Kasi Majili Kathalu Episode 68 ( కాశీ మజిలీ కథలు ) | జరిగిన కథ : రాజహత్య చేసిన గురుదత్తుడు, పద్మిని అడవుల్లోకి పారిపోయి.. తివాసీలు అల్లే పనిచేస్తూ జీవించసాగారు. అనుకోని రీతిలో ఆ జంట విడిపోయారు. వారి కొడుకు చెంచుల వద్ద పెరిగి, అందమైన తివాసీలు అల్లే విద్య నేర్చుకున్నాడు. తివాసీని అమ్మడానికి వచ్చి, రత్నాంగి అనే వేశ్య వలలో పడ్డాడు. అక్కడే పద్మినిని కలుసుకున్నాడు. ఆమె చెప్పినట్లుగా తన ప్రవర్తన మార్చుకున్నాడు.
‘ఎంత పంచినా తరిగిపోని సంపద చదువు. మనిషికి నిజమైన కీర్తిని, భోగాలను ఇచ్చేది చదువే! మనల్ని నడిపించే గురువు చదువే! బంధువులు, తెలిసినవాళ్లు ఎవరూ లేని ఊరు కాని ఊరిలో కూడా.. మనల్ని ఆదుకునేది చదువే! అదే అన్నిటికంటే గొప్ప దైవం. అటువంటి చదువును.. జీవితంలో శ్రమించి నేర్చుకోనివాడు మనిషే కాదు’.. అని అర్థం వచ్చే పద్యాన్ని చదువుకున్నాడు మృగదత్తుడు.
‘అయ్యయ్యో! చదువుకోకపోవడం వల్ల నేనెంత మూర్ఖుడినయ్యాను?! ఆ ఇల్లాలు ఆనాడు ఈ మాట నాకు చెప్పకపోతే.. నేను చదువుకోవడం మొదలు పెట్టేవాడినే కాను. నాలుగు మాసాలలోనే చదవడం, రాయడం తెలిసింది. ఆ ఉత్తరంలో ఆవిడ ఏం రాసిందో తెలిసింది. ఇప్పుడిక ఆలస్యం చేయకుండా.. ఆమె చెప్పినట్లుగా దుర్గానగరానికి పోతాను’ అనుకున్నాడు.
ముళ్లు, రాళ్లను లెక్కచేయకుండా అనేక కష్టాలు పడుతూ దుర్గానగరానికి సమీపంలో ఒక గ్రామానికి చేరుకున్నాడు. ఆనాడు అక్కడ విశ్రాంతి తీసుకోవాలనుకొని, ఒక సత్రంలో బస చేశాడు. అక్కడ ఒక బ్రాహ్మణుడు మృగదత్తుణ్ని తేరిపార చూస్తూ.. “అబ్బాయీ! ఏ ఊరికి పోతున్నావు?” అని అడిగాడు.
“దుర్గానగరానికి”.. చెప్పాడు మృగదత్తుడు.
“అక్కడ ఎవరింటికి?”.
“కుముదాంగదుని ఇంటికి”.
“అతడు నీకు చుట్టమా?”.
“అవును. మా తాత.. మాతామహుడు!”.
ఆ సమాధానానికి బ్రాహ్మణుడు విస్మయపడి.. “మీ తల్లిదండ్రులు ఎక్కడున్నారు? వాళ్ల పేర్లేమిటి?” అని ప్రశ్నించాడు.
“నాకు తెలియదు. చనిపోయారని ఒకామె చెప్పింది. అయినా నా వృత్తాంతంతో మీకేమిటి పని?” అని అడిగాడు మృగదత్తుడు.
“బాబూ! నేను మీ తండ్రికి మిత్రుణ్ని. నన్ను ‘మామా!’ అని పిలువు. నా పేరు గదాధరుడు అంటారు. నేను మీ తల్లిదండ్రులను వెతుకుతూ దేశాటనం చేస్తున్నాను. వాళ్లు నిజంగా చనిపోయారా?! వాళ్లను నువ్వు చివరిసారిగా ఎప్పుడు చూశావు?!” అని మళ్లీ ప్రశ్నించాడు గదాధరుడు.
