హైదరాబాద్ : వచ్చే ఎన్నికలలో గోషామహల్ నియోజకవర్గం పై గులాబీ జెండా ఎగరాలని, అందుకు పార్టీ నాయకులు, కార్యకర్త లు సైనికుల్లా పని చేయాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో గోషామహల్ నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో పైరవీలకు తావు లేదని, కష్టపడి పనిచేస్తూ ప్రజాదరణ ఉన్న వారికే సముచిత స్థానం, గౌరవం లభిస్తాయని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం లో గోషామహల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, 10 కోట్ల రూపాయల వ్యయంతో ఫిష్ మార్కెట్ నిర్మాణం, నాలా నిర్మాణం, డ్రైనేజీ సమస్యల పరిష్కారం వంటి అనేక కార్యక్రమాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 24 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అక్రమంగా ఓట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని అన్నారు.
10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సీఎం తన స్థాయిని మరిచి బూతుబాష మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థానానికి ఉన్న గౌరవాన్ని దిగజారుస్తున్నారని విమర్శించారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పై పోరాడాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్, మహేందర్, పలువురు నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.