Kasi Majili Kathalu Episode 74( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : తాళధ్వజుని కుమారులు ఉత్తర దిగ్విజయ యాత్రలు చేసి వస్తూ.. సుడిగాలిలో చిక్కుకున్నారు. రాకుమారుల్లో ఒకడైన విద్యాసాగరుడు సుడిగాలి తాకిడికి కొట్టుకుపోయి, ఒక కోటగోడ పక్కన పడ్డాడు. ఆ గోడ దాటివెళ్తే.. కాశ్మీరరాజు తన కూతురి కోసం కట్టిన భవనం కనిపిచింది. అక్కడివారంతా విద్యాసాగరుణ్ని స్త్రీలా సంబోధించడం వింత గొలిపింది. ఆ వనంలో పురుషుల తోడులేకుండా ఆ స్త్రీలు నివసించడానికి గల కారణాన్ని ఓ వృద్ధ ఉపాధ్యాయురాలు విద్యాసాగరునితో చెబుతున్నది.
ఆమాటలు విన్న శ్రీవర్ధనుడు మొదట కొంచెం కంగారు పడ్డాడు.
“మిత్రమా! నీ కోరిక విడ్డూరంగా ఉంది. పురుష శబ్దమే తెలియకుండా పెరిగిన ఆడపిల్లకు లోకజ్ఞానం ఉండదు. అటువంటి పిల్లను పెళ్లాడినవాడికి ఏం ఆనందం కలుగుతుంది?” అని ప్రశ్నించాడు. కానీ, నేపాళరాజు అందుకు ఒప్పుకోలేదు.
“శ్రీవర్ధనా! స్త్రీల విషయంలో నాకు కలిగిన అనుభవాలు నీకు తెలియవు. పురుష సహవాసం వల్ల కన్యలకు కామాది దుర్గుణాలు అలవడతాయి. ఒకసారి అలవాటైన గుణాన్ని పోగొట్టుకోవడం ఎంతటి పతివ్రతకైనా సాధ్యం కాదు. అందుకే నాకు కాబోయే కోడలు పెళ్లివరకు ఏ పురుషుణ్నీ చూడకూడదని కోరుకుంటున్నాను. స్త్రీలకు మొదటిసారిగా చూసిన పురుషునిపైనే సహజమైన అనురాగం కలుగుతుంది. అటువంటి అనురాగవతి అయిన స్త్రీతో జీవితం మధురంగా ఉంటుంది. నీ కూతురిని అలాంటిదానిగా చేయగలిగితే.. నా కొడుక్కి చేసుకుంటాను. లేదంటే ఈ సంబంధమే వద్దు” అన్నాడు.
“సరే మిత్రమా! నువ్వు కోరినట్లే చేస్తాను” అని మాటిచ్చాడు శ్రీవర్ధనుడు.
ఈ మహారణ్యం కాశ్మీరానికి ఉత్తరభాగంలో ఉంది. దీనికి చుట్టూ ఎత్తయిన ప్రహరీ పెట్టించాడు శ్రీవర్ధనుడు. పడమటి వైపు మాత్రమే నిగూఢమైన ద్వారం ఉంది. ఈ వనంలో అనేక విచిత్ర భవనాలున్నాయి.
ప్రమద్వరకు మూడేళ్లు దాటిన వెంటనే, ఆమె ఈడుకు తగిన వందమంది స్నేహితులతో కలిపి.. కొంతమంది దాసీజనంతోనూ ఇక్కడ ప్రవేశపెట్టాడు. వీళ్లందరికీ నన్ను ఉపాధ్యాయురాలిగా నియమించాడు. నేను ఈ కోటకు రక్షకురాలిని కూడా! రాజధాని నుంచి శ్రీవర్ధనుడు పంపే సంబారాలు స్వీకరించడానికి, ఇక్కడి వార్తలు ఆయనకు తెలియచేయడానికి నాకు మాత్రమే అధికారాలు ఉన్నాయి. నేను నా విధులను అతిరహస్యంగా నిర్వర్తిస్తూ ఉంటాను. ప్రమద్వరకు నేటివరకూ.. లోకంలో మగజాతి అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు. అవతల వసుప్రియుని కుమారుడు ఈమెను పెళ్లాడటానికి ఉర్రూతలూగుతున్నాడట. రేపోమాపో వాళ్ల వివాహం కానున్నది. అప్పటివరకు మాత్రం ఆమె ముందు పురుషశబ్దమే పనికిరాదు. నువ్వు కూడా ఆమెతో అనరాదు.
