అంతా మామూలుగనే ఉన్నది. ఎప్పటిలెక్కనే మసీదులకెల్లి జొహర్ నమాజ్ వినిపిస్తాంది. నిమ్మచెట్టు కొమ్మలమీద ఊరపిచ్చుకలు కిచకిచమని అరుస్తానయ్. “కడుపునొప్పి!” అని బడి తప్పించిన బుజ్జిగాడు.. అరుగు మీద కూసొని, ఒక్కడే అష్టచెమ్మ ఆడుతున్నడు. ఇలాంటి ఓ సాధారణ సమయాన.. బొజ్జ వెంకటేశు అలియాస్ బొజ్జ ఎంకటిగాని పాతచెప్పు భూపాల్రావు పటేల్ చెంపను తాకింది. దళితులను తమ ముంగట చెప్పులు చేతుల పట్టుకుని నడవాలి అన్న చరిత్ర నుంచి.. అదే దళితుని చెప్పు ఓ ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తి ఒంటిని తాకితే సుత అంతా సాధారణంగానే ఉండుడేంది? ఈపాటికి దిక్కులు పిక్కటిల్లేలా ఉరుములు పుట్టొద్దా? గాలి దెయ్యమేదో వచ్చి మనుషుల మింగొద్దా? ఏ ఏరో హోరెత్తి ఊరిని ముంచేయొద్దా?
* * *
“అప్పుచేసి బోరు ఏపిద్దామని సూత్తానం. పడకపోతే ఎట్లనే?”.. కంచంలోని బువ్వలో కూర కలుపుకొంట అన్నడు వెంకటేశు.
“ఎందుకు పడది? గొల్లోళ్ల రాజకొమురయ్యోళ్లది పడలేదా? మనకు కూడా పడ్తది. మస్తు నీళ్లత్తయి. మస్తు పంట పండుతది. నేలతల్లిని నమ్ముకున్నోళ్లెవలూ మోసపోరు”.. ఏదో ఆశకొద్దీ చిన్నోనికి పాలిచ్చుకుంట అన్నది లక్ష్మి.
‘నమ్ముకున్నోణ్ని నేలమ్మ మోసం చేయదా? మరి గట్లయితే.. ఆ జెర్రిపోతుల రాజయ్య పంట పండక, అప్పులయ్యే కదా ఉరివెట్టుకుని సచ్చిండు? మరి వాడు నేలతల్లి చేతిల మోసపోయినట్లు గాదా?’.. భార్య మాటలినుకుంటు బువ్వ నములుతుంటే, ఇట్లా ఆలోచనలొచ్చినయి వెంకటేశుకు. కానీ, బయటికి మాత్రం.. “నీ నోటి సలవతోని మనకు మంచిగ బోరువడి నీళ్లచ్చి, పంట చేతికత్తే.. నీకు వచ్చే ఏటికల్లా పుస్తెలతాడు చేయిస్తనే లక్ష్మి” అన్నడు.
“తాడు ఏసుకుని నేనేడికి ఊరేగపోత గనీ, ముందుగాల అప్పులు తీర్శి.. చిన్నోని సదువుకు పైసలు కూడబెట్టాలే. వీణ్ని మంచిగ సదివిపియ్యాలే!” అని పాలు తాగుతున్న బిడ్డ చెంపను ఐదేళ్లతోని తాకి ముద్దిచ్చుకుంట చెప్పింది.
“అవు.. నిజమేనే!”.. “గందుకే.. నువ్వు ఎక్కువ తక్కువ సోచాయించకు. మనకంతా మంచే అయితది. నువ్వు రేపే పటేల్ తానకు పో”.. “చిన్నోడు పుట్టినప్పుడే పండుగ ఖర్సులకని ఇరవై వేలు బాకీ చేత్తిని. మళ్ల ఏ మొఖం పెట్టుకొని పోవాల్నని భయమైతాందే? పటేల్ పైసలు ఇత్తడంటవానే”.. “ఎహే ఇత్తడుపో! పటేలోళ్లకాడనే కదా.. మామ అప్పట్ల జీతం ఉండే! నువ్వు పోయి ఇగురం కొద్ది మాట్లాడి అడుగుపో” అన్నది లక్ష్మి.
