‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.2 వేల బహుమతి పొందిన కథ.
“రామేశ్వరరావు గారూ! మీ క్వారంటైన్ నేటితో ముగుస్తుంది. రేపు మీ ఇంటికి వెళ్లవచ్చు. ఉదయం పరీక్షలో కరోనా నెగెటివ్ కూడా వచ్చింది. మీకు అభినందనలు”. డాక్టర్ కోటేశ్వర్, రామేశ్వరరావును అభినందించగా మిగతావారు విని సంతోషించారు. కానీ, రామేశ్వరరావు సంతోషించలేదు. నిస్తేజమైన చూపులతో ఆయన డాక్టర్ను చూశాడు. డాక్టర్కు కూడా ఆ నీరసానికి అర్థం తెలియలేదు. ఉండబట్టలేక అడిగాడు కూడా. దానికి జవాబుగా రామేశ్వరరావు చెప్పింది చుట్టుపక్కలవారికి కూడా షాక్ ఇచ్చింది.
“డాక్టర్గారూ! 14 రోజులైనా, న్లైనా.. నా పిల్లలకు నేను తిరిగి ఇంటికి రావాలని లేదు. అంతకుముందు నుంచే నన్ను వృద్ధాశ్రమంలో జాయిన్ చేయాలని అనుకున్నారు. కానీ బంధువులకు, మా సోదరులవైపు వారికి భయపడి ‘ఏం చేద్దాం?’ అని సందేహిస్తూ వచ్చారు. కరోనా వచ్చిందని తెలియగానే.. తక్షణం తీసుకొచ్చి.. ఇక్కడ క్వారంటైన్లో వేశారు. ఇప్పుడు తిరిగి ఇంటికెలా తీసుకెళ్తారు? వారికది ఇష్టంలేదు. ముఖ్యంగా మా కోడలికి”.
“రావు గారూ! మీ ఆవిడ ఎక్కడ? ఆవిడ పరిస్థితి ఏమిటి?” అడిగాడు డాక్టర్.“డాక్టర్ గారూ! మా ఆవిడ పోయి ఏడాది దాటింది. అప్పటినుంచే నాకు నరకం మొదలైంది. నాకు ఓ ప్రత్యేకమైన గది ఇచ్చారు. తీసుకెళ్లి దాంట్లో పడేశారు. అందరూ తిన్నాక ఏ ఒంటిగంటకో మా కోడలు పళ్లెంలో ఇంత భోజనం తెచ్చి పడేస్తుంది. అంతవరకు నా ఆకలిదప్పులు అదిమి పెట్టుకోవాలి. తింటుండగా మారు వేసేందుకు ఏం కావాలని అడగరు. పళ్లెం తీసుకెళ్లి.. నా గదిలోని బాత్రూంలో కడుక్కొచ్చి పక్కన పెడతాను. మళ్లీ రాత్రికే భోజనం. కరోనాకు ముందు ప్రపంచం, కరోనా తరువాతి ప్రపంచం అని మీరు నేటి సమాజాన్ని విశ్లేషిస్తున్నారు. నాకు మాత్రం కరోనాకు ముందూ, వెనుకా ఒకటే! మా ఆవిడ మృతికి ముందు, వెనుకా అని మాత్రమే! నా జీవితంలో అదే పెద్ద మార్పు. రామేశ్వరరావుకు దూరపు బంధువు కూడా అయిన డాక్టర్ కోటేశ్వర్ తాను వాళ్ల ఇంటి సంగతి తెలియక అభినందించాడు. విషయం తెలిశాక నొచ్చుకొని బాధపడ్డాడు. తాను రామేశ్వరరావు కొడుకుకు చెప్పి చూస్తాననీ అన్నాడు.