ఇంతవరకూ కథ చెప్పిన ఉపాధ్యాయురాలు.. “అమ్మాయీ! ఇక నీ సంగతి చెప్పు. నువ్వు ఎవరి కూతురివి? అతి రహస్యమైన ఈ కోటలోకి ఎలా ప్రవేశించావు?” అని ప్రశ్నించింది.
ఆమె మాటలకు విద్యాసాగరునికి ఆశ్చర్యం రెట్టింపయింది. ఇంత కథ చెప్పిన తరువాత కూడా ఆ వృద్ధురాలు తనను ఆడదానిగానే సంబోధించడం వింతగా అనిపించింది.
‘సరే.. నేను బయటపడటం ఎందుకు?’ అని మనసులో అనుకున్నాడు.
“అవ్వా! మాది దక్షిణ దేశం. నేను క్షత్రియ వంశంలో జన్మించాను. అశ్వారోహణం మొదలైన వీరధర్మాలలో నాకు గొప్ప పాండిత్యం కుదిరింది. నేను నా గుర్రమెక్కి దేశదేశాలూ తిరుగుతుండగా ఈ కోటగోడ కంటపడింది. ఇవతల ఏముందో చూడాలనే వేడుకకొద్దీ నా గుర్రాన్ని కోటగోడ దూకించి, దాని ప్రాణాలు పోగొట్టాను. తరువాత మీ రాకుమారి కనిపించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది” అని చెప్పాడు.
‘ఊ.. హూ..’ అని తలాడిస్తూ.. అతడు చెప్పిన మాటలను ఆలకిస్తున్నది ఆ ఉపాధ్యాయురాలు.
“అవ్వా! నీకు తెలియని ధర్మాలుండవు. స్త్రీలకు కోటలు, అగడ్తలు, శుద్ధాంతఃపురాలు.. చివరికి వస్ర్తాలు కూడా ఆవరణలు కానేకావు. వ్యక్తిత్వం కలిగినవారు ఇవేమీ లేకపోయినా తమను తాము అదుపులో పెట్టుకోగలరు. మంచి గుణం లేనప్పుడు ఇవేమీ వారిని కాపాడలేవు. ఆ నేపాళరాజు కోరిక విడ్డూరమే కాకుండా ధర్మ విరుద్ధమని నా అభిప్రాయం. ఏమంటావు?” అన్నాడు విద్యాసాగరుడు.
ఆ మాటలు విన్న ఉపాధ్యాయురాలి ముఖంలో ఒకింత విసుగు కనిపించింది.
“చూడు తల్లీ! నువ్వేదో బాగా చదువుకున్న దానిలా కనిపిస్తున్నావు. నీకు పుణ్యం ఉంటుంది. మా రాకుమారి వద్ద మాత్రం పురుష ప్రసక్తి తేవద్దు. ఒకవేళ తెస్తే అది నీకే నష్టం తెచ్చిపెట్టగలదు” అని హెచ్చరించింది.
ఇంతలో ఒక పరిచారిక వచ్చింది.
“అవ్వా! ప్రమద్వర కళామందిరంలో ఉంది. ఈవేళ ఎవరో కొత్తగా వచ్చారట కదా! ఆమెను తీసుకుని రమ్మన్నది” అని చెప్పింది.