“ఏదయితే అదయితది. రేపు పొద్దుగాల పోయి అడుగుతనే”.. పాలు చీక్కుంట చీక్కుంట అట్లనే నిద్రపోయిండు చిన్నోడు. వాని మూతి తుడిసి, ఉయ్యాలల ఏసి.. అటెన్క బిందె పట్టుకొని లక్ష్మి పోవుడు సూసిండు.
“ఓయ్.. ఎటో పోతానవ్!?”.. తిన్న కంచం కడుగుకుంట అడిగిండు వెంకటేశు.
“వారమైతాంది. నల్లత్తలేదు. నీళ్లు ఒడుత్తానయి. బోరింగ్ కాడికిపోయి ఇన్ని నీళ్లెత్తుకత్త!” చెప్పిందామె.
“నేను సావలేదే? బతికే ఉన్న” అన్నడు వెంకటేశు.
కోపంతోటి చేతిల బిందె ఎత్తేసి.. “నీ నోరుకగ్గితల్గ. గయ్యేనా మాటలు?” అన్నది.
“మరి నేను తెత్త కదనే! ఓ.. బిందెపట్టుకొని టిక్కుటిక్కుమంట ఉరుకుతానవ్”.. లక్ష్మికి ఏడు నెలల కిందటే చిన్నోడు పుట్టిండు. బిడ్డను కని ఇన్ని రోజులైన సుత.. బరువు పనులు చేత్తే ఏమన్న అయితదేమోనని వెంకటేశుకు బుగులు. అందుకే ఆమెతో అల్కల్కటి పనులు తప్ప ఇంకేం చేపియ్యడు. గడ్డిగసం పీకేందుకు బాయికాడికి అత్తనంటే.. ‘నోర్ముయ్!’ అంటడు.
వెంకటేశు చిన్నగున్నప్పుడే వాళ్ల అవ్వ సచ్చిపోయింది. అయ్య రాజయ్య.. భూపాల్రావు పటేలోళ్ల ఇంటికాడనే కొన్నొద్దులు జీతమున్నడు. ఆ పనీ ఈ పనీ చేసుకుంటా.. ఎట్లనో రెండెకరాల భూమిజాగా సంపాయించి, వెంకటేశు చేతిల పెట్టిండు. మేనమామ బిడ్డ లక్ష్మితోని పెళ్లి చేపిచ్చిండు.
వెంకటేశుకు పెళ్లయిన మూడు నెలలకే రాజయ్య కిడ్నీలు ఖరాబైనయ్. చానా దావాఖాన్లల్ల చూయిచిండ్లుగనీ, నెలరోజులకు మించి బతకలే! లక్ష్మి ఆ ఇంట్లకొచ్చిన కొన్నాళ్లకే ఇట్లయ్యేసరికి చుట్టుపక్కోళ్లు, తెలిసినోళ్లు, తెలవనోళ్లు అందరూ.. ‘లక్ష్మి కాలి శెడ్డతనమే!’ అన్నరు. అంతేగాక పెళ్లయి నాలుగేళ్లయిన సుత వాళ్లకు పిల్లలు పుట్టలేదు. ఇదిజూసి.. “ఈ పోరితోని ఇడుపుకాయిదం చేసుకుని వేరే ఎవతినన్న కట్టుకోరా ఎంకన్న!” అని వరుసకు పెద్దవ్వ అయ్యే కనుకవ్వ అన్నది ఓసారి.
“ఓ పెద్దవ్వ! ఏం మాట్లాడుతానవ్!. ఈ ముచ్చట మళ్ల గిట్ల అంటే మంచిగుండదు చెప్తాన. మా నాయన సావనీకి నా పెళ్లానికి లంకె పెడ్తవ్? తాగి తాగి వాడు సత్తే.. నువ్వేమో దీన్ననవడ్తివి. పిల్లలు పుడ్తలేరన్న రంది మాకంటే నీకే ఎక్కువున్నట్లుందిగా!” అనుకుంట ఆమెతో జౌడం పెట్టుకోబోయిండు. లక్ష్మి అంటే వెంకటేశుకు అంతటి పాయిరం మరి.