“కోటేశ్వర్గారూ! అక్కర్లేదు. భయంకర ఏకాంతం భరించాను ఆ ఇంట్లో. దానికంటే మీ హాస్పిటలే నయం. నన్ను చూసుకునే ముగ్గురు, నలుగురు వైద్య సిబ్బంది ఉన్నారు. వేళకు ఆహారం వచ్చింది. నన్ను ఇంకో నెల రోజులు ఉంచుకోండి.. వీలైతే” అని అడిగాడు.“రావు గారూ! అది అసాధ్యం. నెగెటివ్ వచ్చాక మేం మిమ్మల్ని ఇక్కడ ఉంచుకోలేం. బెడ్ ఖాళీ అయితే దాన్ని మరొకరికి ఇవ్వాల్సి ఉంటుంది. మీ అబ్బాయి హాస్పిటల్ ఖర్చు భరించలేడు. ఈ పద్నాలుగు రోజులకే ఎంతో ఖర్చు అయ్యిందని గొణిగాడు. బిల్లు తగ్గించాలని నన్ను అడిగాడు. సరే చెప్పి చూస్తానోసారి” అన్నాడు డాక్టర్.
“కోటేశ్వర్ గారూ! అక్కర్లేదు. మీ మాటతో ఫీజు తగ్గింపు చేస్తారని, డాక్టర్గా మీ మాటను గౌరవించినట్టు నా విషయంలో మా వాడు నటిస్తాడు. కానీ, వాడికి ఇష్టం లేదు. ‘కరోనాతో పోతే శ్మశానానికి.. కరోనాతో పోకుంటే వృద్ధాశ్రమానికి!’ అని ఇప్పటికే వాళ్లు రెండుదారులు నిర్ణయించుకున్నారు”. “ఇది ముందే నిర్ణయమైందా? మీ ఇల్లు, ఆస్తి వాళ్లకు అక్కర్లేదా? ఇంత దారుణమా?”.“అవును డాక్టర్! కరోనా వచ్చాక తొలిరోజే అది నిర్ణయమైంది. ఇప్పుడైతే తప్పు పట్టరని మా కోడలు ఈ సందర్భాన్ని వినియోగించుకొమ్మని పోరింది. నా ఇల్లు వారిపేర రాసేశాను. వేరే ఆస్తి లేదు”.“అంత తొందరగా ఇల్లు ఎందుకు రాసిచ్చారు?”.
“తప్పలేదు. అంతకుముందు నుంచే పోరు నడుస్తున్నది. అందుకే, సరేనన్నాను. కరోనా పాజిటివ్ రాగానే అర్జెంటుగా కాగితాలు సిద్ధం చేయించి సంతకం పెట్టించి, హాస్పిటల్లో జాయిన్ చేశారు. సంతకం పెట్టకుంటే దవాఖానాలో చేర్చమని బెదిరించారు కూడా. మీద కరోనా కత్తి వేలాడుతున్నది. నిస్పృహ, దుఃఖం, మృత్యుభీతి.. నా చేత సంతకం చేయించాయి”. అతని దీనగాథ వింటుంటే డాక్టర్ నోట మాట రాలేదు. సామాజిక విలువలను కరోనా ధ్వంసం చేసిందని ఏడుపే కానీ, విలువలు కరోనాకు ముందే ధ్వంసమయ్యాయని అనుకొన్నాడు. రామేశ్వరరావు కొడుకు కోరినా డాక్టర్ ఫీజు తగ్గింపు కోసం సిఫారసు చేయలేదు. ఈ రాక్షసులకు తాను సాయం చేయడం ఎందుకనుకున్నాడు. కౌంటర్లో బిల్లు చెల్లింపులు కాగానే.. రామేశ్వర రావును కొడుకు డిశ్చార్జి చేయించుకుని, ప్రైవేట్ వాహనంలో తరలించాడు. తండ్రిని కనీసం అడగనైనా అడగకుండా నేరుగా వృద్ధాశ్రమానికే తీసుకెళ్లాడు.
“నాన్నా! నీకు తెలియంది ఏముంది? కోడలు నిన్ను సరిగా చూడటం లేదు. ఇక్కడ వేళకు చక్కగా తిండి పెడతారు. నీ వయసువాళ్లు ఓ నలుగురు ఉంటారు. సిటీలోని మంచి ఆశ్రమాల్లో ఇదొకటి. ఇక్కడి ఖర్చులకు నీ పెన్షన్ డబ్బులు సరిపోగా, కొంత మిగులుతుంది. మేము కూడా మధ్యమధ్యలో వచ్చి వెళ్తుంటాం. ధైర్యంగా ఉండు”.. అన్న కొడుకు ఆఖరి వాక్యాలతో, రామేశ్వరరావు కరోనా అనంతర జీవితం ప్రారంభమైంది. ఇంట్లో వారికి, చుట్టుపక్కల వారికీ.. ‘నాన్న ఇంకా డిశ్చార్జి కాలేదు’ అని చెప్పాడు కొడుకు. ఒక్క కోడలికి మాత్రమే వృద్ధాశ్రమంలో చేర్చినట్టు తెలుసు.