విద్యాసాగరుడు పరిచారిక వెంట ప్రమద్వర వద్దకు వెళ్లాడు. అతణ్ని చూసి ప్రమద్వర తటాలున ఆసనం నుంచి లేచి, ఎదురు వచ్చింది. విద్యాసాగరుని చేయిపట్టుకుని తీసుకెళ్లి, తన పక్క పీఠంపై కూర్చోబెట్టుకుంది.
“సఖీ! మా ఉపాధ్యాయురాలిని చూశావా? ఆమె నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలిచ్చిందా?!” అని ప్రశ్నించింది.
‘చెప్పింది!’ అన్నట్లుగా విద్యాసాగరుడు చిరునవ్వు నవ్వాడు.
కొద్దిసేపు అక్కడ సంగీత కచేరీ జరిగింది. రెండుమూడు గీతాల తరువాత విద్యాసాగరుడు వీణ అందుకున్నాడు. గొప్ప ప్రావీణ్యంతో అతడు సాగించిన వీణావాదన విని, ప్రమద్వర పరవశించి పోయింది.
మరొక్క పాట! ఇంకొక్కటి..’ అంటూ దాదాపు ఆ రాత్రంతా విద్యాసాగరుని చేత పాడించుకుంటూనే ఉండిపోయింది ప్రమద్వర.
ఆనాటి నుంచి విద్యాసాగరునితోనే లోకమైపోయింది ప్రమద్వరకు. మిగిలిన చెలికత్తెలతో ఆటలకు పోవడం మానేసింది. గుర్రపు స్వారీ చేసినా, విలువిద్య సాధన చేసినా విద్యాసాగరుడు పక్కన ఉండాల్సిందే! జలకాలాటకు పోయినా, అన్నం తింటున్నా, నిద్రపోతున్నా అతడు లేకుండా క్షణం కూడా ఉండటం లేదామె.
ఎంత సన్నిహితంగా ఉంటున్నా.. విద్యాసాగరుణ్ని ఏవిధంగా చూసినా ప్రమద్వరకు ఎటువంటి అనుమానమూ తోచడం లేదు. అద్దంలో చూసుకున్నప్పుడు కూడా తన అవయవాల పొందికలో ఎటువంటి మార్పూ విద్యాసాగరునికి కనిపించడం లేదు. అయినా తనను ప్రమద్వర స్త్రీగానే గుర్తించడం అతనికి అబ్బురంగానే అనిపించింది.
పదహారేళ్ల వయసు వస్తున్నా.. కొత్తగా యవ్వనం పొంగులు వారుతున్నా, ప్రమద్వరకు శృంగారమంటే ఏమిటో తెలియదు. ప్రకృతి సహజంగా ఏర్పడాల్సిన సంగమ వాంఛ ఆమెలో జొరబడటానికి అవకాశమే కలగలేదు. విద్యాసాగరుడు అన్ని శాస్ర్తాలలాగే కామశాస్ర్తాన్ని కూడా బాగా అధ్యయనం చేశాడు. ఆ శాస్త్రంలో ప్రయోగాలు చేయడానికి తగిన తరుణం ఇప్పుడు వచ్చింది. విద్యాసాగరునితో ప్రమద్వరకు అనుబంధం గాఢమైన కొద్దీ అతనికి అవకాశాలు కూడా బాగా పెరిగాయి.
అక్కడ వారిద్దిరినీ ఎవరూ అనుమానించేవారు లేరు.. అడ్డుపెట్టేవారు లేరు. ఒకనాటి రాత్రి వారిద్దరికీ ఏకాంతం కుదిరింది. అప్పటివరకూ అనాఘ్రాత పుష్పంలా, రవిచూడని సౌందర్యంలా ఉన్న ప్రమద్వరకు.. విద్యాసాగరుడు కామకళను పరిచయం చేశాడు.
ఆనాటినుంచి ప్రమద్వర వ్యక్తిత్వంలోనూ, ప్రవర్తనలోనూ మార్పులొచ్చాయి. అంతఃపురం నుంచి బయటికి రావడమే మానేసింది. ఇతరులెవరినీ తనతో కలవనిచ్చేది కాదు. ఆటపాటలు, ఇతర వినోదాలన్నీ కట్టిపెట్టింది. కాలమంతా ఆ కొత్తజంటకు ఏకాంత సమయంగా మారిపోయింది.
