Yusuf Pathan : తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ కోసం ఎంపీ పదవికి రాజీనామా చేయాలని పార్టీ తనను కోరినట్లు వస్తున్న వార్తలపై మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీ (TMC MP) యూసుఫ్ పఠాన్ (Yusuf Patan) స్పష్టతనిచ్చారు. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని ఆయన కొట్టిపారేశారు. తననెవరూ రాజీనామా చేయమని కోరలేదని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోందని పఠాన్ అన్నారు. బెర్హంపూర్ లోక్సభ స్థానానికి తాను రాజీనామా చేస్తున్నానని, తద్వారా మమతా బెనర్జీ అక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోందని, కానీ అందులో నిజం లేదని పేర్కొన్నారు.
ఈ విషయంపై మమతా బెనర్జీ తనతో ఎప్పుడూ చర్చించలేదని, పార్టీలోని ఏ ఒక్క నాయకుడు కూడా తనను రాజీనామా చేయమని అడగలేదని, ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని యూసుఫ్ పఠాన్ కొట్టిపారేశారు. ఈ మేరకు ఆయన ఈ విషయాన్ని ఓ వీడియోలో పేర్కొన్నారు. మమతా బెనర్జీకి, యూసుఫ్ పఠాన్కు మధ్య భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మధ్యవర్తిత్వం వహించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ ఆరోపణలను ఇప్పటికే గంగూలీ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.
మమతా బెనర్జీ తనను ఈ విషయంలో ఎప్పుడూ సంప్రదించలేదని, తాను పఠాన్తో మాట్లాడలేదని, ఈ వార్తలు కేవలం కల్పితమని గంగూలీ స్పష్టంచేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లోని బెర్హంపూర్ స్థానం నుంచి టీఎంసీ తరఫున పోటీ చేసిన యూసుఫ్ పఠాన్ విజయం సాధించారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరిని ఆయన ఓడించారు. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ కోసం పఠాన్ తన సీటును త్యాగం చేయాల్సి వస్తుందని గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఆయన తాజా ప్రకటనతో తెరపడినట్లయ్యింది.