పిల్లల కోసమని డాక్టర్ల సుట్టూ తిరిగిండ్రు. ఆకుపసరు మింగిండ్రు. కట్టమీది మైసమ్మకు.. ఎములాడ రాజన్నకు, కొండగట్టు అంజన్నకు మొక్కులు మొక్కిండ్రు. ఏ దేవుడు కరుణించిండో, ఏ దేవత వాళ్ల మొర విన్నదో తెలవదుగనీ.. నాలుగేళ్ల తర్వాత లక్ష్మి నీళ్లు పోసుకుంది. గూడెమోళ్ల నోళ్లు మూతవడ్డయి. ఓ పూట పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది లక్ష్మి. మూడునెలల తర్వాత పుట్టింటి నుంచి ఇంటికి తీసుకచ్చి “చిన్నోడు” అని పిలుసుడుపెట్టిండు. భూపాల్రావు పటేల్ కాడనే ఇరవై వేలు అప్పు తీసుకచ్చి, సుట్టపోళ్లందరిని పిలిశి చిన్నగా పండగ చేసిండు.
వెంకటేశు సుతారి పనిచేస్తడు. వాళ్ల అయ్య సంపాయించిన భూమి ఉన్నగనీ, దాంట్ల బాయిలేదు. వానదేవుడే దిక్కు. వానలను నమ్ముకొని పోయినసారి మక్కజొన్న ఏత్తే.. పురాగ ఎదగకముందే ఎండిపోయింది. గందుకే గీసారి ఎట్లనన్న చేసి బోరేయించి, పంట పండించుకోవాలె అనుకున్నడు. బోరు ఏపియ్యడానికి పైసల కోసమే భూపాల్రావు దగ్గరికి అప్పుకోసం పోదామని సూత్తున్నడు.
తెల్లారి భూపాల్రావు ఇంటికి పోయిండు వెంకటేశు. అప్పటికి భూపాల్రావు ఇంటి ముందర వరండాల కూర్చుని.. పేపర్ చదువుకుంట చాయ్ తాగుతున్నడు. ఇంటి గేటు బయట చెప్పులు ఇడిశి, మెడలున్న తువ్వాల తీసి చేతిల పట్టుకుని లోపటికి పోయిండు వెంకటేశు.
“ఏరా బొజ్జెంకటి.. ఇట్లొచ్చినవ్? వాయిదా కాకమునుపే పైసల్ పట్టుకొచ్చినవా ఏంది?”.. అడిగిండు భూపాల్రావు.
“లే పటేలా! గా ముచ్చటే మాట్లాడుదామని వచ్చిన!”.. భూపాల్రావు ఇట్ల లేనోళ్లకు అప్పులు ఇచ్చుకుంట, వాటి మీద వడ్డీలు వసూలు జేస్తుంటడు. ఇరవై ఎకరాల భూమిని జీతగాళ్లు సూస్తుంటరు. భూపాల్రావు భార్య సుజాతమ్మ.. ఇంట్లనే ఉంటది. ఆయన కొడుకు, బిడ్డ కాలేజీల సదువుతున్నరు.
ఇల్లు కాగితాలు పెట్టుకుని ఇంకా యాభై వేలు అప్పు ఇయ్యమని, ఏడాదికి పాతయి, కొత్తయి కలిపి బాకీ మొత్తం తీర్చేస్తానని భూపాల్రావును బతిమాలిండు వెంకటేశు.
“పాత ఇరవయ్యే ఇంక మూలుగుతానయ్. మళ్ల యాభై అడుగుతానవారా?”.. “బోరు పడి పంట చేతికత్తే.. ఏడాదికల్లా ఎట్లనన్న చేసి వడ్డీతోని ఇచ్చేత్త పటేల. ఎట్లాగు ఇల్లు కాయితాలు మీతాననే ఉంటయి”.. “ఊరవతల ఉండే నీ గూడెంల ఇల్లు పట్టుకుని నేనెం చేయాల్రా?”.. “గట్లంటే ఎట్ల పటేలా!? ఇల్లు అమ్ముతమంటే మా గూడెంలనే మస్తు మంది ఎగవడ్తరు”.. “సరే సరే! నువ్ ఎల్లుండి ఆదివారం కలువు” అనుకుంట లేసి, మోటార్ సైకిల్ చాలు చేసుకుని ఎటో పోయిండు పటేల్.