దయానిధి వృద్ధాశ్రమంలో రామేశ్వరరావుకు రోజులు బాగానే సాగుతున్నాయి. ఆ వాతావరణానికి అలవాటయ్యాడు. ఈలోగా ఒక సంఘటన జరిగింది. వాళ్లింటి పెంపుడు కుక్క దారి తెలుసుకుని వృద్ధాశ్రమానికి వచ్చింది. తనింట్లో ఈ కుక్క రామేశ్వర రావుకు బాగా దగ్గరగా ఉండేది. దాన్ని తానే వీధిలోంచి తెచ్చి పెంచాడు. మమకారంతో ఇక్కడ రామేశ్వరరావు దగ్గరికి వచ్చి చేరింది. వృద్ధాశ్రమంలో కుక్కలను ఉంచకూడదనే నియమం వల్ల కొడుక్కు ఫోన్ చేసి, కుక్కను తీసుకుపొమ్మని నిర్వాహకులు చెప్పారు. కొడుకు కారులో భార్య, పిల్లలతో వచ్చాడు. కోడలు మాట వరుసకు.. “ఇక్కడ ఏర్పాట్లు అన్నీ బాగున్నాయా” అన్నది.
“ఇంటికంటే బాగుంది” అంటూ రామేశ్వరరావు సమాధానమిచ్చాడు.కుక్క పేరిట మనుమళ్లను చూసే అవకాశం దొరికింది. కాసేపుండి.. కుక్కను వెంట తీసుకొని వెళ్ల బోతుండగా..ఆశ్రమంలో రామేశ్వరరావుకు సన్నిహితంగా ఉండే జోగయ్య.. “కుక్కను తీసుకొని వెళ్తున్నారు కానీ, తండ్రిని మాత్రం ఇక్కడే వదిలి వెళ్తున్నారు..” అని కొడుకు ముందే కరుగ్గా అన్నాడు.ఆయనకు ఇలాంటి సంతానం అంటే ద్వేషం. ఎందుకంటే.. ఆయన సంతానమూ అలాంటివాళ్లే. జోగయ్య మాటలకు చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు వాళ్లకు.. కుక్కను కారులో ఎక్కించుకొని వెళ్లిపోయారు. రామేశ్వరరావుకు వచ్చే 40 వేల రూపాయల పింఛన్లో 20 వేలు వృద్ధాశ్రమానికి కట్టగా.. మిగిలినవి మొదట్లో తన దగ్గరే ఉంచుకోమని చెప్పాడు కొడుకు. కానీ, ఆ తర్వాత భార్య సలహా మేరకు పెద్ద టీవీ కొని, తండ్రి బ్యాంక్ అకౌంట్ నుంచే ఈఎంఐలు కట్ అయ్యేలా ఏర్పాటు చేయించాడు. అది అలవాటుగా మారి.. ప్రతినెలా ఏదో ఓ ఖర్చు చెప్పి తండ్రి మిగులు పింఛన్ మొత్తాన్నీ ఊడ్చుకునేవాడు. రామేశ్వరరావు పింఛన్ డబ్బులు.. తన ఇంటి పక్కనే ఉండే బ్యాంక్లోనే జమయ్యేవి. దీంతో తండ్రికి ఆన్లైన్ బ్యాంకింగ్ ఏర్పాటుచేసి, డబ్బు తీయడానికి కనీసం ఇంటివరకు వెళ్లాల్సిన అవకాశాన్ని పోగొట్టాడు కొడుకు.
“నీకు సౌకర్యంగా ఉంటుందంటూ.. నువ్వు ఇంటికి వెళ్లకుండా ఆన్లైన్ బ్యాంకింగ్ ఏర్పాటు చేశాడన్నమాట!” అన్నాడు జోగయ్య. నిజమే! ఈ సౌకర్యాలు మనుషుల మధ్య దూరాలను పెంచాయి. ఆ బ్రాంచ్ మేనేజర్ తన కొలీగ్ కొడుకు. బ్యాంక్కు వెళ్లినపుడల్లా ప్రేమగా పలకరించేవాడు. త్వరగా పని చేసిపెట్టేవాడు.