వనంలో ఉన్న మిగతావారందరికీ అది కంటగింపుగా మారింది. అయితే ప్రమద్వర రాకుమారి కనుక ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకునే అవకాశం ఎవరికీ దక్కలేదు. ఇలా దాదాపు నాలుగైదు నెలల కాలం గడిచిపోయింది. చివరికి అందరూ కలిసి వృద్ధ ఉపాధ్యాయురాలిని ఆశ్రయించారు.
‘ఒకసారి కిందికి వచ్చిపో!’ అంటూ ప్రమద్వరకు చాలాసార్లు కబురు పంపింది ఉపాధ్యాయురాలు.
‘సాయంత్రం వస్తాను. రేపు వస్తాను’ అంటూ వాయిదా వేస్తూ వచ్చింది ప్రమద్వర.
చివరికి ఆ వృద్ధ ఉపాధ్యాయురాలు అతికష్టం మీద తానే మేడ మెట్లెక్కి ప్రమద్వర ఉన్న మందిరానికి వచ్చింది.
ప్రమద్వర ముఖం తెల్లగా పాలిపోయి ఉంది. కానీ, వింతకాంతులు ప్రసరిస్తున్నది. ఆ లక్షణాలను చూడగానే వృద్ధురాలికి సంగతంతా బోధపడింది.
ప్రమద్వరను లాలనగా.. “అమ్మాయీ! ఆ కొత్తపిల్ల, నువ్వు ఏకశయ్యపై నిద్రిస్తున్నారా? నాతో నిజం చెప్పవూ!?” అని అడిగింది.
అందుకామె.. “అవ్వా! ఆమె నాకేమీ హాని చేయడం లేదు. పైగా ఇదివరకు తెలియని సంతోషాలన్నీ పరిచయం చేస్తున్నది” అని సమాధానం ఇచ్చింది.
“నీకు లోకజ్ఞానం లేకపోవడం పెద్దముప్పునకే కారణమైంది” అని కసురుకుంటూ.. వృద్ధురాలు కిందికి వెళ్లింది. విద్యాసాగరుణ్ని పిలిచి.. “ఆడదాన్నని చెప్పి అంతఃపుర ద్రోహానికి ఒడికట్టావు. నిన్ను రాజు శిక్షించక మానడు” అని బెదిరించింది.
అందుకతడు నవ్వి.. “నేను ఆడదాన్నని కానీ, మగవాణ్నని కానీ మీతో చెప్పానా? మీరే నన్ను ఆడదాన్ని అనుకున్నారు. ఇప్పుడు హఠాత్తుగా మగవాణ్నెలా అయిపోతాను? అయినా మీరంత తెలియనివారా? నన్ను సరిగా చూసి చెప్పు?” అన్నాడు.
ఆ వృద్ధురాలు పాపం విద్యాసాగరుణ్ని తేరిపార చూస్తూ.. “చూస్తుంటే నువ్వు ఆడదానిలాగే ఉన్నావు.
మగవాడివని చెప్పడానికి ఏ ఆధారం కనిపించడం లేదు. ఏమైతేనేం.. జరగాల్సిన అనర్థమంతా జరిగిపోయింది. ఈ భారమంతా నా నెత్తిమీద పెట్టి, రాజు దూరంగా ఉన్నాడు. ఇప్పుడీ వార్త చెబితే నా తల తీయించేస్తాడు. యువరాణి పెళ్లి ఆగిపోతుంది.. ఏం చేయాలి?!” అని శోకంతో విస్మయంతో ఏమేమో మాట్లాడసాగింది.
అప్పుడు విద్యాసాగరుడు.. “అవ్వా! నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చు” అని ధైర్యం చెప్పాడు.
అతని మాటలు విని.. ‘కానున్నది కాకమానదు’ అనుకుంటూ, సంగతులన్నీ వివరంగా తెలియచేస్తూ రాజు పేరిట ఒక లేఖ రాసింది ఉపాధ్యాయురాలు.