ఆదివారం మాపటిజామున పటేల్ ఇంటికి పోయిండు వెంకటేశు. రాజిరెడ్డి, వీరభద్రరావు సాక్షి సంతకాలు పెట్టంగ.. ఇల్లు కాగితాలు తీసుకుని యాభైవేల కట్ట తీసి వెంకటేశు చేతిల పెట్టిండు పటేల్.
“సచ్చి పుడతా పటేలా!” అనుకుంటా ఆ కట్ట అందుకున్నడు.
“అన్న టయానికి ఇయ్యాలె! లేకపోతే ఏందో ఎర్కే గదా!” కాగితం చుట్టను అరచేతి మీద కొడుతూ అన్నడు పటేల్.
“గంతదాక పోనియ్య పటేలా. వాయిదాకు నెలరోజుల ముందే ఇచ్చేత్తా”.. భూపాల్రావు ఇచ్చిన పైసలతోపాటు, అంతకుముందు బ్యాంకుల దాసుకున్న పైసలు ఇడిపిచ్చుకచ్చి.. మొత్తం భార్య చేతిలవెట్టిండు.
“ఎములాడ రాజన్న.. నువ్వే గట్టెక్కించాల”.. అని నిద్రపోయేటప్పుడు మొక్కుకుని కండ్లు మూసుకున్నాడు. ఆ రాత్రి అన్నీ వెంకటేశుకు మంచి మంచి కలలే. బోర్లకెల్లి నీళ్లు బుస్సబుస్స పొంగుకుంటూ వచ్చినట్లు! పంట బాగా పండినట్లు! లక్ష్మికి పుస్తెలతాడు చేయించినట్లు.. ఇట్ల రాత్రంతా కలలే కలలు! కలల మధ్య ఎప్పుడో కొద్దిగా నిద్ర పోయిండు.
* * *
గొల్లోళ్ల రాజకొమురయ్యకాడ వివరాలు కనుక్కోని.. హుజురాబాద్కు పోయి బోరేసోటోళ్లను కలిసిండు వెంకటేశు. ఏకాదశి రోజు మంచిదని ఎవలో చెబితే.. ఆరోజు బోర్ ఏయనీకె రమ్మని అడ్వాన్స్ ఇచ్చి వచ్చిండు.
బోరేసేరోజు పొద్దుగాల కొబ్బరికాయతోని బోరు పాయింటు చెప్పే కాశ వీరయ్యను భూమి కాడికి తీసుకుపోయిండు. వీరయ్య కొబ్బరికాయ అరచేతిల నిలబెట్టుకుని.. రెండెకరాల జాగలో మొత్తం తిరిగిండు. ఓ జాగల.. కాయ బోర్లవడ్డది!
“అదే బోరుపడే పాయింటు!” అని చెప్పిండు.
ఆడ ముగ్గుతోని గుండం గీసిండు. లక్ష్మి కొబ్బరికాయ కొట్టి, ఊదిబత్తీలు ముట్టిచ్చి, పసుపు కుంకుమ, పూలు సల్లి.. మైసమ్మను మొక్కినంక బోర్ ఏసుడు షురూ చేసిండ్లు.
200 ఫీట్లు వేసినంక రాయొచ్చిందన్నరు.
“రాయత్తె నీళ్లున్నట్లే!”.. అన్నరెవరో.
రాయిపోయి ఇంకా యాభై ఫీట్లు పోయిన సుత మట్టి వచ్చింది తప్ప.. నీటి జాడ రాలే.
“ఇంకో యాబై ఫీట్లు వేస్తే నీళ్లు వస్తయి గావచ్చు!”.. అన్నరు మరెవలో.
ఆశ ఉన్నా, చేతిల పైసల్లేక.. “ఇకసాలు బంజేయుర్రి” అన్నడు వెంకటేశు.
ఆ రోజున బోర్లకెల్లి నీళ్లురాలేగానీ.. వెంకటేశు, లక్ష్మి కండ్లల్లకెల్లి మాత్రం బగ్గనే వచ్చినయ్.