ఈ మధ్య రామేశ్వరరావుకు మరీ సన్నిహితుడయ్యాడు జోగయ్య. ఇద్దరూ అన్నదమ్ముల్లా ఉంటున్నాడు. జోగయ్య సాహిత్యం బాగా చదువుకున్నవాడు. అనేక విషయాలు విప్పి చెప్పడంలో, తర్కంలో, కథాకథనంలో దిట్ట. వీరిద్దరినీ ఆశ్రమంలో ‘రామయ్య-జోగయ్య’ అని పిలువ సాగారు. అయితే, అప్పటికే రామేశ్వరరావుకు ఊపిరితిత్తుల కాన్సర్ వచ్చిందని వైద్య పరీక్షల్లో తేలింది. వ్యాధి ప్రారంభ దశలోనే ఉండటంతో.. ఆశ్రమానికి వచ్చే విజిటింగ్ డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతున్నాడు. ఈ విషయం జోగయ్యకూ తెలుసు. “నీకు నీ కొడుకు వైద్యం చేయించేలా లేడు. ఆశ్రమం నియమాల ప్రకారం కొడుకు వచ్చి సొమ్ము చెల్లించకపోతే ఆసుపత్రిలో చేర్చరు. నీ కొడుకు నిన్ను తీసుకెళ్లి, మంచి హాస్పిటల్లో వైద్యం చేయించాలి. అది జరుగుతుందని నేననుకోను. నీ పింఛన్లో ఆశ్రమం బిల్లు, మందులకు పోను ఒక్క రూపాయి కూడా మిగలడం లేదు. అంతా నీ కొడుకే ప్రతినెలా ఐదో తేదీకే ఊడుస్తున్నాడు. ఇలా అయితే.. నీ గతేంటి” ప్రశ్నించాడు జోగయ్య.
“నిజమే. దీని గురించి ఆలోచించలేదు” అన్నాడు రామయ్య.
“సాఫీగా సాగితే జీవితం కాదు. మలుపులు తిప్పేదే జీవితం. ఇక మన జీవితాల్లో ఎక్కువ మలుపులు లేవు. ‘తీవ్ర అనారోగ్యం – మరణం’ రెండే మలుపులు” అన్నాడు జోగయ్య. “మరణం తరువాత మనకక్కరలేదు. ఆలోపు జీవితానికి వృద్ధాప్యంలో తీవ్ర అనారోగ్యమే ఓ గుదిబండ. ఏం చేద్దాం?”. “నీ ఇంటి రిజిస్ట్రేషన్ కాగితాలు ఎక్కడ?” అని సాలోచనగా అడిగాడు జోగయ్య. “అవి ఇంట్లోనే నా ఫైల్లో భద్రంగా ఉన్నాయి. ఇప్పుడు వాటితో ఏంచేస్తాం? ఇల్లు నా కొడుక్కు రాసిచ్చానుగా” అన్నాడు రామయ్య.“ఫర్వాలేదు. ఈసారి వచ్చే ఆదివారం నీ మనుమరాలి బర్త్డే కోసం మీ అబ్బాయి నిన్ను ఇంటికి తీసుకెళ్తానన్నాడుగా. అప్పుడు వాటిని తీసుకురా” అన్నాడు జోగయ్య. “అవి తెస్తే వాడికి అనుమానం వస్తుంది ఎలా?” అన్నాడు రామయ్య. “చదువుకోవడానికి కావాలంటూ కొన్ని పుస్తకాలను అట్టపెట్టెలో సర్ది, ఆ పత్రాలను వాటితోపాటు తీసుకొని రా” అని చెప్పాడు జోగయ్య. ఆదివారం రానే వచ్చింది. అనుకోకుండా రామేశ్వరరావుతో జోగయ్య కూడా వారింటికి వెళ్లాడు. ఫంక్షన్ అయ్యాక ఇద్దరూ బయల్దేరుతూ.. ఇంటి పత్రాలు, పుస్తకాలు పెట్టిన అట్టపెట్టెను వెంట తెచ్చారు. “ఏం చేద్దాం ఇప్పుడు?”.. మరుసటి రోజు అడిగాడు రామయ్య.