అందుకు మృగదత్తుడు.. “వారిని నేనెప్పుడూ చూడలేదు. కానీ, వాళ్లు నా చిన్నతనంలోనే చనిపోయారని ఒక వేశ్య ఇంటిలోని పరిచారిక నాతో చెప్పింది” అంటూ కథంతా వివరించాడు.
“ఏదీ ఆ ఉత్తరం!” అని అడిగి మరీ తీసుకున్నాడు గదాధరుడు.
అందులో ఇలా ఉంది.
‘ఆర్యులారా! ఈ ఉత్తరం తెచ్చినవాడి పేరు మృగదత్తుడు. మీకు దౌహిత్రుడు. వీడి తల్లి చనిపోయింది. తండ్రి ఏమైనాడో తెలియదు. వీణ్ని మీరు పెంచుకుని, వంశాభివృద్ధి చేసుకోండి’.. గదాధరుడు ఉత్తరం చదువుకుని, లిపి గుర్తుపట్టాడు.
“అయ్యో! ఇది పద్మిని రాసినదే. భర్తతో వియోగం పొంది ఉండవచ్చు. అందుకే విరక్తితో అలా రాసి ఉంటుంది. అబ్బాయీ! ఆమె ఎవరనుకున్నావు?! నిన్ను కన్నతల్లి. ఇంతకీ ఆమెను ఎక్కడ చూశావు? మళ్లీ
అక్కడికి పోయి చూద్దామా?!” అని అడిగాడు.
“లాభం లేదు మామా! ఆరోజునే ఆమె ఎక్కడికో వెళ్లిపోయింది. నగలతో పారిపోయిందని ఆ రత్నాంగి తగాదా కూడా తెచ్చింది” అని చెప్పాడు మృగదత్తుడు.
“అయితే మనం ముందుగా దుర్గానగరానికి పోదాం. కానీ, నువ్వక్కడ ఉండిపోవడం సాధ్యం కాదు. రాజ ప్రతినిధులు మీ ఇంటిచుట్టూ భటులను కాపు పెట్టారు. పోనీ మీ పితామహుని దగ్గరికి వెళ్లాలన్నా.. వారిని కూడా అలాగే నిర్బంధిస్తున్నారు. కాబట్టి మనం ఎవరి కంటా పడకుండా ప్రచ్ఛన్నంగా చూసి రావాలి” అన్నాడు గదాధరుడు.
“ఎందుకు మామా.. మనమేం అపరాధం చేశాం?” అని మృగదత్తుడు అమాయకంగా ప్రశ్నించాడు.
“దుర్గానగరాన్ని పాలించే సురూపుడనే రాజును కామాపరాధం వల్ల మీ అమ్మ చంపేసింది. అందువల్ల మీమీద రాజహత్యా నేరం మోపబడింది. అయితే ఆ హత్య తరువాత మీ అమ్మానాన్నలు అడవుల్లోకి పారి
పోయారు. వాళ్లెన్ని కష్టాలు పడుతున్నారో కానీ.. ఇక్కడ మీ మాతామహునికి, పితామహునికి కూడా జీవితం కంటకప్రాయంగా తయారైంది. వాళ్లు ఊరు విడిచి వెళ్లడానికి వీల్లేదు. ఆ ఇళ్లపై ఎల్లవేళలా భటుల నిఘా ఉంటుంది” అని వివరించాడు గురుదత్తుడు.
ఆ తరువాత అతణ్ని తీసుకునిపోయి కుముదాంగదునికి చూపించాడు. అప్పటికే కూతురిపై బెంగతో అతని భార్య చనిపోయింది. ఆశలు చంపుకొని చావుకోసం ఎదురుచూస్తూ రోజులు లెక్కపెడుతున్న ఆ వృద్ధునికి.. దీపంలాగా మనవడు కనిపించేసరికి అంతులేని ఆనందం కలిగింది. పద్మిని రాసిన ఉత్తరం చదువుకున్నాడు. మృగదత్తుని చేత ఆమె గురించిన కథనంతా చెప్పించుకున్నాడు. అంతా విన్న తరువాత.. “మీ అమ్మను అక్కడే ఎందుకు వదిలిపెట్టి వచ్చే శావేంరా?!” అని అడిగాడు.