ఎన్నో ఆశలు పెట్టుకుని అప్పు తెచ్చి ఏపిచ్చిన బోర్ పడకపోయేసరికి వెంకటేశు దిగాలు పట్టిండు. వారం రోజుల దాంక ఇంట్లకెల్లి బైటికి పోలే. సుతారి పనులకు పొమ్మని లక్ష్మి అంటే.. పోబుద్ధయితలేదని కసురుకుని పంటాండు. భూపాల్రావు పటేల్ తాన చేసిన బాకీ ఎట్ల తీర్చాలనే ఆలోచనతోనే మనిషి సగమైండు.
ఓరోజు రాత్రి పూట నిద్రపోకుండా పక్కమీద అటూఇటూ మెసుల్తున్నడు వెంకటేశు.
“నిద్రపోకుండా.. ఏమాలోచిస్తానవ్?” అన్నది లక్ష్మి.
తల అడ్డంగ ఊపిండు వెంకటేశు.
“ఏందయ్యో.. ఒక్క బోర్ పడకపోతెనే గట్లయితానవ్? గా చిల్పూరి మొండయ్యోళ్లు పదిసార్లు ఏపిత్తే ఒక్కటి పడ్డది. మన గాచారమే గంత అనుకొని ఏదో పని చేసుకుంట నడవాలేగనీ.. నువ్ గిట్ల గదే రందితోని ఉంటే ఎట్ల!? నువ్వేం మొగోనివి?”..
“ఏందే గంత మాటంటివి?”.. “మరి లేకపోతే!? అప్పు ఎట్ల తీర్చాలని ఆలోచించుకుంట కూసుంటే బువ్వకెళ్తదా? కూరకెల్తదా? రోజురోజుకు నువ్వు ఎట్లయితానవో ఎర్కయితాందా. ఏనుగు లెక్క ఉండేటోనివి. ఎలుక పిల్ల లెక్క కానస్తానవ్?”.. పక్కకు తిరిగి భార్య కండ్లల్లో తనను తాను చూసుకున్నడు.
“నా మాటిని రేపటి సంది కూలీకిపో. నేను ఇంట్లనే మిషిన్ కుట్టుడు మొదలుపెడ్త. ఈసారి వానమబ్బులు సూశి మక్కజొన్న మళ్ల ఏద్దాం. ఏదున్నా ఎములాడ రాజన్న సూసుకుంటడు” అన్నది.
భార్య మాటలకు కరిగిపోయిండు వెంకటేశు. మెల్లగా ఆమె దగ్గరికి జరిగి.. ఆమెలో కలిసిపోయిండు.
తెల్లారిసంది పనికి పోవుడు మొదలువెట్టిండు.
* * *
బాకీలున్నోళ్లు టయానికి పైసల్ తేకపోతే.. అప్పుడప్పుడు గూడానికి వస్తా ఉంటాడు భూపాల్రావు పటేల్.
అన్నమాటకు పైసల్ ఇయ్యనోళ్లను, వాళ్లింటి ఆడోళ్లను అడ్డమైన మాటలు తిడ్తడు. ఒకటి రెండుసార్లు అట్ల వచ్చినప్పుడు వెంకటేశు పెండ్లాం లక్ష్మిని చూసిండు భూపాల్రావు. ఏడాది తిరిగింది. భూపాల్రావు పటేల్కు వెంకటేశు ఇయ్యాల్సిన వాయిదా తేది వచ్చింది. ఆ రోజు పన్నెండు గొడ్తాంటే గూడెంల అడుగువెట్టిండు భూపాల్రావు.
గూడెంల ముసలీ ముతక, మంచాన పడ్డోళ్లు, బడి ఎగ్గొట్టిన చిన్నపోరలు తప్ప ఎవలూ లేరు. అందరూ బాయిలకాడికి, కూలీపనులకు పోయిండ్రు. రోడ్డుమీద బండి ఆపి కాలిబాట మీద నడుసుకుంట వెంకటేశు ఇంటికి చేరిండు. ఆ సమయంలో బట్టలు పిండుతాంది లక్ష్మి. బట్టలు ఆరేసుకుంట వెనక్కి తిరిగి సూస్తే.. ఇంటి సుట్టూ నడుమెత్తు కట్టిన మట్టిగోడ దర్వాజకాడ పటేల్ కనవడిండు.