“ఈ ఆస్తి నీది. కాగితాలు నీ దగ్గర ఉన్నాయంటే, ఆస్తి మార్పిడి జరగదు. ఇవి బ్యాంక్లో తనఖా పెట్టి అప్పు తెచ్చుకో. ముందుగా బ్యాంక్ ఖాతాకు ఆన్లైన్ లింక్ తీసివేయించు. మార్ట్గేజ్ డబ్బులను అందులో వేసుకో. ఆ డబ్బు నువ్వు వెళ్తేనే ఇస్తారు. అలా చేద్దాం”. “నాకు ఈ వయసులో అప్పా? ఎలా సాధ్యం?” అడిగాడు రామయ్య. “అలాగే ఇస్తారు. పైగా నువ్వు డబ్బు తిరిగి కట్టనక్కరలేదు. అప్పు తీరిస్తే ఇల్లు నీది. లేకుంటే.. బ్యాంక్ది. ఇది వృద్ధులకు వరం లాంటిది. బ్యాంక్ మేనేజర్ నీ కొలీగ్ అబ్బాయే కదా! ఒక్కసారి అడిగి చూడు” అన్నాడు. ఇద్దరూ ఆటోలో రామయ్య ఇంటి వీధిలోని బ్యాంకుకు వెళ్లారు. మేనేజర్ వృద్ధులకు ఇంటిని తనఖా పెట్టుకొని అప్పు ఇవ్వడానికి ఓకే చెప్పాడు. ఇంటి కాగితాల జిరాక్స్లు తీసుకొన్నాడు.
అయితే.. రామయ్యకు ఇంకా తాను తప్పు చేస్తున్నానేమో అన్న భావన వదలలేదు. ‘కొడుక్కు రాసిచ్చి.. మళ్లీ ఆ ఇంటిపైనే అప్పు తీసుకోవడం ఎలా?’ అని. ఆ విషయమే జోగయ్యతో చెప్పాడు.
“నీ అత్యవసర చికిత్స కోసం వృద్ధాశ్రమ నిర్వాహకులకు ఓ యాభై వేలు కట్టమని నీ కొడుకును అడుగు. నీకు లంగ్ క్యాన్సరని నీ కొడుక్కు తెలుసుగా!? ఏం చెప్తాడో విను. ఆపైన నిర్ణయించుకో!”.. కాస్త కటువుగానే సలహా ఇచ్చాడు జోగయ్య. జోగయ్య వైపు బేలగా చూశాడు రామయ్య. తరువాత ఓ నెలకు కొడుకు రావడం మానేసి, ఫోన్లోనే.. “ఎలా ఉన్నావు నాన్నా?!” అని అడిగాడు. లంగ్ క్యాన్సర్ చికిత్స గురించి తొందరగా నిర్ణయం తీసుకొమ్మని విజిటింగ్ డాక్టర్ అప్పటికే ఎన్నోసార్లు చెప్పాడు. ఆ విషయాన్నే కొడుకుతో చెప్పాడు రామయ్య. “నాన్నా! ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు. మొన్ననే రేట్లు పెరుగుతున్నాయని బంగారం కొన్నాం. ఇంకో రెండు నెలలు ఆగి చూద్దాం! నీ పింఛన్ వచ్చిందా? స్కూల్ ఫీజు కట్టాలి. ఆన్లైన్ బ్యాంకింగ్లో లాగిన్ అయితే.. వెబ్సైట్లో ఏదో ప్రాబ్లం చూపిస్తున్నది” అన్నాడు.