“అమ్మ అని తెలిస్తే వదిలేస్తానా తాతా!” అన్నాడు మృగదత్తుడు.
“అయితే అమ్మ ఎలా ఉంది!?” అని మళ్లీ అడిగాడు కుముదాంగదుడు.
దాంతో.. మళ్లీ కథంతా మొదలుపెట్టాడు మృగదత్తుడు. అలా ఆ కథంతా అప్పటికి కనీసం పదిసార్లు చెప్పి ఉంటాడు. దాదాపు సాయంత్రం కావస్తుండగా రాజభటులు రానేవచ్చారు. మృగదత్తుడు, గదాధరునితోపాటు కుముదాంగదుణ్ని కూడా బంధించి.. రాజప్రతినిధి ముందు నిలబెట్టారు. ఆ ప్రతినిధి ఆ ముగ్గురినీ వేర్వేరుగా ప్రశ్నించాడు. అతడు అడిగిన ప్రశ్నలకు ఆ ముగ్గురూ మూడురకాలైన సమాధానాలిచ్చారు.
దాంతో వారు అపరాధులని తేలింది. కానీ, వారికి దండన విధించే అధికారం మాత్రం ప్రతినిధికి లేదు. అందువల్ల చక్రవర్తి అయిన గజేంద్రవాహనుని ఆజ్ఞ ప్రకారం.. రక్షకభటుల వెంట ఖైదీలుగా ఆ ముగ్గురినీ సుమేధుని వద్దకు పంపాడు. పదిమంది చుట్టూ నడుస్తుండగా ముగ్గురూ సుమేధుడు పాలించే విద్యా నగరానికి బయల్దేరారు. దారి మధ్యలో రాజభటులను ఉద్దేశించి, గదాధరుడు ఇలా ఉపన్యసించాడు.
“కింకరులారా! లోకంలో ఫలానా పని న్యాయం.. ఫలానా పని అన్యాయమైనదని సాధారణంగా చెప్పుకొంటుంటాం. కానీ, ఒక్కొక్కప్పుడు న్యాయం అన్యాయంగానూ.. అన్యాయాన్ని న్యాయంగానూ పరిగణించాల్సి వస్తుంది. అందుకు పూర్వజన్మ కర్మలే హేతువులని పెద్దలు చెబుతారు. పూర్వం మాండవ్యుడనే మహర్షి ఇలాగే నిరపరాధి అయినా.. చోరునిలా కొరత వేయబడ్డాడని భారతం చెబుతున్నది. ఈ కుర్రవాడి కర్మకాకపోతే మరేమిటో చెప్పండి.. కోటీశ్వరునికి మనుమడై పుట్టి, తల్లిదండ్రులెవరో తెలియకుండా పెరిగాడు. ఇప్పుడిలా బంధితుడయ్యాడు. ఇక మా పద్మిని చేతిలో దుర్మరణం పొందిన మీ రాజు ఎలాంటివాడో మీకు తెలియనిది కాదు. ‘ఆ రోజు పద్మిని చేసిన పని సరైనదే!’ అని మనసులోనైనా అంగీకరిస్తారని అనుకుంటా”.. అతడి మాటలు విన్న భటులలో ఒకడు.. “అయ్యవారూ! ఇంతకూ మీరేం చెప్పదలుచుకున్నారు?!” అని ప్రశ్నించాడు.
అందుకు గదాధరుడు.. “మాకు శిక్ష విధించడం అన్యాయమని మీకు అనిపించడం లేదా?” అని అడిగాడు
“అనిపిస్తోంది అనుకోండి. కానీ, మేమేం చేయగలం చెప్పండి” అన్నారు భటులు నిస్సహాయంగా.
“అబ్బో! మీరు చేయగలిగిన పని మహారాజులు కూడా చేయలేరు” అన్నాడు గదాధరుడు.
దాంతో వాళ్లు కంగారుపడ్డారు.
“కొంపదీసి విడిచిపెట్టమంటావా ఏమిటి? మా తలకాయలు ఎగిరిపోతాయ్” అన్నారు వాళ్లు.
