారు. 2016లో నిర్వహించిన 20వ నంది నాటకోత్సవాల్లో వీరి ‘రచ్చబండ నాటిక’ ప్రదర్శితమై.. రెండు తెలుగు రాష్ర్టాలకుగానూ ద్వితీయ రచనగా నంది అవార్డును గెలుచుకున్నది. 2014లో తెలంగాణ ప్రభుత్వం ‘ఉత్తమ రచయిత అవార్డు’తో సన్మానించింది. తుమ్మల రంగస్థల సాహితీ పురస్కారం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ నుంచి స్ఫూర్తి పురస్కారం అందుకొన్నారు. పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి 2018 సంవత్సరానికిగాను ఉత్తమ నాటక రచయితగా కీర్తి పురస్కారం దక్కించుకున్నారు.