ఆ మాటలతో రామేశ్వరరావు మనసు పూర్తిగా విరిగింది. డాక్టర్ విజిట్లోగా జోగయ్యతో కలిసి బ్యాంక్కు వెళ్లి లోన్ తీసుకున్నాడు. ఇంటిపై మార్ట్గేజ్ అప్పు పెట్టి, కాగితాలన్నీ బ్యాంక్కు స్వాధీనం చేశాడు. ఇప్పుడు రామేశ్వరరావు మనసులో ఎవరూ లేరు. ఎలాంటి తప్పు భావనా లేదు. ‘నా ఆస్తి నా ఆరోగ్యం కోసం!’ అనే భావన కలిగింది. ఇల్లు తాకట్టు కూడా కొడుక్కు చెప్పలేదు. ‘రిజిస్ట్రేషన్ వరకు తెలుస్తుంది లే!’ అనుకున్నాడు.ఇప్పుడు రామేశ్వరరావుకు వృద్ధాశ్రమమే సర్వం అయ్యింది. జోగయ్యకు మరీ ఆత్మీయుడయ్యాడు. డబ్బు సిద్ధమని డాక్టర్తో చెప్పాడు. కొన్ని రోజులకు ఆన్లైన్ బ్యాంకింగ్ను తండ్రే ఆపాడన్న సంగతి కొడుక్కు తెలిసిపోయింది. పింఛన్లో మిగులు డబ్బులు ఇవ్వబోడని అర్థం అయ్యింది. ఫోన్ చేద్దామంటే.. లంగ్ క్యాన్సర్ చికిత్సకు డబ్బు అడుగుతాడని భయం వేసింది. దీంతో తండ్రికి ఫోన్ చేయడం మానేశాడు.
రామేశ్వరరావు క్యాన్సర్ హాస్పిటల్లో చేరాడు. జోగయ్యకు ఏదో జబ్బు వచ్చి గాంధీ హాస్పిటల్లో చేరి ఒంటరిగా మిగిలాడు. ఇద్దరికీ రెండే దారులు ఉన్నాయి. బతికితే వృద్ధాశ్రమం, బతకకుంటే ఈశ్వరుడి నిలయం. కరోనాతోనైనా భూమిపై ప్రజలకు బుద్ధి వస్తుందనుకొన్న దేవుడికి ఏమీ తోచలేదు. ఇటు చూస్తే.. చైనావాడు దురాక్రమణల ప్రణాళికల్లో, అమెరికావాడు ఎన్నికల్లో.. ఇలా ప్రపంచమంతా ఎవరి బాధలో వాళ్లున్నారు.భారత్లో మంత్రులు, అధికారులు.. కరోనా విలయం పట్ల హృదయం కలచి వేస్తున్నదని, కన్నీరు తెప్పిస్తున్నదనీ పత్రికా ప్రకటనలు గుప్పిస్తున్నారు. కరోనా విలయంలో ప్రజాసేవలోనే నిమగ్నమైనట్లు డాంబికాలు పోతున్నారు. దీంతో కర్మ సిద్ధాంతానికి మంచి ప్రచారం వచ్చింది. ప్రజలు అర్ధ ముఖాలతో, అర్ధ జీవితాలతో భయం భయంగా బతుకీడుస్తున్నారు. భయం లేనివారు.. హాయిగా బతికేస్తున్నారు.
కవిగా, చరిత్రకారుడిగా, వ్యాకరణవేత్తగా, విమర్శకుడిగా, నాటకరంగ కళాకారుడిగా సంగనభట్ల నర్సయ్య సుపరిచితులు. ప్రస్తుతం హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇంతకుముందు సంస్కృత డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ తర్వాత.. తెలుగు అకాడమీలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా సేవలు అందించారు. రామోజీ ఫౌండేషన్ కోసం డిక్షనరీ ప్రాజెక్ట్లో కన్సల్టెంట్గా పనిచేశారు. నాటకాలు, అనువాదాలు, జీవిత చరిత్రలు, తెలంగాణ చరిత్రకు సంబంధించిన 20కి పైగా పుస్తకాలను వెలువరించారు. వివిధ ప్రాంతీయ, జాతీయ పత్రికలలో 400కు పైగా వ్యాసాలు రాశారు. నాటక, సాహిత్య రంగాల్లో కృషికి తెలంగాణ ప్రభుత్వం, తెలుగు విశ్వవిద్యాలయం, సీపీ బ్రౌన్ అకాడమీ, రంజనీ కుందుర్తి, నమస్తే తెలంగాణ దినపత్రిక.. మొదలైన సంస్థల నుంచి అనేక అవార్డులు, బహుమానాలు అందుకున్నారు.
-సంగనభట్ల నర్సయ్య
94400 73124