“నేనుండగా మీ ప్రాణాల మీదికి రానిస్తానా.. చూడండి. ఇతడి పితామహుడు కుంభకోణంలో ఉన్నాడు. మనం వెళ్లేది ఆ పట్టణం మీదనుంచే కదా! అక్కడ ఒక్కసారి ఈ పిల్లవాణ్ని తాతకు చూపించి వెళదాం. ఈ కాస్తసాయం చేసిపెడితే చాలు. మీరు ఊరకే చేయనక్కర లేదు. ఆయనకు చెప్పి మీరు కోరినంత బహుమానం ఇప్పిస్తాను. మీరు కూడా పాపం పిల్లలు కలవాళ్లు” అని వాళ్లకు ఆశ పెట్టాడు గదాధరుడు.
చాలాసేపు తర్కించిన మీదట కుంభకోణంలో ఆగేందుకు అంగీకరించారు భటులు. ఇతరుల కంటపడకుండా గురుదత్తుని తండ్రి అయిన రత్నాకరుని ఇంటికి వెళ్లారు వాళ్లు. మనవణ్ని చూసుకుని, రత్నాకరుడు సంతోషించాడు.
వాళ్లేవో మాట్లాడుకుంటుంటే భటులు వచ్చారు.
“అయ్యా.. చూడటం అయింది కదా! త్వరగా బయల్దేరండి. వేళవుతున్నది” అన్నారు.
“ఒక్క నిమిషంలో వస్తాం!” అని గదాధరుడు అక్కడే ఉన్న రత్నాకరుణ్ని లోపలికి తీసుకువెళ్లాడు.
కొద్దిసేపట్లోనే ఒక పెద్ద గోనెసంచి నిండా యాభైవేల వరహాలు తీసుకొచ్చి.. ఆ భటుల ముందు రాసిపోశాడు. అంత డబ్బు వాళ్ల జీవితంలో కళ్ల చూసి ఉండరు. అందుచేత వాళ్లంతా మాటలు దక్కి.. ఆ డబ్బుకేసి కళ్లు విప్పార్చి ఆశగా చూస్తూండసాగారు.
అప్పుడు గదాధరుడు.. “కింకరులారా! మీరు మరో సాయం చేసిపెట్టాలి” అన్నాడు.
“చెప్పండి అయ్యవారూ!” అన్నారు వాళ్లు.. డబ్బుమీది నుంచి చూపులు తిప్పుకోకుండానే.
“ఇదుగో వీళ్లు ముగ్గురినీ చూశారు కదా! వయసులో మా ముగ్గురితోనూ సరిపోలుతారు. వీళ్లను మీతోపాటు తీసుకెళ్లండి. ‘వీళ్లే.. కుముదాంగదుడు, మృగదత్తుడు, గదాధరుడు!’ అని చెప్పి.. సుమేధునికి అప్పగించండి. మీరు ముగ్గురినీ అప్పజెప్పినట్లే అవుతుంది కనుక, మీ బాధ్యత తీరిపోతుంది. మిమ్మల్ని ఎవరూ తప్పు పట్టరు. ఈ కాస్త సాయం చేసిపెట్టారంటే ముందుముందు మీకు ఇంతకు రెట్టింపు ఇప్పిస్తాను” అన్నాడు.
ఆ భటులంతా మంత్రం వేసినట్లు తలకాయలు ఊపారు. గదాధరుడు చూపించిన ముగ్గురినీ వెంటబెట్టుకుని అక్కణ్నుంచి బయల్దేరారు. గదాధరుని తెలివితేటలకు రత్నాకరుడు సంతోషించాడు.
“నాయనా! మీరిద్దరూ ఇక్కడే ఉండిపోండి. నా కొడుకు తిరిగి వచ్చేవరకూ మనవడితో అయినా సంతోషంగా కలిసి జీవిస్తాను” అన్నాడు మృగదత్తుని ఒడిలో కూర్చోబెట్టుకుని బుగ్గలు నిమురుతూ.