ఎంటనే బొడ్డుల చెక్కిన లంగను కిందకనుకుని.. “మీరు ఎప్పుడొచ్చిండ్లు పటేలా!?” అనుకుంట అటేపు వచ్చింది.
“ఎంకటిగాడు లేడానే?” అనుకుంట జరంత లోపలిదాంక వచ్చిండు.
అలా అనేటప్పుడు పటేల్ సూపులు లక్ష్మి మెడకింద భాగాన ఉన్నయి. పైట సర్దుకుంటనే.. “లేడు పటేలా! పైసలు తేనీకే కరీంనగర్ల మా చిన్నబాపు ఇంటికి పోయిండు” అన్నది.
“ఎప్పుడొత్తడు? పైసలు ఎప్పుడు తెత్తడు?”.. “ఎల్లుండి పొద్దుగాల వరకు పట్టుకత్తడు పటేల. జర రెండ్రోజులాగుండ్రి మీ పైసల్ మీకు తెచ్చిత్తడు”.. ఎల్లుండని చెప్పేసరికి ఆలోచనల వడ్డడు భూపాల్రావ్ పటేల్.
“ఆ.. ఆ! తేకపోవాలే.. వాణ్ని నేనే ఎతుక్కుంటా కరీంనగర్ పోతా!” అనకుంటూ పోయినట్లు చేసిండు.
ఆ వెంటనే మళ్లీ వెనక్కి మర్రొచ్చి లక్ష్మి చేయి పట్టుకున్నడు. అర్థంకాని లక్ష్మి.. “ఏందిది పటేలా!? నా చెయ్యి పట్టుకున్నవ్!” అని ఇడిపిచ్చుకుంది.
“ఎంకటిగాడు సానా అదృష్టమంతుడే! నీ అసొంటి సక్కని పెళ్లాం దొరికిందానికి. జర్ర నేను సెప్పేది విను!” అన్నడు.
ఏడాదిన్నర వయసున్న చిన్నోనికి ఏమర్థమైందో గనీ అప్పుడే ఏడుపు లగెత్తుకున్నడు.
“నేను గసొంటిదాన్ని కాదు పటేల!” అనుకుంట లక్ష్మి ఎనకకు ఎనకకు జరుగుతాంటే.. మీదిమీదికి పోవట్టిండు. ఒక్కసారిగ మీదవడి అరవకుండ నోరుమూసిండు. భూపాల్రావు పటేల్ కౌగిట్ల చిక్కుకున్న లక్ష్మి.. కోడిపిల్ల లెక్క కొట్టుకుంటాంది.
గంతట్లనే ఎక్కణ్నుంచి వచ్చిండో తెలవదు.. ఉరికొచ్చి భూపాల్రావు పటేల్ను మెడపట్టి ఇగ్గి కిందపడేశిండు వెంకటేశు.
ఇంతకుముందు పటేల్తోని లక్ష్మి చెప్పినట్లు.. వెంకటేశు కరీంనగర్కు పోలే ఏంలే! వాయిదా తేదీన పటేల్ తప్పకత్తడని తెలిసే.. ఇంట్లనే కూసొని, పటేల్ వత్తే అట్ల అనుమని ముందుగాల్నే లక్ష్మితోని చెప్పిండు. పటేల్ వచ్చినంక తలుపు ఎన్కకెల్లి మొత్తం వినుకుంట నిలవడ్డడు. కిందపడ్డ భూపాల్రావును.. “లం.. కొడుకా!” అనుకుంట ఒక్క తన్ను తన్నిండు.
వెంకటేశు తన్నుకు మూర్ఛ అచ్చినట్లయింది పటేలుకు. ఆడనే పడి ఉన్న పాత చెప్పు తీసి.. పటేలును శిప్పసప్ప సంపుతున్నడు వెంకటేశు. ఆ సమయంలో అంతా మామూలుగనే ఉంది.
దళితులను తమ ముందు చెప్పులేసుకుని నడవద్దు అన్న చరిత్ర నుంచి.. అదే దళితుని చెప్పు ఓ ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తి ఒంటిని తాకితే సుత అంతా సాధారణంగనే ఉండుడేంది? ఈ పాటికి దిక్కులు పిక్కటిల్లేలా ఉరుములు పుట్టొద్దా? గాలిదెయ్యమేదో వచ్చి మనుషుల మింగొద్దా? ఏ ఏరో హోరెత్తి ఊరిని ముంచేయొద్దా? కానీ, అట్లాంటిదేం లేదు! అంతా నిమ్మలంగనే ఉంది! వెంకటేశు కోపం ఇంకా సల్లారలే!