* * *
ఉపాధ్యాయురాలు రాసిన లేఖను చూసిన శ్రీవర్ధనుడు గుండెలు బాదుకున్నాడు.
“ఒక పక్కన వివాహముహూర్తం సమీపిస్తున్నది. ఆ వసుప్రియుడితో ఏమని చెప్పను? అసలతని మాటలు వినడం వల్లే ముక్కుపచ్చలారని నా బిడ్డను అడవులపాలు చేశాను. ఆమె ఆటపాటలైనా దగ్గరుండి చూసి ఆనందించడానికి వీల్లేకుండా పోయింది. హా!
ఎంతటివారైనా దైవ నిర్ణయానికి తలవంచవలసిందే కదా!” అని విలపించసాగాడు.
అదంతా చూస్తున్న మహారాణికి మతిపోయింది.
“స్వామీ! మీరన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంత అనర్థం ఎలా జరిగింది?” అని ప్రశ్నించింది.
శ్రీవర్ధనుడు కన్నీరు తుడుచుకుంటూ.. “అడవిలో కోట కట్టి, పురుషులెవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాను కదా! ప్రమాదవశాత్తూ ఎవరైనా పురుషులు జొరపడితే.. వారంతా లోపలున్న స్త్రీల కళ్లకు స్త్రీలలాగే కనిపించేలా ఒక సిద్ధుని వల్ల వరం పొందాను. ఆ వరమే నా కొంప ముంచింది. అలా కాకుండా, ‘అక్కడ ఏ మగవాడు అడుగుపెట్టినా.. వాడు కూడా ఆడదై పోవాలి’ అని కోరుకుని ఉంటే బాగుండేది. ఛీ ఛీ నావంటి మూర్ఖుడు ఎక్కడా లేడు. లేకలేక పుట్టిన బిడ్డకు తగిన మగణ్ని తేలేక మూఢుని వశం చేశాను” అని చింతించ సాగాడు.
“చింతించకండి మహారాజా! మన అదృష్టం బాగుంటే మన అమ్మాయి ఒక మహావీరుణ్నే వరించి ఉండకూడదా?!” అని ఓదార్చింది మహారాణి.
శ్రీవర్ధనుడు తగినంత సైన్యాన్ని తీసుకుని, ఆకోటను ముట్టడించాడు. విద్యాసాగరుడు ఒంటరిగానే యుద్ధరంగంలో నిలిచి కాశ్మీర సైన్యాన్నంతటినీ తన కరవాలంతో తుత్తునియలు చేశాడు. అతని యుద్ధవిద్యా నైపుణ్యానికి శ్రీవర్ధనుడు అచ్చెరువొందాడు.
అతనితో సంధిచేసుకుని, యుద్ధం విరమించాడు.
విద్యాసాగరుని పుట్టుపూర్వోత్తరాలను అడిగి తెలుసుకుని సంతోషించాడు. త్వరలోనే విద్యాసాగరునికి, ప్రమద్వరకు వైభవంగా వివాహం జరిపించాడు.
కూతురిని, అల్లుడిని రాజధానికి రమ్మని కోరాడు. కానీ, కొత్త దంపతులు అంగీకరించలేదు. ఆ వనంలోనే ఉంటామని చెప్పి రాజ దంపతులను ఒప్పించారు. క్రమంగా నెలలు నిండి, ప్రమద్వర పండంటి మగబిడ్డకు
జన్మనిచ్చింది.
(వచ్చేవారం.. చిలక పురుషుడు)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | పాతాళాన్ని గెలిచిన మానవుడు
Kasi Majili Kathalu | సుధన్వుడి రససిద్ధి
Kasi Majili Kathalu | పాతాళ గుహ
Kasi Majili Kathalu | అపరాధ విచారణ
Kasi Majili Kathalu | రత్నాంగి తెచ్చిన తగాదా
Kasi Majili Kathalu | విడిపోయిన జంట