“మామయ్యగారూ! అలా చేయడం మరీ ప్రమాదం. రాజభటులు మీ ఇంటిపైన కూడా నిఘా పెట్టారు కదా! అదికాకుండా ఇంతకాలంగా అడవుల్లోని మర్మాలు సరిగా తెలియకపోవడం వల్ల గురుదత్తుని జాడ తెలుసుకోలేక పోయాను. ఇప్పుడు నిప్పుకి గాలి తోడైనట్లు.. మీ మనవడు నాతో ఉన్నాడు కనుక.. నా పని తేలికవుతుంది. ఈసారి ఎలాగైనా మీ కొడుకును, కోడలిని వెంటబెట్టుకుని వస్తాను” అని చెప్పి ఒప్పించాడు గదాధరుడు.
ఆనాడే వాళ్లిద్దరూ కుంభకోణాన్ని విడిచిపెట్టి, అడవిమార్గం పట్టారు. పద్మిని, గురుదత్తుని కోసం.. అడవి పల్లెలన్నీ వెతుక్కుంటూ దాదాపు నెలరోజులకు మృగదత్తుడు పెరిగిన కోయపల్లెకు వెళ్లారు. అప్పటికే అక్కడ అతనికోసం ఉదయార్కుని భటులు వేచి చూస్తున్నారు.
“మృగదత్తా! నీమీద రత్నాంగి తెచ్చిన తగాదా ఇంకా పరిష్కారం కాలేదు. ప్రస్తుతం సుమేధుల వారు నీ వ్యాజ్యంలో తగాదాలు వింటున్నారు. నిన్ను వారిముందు హాజరు పరచాలి. పద.. వెళ్దాం” అన్నారు. మృగదత్తుని వెంట గదాధరుడు కూడా వెళ్లాడు.
వాళ్లకంటే ముందుగా కుంభకోణం నుంచి వెళ్లిన ముగ్గురినీ విచారించాడు సుమేధుడు. వాళ్లు తామే కుముదాంగదుడు, గదాధరుడు, మృగదత్తులమని చెప్పుకోగా మౌనంగా విన్నాడు.
“చూడండి.. మృగదత్తుడు పల్లెవాడని వ్యాజ్యంలో రాసి ఉంది. ఇతడిలో ఆ లక్షణాలేవీ కనిపించడం లేదు. కుముదాంగదుడు తన వయసు కంటే చిన్నవాడిగా కనిపిస్తున్నాడు. మిగిలిన వారి సంగతెలా ఉన్నా.. కొన్ని కారణాల వల్ల గదాధరుణ్ని నేను గుర్తించగలను. మీ ముగ్గురూ.. ఆ ముగ్గురు కాదని నాకు బాగా తెలుసు. అసలు నేరస్తులను మరుగున పెట్టి, ఏ కారణం చేత మీరు వారిలా నటిస్తున్నారో తెలియాలి. అప్పటివరకు తీర్పును వాయిదా వేస్తున్నాను” అన్నాడు సుమేధుడు.
ఆ తరువాత మృగదత్తుడు, గదాధరుడు కలిసి ఆ పట్టణానికి వెళ్లారు.
అధికారులు గదాధరుణ్ని లోనికి అనుమతించలేదు. మృగదత్తుణ్ని మాత్రమే సుమేధుని ముందు ప్రవేశపెట్టారు. నూనూగు మీసాల ప్రాయంలో తాను ఎలా ఉండేవాడో అచ్చంగా అలాంటి బాలుణ్నే కళ్లముందు చూసి.. సుమేధుడు అబ్బురపడ్డాడు.
(వచ్చేవారం.. అపరాధ విచారణ)
– అనుసృజన
నేతి సూర్యనారాయణ శర్మ
Kasi Majili Kathalu | రత్నాంగి తెచ్చిన తగాదా
Kasi Majili Kathalu | విడిపోయిన జంట
Kasi Majili Kathalu | అతివ సాహసం
Kasi Majili Kathalu | ఆమె పేరు పద్మిని
Kasi Majili Kathalu | గజకర్ణ – గోకర్ణ విద్యలు
Kasi Majili Kathalu | మహేంద్రజాలం టక్కుటమారం