“నా లచ్చిమీద చెయ్యేత్తావురా నీ జాతి..” అనుకుంట దిగుట్లున్న కొడవలి తీసి పటేల్ మీదికి ఉరికిండు. అప్పుడే.. లక్ష్మి అడ్డమొచ్చింది. కిందవడ్డ భూపాల్రావు.. చేతులు ముడిసి, వణుక్కుంటూ..
“నీ బాంచెన్రో!” అని ఒర్రుకుంట కండ్లు మూసుకున్నడు.
సప్పుడుకు నాలుగిండ్ల అవతల ఉన్న రాజయ్య.. చేతిల కట్టె పట్టుకొని బైటికొచ్చిండు.
“ఓరి ఎంకన్నా! ఏమైందిరా” అని ఇంటి ముంగట నిల్సొని కేకేశిండు.
“ఏం లేదే మామా! పిల్లి పాలగిన్నె బోర్లేశింది”.. గస పోసుకుంటనే చెప్పిండు.
“ఏందిరా?”.. వినపడక మళ్లోపారి అడిగిండు రాజయ్య.
“పిల్లి మామా! పిల్లి.. పిల్లి!”.. అని ఇంకొంచెం గట్టిగా అరిసి చెప్పిండు వెంకటేశు.
ఇన్నొద్దులు పులిలెక్క తిరిగిన భూపాల్ పటేల్.. వెంకటేశు దెబ్బలకు నిజంగనే పిల్లితీరు అయిండు.
“నీయక్క పిల్లి నోట్ల మన్నువడ! సంపి బొందపెట్టకపోయినవ్రా!” అన్నడు రాజయ్య.
“పెడతా పెడతా!”.. అనుకుంట కొడవలి కిందపడేశిండు వెంకటేశు.
లేచి చెప్పులు చేత పట్టుకొని.. ఆడి నుంచి పిల్లి లెక్కనే బయటవడ్డడు భూపాల్రావు పటేల్. అప్పటిసంది బాకీ వసూలు కోసం.. జీతగాళ్లను పంపుడు తప్ప.. మళ్లింకెప్పుడూ మాదిగ గూడెంల అడుగువెట్టలేదు ఆ పటేల్. ఊరిలో కూడా ఎక్కడన్న వెంకటేశు కనవడితే.. వానికి కనవడకుండ అక్కణ్నుంచి తప్పించుక పోయేటోడు. ఏదేమైనా.. భూపాల్రావు పటేల్ను వెంకటేశు చెప్పుతోని కొట్టుడు ఓ చరిత్ర. అది ఎవలూ వినని మూగ చరిత్ర.
పాఠకులను ప్రభావితం చేసేలా, సమాజంలో మార్పు తీసుకువచ్చేలా కథలు రాస్తానని చెబుతున్నారు యువ రచయిత దూడం పవన్ కుమార్. ఈయన స్వస్థలం సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూర్ గ్రామం. బీటెక్ చదివిన పవన్ కుమార్, ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్నారు. కథలు చదవడాన్ని ఇష్టపడతారు. 2019 నుంచి రాస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో అనేక చిన్న చిన్న కథలు రాస్తుంటారు. ఈయన రాసిన ‘ఆట బొమ్మలం’ కథ.. ఓ దినపత్రికలో ప్రచురితమైంది. ‘పిల్లి’ కథ.. నమస్తే తెలంగాణ – ముల్కనూరు ప్రజా గ్రంథాలయం నిర్వహించిన కథల పోటీలో ప్రత్యేక బహుమతి అందుకున్నది. గ్రామాల్లో కులమతాల జాడ్యం ఇంకా బలీయంగానే ఉన్నదనేది రచయిత అభిప్రాయం. ‘తమను అవమానించే ఆధిపత్య కులాల వాళ్లపై నిమ్నకులాల వారు తిరగబడితే!?’.. అన్న ఆలోచన నుంచే ఈ కథ పుట్టిందని చెబుతున్నారు.